breaking news
vro dies
-
పోలీసులకు చిక్కిన హుండీల దొంగ
అచ్యుతాపురం(అనకాపల్లి): చిన్న చిన్న ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడే ఘరానా దొంగ అచ్యుతాపురం పోలీసులకు గురువారం చిక్కాడు. ఎస్ఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పందంగా సంచరిస్తున్న అప్పలరాజును పోలీసులు విచారించి అసలు విషయాన్ని రాబట్టారు. విశాఖ జ్ఞానపురానికి చెందిన అప్పలరాజుపై అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న అచ్యుతాపురం మండలంలోని ఉప్పవరం ఆంజనేయస్వామి ఆలయంలో రూ.9వేలు, ఫిబ్రవరి 23న మునగపాక మండలం టి.సిరసపల్లి వీరభద్రస్వామి ఆలయంలో రూ.6వేలు, మే 21న పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో రూ.3వేలు, మే 25న సబ్బవరం మండలం జోడుగుళ్లు ప్రాంతంలో బంగారమ్మతల్లి ఆలయంలో చోరీకి ప్రయత్నించినట్టుగా పోలీసులు విచారణలో రాబట్టారు. అప్పలరాజు రాత్రి వేళల్లో మద్యం సేవించి చిన్న ఆలయాల్లో హుండీలు లక్ష్యంగా చోరీలకు పాల్పడతాడని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇతనిపై విశాఖనగరంలో 20 కేసులు ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. నాపై తప్పుడు కేసు... విచారణ చేయండి’ మాకవరపాలెం : తనపై నమోదైన తప్పుడు కేసుపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కొత్తపాలెం గ్రామానికి చెందిన యాకా లోవరాజు పోలీసులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశాడు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడంటూ లోవరాజుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం లోవరాజు విలేకరులతో మాట్లాడాడు. తహసీల్దార్ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని తెలిపాడు. నిర్వాసిత కాలనీలో పట్టా కోసం అధికారులను కోరగా అప్పట్లో పనిచేసిన వీఆర్వో రూ.80వేలు అవుతుందని చెప్పడంతో మొదట రూ.10 వేలు ఇచ్చానన్నాడు. అనంతరం రూ.70వేలు సిద్ధం చేసుకోవాలని చెప్పగా నగదు పట్టుకుని వెళ్లానన్నాడు. వీఆర్వో తహసీల్దార్ ఇంటికి తీసుకెళ్లి నగదు తీసుకుని పట్టా ఇచ్చినట్టు తెలిపాడు. తీరా ఇప్పుడు ఈ పట్టా నకిలీదని, తానే సృష్టించానని తహసీల్దార్ తప్పుడు కేసు పెట్టారని ఆరోపించాడు. ఈ విషయమై తహసీల్దార్ రాణీ అమ్మాజీని వివరణ కోరగా నగదు తీసుకున్నట్టు చెబుతున్న వీఆర్వో కన్నయ్య మరణించాడని, పట్టా తాను ఇవ్వలేదన్నారు. అది నకిలీ పట్టా కావడంతోనే ఫోర్జరీ సంతకంపై కేసు పెట్టినట్టు తెలిపారు. (చదవండి: హుండీలను కొల్లగొట్టే ముఠా అరెస్ట్) -
బస్సులోంచి జారిపడి వీఆర్వో మృతి
గుంతకల్లు రూరల్ : బస్సులోంచి దిగుతూ ప్రమాదవశాత్తు కాలుజారిపడిన ఘటనలో గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న తళారి మహేష్ (36) బుధవారం రాత్రి మృతి చెందారు. గుంతకల్లు పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో నివాసం ఉంటున్న మహేష్ ప్రస్తుతం గుంతకల్లు మండలంలోని తిమ్మాపురం, నక్కనదొడ్డి గ్రామాలకు వీఆర్వోగా పనిచేస్తున్నాడు. దాదాపు 10 సంవత్సరాల క్రితం కిడ్నీవ్యాధికి గురైన మహేష్ అప్పటినుండి చికిత్స పొందుతూనే ఉన్నాడు. మహేష్ రెండు కిడ్నీలు పాడై పరిస్థితి విషమంగా మారడంతో 6 సంవత్సరాల క్రితం మహేష్ తల్లి కిడ్నీ దానం చేసింది. అయినప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వారానికి రెండు సార్లు చొప్పున జిల్లా కేంద్రానికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకూ విధుల్లో ఉన్న మహేష్ డయాలసిస్ కోసం సాయంత్రం బయలుదేరాడు. అనంతపురం బస్టాండ్లో బస్ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహేష్ను ఆంబులెన్స్ ద్వారా తోటి ప్రయాణికులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దహన సంస్కారాల నిమిత్తం తహసీల్దార్ హరిప్రసాద్ ఆ కుటుంబానికి రూ.15 వేలు తక్షణ ఆర్థిక సహాయంగా అందజేశారు.