breaking news
Yazidi girl
-
'ప్రతి రోజూ అత్యాచారం చేసేవారు'
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వందలాది మంది మహిళలను కిడ్నాప్ చేసి హింసించడం, సామూహిక అత్యాచారం చేయడం, బలవంతంగా వారి ద్వారా పిల్లలను కనడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. 9 నెలలు ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉండి, వారి నుంచి తప్పించుకున్న ఓ బాధితురాలి తన వ్యథను తెలియజేసింది. ఐఎస్ ఉగ్రవాదులు జిహాదీ పేరుతో చేస్తున్న హింసను ఇరాక్లోని సింజన్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల యజీదీ తెగ అమ్మాయి వెల్లడించింది. 'గతేడాది ఆగస్టులో నన్ను, నా సోదరిని ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మమ్మల్ని సిరియాలో ఐఎస్ ఆధీనంలో ఉన్న రక్కాకు తరలించారు. మా ఇద్దరితో పాటు పదుల సంఖ్యలో యువతులకు కన్యత్వ పరీక్షలు చేయించారు. మమ్మల్నందరినీ ఓ గదిలోకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టారు. ఉగ్రవాదులు తమకు నచ్చిన అమ్మాయిలను ఎంచుకున్నారు. అందంగా లేకపోవడం నా అదృష్టం కావచ్చు. నన్ను, నా చెల్లిని, మరో ఇద్దరు అమ్మాయిలను అమ్మేశారు. చెచెన్యాకు చెందిన అల్-రషియా అనే ఐఎస్ ఉగ్రవాదికి మమ్మల్ని కొనుగోలు చేశాడు. మమ్మల్ని రోజూ ఉదయం నగ్నంగా నిలబెట్టేవారు. యజమాని తనకు నచ్చినవారిని అత్యాచారం చేసేవాడు. ఆయనతో పాటు అనుచరులు మమ్మల్ని రోజూ దారుణంగా హింసించి సామూహిక అత్యాచారం చేసేవారు. వారి శారీకవాంఛలు తీర్చకపోతే వేడి నీళ్లను కాళ్లపై పోసి చిత్రహింసలు పెట్టేవారు. ఆ తొమ్మిది నెలలూ చస్తూ బతికాను. నన్ను గర్భవతిని చేశారు. గత నెలలో అల్ -రషియాను, అతని బాడీగార్డులను ఖుర్దిష్ సైనికులు కాల్చివేశారు. దీంతో మాకు స్వేచ్ఛ లభించింది. -
'అత్యాచారాలకు ఆనవాళ్లు'
ఇస్లామిక్ రాజ్యం స్థాపన లక్ష్యంగా ఇరాక్, సిరియాలలో ఆక్రమణలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సభ్యులు సాగిస్తున్న లైంగిక అకృత్యాలు నివ్వెరపరుస్తున్నాయి. బాలికలు, మహిళలను లైంగిక బానిసలుగా చేసుకుని వారు చేస్తున్న దారుణాలు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయి. ఐఎస్ఐఎస్ కామాంధులకు చేతికి చిక్కి నరకయాతన అనుభవిస్తున్న ఏ యువతి వెల్లడించిన విషయాలు వింటే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఇజ్ది తెగకు చెందిన మయత్(ఇది ఆమె అసలు పేరు కాదు) అనే 17 ఏళ్ల యువతిని సింజార్ ప్రాంతం నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అపహరించారు. కిడ్నాపర్ల కన్నుగప్పి ఆమె తన బాధను ఫోన్ లో వెళ్లబోసుకుంది. తాను పేరు మాత్రం రాయొద్దని దీనంగా వేడుకుంది. తన పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరుతో సిగ్గుతో చచ్చిపోతున్నానని చెప్పింది. ఇప్పటికిప్పుడే చనిపోవాలని ఉన్నా మళ్లీ తన తల్లిదండ్రులను కలుసుకుంటానన్న ఏకైక ఆశే తనను బతికిస్తోందని తెలిపింది. ఆ అభాగ్యురాలి ఆమె మాటల్లోనే.... '40 మంది మహిళలు, బాలికలను తీవ్రవాదులు ఇక్కడికి ఎత్తుకొచ్చారు. వారి వయసు 12 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. మా పట్ల వాళ్లు ప్రవర్తించే తీరు చెప్పడానికి నోరు రావడం లేదు. ఆ నరకయాతనను ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. మమ్మల్ని ఓ ఇంట్లో బంధించి సాయుధులను కాపలా పెట్టారు. ఈ ఇంట్లో ఉన్న మూడు గదులు నరకానికి నకళ్లు, అత్యాచారాలకు ఆనవాళ్లు. మమ్మల్ని బానిసలుగా చూస్తారు. కిమ్మనకుండా మానాన్ని రోజుకో మగాడికి అర్పించుకోవాల్సివుంటుంది. ప్రతిఘటిస్తే బెదిరిస్తారు. ఒక్కోసారి కొడతారు. ఇలాంటప్పుడు ప్రాణాలు పోతే పీడ వదులుతుందని అనుకుంటాం. కాని పిరికిపందలు.. మేము ఎదుర్కొంటున్న నరకాన్ని తప్పించే ధైర్యం ఎవడికీ లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం- ఇప్పటికే నా దేహాన్ని చంపేశారు. ఇప్పుడు నా ఆత్మను హత్యచేస్తున్నారు' అంటూ మయత్ ముగిసించింది.