breaking news
worker suicide
-
రుణం ఇప్పించాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు
కమలాపూర్(హుజూరాబాద్): సబ్సిడీ రుణం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ గల్ఫ్ కార్మికుడు శుక్రవారం వాటర్ ట్యాంకు ఎక్కి గంటకు పైగా ఆందోళనకు దిగాడు. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్కు చెందిన గందసిరి రాజ్కుమార్ కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్కు వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లేక తిరిగి వచ్చాడు. ఇక్కడ హమాలీగా పనిచేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో కమలాపూర్ మండలం నుంచి పలువురు దరఖాస్తు చేసుకోగా మొదటి విడతగా కొందరికి మంజూరయ్యాయి. కమలాపూర్ నుంచి సుమారు 50 మంది ఒక్కొక్కరు రూ.60 వేల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేశారు. నెల గడుస్తున్నా రుణం రాకపోవడంతో రాజ్కుమార్ కమలాపూర్లోని వాటర్ ట్యాంకు ఎక్కి ఆందోళన చేపట్టాడు. పోలీసులు చేరుకుని ఎంత నచ్చజెప్పినా విన లేదు. టీఆర్ఎస్ నాయకుడు మౌటం అశోక్ కొన్ని డబ్బులు పట్టుకుని ట్యాంకు ఎక్కి ఇచ్చినప్పటికీ తనకు రూ.2లక్షలు ఇస్తే తప్పా కిందికి దిగనని భీష్మించాడు. చివరకు మాజీ సర్పంచ్ గందసిరి రవికుమార్ గంట సేపట్లో రూ.2లక్షలు తాను ఇస్తానని హామీ ఇవ్వగా అతడు కిందకు దిగాడు. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన భూపాలపల్లి నగర పంచాయతి పరిధిలోని మంజూరనగర్లో శుక్రవారం వెలుగుచూసింది. రాంనగర్కు చెందిన రమణాచారి(26) సింగరేణిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విధులకు సరిగ్గా కాకుండా మద్యానికి బానిసైన రమణాచారి స్థానిక మైసమ్మ గుడి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఎవరూ అధైర్యపడొద్దు
సిరిసిల్లలో చేనేత కార్మికుడి ఆత్మహత్యపై కేటీఆర్ ఆవేదన - మృతుడి కుటుంబానికి రూ.1.50 లక్షల సాయం.. డబుల్ బెడ్రూం ఇల్లు - కార్మికుల ఉపాధికి చర్యలు తీసుకుంటున్నాం సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో చేనేత కార్మికుడు దోమల రమేశ్ అత్మహత్య పట్ల మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శిం చేందుకు చేనేత, టెక్స్టైల్స్ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ను సిరిసిల్లకు పంపించారు. మృతుడి కుటుంబానికి వీవర్స్ సొసైటీ నుంచి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూం ఇల్లు, పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కోసం ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వస్త్రం కార్మికుల నుంచే... రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వస్త్రాన్ని చేనేత, పవర్లూమ్ కార్మికుల నుంచే సమీకరించాలని సూత్రప్రా యంగా నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల లో కార్మికుడి ఆత్మహత్య నేపథ్యంలో చేనేత, పవర్ లూం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పవర్లూమ్ కార్మికులు అత్యధి కంగా ఉన్న సిరిసిల్లలో కార్మికులకు ఈ ఏడాది రూ.70 కోట్ల విలువ గల స్కూల్ యూనిఫాంల కాంట్రాక్టు అప్పగించామని తెలిపారు. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులెవరూ అధైర్యపడవద్దన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికులను సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మరమగ్గాల కార్మికులకు రూ.5.65 కోట్ల రుణాలు మాఫీ చేశామని, రూ.7.19 కోట్లతో 50 శాతం విద్యుత్ సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ (టీయూఎఫ్) కింద రూ.4 కోట్ల బకాయిలను విడుదల చేశామన్నారు. కేంద్రం నుంచి రూ.15 వేలు, రాష్ట్రం నుంచి రూ.10 వేలు వెచ్చించి రాష్ట్రంలో 5వేల మగ్గాలను నవీకరించామన్నారు. రూ.80 నామమాత్రపు రుసుంతో మహాత్మాగాంధీ బుంకర్ బీమా యోజన కింద 6 వేల మంది కార్మికులకు జీవిత బీమా సదుపాయం కల్పించామన్నారు. ఈ పథకం కింద కార్మికుల ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1,200 చొప్పున ఉపకారవేతనాలు ఇస్తున్నామన్నారు. ముద్రా బ్యాంకు నుంచి 600 మంది కార్మికులకు రుణాలు ఇప్పిం చామన్నారు. ప్రభుత్వ విధానాలు, కార్మికు లకు లభించే రాయితీలు, సదుపాయాలతో త్వరలో చేనేత, టెక్స్టైల్ రంగాల కోసం ప్రత్యేక పాలసీ ప్రకటిస్తామన్నారు.