-
చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. తొలి అవయవదానం ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్ని సక్సెక్స్ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు. ప్రమాదం లేదు హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది. జీవన్దాన్ ట్రస్ట్ అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్దాన్ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్దాన్ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. సర్కారు దవాఖానాలు భేష్ కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్లోని నిజామ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. బ్రెయిన్ డెడ్ మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్ డెడ్గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్డెడ్గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. - సాక్షి, వెబ్డెస్క్ -
మరణించినా జీవించు..
మన ఆయుష్షు యాభై ఏళ్లే అయి ఉండొచ్చు. కానీ మన కళ్లకి మాత్రం మరో యాభై సంవత్సరాలు లోకాన్ని చూసే అదృష్టం ఉంది. మన హృదయ స్పందన అర్ధంతరంగా ఆగిపోవచ్చు. కానీ కాసింత ఆలోచన చేస్తే మరో మనిషి పంచన చేరి ఆ గుండె చేసే చప్పుడు వినవచ్చు. మన ప్రయాణం సగంలోనే ఆగిపోవచ్చు. మిగిలిపోయిన ఆ ప్రయాణాన్ని మన అవయవాలు మరొకరి సాయంతో పూర్తి చేస్తాయి. అందుకు ఉన్న దారి అవయవదానం. ఇది కొత్తదేం కాదు. కన్నప్పు సాక్షాత్తు ఈశ్వరుడికే కంటిని దానం చేశాడు. దధీచి వెన్నెముకనిచ్చి ఇంద్రుడిని రారాజుగా నిలిపాడు. మన మధ్య కూడా అలాంటి దానకర్ణులు ఉన్నారు. ఎటొచ్చీ దీనిపై అవగాహనే తక్కువ. విలువైన అవయవాలను మట్టిపాలు చేసే బదులు ఇంకొకరికి దానం చేస్తే వారి ఆయుష్షును పెంచినవారమవుతామని వైద్యులు చెబుతున్నారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం. ఈ సందర్భంగా.. ఇచ్ఛాపురం రూరల్: ఒక మనిషి చనిపోయినా మళ్లీ బతకవచ్చంటే అది కచ్చితంగా అవయవదానం ద్వారానే. మనిషి మరణించిన తర్వాత మట్టిగా నో లేక బూడిదగానో మారే అవయవాలు సక్రమంగా వినియోగించగలిగితే మరో వ్యక్తికి జీవదానం చేయగలవు. దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చావు సమీపంలో ఉన్న వ్యక్తిని అమాంతం బతికించగల అపురూప కార్యమిది. సామాజిక కట్టుబాట్లు, మత మౌఢ్యం వేళ్లూనుకున్న మన సమాజంలో ఇప్పుడిప్పుడే అవయవదానం, రక్త, నేత్ర దానాలపై అవగాహన కలుగుతోంది. మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లీవర్, జీర్ణ వ్యవస్థలోని పాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. ఏ అవయవాలు దానం చేయవచ్చు మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కి డ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో బ్రెయిన్డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మా త్రమే అవయవాలను సేకరిస్తారు. అవయవాలు కావాల్సి వస్తే అవయవాలు కావాల్సిన రోగులు కూడా ప్రభుత్వ జీవన్దాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబర్ ఇ స్తారు. అవయవ దానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు. నమోదు ఇలా.. అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్ధాన్ డాట్ జీవోది డాట్ ఇన్’ వెబ్ సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డును అందజేస్తుంది. అవగాహన తప్పనిసరి.. అవయవ దానంపై ఇప్పటికీ జిల్లా వాసుల్లో చాలా అపోహలు ఉన్నాయి. ప్రాయోజితమైన ఈ కార్యక్రమంపై ప్రచారం లేకపోవడంతో అవ గాహన పెరగడం లేదు. దేశంలో ఏటా లక్షా 30 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. వీరికి కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో భారతదేశంలో ఏటా 3 లక్షల మంది చనిపోతున్నారు. అందులో మన శ్రీకా కుళం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. వీరికి బ్రెయిన్డెడ్ కేసులు నుంచి సేకరించిన మూత్రపిండాలను అమర్చగలిగితే మరణాలను ఆపవచ్చు. భర్త మాట కోసం.. అవయవదానం గురించి అప్పుడప్పుడే ప్రచారం జరుగుతున్న సందర్భంలో గ్రామీణ మారుమూల ప్రాంతానికి చెందిన నిరక్షరాస్యులైన కృష్ణచంద్ర కుటుంబం అవయవ దానం చేసేందుకు అంగీకరించడం విశేషం. