breaking news
Veterans Welfare Association
-
ఇస్తారా..లేదా..!
సాక్షి, భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు తీయడానికి లబ్ధిదారులు వెనకాడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పైసలు కట్టినా యూనిట్లు సకాలం లో యూనిట్లు ఇస్తారా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10వేల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పటి వరకు కేవలం 500 మంది మాత్రమే డీడీలు తీశారు. జిల్లాలో తొలి విడతలో 9,687 యూనిట్లు, రెండో విడతలో 9,655 యూనిట్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. మొదటి విడత గ్రామాల్లో పంపిణీ పూర్తికాగా మునిసిపాలిటీ పరిధిలో 736 యూనిట్లకు అనుమతి రాకపోవడంతో అవి అలాగే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీఓ 74తో మునిసిపాలిటీల్లోనూ లబ్ధిదారులకు గొర్రెలు అందించేందుకు అనుమతి నిచ్చింది. వీటిని రెండో విడతలో కలిపి 10,391 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల్లో అనుమానాలు.. రెండో విడత సబ్సిడీ గొర్రెల యూనిట్లను తీసుకోవాలనుకునే వారిని అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని నాలుగు నెలలుగా గ్రామాల్లో చర్చజరుగుతుండడంతో లబ్ధిదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు డబ్బులు కడితే ఎప్పుడో యూనిట్లు ఇస్తారని చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల అనంతరం ఈ పథకం ఉంటుందా.. లేదా? అని అనుమాన పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మంది డీడీలు తీయడానికి వెనకాడుతున్నారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని సంబంధిత అధికారులు చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఎన్నికల సమయంలో నెల లేదా రెండు నెలలు మాత్రమే పథకానికి తాత్కాలికంగా విరామం ఉంటుందని ఆ తర్వాత నుంచి డీడీలు తీసిన లబ్ధిదారులకు గొర్రెలు అందిస్తామని చెబుతున్నారు. రెండో విడత గొర్రెల యూనిట్లను 2019 జూలై నాటికి పంపిణీ చేస్తామని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. పంటలకే పెట్టుబడి పెడుతున్నారు. దీంతో తీరికగా డీడీలు కట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొనుగోలులో సాంకేతికత.. సబ్సిడీ గొర్రెల విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈ సారి పటిష్ట్ట ప్రణాళికలతో అధికారులు సిద్ధమవుతున్నారు. గొర్రెల కొనుగోలు విషయంలో సాంకేతికతను ఉపయోగించనున్నారు. జీవాలను కొనుగోలు చేసిన వెంటనే ప్రత్యక్షంగా ఫొటో తీసీ అప్లోడ్ చేయాల్సి చేయనున్నారు. లబ్ధిదారుడి వివరాలు, జీవాలు కొనుగోలు చేసిన ప్రాంతం, విక్రయించిన వ్యక్తి తదితర వివరాలు అప్పటికప్పుడే అధికారిక వెబ్సైట్లో పొందుపరిచేలా ప్రణాళికలు రచించారు. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా ఉన్న చోటు నుంచి వివరాలు, ఫొటోలు పంపాల్సిందే. ఒకవేళ సిగ్నల్ లేకపోతే మరుసటి రోజువరకు ఆగాల్సిందే. గొర్రెలను తరలించే వాహనానికి జీపీఎస్ అమర్చనున్నారు. దీనివల్ల కొనుగోలు ప్రాంతం నుంచి స్వస్థలానికి వచ్చే వరకు వాహనం ఎటువెళ్తోందనే విషయం అధికారులకు తెలుస్తుంది. దీంతో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లు.. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా లబ్ధిదారులకు దూరాభారం తప్పేలా లేదు. ఇంతకు ముందు జిల్లాలోని లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో అధికారులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల వారు అనంతపురం వెళ్లి గొర్రెలను తీసుకువచ్చాక భూపాలపల్లి జిల్లా వారు వెళ్లడంతో నాణ్యమైన గొర్రెలు లభించలేదనే అపవాదు ఉంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఈ సారి మహారాష్ట్రలోని పూణే ప్రాంతం నుంచి గొర్రెలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై లోపు పంపిణీ పూర్తి చేస్తాం.. వచ్చే ఏడాది జూలై చివరి వరకు లబ్ధిదారులందరికీ గొర్రెల యూనిట్లు అందించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాకు మొదటి విడత అనంతపురం నుంచి జీవాలను తీసుకువచ్చాం. రెండో విడతలో మహారాష్ట్రలోని పూణే పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం. ఎన్నికలు ఉన్నప్పటికీ పంపిణీకి ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్నికల షెడ్యూల్ కాలంలో మాత్రమే పంపిణీ తాత్కాలికంగా జరగదు. తర్వాత కొనసాగుతుంది. – బాలకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నాణ్యమైన గొర్రెలు అందించాలి ఇప్పటికే రెండో విడత యూనిట్ల పంపిణీ అలస్యమైంది. నాణ్యమెన గొర్రెలు అందిస్తే బాగుంటుంది. గత విడతలో గ్రామాల్లో ఇచ్చారు. ఈ సారి భూపాలపల్లి మునిసిపాలిటీ ప్రాంతంలోని లబ్ధిదారులకు యూనిట్లు అందించాలి. – గుండబోయిన రాజైలు, వేశాలపల్లి, భూపాలపల్లి -
