breaking news
VNR Vignana jyothi Engineering College beas river
-
గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి
దుఃఖసాగరంలో మునిగిన కుటుంబం శంషాబాద్: హిమాచల్ప్రదేశ్లో గల్లంతైన వారిలో శంషాబాద్ వాసి కూడా ఉన్నారు. స్థానిక పట్టణంలో పాత పోలీస్స్టేషన్ సమీపంలో నివసించే వినోద్, శశిలతల కుమారుడు అరవింద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుతున్నాడు. అతను కూడా గల్లంతు కావడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్తోపాటు అతడి కుటుంబసభ్యులు ముగ్గురు పిల్లల చదువుల కోసం నాలుగైదేళ్లుగా వనస్థలిపురంలో ఉంటున్నారు. అరవింద్ వీరికి మొదటి సంతానం. సెలవుల్లో ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్లని వారి బంధువులు తెలిపారు. అరవింద్ కుటుంబసభ్యులను ఓదార్చడానికి వారి బంధువులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. అరవింద్ తల్లి శశిలతను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కొడుకు గల్లంతయ్యాడనే షాక్ నుంచి ఆ తల్లి తేరుకోలేకపోతోంది. మూడు రోజుల క్రితం ఫోన్ చేశాడు: వినోద్ , బంధువు నా కొడుకు అరవింద్ మూడు రోజుల కింద ఫోన్ చేసి బాగున్నామని చెప్పాడు. నిన్నరాత్రి 12 గంటలకు తెలిసింది.. గల్లంతైన వారిలో మా వాడు కూడా ఉన్నాడని. కాలేజీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. హిమాచల్ప్రదేశ్కు నా బావమరిది వెళ్లాడు. ఇది ఘోరం: ప్రశాంత్, పరమేశ్వర్ సోదరుడు కళాశాల నిర్లక్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది. కాలేజీ వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మా తమ్ముడు గల్లంతైన వారిలో ఉన్నాడు. మా బాధను చెప్పుకోలేని పరిస్థితి. ఉదయమే ఫ్లైట్ ఉందని చెప్పినా విమానాశ్రయంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. -
విషాదఛాయలు
జగద్గిరిగుట్ట (బాచుపల్లి): హిమాచల్ప్రదేశ్లోని లార్జీ హైడ్రో పవర్ డ్యామ్ దుర్ఘటన నేపథ్యంలో.. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం విషాదఛాయలు అలుముకున్నాయి. స్టడీటూర్కు వెళ్లిన విద్యార్థులు బీయాస్ నదిలో గల్లంతయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో కళాశాలకు తరలివచ్చారు. వారి రోదనలతో కాలేజీ పరిసరాలంతా ఉద్విగ్నంగా మారాయి. ఏకకాలంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారన్న షాక్ నుంచి పలువురు తేరుకోలేకపోయారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలుసుకుని విద్యార్థులు, కళాశాల సిబ్బంది హతాశులయ్యారు. పోలీసు అధికారులు, మీడియా హడావుడితో ఈ ప్రాంతం కిటకిటలాడింది. కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ ప్రభుదాసు కాలేజీని సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించారు. బాచుపల్లిలోని కాలేజీలో నెలకొన్న పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. హిమాచల్ప్రదేశ్కు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను హిమాచల్ప్రదేశ్కు విమానంలో రెండు విడతలుగా తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి.డి.నాయుడు ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు బయలుదేరి వెళ్లారు. కొంతమంది దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు బాచుపల్లిలోని కాలేజీ చేరుకుని సమాచారం కోసం విశ్వప్రయత్నం చేశారు. తమ పిల్లల వివరాలను వెల్లడించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం యాజమాన్యం నుంచి సరైన స్పందన లేదని రాంబాబు అనే విద్యార్థి తండ్రి శేఖర్ నాయక్ కాలేజీ భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా చేరుకున్న వారిని మరో విమానంలో హిమాచల్ప్రదేశ్కు పంపింది. కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులు కొంతమంది మృతి చెందడంతో కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాలానగర్ ఏసీపీ నాగరాజరెడ్డి నేతృత్వంలో దుండిగల్ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ దళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, పేట్బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావులు ఘటనా స్థలానికి సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. కళ్లు తిరిగి పడిపోయిన సీఏఓ విద్యార్థులు గల్లంతై మృతి చెందిన విషయం తెలుసుకున్న కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి (సీఏఓ) సి.వి.రావు షాక్కు గురై కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సిబ్బంది హడావుడి కనిపించింది. హుటాహుటిన డాక్టర్ను పిలిపించి పరిస్థితిని అదుపు చేశారు. దురదృష్టకరం : సీఏఓ సీవీ రావు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి విద్యార్థులు నదిలో కొట్టుకుపోవడం దురదృష్టకరమని, విద్యార్థుల తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేనిదని అందుకు తాము ఎం తో బాధపడుతున్నామని కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సీవీ రావు అన్నారు. బాచుపల్లిలోని కళాశాలలో సోమవారం సాయంత్రం ఆయ న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తమకు సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సమాచారం అందించమన్నారు. సిగ్నల్స్ అందకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమకు ప్రభుత్వపరంగా ఎంతో సహాయం అందించారని ఆయన తెలిపారు. తమకు ప్రత్యేక విమానాలను సమకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. తమ విద్యార్థులను రక్షించుకోవడం కోసం ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నమన్నారు. ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, హిమచల్ప్రదేశ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయని ఆయన తెలియ జేశారు. విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతాం నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు ఎయిర్ పోర్ట్ నుంచి చేరవేస్తామని సీవీ రావు చెప్పారు. ఎప్పటికప్పుడు లభించిన మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించేందుకు హెల్ప్లైన్ను ఏర్పాటు చేశామన్నారు. షాక్కు గురయ్యాం ఆదివారం ఇండస్ట్రియల్ టూర్కు వెళ్లిన విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారన్న సమాచారం రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాం. టూర్కు వెళ్లిన ఈఐఈ బ్రాంచ్ విద్యార్థులంతా సత్ప్రవర్తన కలిగిన పిల్లలే. ఇంత ఘోరం వీరికే జరగడం బాధాకరం. మృతి చెందిన వారిలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులున్నారు. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాం. గుండె బరువెక్కుతోంది భగవంతుడు మా విద్యార్థులకే ఇలాంటి కష్టాలు తేవాలా? ఎంతో మంచి తెలివితేటలు కలిగిన విద్యార్థులు లేరన్న సంగతి తల్చుకుంటేనే గుండె బరువెక్కుతోంది. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివి జీవితంలో స్థిరపడే సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. మాకే ఇంత బాధ ఉంటే ఇక విద్యార్థులను కని పెంచిన వారి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో?