breaking news
try to sell
-
అమ్మ, అమ్మమ్మ కలిసి.. అమ్మాయిని అమ్మబోయి..
పహాడీషరీఫ్: పేదరికమో, మరో కారణమో.. డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది.. భార్యకు విడాకులిచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ల వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమైంది. అమ్మ, అమ్మమ్మ కలిసి.. మరో ఐదుగురు మహిళలు మధ్యవర్తులుగా నిలిచి.. చేయబోయిన ఈ దారుణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి దాడులు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని బండ్లగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీ (61) ఆరేళ్ల క్రితం తన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు మరో తోడు అవసరమని భావించాడు. ఇందుకోసం హైదరాబాద్లోని క్యూబా కాలనీలో నివాసం ఉండే అఖిల్ అహ్మద్ (37)ను సంప్రదించాడు. ఇద్దరూ కలిసి షాహీన్నగర్, చాంద్రాయణగుట్ట పరిసరాలకు చెందిన మహిళలను అక్రమంగా రవాణా చేసే జరీనా బేగం (25), షబానా బేగం (38), షమీం సుల్తానా (45), నస్రీన్ బేగం (40), జాహెద్బీ (72)లను మధ్యవర్తులుగా పెట్టుకున్నారు. ఈ మధ్యవర్తులు బండ్లగూడ నూరీ నగర్కు చెందిన అష్రియా బేగం కుమార్తె (14 ఏళ్లు)ను అల్తాఫ్ అలీకి రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఆమె అమ్మమ్మ చాంద్ సుల్తానా (65) సమక్షంలో మూడు నెలల కింద ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అల్తాఫ్ డబ్బు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో ఒప్పందం రద్దయింది. అయితే కొద్దిరోజుల కింద బాలిక మేనమామకు ప్రమాదం జరిగి, డబ్బులు అవసరం పడ్డాయి. దీనితో అష్రియా బేగం తన బిడ్డను విక్రయించేందుకు సిద్ధమై మధ్యవర్తులను ఆశ్రయించింది. వారు వెంటనే ముంబైకి చెందిన అల్తాఫ్ అలీకి సమాచారమిచ్చారు. డబ్బు అత్యవసరం కావడంతో ఈసారి రూ.3 లక్షలకే బాలికను కొనేందుకు బేరం కుదుర్చుకొన్నారు. డబ్బు చెల్లించి బాలికను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో.. బాలాపూర్ ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసు బృందం ఆదివారం రాత్రి దామని ఎర్రకుంటలో దాడులు చేసింది. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి బాలికను రక్షించింది. పోలీసులు నిందితులపై పోక్సో, మహిళల అక్రమ రవాణా చట్టాల కింద కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్కు తరలించారు. -
కుమారున్నే అమ్మబోయాడు..
కేసముద్రం(వరంగల్): బిడ్డను కంటికిరెప్పలా చూడాల్సిన తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని మరిచాడు. చివరకు మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డను అమ్మడానికి సిద్ధపడ్డాడు. బిడ్డను అమ్మొద్దని అడ్డువచ్చిన భార్యను చితకబాదాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె బిడ్డను కడుపున బెట్టుకుని పరారై వరంగల్ జిల్లా కేసముంద్రం రైల్వేస్టేషన్లో తలదాచుకుంది. ఎస్సై ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని కొత్తపేట కనకదుర్గ కాలనీకి చెందిన షేక్ సల్మా, అదే ప్రాంతంలోని కె.రాజు ప్రేమ వివాహం చేసుకున్నారు. తాపీ మేస్త్రీ పనిచేస్తూ రాజు కుటుంబాన్ని సాకుతున్నాడు. వారికి కుమారుడు రఫీ (3) ఉన్నాడు. పనిమానేసిన రాజు మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఉన్నదంతా అమ్ముకుంటూ మద్యానికి వెచ్చించాడు. డబ్బు కోసం భార్యను వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా పుట్టిన బిడ్డను అమ్మడానికి యత్నించాడు. భార్య వాదించడంతో చితకబాదాడు. ఎలాగోలా భర్త నుంచి తప్పించుకున్న సల్మా కొడుకును తీసుకుని మూడు రోజుల క్రితం విజయవాడలోని రైలు ఎక్కి కేసముద్రం రైల్వేస్టేషన్కు చేరుకుంది. భిక్షాటన చేస్తూ బిడ్డ కడుపు నింపుతోంది. గమనించిన స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం పోలీసులు రైల్వేస్టేషన్ చుట్టుపక్కల తిరుగుతున్న ఆమెను పోలీస్స్టేషన్.. అనంతరం తల్లీబిడ్డను వరంగల్లోని స్వధార్ హోంకు తరలించారు.