పశువుల గణన
ఆదిలాబాద్టౌన్: జనాభా లెక్కల మాదిరిగానే పశుసంవర్ధక శాఖ పశు గణన కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతీ ఐదేళ్లకోసారి పశువులను లెకిస్తోంది. గతంలో 2012 సంవత్సరంలో గణన చేపట్టగా.. 2017లో నిర్వహించాల్సి ఉంది. కానీ కేంద్రం ఒక సంవత్సరం ఆలస్యంగా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఈ గణన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులకు హైదరాబాద్లో శిక్షణ ఇప్పించారు. వారు మండల స్థాయి పశువైద్యాధికారులు, ఎన్యుమరేటర్లకు ఇటీవల రెండు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చేందుకు ఎన్యుమరేట్లకు ట్యాబ్లను అందించనున్నారు. గతంలో మ్యానువల్(రికార్డు) పద్ధతిలో గణన జరగగా, ఈసారి డిజిటల్ పశుగణన చేపట్టనున్నారు. 20 నుంచి షురూ.. ఈ నెల 20 నుంచి పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మూడు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటిలోగా బాధ్యతలు అప్పగించిన అధికారులు పశువుల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి ముగ్గురు ఎన్యుమరేటర్ల చొప్పున 54 మందిని నియమించారు. వీరితోపాటు మండల పశువైద్యాధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇంటింటికి వెళ్లి ఆవులు, గేదెలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, కుక్కలు, ఇతర పశువుల వివరాలను రైతులు, పశుపోషకులను అడిగి నమోదు చేసుకుంటారు. రైతుల వద్ద వ్యవసాయ పరికరాలు ఎన్ని, ఏవేవనే వాటినీ నమోదు చేసుకుంటారు. ప్రత్యేక సాఫ్ట్వేర్.. డిజిటల్ పశు గణన కోసం ఈసారి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతీ పశువుకు ఒక డిజిటల్ నంబర్ను ఇచ్చి అందులో యజమానితోపాటు పశువు వివరాలను పొందుపరుస్తారు. పశువులను అమ్మినా, కొనుగోలు చేసినా వెంటనే వివరాలు తెలిసే విధంగా సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అడవుల్లో జీవించే వన్యప్రాణుల గణనను అటవీ శాఖాధికారులు చేపట్టారు. 20వ పశుగణన.. ప్రస్తుతం చేపట్టనున్న పశుగణన 20వది కానుంది. దేశంలో తొలిసారిగా 1919 సంవత్సరంలో ఈ గణనను చేపట్టారు. అప్పటినుంచి ఐదేళ్లకోసారి ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. గత సంవత్సరం జరగాల్సి ఉండగా ఒక సంవత్సరం ఆలస్యమైంది. ఇప్పటివరకు 19సార్లు పశుగణన పూర్తయ్యింది. ఈసారి గణన కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత పశుగణనలో జిల్లాలో 9లక్షల 98వేల 609 పశువులు ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ఈసారి దాదాపు 14 లక్షల వరకు వాటి సంఖ్య చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. పకడ్బందీగా చేపడతాం.. జిల్లాలో పశుగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 20 నుంచి నవంబర్ మాసం వరకు కొనసాగనుంది. మండలానికి ముగ్గురు చొప్పున ఎన్యుమరేటర్లను నియమించాం. మూడు నెలల్లో పశువులన్నింటి వివరాలను ఆన్లైన్లో ట్యాబ్లా ద్వారా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. – సురేష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి -
9న తిరుపతి రానున్న ఆర్మీ చీఫ్ రావత్
తిరుపతి సిటీ: తిరుపతిలో ఈనెల 9న మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హాజరు కానున్నారని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.రెడ్డి తెలిపారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో మాజీ సైనికులతో పాటు పలువురు సైనికాధికారులు పాల్గొంటారని చెప్పారు. వీరి కోసం రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మనోహర్ రెడ్డి, ఎస్.గోపాల్, రవీంద్రబాబు, హరినాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.