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ అయ్యవారిపేటకు చెందిన కృష్ణచంద్ర రౌళో ప్రైవేటు బస్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. పాతికేళ్ల తన విధి నిర్వహణలో వేలాది మంది ని భద్రంగా గమ్యాలకు చేర్చారు. 2015 మార్చి నెలలో ప్రమాదవశాత్తు వంతెన మెట్లపై నుంచి జారిపడటంతో కోమాలోకి వెళ్లిపోయాడు. బతికే సూచనలు లేవంటూ వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశుతులైపోయారు. విశాఖపట్నం న్యూకేర్ ఆస్పత్రిలో అవయవ దానం చేసేందుకు భార్య శారదా రౌళో అంగీకరించడంతో కళ్లు, గుండెతో పాటు కిడ్నీలను దానం చేశారు. బతికుండే సమయంలో తాను చనిపోతే తన అవయవాలను ఇతరులకు దానం చేయాలన్న తన భర్త కృష్ణచంద్ర మాట కోసం అవయవాలతో ముగ్గురు వ్యక్తులకు జీవం పోశామని, ఆయన నేటికీ సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కన్న కొడుకు కోసం.. తన కన్నకొడుకు పడుతున్న దుస్థితి మరొకరు పడకూడదన్న ఓ తండ్రి ముందు చూపుతో నేత్రదానం చేసేందుకు అంగీకరించి తన కళ్లతో వేరొకరు లోకం చూసేందుకు చూ పును ప్రసాదించి చిరస్థాయిగా నిలిచిపోయారు నెయ్యిల ధర్మరాజు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన ధర్మరాజు టైలరింగ్ చేస్తూ భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషించుకునేవారు. పెద్ద కుమారుడు విఘ్నేష్ పుట్టు అంధుడు కావడంతో చూపు కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుడు వంటి ఎందరో అంధులుగా జీవనం సాగిస్తున్నట్లు స్వయంగా తెలుసుకున్న 42 ఏళ్ల ధర్మరాజు నేత్రదానానికి అంగీకరించారు. దురదృష్టవశాత్తు 2018 జనవరి 17న గుండె పోటుతో మృతి చెందారు. భర్త ఇచ్చిన మాటకు కట్టుబడిన భార్య నెయ్యిల పార్వతి అంగీకరించడంతో బెర్హంపూర్ నేత్రాలయానికి కళ్లను దానం చేశారు. ఆయన కళ్లు సజీవం! పెద్దాయన ప్రాణంతో లేకపోయినప్పటికీ ఆయన కళ్లు మాత్రం సజీవంగా ఉన్నాయి. ఇచ్ఛాపురానికి చెందిన సంతోష్ షాపింగ్ మాల్ యజమాని కిల్లంశెట్టి విశ్వనాథం (74) 2019 నవంబర్ 20న మృతి చెందారు. ఆయన తమ మధ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన కళ్లు మరొకరికి చూపునివ్వాలన్నది కుటుంబ సభ్యుల కోరిక. వెంటనే బరంపురం నేత్రాలయానికి సమాచారం అందివ్వడంతో విశ్వనాథం కళ్లను సేకరించారు. అన్నయ్యకు కిడ్నీదానం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన పరపటి కృష్ణారావు 2017వ సంవత్సరం మూత్రపిండాల వ్యాధి బారినపడ్డాడు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే తప్ప బతికే పరిస్థితే లేదన్నారు వైద్యులు. కిడ్నీ దానం చేసేందుకు చెల్లెలు నీలమ్మ ముందుకు వచ్చింది. 2017 ఏప్రిల్ నెలలో విశాఖపట్నం సెవెన్ హిల్స్లో ఆపరేషన్ సజావుగా జరిగింది. ఇప్పుడు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అపోహలు వద్దు అవయవ దానంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ చాలా మందిలో ఇప్పటికీ అవయవదానంపై అపోహలు పడుతున్నారు. అవి ఏ మాత్రం వాస్తవం కాదు. మరణానంతరం శాశ్వతంగా జీవించే మార్గం అవయవ దానమే. ప్రతి ఒక్కరూ తమ దేహాన్ని ముగించే ముందు మరొకరికి జీవితాన్ని ప్రసాదించాలి. – డాక్టర్ స్వాతి, వైద్యాధికారి, కొళిగాం పీహెచ్సీ, ఇచ్ఛాపురం మండలం -
నువ్వు శాశ్వతం..
