breaking news
World Telugu writers
-
‘తెలుగు’ దివ్వె వెలుగులీనాలి!
* తెలుగు రచయితల మహాసభల్లో భాషాభిమానుల పిలుపు * మన భాషకు గౌరవం లేనప్పుడు జీవితానికి అర్థంలేదని వ్యాఖ్య * న్యాయస్థానాల్లోనూ తెలుగులో పాలన జరగాలి * మన రచనలు తెలుగుకే పరిమితం కాకూడదు * ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష వెలుగులీనాలని, ప్రతి తెలుగువాడూ మాతృభాషకు సేవ చేసేలా చైతన్యం పురివిప్పాలని, తెలుగు భాషాభిమానులు, పలువురు ప్రముఖులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పిలుపునిచ్చారు. విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న ఈ మహాసభల ముగింపు వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెలుగు భాషకు సొబగులద్దిన అతిరథ మహారథులతోపాటు వివిధ రంగాల్లో తెలుగుకు సేవచేస్తున్న ప్రముఖులూ హాజరై తెలుగు ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ సాహిత్య, లలిత కళలు, సంగీత సంస్థ(అకాడమీ)లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పుల్లో తెలుగుకు ప్రాధాన్యత గురించి పెద్దలతో చర్చిస్తామని తెలిపారు. 2017లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను విశాఖపట్నంలో నిర్వహించాలని కోరగా అందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అంగీకరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి శివారెడ్డి మాట్లాడుతూ.. ఏ లక్ష్యంతో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారో అది ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విశ్వనాథ్ప్రసాద్ తివారీ, కే శ్రీనివాస్లు మాట్లాడుతూ.. కేంద్ర సాహిత్య అకాడమీ మాదిరిగానే రాష్ట్రంలోనే సాహిత్య అకాడమీ ఉండాలని సూచించారు. దేశంలో వెయ్యి భాషలుండగా కొన్నింటికి లిపి లేదని అయినా వాటిని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మహాసభలను దిగ్విజయంగా నిర్వహించిన మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్లు, కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారావు, జీవీ పూర్ణచంద్లను పలువురు ప్రశంసించారు. సభలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుకే పరిమితం కాకూడదు రాష్ట్ర విభజనకు ముందు నిధులు, నీరు, నియామకాలు, భాషపై చర్చలు జరిగాయి. తెలుగు ప్రజల్ని ఐక్యంగా ఉంచాల్సిన భాష.. అనైక్యతకు దారితీసింది. తెలుగు మాతృభాషగా ఉన్నవారంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరముంది. ఇతర దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కలిపే వారధి గా తెలుగు వెలగాలి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు(టీవీ) ఒకపక్క తెలుగుకు సేవ చేస్తూనే మరోపక్క ద్రోహం కూడా చేస్తున్నా యి. తెలుగు కంటే ఆంగ్లం శక్తిమంతంగా ఉం టుందని ఆ భాషలోని పేర్లే వాడుతున్నాయి. కానీ.. ఆంగ్లం కంటే తెలుగే శక్తిమంతమైంది. తెలుగు కవితలు, రచనలు కేవలం తెలుగుకే పరిమితం కాకూడదు. హిందీ సహా ఇతర భాషల్లోకి అనువాదం కావాలి. అలా జరిగితే మనకు నాలుగో జ్ఞానపీఠ్ కూడా రావచ్చు. - కె.రామచంద్రమూర్తి, సాక్షి, ఈడీ తెలుగు కవిత్వం విడిపోరాదు తెలుగు రచనలు, కవిత్వం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, గుంటూరుగా విడిపోకూడదు. బమ్మెర పోతన కవితలు ఆయనలోని అసామాన్యమైన కోణాన్ని ఆవిష్కరించాయి. కవుల మధ్య జరిగే గొడవలు కూడా ఎంతో కవితాత్మకంగా ఉంటాయి. (ఈ సందర్భంగా విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీల మధ్య కవితలతో పడిన ఘర్షణను వినిపించారు) - బ్రహ్మానందం, హాస్య నటుడు తెలుగు నామఫలకం తీసేయమన్నారు ప్రజల మధ్య వైషమ్యాలను హరించి జగతిని ఏకం చేసేది భాషే. న్యాయస్థానాల్లో న్యాయం తీరు ఎలా ఉంటుందో 2 పేరాల్లో విశ్లేషించిన అద్భుత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రికి సరైన గౌరవం దక్కలేదు. తెలుగు నేలపై పుట్టడం ఆయన దురదృష్టం. ఢిల్లీలో నాకు కేటాయించిన బంగళా ప్రవేశ ద్వారానికి తెలుగులో నామఫలకం పెట్టుకుంటే.. ఒక అనుభవశాలియైన(సీనియర్) న్యాయమూర్తి వెంటనే తీసేయమని సూచించారు. కానీ నేను ఒప్పుకోలేదు. అంతేకాదు నేను ఢిల్లీలో ఉన్నంతకాలం ఆ ఫలకం ఉంటుందని చెప్పాను. మన భాషకు గౌర వం, గుర్తింపు లేనప్పుడు మన జీవితానికే అర్థంలేదు. అన్ని పత్రికల్లోనూ పాత నవలలను పరిచయం చేసే ప్రయత్నం చేయాలి. తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. పిల్లలతో సంభాషణ తెలుగులోనే జరపాలి. ప్రాథమిక విద్యను తెలుగులోనే చెప్పించాలి. భాషాభివృద్ధికి తెలుగు పత్రికలు ఎంతో తోడ్పడుతున్నాయి. కె.రామచంద్రమూర్తిగారు(సాక్షి, ఎడిటోరియల్ డెరైక్టర్) హెచ్ఎం టీవీలో ఉండగా భాషాభివృద్ధికి ఎంతగానో పాటుబడ్డారు. - జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి -
తెలుగోత్సవం
ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభలు ప్రారంభం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన పలు సదస్సులు సభల్లో పాల్గొన్న పలువురు {పముఖులు, రచయితలు, కళాకారులు, కవులు వాడీవేడిగా చర్చలు, ఛలోక్తులు విజయవాడ : నగరంలో సాహితీ శోభ ఉట్టిపడుతోంది. అచ్చమైన పంచెకట్టులో ప్రముఖులు అటూ.. ఇటూ తిరుగుతూ తెలుగుదనాన్ని చాటారు. పలువురు ప్రముఖులు తెలుగు గొప్పదనాన్ని వివరించారు. మాతృభాష సేవలో తరలించాలని, కమ్మనైన అమ్మ భాషను విశ్వవ్యాపితం చేయాలని పిలుపునిచ్చారు. పటమట శ్రీ కృష్ణవేణి స్కూలులో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభలు ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు పలు దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఎంతోకాలం తర్వాత కలిసిన కవులు, రచయితలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా చేసిన భోజన ఏర్పాట్లు బాగున్నాయని అతిథులు అభినందనలు తెలిపారు. సభలను జ్యోతి వెలిగించి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ, ప్రముఖ పత్రికా సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి, కె.శ్రీనివాస్, శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఆకాశవాణి కేంద్ర సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి పాల్గొన్నారు. ప్రారంభ సభలో రచయితలు, సాహిత్యాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తల్లి భాషలోని తియ్యదనం అనుభవిస్తేనే తెలుస్తుందని చెప్పారు. తాను చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తల్లి ద్వారా భాష నేర్చుకునే అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఎంతోమంది తల్లులు తనకు అన్నం పెట్టి దీవించారని, వారు చెప్పిన మాటలు, వారు వండి వడ్డించిన భోజనం ఎప్పుడూ తనకు గుర్తుకు వస్తూ ఉంటాయని చెప్పారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తన తల్లి ఎంతగానో అభిమానించి, ఆదరించిందని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తెలుగును విశ్వవ్యాప్తం చేయాలంటే భాష ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాల్సి ఉందన్నారు. ఆలోచింపజేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాటలు.. ఈ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పిన మాటలు పలువురిని ఆలోచింపజేశాయి. ఎన్నిసార్లు సభలు నిర్వహించినా ప్రయోజనం పెద్దగా ఉండదని, బతుకు దారి చూపించే భాషగా తెలుగు మారితే తప్పకుండా ప్రపంచ భాషగా గుర్తింపు లభిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. తెలుగులోని రచనలు అన్ని భాషల్లోకీ అనువాదం చేసి భాష గొప్పదనాన్ని చాటి చెప్పాలని కోరారు. తెలుగు భాషలో అన్ని వృత్తి విద్యలకు సంబంధించిన కోర్సులను బోధించే విధంగా మారాలని, అప్పుడు మాతృభాష ద్వారానే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అందరూ తెలుగు భాష గురించి గొప్పగా చెప్పాలంటే కవులు, కళాకారులు, రచయితలు కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆకట్టుకున్న ప్యారిస్ పరిశోధకుడు ప్యారిస్ దేశానికి చెందిన డేనియల్ నిగర్స్ మాట్లాడుతున్న సమయంలో అందరూ ఆసక్తిగా విన్నారు. విదేశీయుడైనప్పటికీ తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నందున భాషకు ప్రాచీన కాలం నుంచి ఉన్న ఔన్నత్యాన్ని ఆయన వివరిస్తుండగా.. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఆయన తెలుగు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ, మాతృభాష కాకపోవడంతో అది సహజమేనని పలువురు పేర్కొన్నారు. గొల్లపూడి మారుతీరావు, సుద్దాల అశోక్తేజ, తనికెళ్ల భరణి మహాసభలకు ఆకర్షణగా నిలిచారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తనికెళ్ల భరణిల పంచెకట్టు ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు, ఏడుగురు విదేశీ ప్రతి నిధులు సదస్సుకు హాజరయ్యారు. ఆదివారం మరో ప్రతినిధి హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రచయితల సంఘం ప్రముఖులు సదస్సుల్లో పాల్గొన్నారు.