breaking news
TSPL
-
ఎయిరిండియా, విస్తారా విలీనంపై ముందడుగు
న్యూఢిల్లీ: ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థలైన ఎయిరిండియా, విస్తారాలను విలీనం చేసేందుకు అనుమతుల కోసం కాంపిటీషన్ కమిషన్ ఇండియా (సీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ), టాటా సన్స్ (టీఎస్పీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన టాటా సియా ఎయిర్లైన్స్ (టీఎస్ఏఎల్).. విస్తారా బ్రాండ్ కింద విమానయాన కార్యకలాపాలు సాగిస్తోంది. టీఎస్ఏఎల్లో టీఎస్పీఎల్కు 51 శాతం, ఎస్ఐఏకి 49 శాతం వాటాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. తమకు వాటాలు ఉన్న విస్తారాను కూడా అందులో విలీనం చేయాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత డీల్ ప్రకారం విలీనానంతరం ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో టీఎస్పీఎల్కు 51 శాతం, ఎస్ఐఏకి 25.1 శాతం వాటాలు ఉంటాయి. అటు ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా)ను ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో విలీనం చేసే ప్రక్రియ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్టోబర్ గణాంకాల ప్రకారం ఎయిరిండియా, విస్తారా మార్కెట్ వాటా 18.3 శాతంగా (రెండింటిదీ కలిపి) ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ కూడా కలిస్తే దేశీయంగా టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్స్ మొత్తం మార్కెట్ 25.9 శాతానికి పెరుగుతుంది. తద్వారా ఎయిరిండియా భారత్లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్గాను, దేశీ రూట్ల విషయానికొస్తే రెండో పెద్ద విమానయాన సంస్థ గాను నిలుస్తుంది. -
టాటా–మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు సంబంధించి దాఖలైన క్రాస్ అప్పీల్స్పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసుకుంది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టాటా గ్రూప్ చీఫ్గా మిస్త్రీ తొలగింపు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పునఃనియామకం ఉత్తర్వులు, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన క్రాస్ అప్పీల్స్ గురువారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఎస్. బోపన్న, వి.రామసుబ్రమణ్యన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు పూర్వాపరాలు ఇవీ... 2012లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది. తనను తొలగించడంపై ఎన్సీఎల్ఏటీని సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. ఈ కేసులో సైరస్ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.7,50,000 కోట్లు) గ్రూప్ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సైరస్ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ, టాటా సన్స్ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్లూ వివాదంపై క్రాస్ అప్పీల్స్ దాఖలు చేసినట్లయ్యింది. డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన పునఃనియామక ఉత్తర్వులపై జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. చైర్మన్గా మిస్త్రీని తొలగింపు విషయంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అలాగే కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. వాటా విలువలపైనా వివాదం టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్ల మధ్య తాజా న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా విలువ రూ.70,000 కోట్లు–రూ.80,000 కోట్ల మధ్య ఉంటుందని డిసెంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టుకు టాటా గ్రూప్ తెలిపింది. టాటా గ్రూప్తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్ 29న సంబంధిత వర్గాలు తెలిపాయి. -
త్వరలో ‘క్యాట్’ క్రికెట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో ఏర్పాటైన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ జరుగనుంది. పాఠశాల స్థాయిలో ‘తెలంగాణ స్కూల్స్ ప్రీమియర్ లీగ్ (టీఎస్పీఎల్)’ పేరుతో జూలై చివరివారంలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ ఈ లీగ్కు మెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్ రెండు స్థాయిల్లో జరుగనుంది. ఈలీగ్లో రాణించిన క్రీడాకారులతో ఒక జట్టును ఎంపిక చేసి ముంబైలోని వెంగ్సర్కార్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదే జట్టు ముంబై అండర్–17 జట్టుతోనూ ఆడుతుందని క్యాట్ , టీఎస్పీఎల్ వ్యవస్థాపకులు, సెక్రటరీ సునీల్బాబు తెలిపారు. టీఎస్పీఎల్లో ఆడాలనుకునే వారు రిజిస్ట్రేషన్ కోసం www.tspl.online సైట్లో లాగిన్ అవ్వాలని తెలిపారు.