breaking news
tv mechanic
-
ప్రాణం లేదని.. కాటికి తీసుకెళ్తే..
సాక్షి, కందుకూరు: జీవం లేదు.. వెంటిలేటర్ తీసివేస్తే మహా అయితే రెండు గంటలు ప్రాణం ఉంటుంది.. అని ఒంగోలులోని ఓ కార్పొరేటు వైద్యశాల వైద్యులు చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటికి ఎందుకు తీసుకెళ్లడం.. అని కందుకూరులోని శ్మశానానికి తీసుకెళ్లారు. పూడ్చి పెట్టేందుకు గుంత కూడా తీసిపెట్టారు... కానీ అక్కడకు తీసుకువెళ్లిన తరువాత అందరినీ ఆశ్చర్యపరిచేలా కాళ్లు, చేతులు కదిలించాడు. కళ్లు తెరిచి చూశాడు. ఈ సంఘటన చూసి అక్కడి వారందరూ అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులోని వైద్యులతో మాట్లాడి వైద్యశాలలో చేర్పించారు. తరువాత కాస్త కుదుటపడ్డాడు. మజ్జిగ తాగాడు. మరలా 7 గంటలసేపు మృత్యువుతో పోరాడి మరణించాడు. కందుకూరు పట్టణంలో ఆదివారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్లోని పి.వెంకటేశ్వర్లు (56) టీవీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కాళిదాసువారి వీధిలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటాడు. భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఉదయం బాత్రూంకు వెళ్లి జారిపడి అపస్మారక స్థితిలోనికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి ఫర్వాలేదనడంతో ఇంటికి తీసుకువెళ్లారు. మరలా శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తరువాత కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అత్యవసర చికిత్స అవసరం అని ఒంగోలు రిమ్స్కు తరలించారు. రిమ్స్ వైద్యులు ఇక్కడ తలకు సంబంధించిన ఆధునిక పరికరాలు లేవు అని చెప్పడంతో ఒంగోలులోని పలు వైద్యశాలకు తీసుకుని వెళ్లినా ఖాళీలు లేక చేర్చుకోలేదు. దీంతో తన కుమారుడు మా నాన్న కు న్యాయం చేయండి.. అని కందుకూరు సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో తెలియచేశాడు. దీంతో పాత్రికేయులు, స్థానికులు స్పందించారు. తోచిన విధంగా తెలిసిన వైద్యులతో మాట్లాడారు. శ్మశానంలో గుంత తీస్తున్న బంధువులు చివరగా ఓ కార్పొరేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో అక్కడ వైద్యం చేయించారు. వైద్యులు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ఆదివారం ఉదయం అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ ఉంచి డబ్బులు వృథా చేసుకోవడం ఎందుకు అని సలహాలు ఇచ్చారు. వెంటిలేటర్ తీసి వేస్తే మరో రెండు గంటలు ప్రాణం ఉంటుందని తరువాత ఉండదు అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్లమని చెప్పారు. కుటుంబ సభ్యులు ఎలాగా జీవం లేదన్నారు. ఇంటికి వెళ్లడానికి సొంత ఇల్లు లేదు. అద్దె ఇంటికి ఎందుకు తీసుకువెళ్లడం అని నేరుగా శ్మశానానికి తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి ఆరామ క్షేత్రంలో ఉంచి.. పూడ్చిపెట్టడానికి గుంట కూడా తీసి పెట్టారు. ఈ తంతు అంతా జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలో మార్పులు వచ్చాయి. కాళ్లు చేతులు కదలడం ఆరంభించాయి. కళ్లు తెరిచి చూశాడు. దీంతో అక్కడివారు అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులో ఉన్న వైద్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వైద్యశాలకు తీసుకుని వస్తే వైద్యం చేస్తామని వారు తెలియచేయడంతో నేరుగా శ్మశానం నుంచి కందుకూరు లోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మజ్జిగ కూడా తాగినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న సమయంలో ఏడుగంటల సేపు మృత్యువుతో పోరాడాడు. రాత్రి 8 గంటల సమయంలో మరణించాడు. ఇందులో నిర్లక్ష్యం ఎవరిది అనేది పక్కనపెడితే కరోనా నేపథ్యంలో వైద్యశాలలు, కుటుంబ సభ్యులు, గ్రామంలోని పరిస్థితుల ఒత్తిడులు ఇలాంటి ఘటనలు జరిగేలా చేస్తున్నాయి. -
కోతలతో విలవిల
ఖమ్మం: సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన పాకాల ప్రసాద్ పదేళ్లుగా టీవీ మెకానిక్గా పని చేస్తున్నాడు. షాపు అద్దె నెలకు రూ.5 వేలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవ టంతో టీవీలు రిపేర్ చేయలేకపోతున్నాడు. దీంతో అద్దె చెల్లించేందుకే అప్పు చేయాల్సి వస్తోంది. ఇక అతడి కుటుంబం ఇబ్బందుల పాలవుతోంది. పగటి వేళల్లో విద్యుత్ కోతలు ఇలాంటి ఎంతోమంది జీవనోపాధిని దెబ్బతీస్తోంది. జిల్లాలో అధికారిక కోతలకు తోడు అనధికారిక కోతలు భారీగా విధిస్తుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడంతో పాటు.. ఏ పనీ సాగక చిన్న చిన్న పరిశ్రమల వారు, సా మిల్లు కార్మికులు, మెకానిక్లు.. ఇలా అనేక రంగాల వారు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. విద్యుత్ వినియోగానికి-సరఫరాకు మధ్య తేడా ఉందనే నెపంతో కోతల సమయాన్ని పెంచారు. అధికారికంగానే జిల్లా కేంద్రంలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు, మున్సిపల్, మండల కేంద్రాల్లో ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటలు కోత విధిస్తున్నారు. దీనికి తోడు ఏదోఒక సాకుతో రోజుకు మరికొన్ని గంటలు సరఫరా నిలిపివేస్తున్నారు. రాత్రీ-పగలూ తేడా లేకుండా కరెంట్ పోతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొద్దంతా కష్టపడి పనిచేసుకుని వస్తే రాత్రి వేళ విద్యుత్ కోతలతో దోమల బాధ భరించలేకపోతున్నామని, నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. విద్యుత్ లేకపోవడంతో పిల్లలు రాత్రిపూట చదువుకోలేకపోతున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. కార్యాలయాల్లోనూ తప్పని వెతలు.. పట్టణాలలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ కోతలు విధించడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోతున్నాయి. పనులు చేసే సమయంలో కరెంట్ లేకపోవడంతో రాత్రివేళల్లో కూడా కార్యాలయాల్లోనే ఉండాల్సి వస్తోందని ఉద్యోగులు చెపుతున్నారు. ఇక చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు పనులు చేయక పస్తులుండాల్సిన పరస్థితి నెలకొంది. ప్రధానంగా జిరాక్స్ సెంటర్లు, మెకానిక్లు, ఎలక్ట్రికల్ వర్కర్లు, వెల్డింగ్ షాపుల వారిపై కోతల ప్రభావం అధికంగా ఉంటోంది. గంటల తరబడి విద్యుత్ కోతలతో ఏ పనీ చేయలేకపోతున్నామని ఆయా రంగాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండుతున్న పంటలు.. గృహ అవసరాలకు విద్యుత్ కోతలు విధిస్తున్నామని చెపుతున్న ట్రాన్స్కో అధికారులు వ్యవసాయ రంగాన్నీ వదలడం లేదు. పంటల సాగుకు ఉదయం ఐదు గంటలు, రాత్రి రెండు గంటలు సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్పడమే తప్ప.. సక్రమంగా అమలు చేయడంలేదు. గత వారం రోజులుగా ఉదయం ఒకటి రెండు గంటలు మాత్రమే కరెంటు ఉంటోందని, అది కూడా తరచూ ట్రిప్ కావడం, లోవోల్టేజీ సమస్యలతో కనీసం ఒక మడి కూడా తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపా దడపా చిరుజల్లులు రావడంతో కొద్దోగొప్పో పంటలు రక్షించుకోగలుగుతున్నామని, లేకుంటే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు. సంక్షోభంలో ‘గ్రానైట్స్’... జిల్లాలో అత్యధిక సంఖ్యలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వేల సంఖ్యలో కార్మికులు, కూలీలు ఈ ఫ్యాక్టరీలపై ఆధారపడి జీవిస్తున్నారు. గృహ అవసరాలకు అధికంగా విద్యుత్ను వినియోగించే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పరిశ్రమలకు అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీనికి తోడు మిగిలిన సమయంలోనూ కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియడం లేదు. దీంతో తరుచూ మిషన్లు ఆగడంతో సరైన కూలి లభించక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీ యజమానులు సైతం నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.