జీవితం క్షణభంగురమని పురాతన మతతత్వాలన్నీ చెబుతున్నాయి. మరణాన్ని నేరుగా జయించే మార్గమేదీ నేటి వరకు అందుబాటులో లేదు. అయితే, మరణానంతరం శాశ్వతంగా జీవితం కొనసాగించే మార్గం మాత్రం ఉంది. అదే– అవయవదానం. అవయవదానం చేయండి. జీవితాన్ని శాశ్వతం చేసుకోండి. ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన మైలురాయి అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం నానాటికీ మెరుగుపడుతూ వస్తోంది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా పెరుగుతోంది. అవయవ దాతల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంది. అవయవ దానంపై లేనిపోని అపోహలు, మతపరమైన నమ్మకాలు, ఆచారాల వంటి వాటి కారణంగా చాలామంది అవయవ దానానికి ముందుకు రావడం లేదు. కొన్ని అవయవాలను జీవించి ఉండగానే సేకరించడం జరుగుతుంది. దానివల్ల అవయవ దాతకు గాని, అవయవ గ్రహీతకు గాని ఎలాంటి నష్టం జరగదు. చాలా సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయినా, సాధారణ కారణాల వల్ల మరణించినా, వారు ముందుగానే అవయవ దానానికి లిఖితపూర్వకంగా సంసిద్ధత వ్యక్తం చేసి ఉన్నట్లయితే, వారి అవయవాలను సేకరించి, అవసరంలో ఉన్న ఇతరులకు అమర్చుతారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల ద్వారా గరిష్టంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణజాలం ద్వారా గరిష్టంగా యాభై మంది జీవన ప్రమాణాన్ని పొడిగించవచ్చు. అవయవ దాతలు సైతం మరణానంతరం తమ అవయవాలను పొందిన ఇతరుల ద్వారా మరికొంతకాలం వారి జ్ఞాపకాల్లో సజీవంగా ఉండవచ్చు. ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం గురించి కొన్ని విశేషాలు... అవయవదానంపైనా, అవయవ మార్పిడి చికిత్స విధానాలపైనా ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రజలకు కొంత అవగాహన ఏర్పడుతోంది. అయినా, ఇంకా ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. అవయవదానానికి ఏయే అవయవాలు పనికి వస్తాయో, ఎలాంటి పరిస్థితుల్లో దాతల నుంచి అవయవాలను సేకరిస్తారో కూడా చాలామందికి తెలియదు. అవయవదానానికి ఏయే అవయవాలు, కణజాలాలు పనికి వస్తాయంటే... గుండె ప్రాణం నిలిచి ఉండాలంటే గుండె పనిచేస్తూ ఉండాల్సిందే. కొందరిలో గుండె వైఫల్యం కారణంగా, తీవ్రమైన వైరల్ జ్వరాల కారణంగా గుండె పనిచేయడం మానేసే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి వారికి ఇతర చికిత్సలేవీ పనిచేయని పరిస్థితుల్లో గుండె మార్పిడి ఒక్కటే దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్డెడ్ కారణంగా మరణించిన వారి నుంచి సేకరించిన గుండెను వేరు చేసి అమర్చడం ద్వారా గుండె వైఫల్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలను కాపాడవచ్చు. తగిన గుండె దొరికేంత వరకు రోగుల ప్రాణాలను నిలిపి ఉంచేందుకు వైద్యులు కృత్రిమ గుండెను ఉపయోగిస్తారు. అవయవదానంపై అపోహలు వాస్తవాలు అవయదానంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం సాగిస్తున్నప్పటికీ, చాలామందిలో ఇప్పటికీ అవయవదానంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు ఏమాత్రం వాస్తవం కాదు. ముఖ్యంగా ప్రచారంలో ఉన్న అపోహలు, వాటి వెనుకనున్న వాస్తవాలు