breaking news
wet crop
-
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లాలో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. తూకంవేసిన బస్తాలతోపాటు రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు నీటమునిగాయి. ధాన్యం కుప్పలు పక్కపక్కనే ఉండడంతో వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక అక్కడి నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలు ఉన్న భూమి తడిగా మారడంతో అందులోకి లారీలు రాలేకపోయాయి. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం 4వేలు క్వింటాళ్లు ఉండగా.. నేరుగా రైస్మిల్లులకు తరలించారు. ధాన్యాన్ని ఆరబెడితే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆ పనిలో పడ్డారు. సగం ధాన్యం కేంద్రాల్లోనే ! జిల్లాలోని 146 ఐకేపీ కేంద్రాల్లో, 144 సింగిల్విండో కేంద్రాల ద్వారా వరిధాన్యం సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాల ద్వారా 7.87లక్షలు క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 7లక్షలు క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. సింగిల్విండో కేంద్రాల ద్వారా 8లక్షలు క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 6 లక్షలు క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెస్తున్న ధాన్యానికి సరిపోయే స్థాయిలో కవర్లు లేకపోవడంతో వర్షం పడిన ప్రతీసారి తడిసిపోతుంది. హమాలీలతోనే అసలు సమస్య మహారాష్ట్ర, బిహార్ నుంచి వేల సంఖ్యలో హమాలీలు వచ్చినప్పటికీ సరిపోవడం లేదు. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పగటిపూట 43 డిగ్రీలు వరకు ఉంటుండడంతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడం లేదు. దీంతో తూకం, లోడింగ్ పూర్తవడం లేదు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెట్పల్లి, చల్గల్లో తడిసిన ధాన్యాన్ని జాయింట్ కలెక్టర్ రాజేశంతోపాటు ఐకేపీ, సింగిల్విండో అధికారులు పరిశీలించారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సంజయ్కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కథలాపూర్/మెట్పల్లి/ఇబ్రహీంపట్నం : మెట్పల్లిలోని వ్యవసాయ మార్కెట్యార్డులో తడిసిన ధాన్యాన్ని ఆదివారం జాయింట్ కలెక్టర్ రాజేశం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం రావడంతో కొనుగోళ్లలో జాప్యమవుతుందన్నారు. కేంద్రాల్లో బార్దాన్లు, లారీల కొరత లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జేసీ తెలిపారు. వ్యవసాయ మార్కెట్యార్డులో కొనుగోలు చేసిన ధాన్యం 5,500 క్వింటాళ్లు, కొనుగోలు చేయని ధాన్యం 10 వేలు క్వింటాళ్లు నిల్వ ఉంది. మార్కెట్ చైర్మన్ బాల్క సురేష్, సింగిల్విండో చైర్మన్ మారు మురళీధర్రెడ్డి, తహసీల్దార్ సుగుణాకర్రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ ధాన్యాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 500 బస్తాలు స్వల్పంగా తడిసిపోయాయి. -
వర్షాభావ పరిస్థితుల్లో పొద్దు తిరుగుడే ముద్దు
తాళ్లూరు : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ పొద్దు తిరుగుడు పంట సాగు ఉత్తమం. ఈ మేరకు రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. పంట సాగులో మెళకువలు, యాజమాన్య పద్ధతులను అద్దంకి ఏడీఏ కుప్పయ్య ‘సాక్షి’కి వివరించారు. వాతావరణంలో తేమ తక్కువగా ఉంటే ఏడాది పొడవునా ఈ పంటను పండించుకోవచ్చని చెప్పారు. ఖరీఫ్లో అయితే సెప్టెంబర్ చివరి వరకు ఈ పంటను వేసుకోవచ్చన్నారు. అనుకూలమైన నేలలు నీరు నిల్వ ఉండని తటస్థ నేలలైన ఎర్ర, రేగడి, ఒండ్రు నెలలు పొద్దుతిరుగుడు పంటకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేల కంటే క్షార లక్షణాలు కలిగిన నేలల్లో దిగుబడి ఎక్కువగా వస్తుంది. భూమిలో ఆమ్ల లక్షణాలు ఉంటే విత్తనం మొలకెత్తే స్వభావం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణం మొక్కలో పటుత్వాన్ని తగ్గిస్తుంది. పొద్దు తిరుగుడు మొక్కలు అధిక తేమ శాతాన్ని తట్టుకోలేవు. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవద్దు. సాగు నేల తయారీ భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. మధ్యస్థ బరువు నేలల్లో బ్లేడుతో ఒకటి రెండు సార్లు కలియదున్నాలి. చదును చేసిన అనంతరం బోదెలు చేసి విత్తనం నాటాలి. విత్తనశుద్ధి... ఎకరాకు రెండు కిలోల విత్తనం అవసరం. విత్తనాలను ముందు 14 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తే ముందు కిలో విత్తనాలకు మూడు గ్రాముల కాంప్లాన్, థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాతే విత్తాలి. నీటి యాజమాన్యం ఎర్ర రేగడి నేలల్లో ఉష్ణోగ్రతను బట్టి 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగ డి భూముల్లో 15 నుంచి 20 రోజుల కొకసారి నీటిని అందించవచ్చు. శీతాకాలంలో తేలిక నేలలకు 4 నుంచి 6 సార్లు, మధ్యస్థ నేలలకు మూడు నుంచి 4 సార్లు, బరువు నేలలకు రెండు నుంచి మూడు సార్లు నీటిని పారించాలి. ఎరువుల వాడకం విత్తనం విత్తే మూడు వారాల ముందు ఎకరాకు మూడు టన్నుల పశువుల పేడ వేసి దున్నాలి. ఇది భూమిని సారవంతం చేస్తుంది. భాస్వరం, పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిని విత్తనం నాటే దశలో, మొగ్గ తొడిగే దశలో, పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. పూత దశలో, ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల బోరాక్స్ మందు(లీటరు నీటికి రెండు గ్రామాల బొరాక్స్ కలపాలి)ను పిచికారీ చేయాలి. దీనివల్ల గింజలు ఎక్కువగా, బలంగా తయారవుతాయి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. సస్యరక్షణ చర్యలు పొద్దు తిరుగుడు పంటను రసం పీల్చే పురుగులు, లద్దె, గొంగళి, పచ్చ, శనగపచ్చ, తలను తొలిచే పురుగులు లాంటివి ఆశిస్తాయి. ఆకుమచ్చ, పువ్వుకుళ్లు, బూజు లాంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన తగిన నివారణ చర్యలు చేపట్టాలి. పక్షులు, అడవి పందుల బెడద పొద్దు తిరుగుడు పంటకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. రామచిలుకలు ఎక్కువగా పంటపైన వాలి నష్టాన్ని కలిగిస్తాయి. పక్షులను బెదరగొట్టేందుకు మెరుపు రిబ్బన్లు చేను పైభాగంలో(వీటిపై సూర్యరశ్మి పడే ఎత్తులో) కట్టాలి. శబ్ధాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షుల బెడదను తగ్గించుకోవచ్చు. విత్తనం పట్టాక అడవి పందులు కూడా దాడి చేసే అవకాశం ఉంది. వాటి నివారణకు పంట చుట్టూ గుంజలు పాతి పట్టలు చుట్టి కాపాడుకోవాలి.