breaking news
Vikram Jit duggal
-
జీవితంలో సేవ భాగం కావాలి
►జీవితంలో సేవ భాగం కావాలి గోదావరిఖని(రామగుండం): సేవచేయడం, సేవాదృక్పథాన్ని అలవర్చుకోవడం మనిషి జీవితంలో భాగం కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆకాంక్షించారు. గోదావరిఖని విద్యానగర్–2లోని ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో దీనబంధు స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఐదునుంచి 10ఏళ్ల లోపు వయస్సున్న 12మంది ఆడ పిల్లలకు గురువారం కర్ణవేదన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ పాల్గొని.. మేనమామ స్థానంలో కూర్చుని ఈ కార్యక్రమం జరిపించారు. అనంతరం మాట్లాడుతూ నిస్సహాయ ఆడ పిల్లలకు చెవులు కుట్టించేందుకు దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. సేవాగుణంతో వచ్చే మార్పు సామాజిక ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వాలని, పేదవారికి అండగా నిలవాలని సూచించారు. ఆదుకునే చేతులుంటే ఆదరణ కోల్పోయే పిల్లలుండరని, నిస్సహాయ పిల్లలకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని అనాథలు, వికలాంగులు, ఇతర నిస్సహాయ పిల్లలకు సాయం చేసేందుకు ‘పునరావాసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో పనిచేసే హోంగార్డు నుంచి కమిషనర్ వరకు వారి వేతనాల నుంచి ప్రతీనెల కొంత డబ్బు రికవరీ చేసి పిల్లల కనీస అవసరాలకు, విద్యుత్ బిల్లులు, వాటర్ బిల్లు, ఫ్యాన్, కూలర్లు, నోట్పుస్తకాలు, స్కూల్ బ్యాగ్లు ఇలా వారికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఆదరణ నిస్సహాయ ఆశ్రమంలో సేదతీరుతున్న పిల్లల కోసం రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.పిల్లలు చెడు అలవాట్లకు లోనుకాకుండా మంచి ప్రవర్తన కలిగేలా తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఎండీ.రహ్మత్పాష, కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీఐలు జి.కృష్ణ, సీహెచ్. వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జాలి రాజమణి, మహంకాలి స్వామి, చందుయాదవ్, వివేక్, నాయకులు పెద్దంపేట శంకర్, గోపు అయిలయ్యయాదవ్, అందె సదానందం, అబ్బోజు రాంబాబు, కనకరాజు, తాండ్ర సదానందం, గోసిక మోహన్, ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మి, శ్రీనివాస్, ఆర్చన, కృష్ణ పాల్గొన్నారు -
మావోయిస్టులపై ఉక్కుపాదం
గంజాయి రవాణా నిరోధంపై దృష్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ కొత్త ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ విశాఖపట్నం: జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని కొత్త ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. జిల్లా కొత్త ఎస్పీగా ఆయన సోమవారం ఆయన ప్రస్తుత ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు దుగ్గల్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం కొత్త ఎస్పీ ప్రవీణ్ మాట్లాడుతూ గత ఎస్పీ దుగ్గల్ జిల్లాలో శాంతి భద్రతల్ని పరిరక్షించి, మావోయిస్టుల కార్యక్రమాలపై పట్టు సాధించారని ప్రశంసించారు. తాను కూడా అవే విధానాలను కొనసాగిస్తానని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారని చెప్పారు. వారు చేసే విధ్వంసాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీసులు సన్నద్ధంగా ఉన్నారన్నారు. గంజాయి రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) డి.ఎన్.కిషోర్, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎ.ఆర్.దామోదర్, నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని, పాడేరు ఏఎస్పీ ఎ.బాబూజి, చింతపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ ఇ.జి.అశోక్కుమార్. అనకాపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ వి.ఎస్.ఆర్.మూర్తి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎస్.కిరణ్కుమార్ ఎస్పీని కలసి అభినందనలు తెలిపారు.