ఏమిటంటే... అపోహ: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అవయవదానానికి పనికిరారు వాస్తవం: ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారైనా తమ అవయవాలను నిక్షేపంగా దానం చేయవచ్చు. శరీరంలోని వ్యాధిగ్రస్తమైన అవయవాలను విడిచిపెడితే, మిగిలినవి అవయవదానానికి పనికి వస్తాయి. అలాగే, ఇతర అవయవాల్లోని కణజాలం కూడా దానానికి పనికివస్తుంది. అపోహ: వయసు మళ్లిన వృద్ధులు అవయవదానానికి పనికిరారు వాస్తవం: అవయవదానానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసులో ఉన్నవారైనా అవయవదానం చేయవచ్చు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 93 ఏళ్ల అమెరికన్ పౌరుడు మరణానంతరం అవయవదానం చేశాడు. అవయవదానానికి సంసిద్ధత వ్యక్తం చేయడానికి కనీసం పద్దెనిమిదేళ్లు నిండి ఉండాలి. దాదాపు ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్న పద్ధతి ఇది. అపోహ: అవయవదానం మత విశ్వాసాలకు విరుద్ధం వాస్తవం: ప్రపంచంలోని చాలా మతాలు ఆధునికతను అర్థం చేసుకుంటున్నాయి. ఆధునిక శాస్త్ర పురోగతికి ఆటంకం కలిగించే నిబంధనలేవీ విధించడం లేదు. ఇతరుల పట్ల ప్రేమను, దాతృత్వాన్ని వ్యతిరేకించే మతాలేవీ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇస్లామిక్ ఫిక్ కౌన్సిల్ నాలుగో సమ్మేళనం కూడా అవయవదానాన్ని నిస్వార్థమైన దాతృత్వంగా పరిగణిస్తూ, అవయవదానానికి ఆమోదం తెలిపింది. అపోహ: అవయవదానం చేశాక శరీరానికి ఆచార ప్రకారం అంత్యక్రియల నిర్వహణ సాధ్యంకాదు వాస్తవం: అవయవదానం చేసినప్పటికీ, పనికి వచ్చే అవయవాలను తొలగించి, అవసరంలో ఉన్న గ్రహీతలకు అమర్చిన తర్వాత దాత శరీరాన్ని వైద్యులు పూర్తి గౌరవంగా చూస్తారు. తగిన రీతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా దానిని సిద్ధంచేసి, సంబంధీకులకు అప్పగిస్తారు. అపోహ: అవయవదాతల నుంచి సేకరించిన అవయవాలను ఎవరైనా అమ్ముకుంటారేమో! వాస్తవం: అవయవదాతల నుంచి సేకరించిన అవయవాలను అమ్ముకోవడాన్ని నిషేధిస్తూ దాదాపు ప్రపంచదేశాలన్నీ కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించాయి. అవయవాలను అమ్ముకునే వారికి కఠిన శిక్షలు తప్పవు. దాతల నుంచి సేకరించిన అవయవాలను వైద్యులెవరూ అమ్ముకోరు. అపోహ: అవయవదాత కోమాలోకి వెళితే కోమాలో ఉండగానే అవయవాలు తొలగిస్తారేమో! వాస్తవం: ఇది పూర్తిగా అపోహ. కోమాలో ఉన్నవారిని సాధ్యమైనంత వరకు బతికించడానికే వైద్యులు అన్నివిధాలా ప్రయత్నిస్తారు. బ్రెయిన్డెడ్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు శరీరంలోని రక్తానికి ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియకు కొన్ని కారణాల వల్ల అంతరాయం ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో గడ్డలు ఏర్పడటం (సిస్టిక్ ఫైబ్రోసిస్) వంటి పరిస్థితులు తలెత్తితే ఊపిరితిత్తులు శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ను అందించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో బ్రెయిన్డెడ్ లేదా గుండె ఆగిపోవడం వల్ల మరణించిన వారి నుంచి సేకరించిన ఊపిరితిత్తులను రోగులకు అమర్చడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. పొగతాగే అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తులు