breaking news
velugu co-ordinator
-
రూ.5వేలు కాదు, రూ.10వేలు ఇస్తాం..
సాక్షి, కైరుప్పల : ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం వెలుగు యానిమేటర్లు కలిశారు. డ్వాక్రా సంఘాలను టీడీపీ సర్కార్ నిర్వీర్యం చేసిందని, యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యానిమేటర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక వెలుగు యానిమేటర్లకు నెలకు రూ.10వేలు జీతం ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొదుపు సంఘాలు చంద్రబాబు సర్కార్ హయాంలో నిర్వీర్యం అయ్యాయి. అలాంటి పొదుపు సంఘాలను నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న యానిమేటర్లు... తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు. పక్కన తెలంగాణలో రూ.5వేలు ఇస్తున్నారని, కనీస పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగినా ఫలితం లేదు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే అయిదు వేలు కాదు... రూ.10వేలు ఇస్తాం.’ అని తెలిపారు. వైఎస్ జగన్ హామీతో పొదుపు సంఘాల యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు. -
మహిళా సంఘాల నిధులు స్వాహా
► రూ.6.73 లక్షలు కైంకర్యం ► పరారీలో వెలుగు సీసీ మార్కాపురం: రెండు మహిళా సంఘాల ఖాతాల్లో ఉన్న సుమారు రూ.6.73 లక్షల నిధులను వెలుగు కమ్యూనిటీ కో ఆర్డినేటర్ (సీసీ) స్వాహా చేశాడు. రాజుపాలెంలో ఆదర్శ మహిళా సంఘంలో 10 గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో ఆదర్శ, ఆరాధన, భారతి, భగత్, క్రీస్తు, మేరీమాత, ప్రభు, శాంతి, విజయ గ్రూపులున్నాయి. వెలుగు సీసీగా పనిచేస్తున్న వ్యక్తి మహిళల వద్దకు వెళ్లి రుణాలు చెల్లించాలంటూ ఒక్కో గ్రూపు నుంచి రూ.12 వేలు చొప్పున డ్రా చేయించి ఆ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. మళ్లీ ఆరు గ్రూపుల నుంచి రికార్డు మెయింటెనెన్స్, బ్యాంకు ఖాతాల్లో ఖర్చుల కోసం అంటూ రూ.7,200 చొప్పున వసూలు చేశాడు. ఈ విధంగా రూ.1.63 లక్షలు వసూలు చేశాడు. ఇదే సీసీ వేములకోట పంచాయతీలోని కొట్టాలపల్లెలో ఉన్న భవానీ, విజయ గ్రూపుల నుంచి రూ.5.10 లక్షలు వారి ద్వారానే బ్యాంకుల నుంచి డ్రా చేయించి స్వాహా చేశాడు. ప్రభుత్వం స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బ్యాంకుల్లో చేస్తున్న పొదుపు ఆధారంగా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ప్రక్రియలో వెలుగు అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. వీరిచ్చే నివేదికల ప్రకారమే బ్యాంకు మేనేజర్లు పొదుపు గ్రూపులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే బ్యాంకర్లు రెట్టింపు రుణాలు ఇస్తారు. వీటి ద్వారా మహిళలు పాడిపరిశ్రమ, దుస్తుల వ్యాపారం నిర్వహించుకోవచ్చు. మహిళల అవసరాన్ని ఆసరా చేసుకున్న వెలుగు సీసీ నమ్మకంతో వారి ద్వారానే బ్యాంకు ఖాతాల నుంచి నగదు డ్రా చేయించుకుని స్వాహా చేశాడు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు లబోదిబోమంటూ సదరు సీసీ నిర్వాహకంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు బ్యాంకు మేనేజర్లు మాత్రం రుణాలు చెల్లించాల్సిందేనంటూ గ్రూపు లీడర్లపై ఒత్తిడి తేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: మార్కాపురం మండలం రాజుపాలెం, కొట్టాలపల్లె గ్రామాల్లో వెలుగు సీసీ డబ్బులు దుర్వినియోగం చేసినట్లు అక్కడి మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మా శాఖ ఉన్నతాధికారులు సదరు సీసీపై పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ---రమేష్, ఏపీఎం, వెలుగు