tundurru villages
-
అభివృద్ధి పేరుతో అరాచకాలా?
భీమవరం: అభివృద్ధి పేరుతో చంద్రబాబు సర్కారు అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నేతలు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకుల బృందం ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా పార్థసారధి, వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ... ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై స్థానికులకు ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని, గ్రామస్తుల బనాయించిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువులో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు బయటకు వస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ప్రజలు తమ వద్ద వాపోయారని చెప్పారు. ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో వాస్తవ పరిస్థితులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. -
తుందుర్రులో వైఎస్సార్సీపీ బృందం పర్యటన
భీమవరం : తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నేతృత్వంలోని బృందం బుధవారం బాధిత గ్రామాల్లో పర్యటించింది. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో 144 సెక్షన్తో పాటు అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. వృద్ధులు, మహిళలపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంతో గ్రామాలు కాలుష్య బారిన పడుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్లుగా చంద్రబాబు సర్కార్ అణచివేత ధోరణితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫుడ్ పార్క్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చి...ధైర్యం చెప్పారు. బాధితులను పరామర్శించిన వారిలో నేతలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, వంకా రవీంద్రనాథ్, గుణ్ణం నాగరాజు, కవురు శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.