ఇందుకు పనికిరావని చాలామంది అనుకుంటారు గాని, అదంతా అపోహ మాత్రమే. పొగతాగే అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తుల సామర్థ్యం బాగానే ఉన్నట్లయితే, అవసరమైన రోగులకు వాటిని అమర్చవచ్చు. ఒకే రోగికి ఒక మనిషి మృతదేహం నుంచి సేకరించిన రెండు ఊపిరితిత్తులనూ అమర్చవచ్చు లేదా అవసరంలో ఉన్న ఇద్దరు రోగులకు చెరొక ఊపిరితిత్తిని అమర్చడం ద్వారా రెండు ప్రాణాలను కాపాడటానికి కూడా వీలు ఉంటుంది. పాంక్రియాస్ లివర్కు దిగువగా ఉండే పాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. టైప్–1 డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ అతి తక్కువగా తయారవుతుంది. ఒక్కోసారి అసలు ఏమాత్రం తయారవదు. నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చినా రక్తంలో చక్కెర నియంత్రణకు రాని పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటప్పుడు పాంక్రియాస్ మార్పిడి మాత్రమే ఏకైక మార్గం. బ్రెయిన్ డెడ్ లేదా గుండె ఆగిపోవడం వల్ల మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన పాంక్రియాస్ను అవసరమైన రోగులకు అమర్చడం ద్వారా వారిని బతికించవచ్చు. అవయవదానంపై ప్రభుత్వాల కృషి అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు దేశ దేశాల్లో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దిశగా కృషి కొనసాగిస్తున్నాయి. ‘ఆర్గాన్ ఇండియా‘ అనే స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ సహకారంతో అవయవదానంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రజలను అవయవదానం వైపు ప్రోత్సహిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ‘జాతీయ అవయవమార్పిడి కార్యక్రమం’ నిర్వహిస్తోంది. మరణానంతరం అవయవదానానికి సంసిద్ధులయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, అవయవాలను అమ్ముకోకుండా ఉండేలా కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేయడం, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివాటిని ఈ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తోంది. అవయవదానం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ‘జీవన్దాన్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ‘జీవన్దాన్’ డైరెక్టర్ డాక్టర్ స్వర్ణలత హైదరాబాద్ కేంద్రంగా అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. భారత్లోని అవయవదాతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. మన దేశంలో కిడ్నీదానం చేసేవారిలో 74 శాతం మంది, లివర్దాతల్లో 60.5 శాతం మంది మహిళలే. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, అవయవదాతల్లో మహిళలే అగ్రస్థానంలో నిలుస్తుండటం విశేషం. భారత్లో ప్రతి 10 లక్షల జనాభాకు 0.58 మంది అవయవదాతలే అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో స్పెయిన్ ప్రతి 10 లక్షల జనాభాకు 36 మంది, క్రొయేషియా ప్రతి 10 లక్షల మందికి 32 మంది, అమెరికా ప్రతి 10 లక్షల మందికి 26 మంది అవయవదానంలో ముందంజలో ఉన్నాయి. కిడ్నీ రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపే కీలక విధులు నిర్వర్తిస్తుంటాయి కిడ్నీలు. ఏదైనా వ్యాధి