breaking news
Yadagirigutta development
-
యాదాద్రి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు!
సాక్షి,యాదాద్రి యాదాద్రి పరిసరాల్లోని పర్యాటక, పుణ్య క్షేత్రాలను కలుపుకుని యాదాద్రి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులతో కలిసి నిర్వహించిన యాదాద్రి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా టూరిజం, దేవాదాయ, పురావస్తు శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యాదాద్రి నవగిరులను ఆధ్యాత్మిక దర్శనీయ ప్రార్థన మందిరాలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఇప్పటికే మొదయ్యాయి. తాజాగా యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరంలోని భువనగిరి ఖిలాను, 23 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాకను వైటీడీఏ కిందికి చేర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాలను పరిశీలించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు మరో మాస్టర్ప్లాన్ రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హైదారాబాద్కు చేరువలో.. భువనగిరి ఖిలా, యాదగిరిగుట్ట, కొలనుపాక పక్కపక్కనే ఉండడంతో దేశ విదేశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులు ఈ మూడు ప్రాంతాలకు వచ్చిపోతుంటారు. భువనగిరి ఖిలా హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకుల కోసం ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు యాదగిరిగుట్టకు వెళ్లడానికి బస్, ఆటో, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం ఆలేరు మండలంలోని కొలనుపాకకు చేరుకుంటారు. అక్కడ పురావస్తు శాఖ మ్యూజియంతో పాటు, వీరశైవ మతానికి చెందిన చండికాంబ సహిత సోమేశ్వరాలయం, జైన దేవాలయం ఉన్నాయి. దీంతో యాదగిరిగుట్ట, భువనగిరి, కొలనుపాకను వైటీడీఏ గొడుగుకిందికి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాంతాల్లో పరిపాలన పరంగా ఒకే రకమైన చర్యలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టే అవకాశాలున్నాయి. యాదాద్రి టూరిజం సర్క్యూట్కు సీఎం ఆదేశం జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు, టూరిజం సర్క్యూట్కు కావాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో సీఎం కేసీఆర్కు టూరిజం సర్క్యూట్ ప్రణాళికలు సమర్పిస్తాం. – అనితారామచంద్రన్, కలెక్టర్ -
‘దిల్’ భూముల స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: దక్కన్ ఇన్ఫ్రాస్టక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్కు (డీఐఎల్ఎల్) గతంలో కేటాయించిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలుపడంతో నేడో రేపో అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. గత ప్రభుత్వాలు హౌసింగ్ బోర్డుకు అనుబంధంగా ఏర్పడ్డ దిల్కు రాష్ట్రంలో పలు చోట్ల భూములు కేటాయించాయి. పారిశ్రామిక అవసరాల నిమిత్తం వీటిని వినియోగించాలనే నిబంధనతో అప్పగించాయి. వీటిలో 529 ఎకరాలు యాదగిరిగుట్ట పరిసరాల్లోనే ఉన్నాయి. ఇక్కడి గుట్టలు... ఎత్తై ప్రాంతాలు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఇక్కడి భూములన్నీ నిరుపయోగంగానే మిగిలిపోయాయి. ఇటీవల గుట్టను యాదాద్రి క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఆ ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. గతంలో దిల్కు కేటాయించిన భూములన్నీ నిరుపయోగంగా ఉండటంతో వీటిపై దృష్టి సారించింది. రెవెన్యూ విభాగం నుంచి సమాచారం సేకరించింది. దిల్కు ఇచ్చి న 529 ఎకరాల భూములను వెనక్కి తీసుకొని.. గుట్ట డెవెలప్మెంట్ అథారిటీకి బదిలీ చే యాలని నిర్ణయించింది. మార్చిలో సీఎస్ రాజీవ్శర్మ సమక్షంలో జరిగిన సమావేశంలోనే ఈ మేరకు తీర్మానం చేశారు. గుట్ట పరిసరాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో భూములు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను సర్వే చేయించి ఖాళీగా ఉన్న రెవెన్యూ భూములను వెంటనే టెంపుల్ అథారిటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే దిల్కు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫైలు సిద్ధం చేశారు. సీఎం ఆమోదముద్ర వేయటంతో అందుకు లైన్ క్లియర్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.