breaking news
we target
-
రైతుల ప్రయోజనాలే లక్ష్యం
- వేరుశనగకు రక్షక తడులు అందించాలి - అధికారులకు జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ ఆదేశం అనంతపురం అర్బన్: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రాథమికరంగ మిషన్ పరిధిలోని నిర్ధేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. జేసీ–2 మాట్లాడుతూ లక్ష్యాలను పూర్తిచేసి పథకాల లబ్ధిని అర్హులైన రైతులకు సకాలంలో అందించి రెండంకెల వృద్ధి చేరుకోవాలన్నారు. బెట్ట దశలో ఉన్న వేరుశనగ పంటకు రక్షకతడులు అందించాలన్నారు. ఇందుకు అవసరమైన నీటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ–క్రాప్ బుకింగ్ ప్రక్రియని రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అందలేదంటూ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తిని ఆదేశించారు. సమావేశంలో పట్టు పరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి, ఉద్యాన శాఖ డీడీ సుబ్బరాయుడు, మత్స్యశాఖ డీడీ హీరానాయర్, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం
తాడిమర్రి / ధర్మవరం అర్బన్ : గ్రామ సంపూర్ణ అభివృద్ధే తన లక్ష్యమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ అనూరాధ పేర్కొన్నారు. తాను దత్తతకు తీసుకున్న మండలంలోని ఆత్మకూరు, శివంపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆత్మకూరు గ్రామంలో రూ.4లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం 20 మంది చేనేత కార్మికులకు ఒకొక్కక్కరికి రూ.1000లు ప్రకారం నగదు సాయం, చేనేత మగ్గం పరికరాలను అందజేశారు. అనంతరం శివంపల్లి గ్రామంలో రూ.6లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికే శివంపల్లి, ఆత్మకూరు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాడిమర్రి, ఆత్మకూరు సర్పంచ్లు దేవర హర్షిత, సాకే లక్ష్మీదేవి, తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఎంపీడీఓ వెంకటనాయుడు, ఎస్ఐ రాంభూపాల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కౌసల్య, మండల ఇంజనీర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ధర్మవరం మండలం కుణుతూరు సమీపంలో పోలీస్ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ డీజీపీ రాముడు దత్తత తీసుకున్న నార్సింపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో తాను తాడిమర్రి మండలంలోని శివంపల్లి గ్రామాన్ని దత్తతకు తీసుకున్నట్లు వివరించారు. గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టుశిక్షణ, అగరబత్తీ తయారీ, పురుషులకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామంలోని చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలో అక్రమ మైనింగ్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో విజిలెన్స్ ఎస్పీ అనిల్బాబు, రూరల్ సీఐ శివరాముడు, ఎస్ఐలు యతీంద్ర, సురేష్ పాల్గొన్నారు.