కారణంగానైనా, మరే కారణం వల్లనైనా కిడ్నీలు దెబ్బతిన్నట్లయితే, రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఫలితంగా మూత్రం ద్వారా బయటకు పోవలసిన వ్యర్థాలు రక్తంలోనే పేరుకుపోయి, శరీరాన్ని దెబ్బతీస్తాయి. కిడ్నీలు రెండూ విఫలమైన స్థితిలో డయాలసిస్ ద్వారా రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతారు. అయితే, డయాలసిస్పై రోగి దీర్ఘకాలం జీవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, వారి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చడం ద్వారా రోగిని కాపాడవచ్చు. సాధారణంగా రక్త సంబంధీకుల నుంచి సేకరించిన కిడ్నీలను రోగులకు అమరుస్తుంటారు. కొన్నిసార్లు బయటి దాతల నుంచి సేకరించిన కిడ్నీలను కూడా అమరుస్తారు. బ్రెయిన్డెడ్ రోగుల నుంచి సేకరించిన కిడ్నీలయితే, ఒక్కోసారి రెండు కిడ్నీలను కూడా ఒకే రోగికి అమర్చే అవకాశాలు ఉంటాయి. ఇద్దరు రోగులకు అవసరమైతే ఒక్కో రోగికి చెరో కిడ్నీని అమర్చి రెండు నిండు ప్రాణాలను కాపాడేందుకు వీలుంటుంది. ఎముకల కణజాలం ప్రమాదాలు, వ్యాధులు, పుండ్లు వంటి కారణాల వల్ల ఎముకలు కోల్పోయిన వారికి దాతల శరీరం నుంచి సేకరించిన ఎముకల కణజాలాన్ని అమర్చడం ద్వారా వారు కోల్పోయిన ఎముకలు తిరిగి యథాస్థితో పెరిగేలా చేయవచ్చు. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి, అరిగిపోయిన కీళ్ల మార్పిడి చికిత్సల్లో అరిగిపోయిన కీళ్లు తిరిగి త్వరగా కోలుకోవడానికి కూడా ఎముకల నుంచి సేకరించిన కణజాలాన్ని ఉపయోగిస్తారు. పిల్లలకైనా, పెద్దలకైనా గూని కారణంగా వంపు తిరిగిపోయిన వెన్నెముకను నిటారుగా తీర్చిదిద్దడానికి కూడా ఎముకల కణజాలం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఎముకల నుంచి సేకరించిన కణజాలం గరిష్టంగా పదిమంది రోగులకు పునరుజ్జీవనం కలిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, ఎముకలను కండరాలకు అతికించి ఉంచే టెండన్ల నుంచి సేకరించిన కణజాలాన్ని కూడా దెబ్బతిన్న టెండన్లను పునరుద్ధరించడానికి ఉపయోగిస్తారు. కార్నియా కంటి ద్వారా చూడాలంటే కంట్లోని కార్నియా, అందులో ఉండే సూక్ష్మభాగాలు సజావుగా ఉండాలి. పుట్టుక నుంచి గాని, మధ్యలో ఏదైనా కారణం వల్ల గాని అంధులుగా మారిన వారికి కార్నియా మార్పిడి చికిత్స ద్వారా తిరిగి చూపు తెప్పించడానికి అవసరం ఉంటుంది. మరణానికి ముందే నేత్రదానానికి సంసిద్ధత వ్యక్తం చేసిన దాతల నుంచి సేకరించిన కార్నియాను అమర్చడం ద్వారా అవసరంలో ఉన్న అంధులకు చూపు తెప్పించడానికి వీలవుతుంది. ఒక్కోసారి ఇతర కారణాల వల్ల మరణించిన వారి కార్నియాలను కూడా వారి బంధువుల అనుమతితో సేకరించవచ్చు. కార్నియా కణజాలాన్ని సేకరించి, అమర్చడం ద్వారా కూడా అవసరంలో అంధులకు చూపు తెప్పించడానికి వీలవుతుంది. చర్మం ఇన్ఫెక్షన్ల కారణంగా, తీవ్రంగా కాలిన గాయాల వల్ల చర్మం బాగా దెబ్బతిని బాధపడుతున్న వారికి చర్మ కణజాల మార్పిడి చికిత్స ద్వారా వారు ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేయవచ్చు. చర్మదాతల నుంచి చర్మంపై ఉండే పలచని పొరను సేకరించి, అవసరంలో ఉన్న రోగులకు ఉపయోగిస్తారు. చర్మం బాగా దెబ్బతిన్న రోగికి ముగ్గురు దాతల నుంచి సేకరించిన చర్మకణజాలాన్ని ఎక్కించడం ద్వారా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చేలా చికిత్స చేస్తారు. లివర్ శరీరంలోని అతి సంక్లిష్టమైన అవయవం లివర్. అంతేకాదు, శరీరంలోని అతిపెద్ద గ్రంథి కూడా ఇదే. లివర్ శరీరంలోని అనేక విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆహారం ద్వారా పొందిన చక్కెరలు, కొవ్వులు, విటమిన్లు వంటి పోషకాలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియల అసమతుల్యతలు, జన్యు కారణాలే కాకుండా హెపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి వ్యాధులు లివర్ను పూర్తిగా దెబ్బతీసే పరిస్థితుల్లో లివర్ మార్పిడి అవసరమవుతుంది. మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన లివర్నే కాకుండా, జీవించి ఉన్న వ్యక్తుల నుంచి సేకరించిన లివర్ ముక్కను కూడా లివర్ మార్పిడి అవసరమైన రోగులకు అమర్చవచ్చు. కొంతకాలానికి దాతలోను, గ్రహీతలోను కూడా లివర్ పూర్తి పరిమాణానికి ఎదుగుతుంది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన లివర్ని అవసరాన్ని బట్టి ఇద్దరు రోగులకు అమర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయి. గుండె కణజాలం పూర్తిగా గుండెమార్పిడి అవసరం లేని వారికి గుండె కణజాలాన్ని ఉపయోగించి చికిత్స చేస్తారు. అలాగే గుండె వాల్వులను కూడా అమర్చి చికిత్స చేస్తారు. పుట్టుకతో వచ్చే జన్యులోపాల వల్ల గుండెకు రంధ్రం ఏర్పడిన పిల్లలకు, గుండెవాల్వులు దెబ్బతిన్న పెద్దలకు ఇలా గుండె నుంచి సేకరించిన కణజాలాన్ని, వాల్వులను అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడటానికి అవకాశాలు ఉంటాయి. అవయవదానం కోసం యాప్ అవయవదానాన్ని సులభతరం చేసేందుకు బెంగళూరులో స్థిరపడ్డ ఒరియా యువకుడు ప్రతీక్ మహాపాత్రో ఒక యాప్ను రూపొందించాడు. అవయవాల అవసరంలో ఉన్నవారు అవయవదాతల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ఈ యాప్ను రూపొందించిన ప్రతీక్ మహాపాత్రో బెంగళూరులోని ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుకుంటున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో అతడు రూపొందించిన ఈ యాప్ మైక్రోసాఫ్ట్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది నిర్వహించిన ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ గుడ్ ఐడియా చాలెంజ్’లో మూడో స్థానంలో నిలిచింది. ఇన్పుట్స్: డాక్టర్ విక్రాంత్రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ కథనం: పన్యాల జగన్నాథదాసు -
అవయవదానానికి ముందుకొచ్చిన ఆరోగ్యశాఖా మంత్రి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ అవయవదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలందరూ అవయవదానానికి ముందుకు రావాలి అని విజ్క్షప్తి చేశారు. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావాలని ఆయన సూచించారు. కేర్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలో అవయవదానంపై అవగాహన తక్కువగా ఉందన్నారు. దేశంలో అవయవాలు లభించక ఏటా ఐదు లక్షల మంది చనిపోతున్నారన్నారు. అవయవదానం చేయడం వలన మరో వ్యక్తి పునర్జన్మను ఇచ్చినవారవుతారని కామినేని అన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement