breaking news
Treasury activities
-
అక్కడ కాసులిస్తేనే లెక్క.. లేకుంటే పెండింగ్ పక్కా!
కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోనే ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల నుంచి వివిధ శాఖల పరిధిలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు అన్నీ ట్రెజరీ ద్వారానే జరుగుతాయి. అలాంటి ప్రధానమైన విభాగంపై నిఘా కరువైంది. నూతన కలెక్టరేట్ భవనంలో కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోనే జిల్లా ఖజానా కార్యాలయం ఉన్నా.. పర్యవేక్షణ కొరవడడంతో అవినీతికి అలవాటు పడిన అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు తప్ప..ఏరియర్స్, డీఏ, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ విత్డ్రాలు, గ్రామపంచాయతీ చెక్కుల వంటి అన్ని రకాల చెల్లింపులకు ఎవరైనా సరే పర్సంటేజీ ప్రకారం ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్లులో ఐదు శాతం.. ట్రెజరీ కార్యాలయానికి సమర్పించిన బిల్లులు నెలల కొదీద్ కోకొల్లలుగా వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ట్రెజరీ కార్యాలయం నుంచి బిల్లులు పాస్ చేసి ఈ–కుబేర్కు పంపాక క్యూలైన్లో ఉండాల్సిందే. అందరికీ ఇక్కడే ట్విస్ట్ ఎదురవుతోంది. చేసిన బిల్లులో ఐదు శాతం పర్సంటేజీ రూపంలో ఇస్తేనే బిల్లు అకౌంట్లో పడుతోంది. ఈ తతంగం తెలిసిన వారు ముందుగానే ఇచ్చి పనులు చేయించుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఇదంతా తెలవని వారు అయోమయానికి గురవుతూ అధికారుల వద్దకు పరుగెడుతున్నారు. వారు అయితదని సమాధానం ఇచ్చి తప్పించుకుంటున్నారు. ముడుపులు ఇచ్చుకోలేని వారు నిత్యం ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు వసూలు.. ఆ తర్వాత పంపకాలు ముడుపుల బాగోతానికి సంబంధించి ట్రెజరీ కార్యాలయంలో ఓ ఇద్దరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కిందిస్థాయి కంప్యూటర్ ఆపరేటర్, ఓ సెక్షన్ క్లర్క్ అన్నీ తామై వసూలు చేస్తున్నట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తాన్ని లెక్కగట్టి.. ఇదివరకు నిర్ణయించుకున్న మేరకు వాటాల రూపంలో పంపకాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు కొందరు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, గ్రామ పంచాయతీ బిల్లులకు సంబంధించిన వ్యక్తులు ‘సాక్షి’తో మాట్లాడారు. ట్రెజరీ కార్యాలయంలో డబ్బులు ముట్టజెబితే మళ్లీ తిరగాల్సిన పని లేదని, ఇవ్వకుంటే పని కాదని, ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమ పేరును గోప్యంగా ఉంచాలని కోరారు. బిల్లులు.. పెండింగ్.. జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎస్టీఓల పరిధిలో గెజిటెడ్ కేడర్ నుంచి క్లాస్–4 వరకు మొత్తం 7,632 మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి ప్రతి నెలా వేతనాల కింద రూ.12,63,01,928 చెల్లిస్తున్నారు. ఇందులో పెన్షనర్లకు రూ.6.40 కోట్లు చెల్లిస్తారు. ఈ ఏడాదిలో ఉద్యోగులకు చెందిన 6,668 సప్లిమెంటరీ బిల్లులకు రూ.41.55 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటు ఇతర రకాల 2,160 బిల్లులకు గాను రూ.73.34 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇవేకాకుండా డీటీఓ నుంచి ఈ–కుబేర్కు పంపిన 33,307 బిల్లులకు రూ.835 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఓ ఉద్యోగ సంఘం నేత హవా.. ఉద్యోగులకు పీఆర్సీ ఏరియర్స్ను 2020 నుంచి లెక్కించి 18 కిస్తుల రూపంలో ప్రతి నెలా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరు నెలల క్రితమే బిల్లులు చేసి ఆయా శాఖల నుంచి జిల్లా ట్రెజరీకి వచ్చాయి. అక్కడ బిల్లులు పాసై ఈ–కుబేర్కు వెళ్లాయి. అయితే ఎవరైతే కాసులు ముట్టజెప్పుతారో వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా కిస్తీల రూపంలో చెల్లిస్తున్నారు. ముట్టజెప్పని వారిని పెండింగ్లో పెడుతున్నారు. జిల్లాలోని ఓ ఉద్యోగ సంఘం నాయకుడితో పాటు పలువురు ఈ–కుబేర్ అధికారులు, సిబ్బందితో కుమ్మకై ్క హవా నడిపిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లోనూ ఆయనే రాయబారాలు నడుపుతుండగా ముడుపుల బేరం మూడు పువ్వులు, ఆరు కాయల్లా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగంపై జిల్లా ఖజానా శాఖ డీడీ శ్రీనివాస్ను పలుమార్లు ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. భాధితుల గోడు ఇలా! హన్వాడ మండలకేంద్రంలో ఓ పాఠశాల భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు 2023 ఫిబ్రవరి 8న జనరేట్ అయింది. పీడీ అకౌంట్ చెక్కును ఓ వ్యకి అదే రోజు ట్రెజరీ కార్యాలయంలో జమ చేశారు. ఇప్పటి వరకు బిల్లు చెల్లించకపోవడంతో సదరు వ్యక్తి ఆ కార్యాలయానికి 11 నెలలుగా తిరుగుతూనే ఉన్నారు. ఈ చెక్కు తర్వాత సమర్పించిన వాటికి బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయి. ట్రెజరీ కార్యాలయంలో లంచం ఇచ్చిన వారికి మాత్రమే పనిచేసి పెడుతున్నారని సదరు వ్యక్తి వాపోతున్నాడు. ఓ తహసీల్దార్కు కిరాయికి కారు పెట్టినా. బిల్లులు ప్రతి నెలా చేసి పంపినా. ఎస్టీఓలో చెల్లింపు చేసినట్లు చూపుతున్నా.. ఈ – కుబేర్లో చెల్లింపు కావడం లేదు. మాతో పాటు చేయించుకున్న కొందరికి బిల్లులు వచ్చాయి. కానీ నాకు 10 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మా పరిస్థితి బాగోలేదని, త్వరగా చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదు. బిల్లులో 5 శాతం లంచం ఇచ్చుకుంటే గానీ పని కాదని తేల్చిచెబుతున్నారు. నెలల పాటు బిల్లు రాకపోవడంతో బండి డీజిల్కు కూడా ఇబ్బంది అయితాంది. ...ట్రెజరీ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పలువురు ఉద్యోగులు, సిబ్బంది ధనదాహం, పట్టించుకోని ఉన్నతాధికారులు వెరసి సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వ అధికారులకు వాహనాలను అద్దెకు పెట్టిన వారు, గ్రామ పంచాయతీ వర్కర్లు, కాంట్రాక్టర్లు తదితరులు నానా తంటాలు పడుతున్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలోని ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న ముడుపుల బాగోతంపై ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
ఖజానాకు తాళం
సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యకలాపాలు ఏకంగా పది రోజులకు పైగా స్తంభించనున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో మే నెలకు సంబంధించి జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ వారం రోజుల ముందుగానే పూర్తయింది. సాధారణంగా జూన్ ఒకటిన ఈ చెల్లింపులు జరుగుతాయి. పెన్షన్లయితే ఐదో తేదీ వరకు చెల్లిస్తారు. విభజన నేపథ్యంలో ఈ చెల్లింపుల ప్రక్రియ శనివారంతో ఫుల్స్టాప్ పెట్టేందుకు ట్రెజరీ శాఖాధికారులు తలమునకలయ్యారు. ఈ నెల 25 నుంచి అపాయింటెడ్ డే మరుసటి రోజు వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరపరు. ముఖ్యంగా ట్రెజరీపరంగా చెల్లింపులు, వసూళ్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకే.. జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల వేతనాలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులతో పాటు పింఛన్ల చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రెజరీ శాఖ వారం రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురైంది. 21వ తేదీతో బిల్లుల స్వీకరణకు 24వ తేదీ చెల్లింపులకు గడువుగా ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నానా హైరానా పడ్డారు. సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉండే బిల్లులను జిల్లా కేంద్రానికి రప్పించి, సర్వర్తో అనుసంధానం చేసి బిల్లుల ల్లింపును పూర్తిచేశారు. ఇప్పటి వరకు జరిగిన వ్యయాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించారు. ఇక నుంచి జరిగే బిల్లులను రెండు రాష్ట్రాల ఖాతాలో జమ చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మళ్లీ మార్గదర్శకాల తర్వాతే.. జిల్లాలో 58 వేల మంది ఉద్యోగులుండగా, 40 వేల మంది వరకు ప్రభుత్వ పింఛనుదారులున్నారు. ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాల కింద ప్రతీనెలా రూ.107 కోట్ల చెల్లింపులు జరుగుతాయి. పింఛనుదారులకు పెన్షన్ల రూపంలో రూ.66 కోట్ల వరకు చెల్లిస్తారు. మరో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వివిధ బిల్లుల కింద చెల్లింపులు జరుగుతాయి. బిల్లుల చెల్లింపులన్నీ నెల పొడవునా జరుగుతుంటాయి. జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు మాత్రం ప్రతీ నెలా మొదటి వారంలోనే చేస్తారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చెల్లింపులన్నీ పది రోజుల ముందుగానే చెల్లిస్తారు. అయితే ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేసే వారికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ నెలాఖరులోగానే చెల్లింపులు జరిపేలా ఏర్పాట్లు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మినహా ఇతర చెల్లింపులను ఈ నెల 25 నుంచి పూర్తిగా నిలిపి వేయనున్నారు. శనివారం సాయంత్రం నుంచి ట్రెజరీ శాఖకు సంబంధించిన సర్వర్ను పూర్తిగా లాక్ చేయనున్నారు. ప్రతీ రోజు ఈ శాఖ ద్వారా సరాసరి రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర చెల్లింపులు జరుగుతుంటాయి. ఆ మేరకు రానున్న పది రోజులు నిలిచిపోనున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు కూడా నిలిచిపోనున్నాయి. దీనివల్ల ఆయా పనులకు విఘాతం కలగనుంది. గతంలో మంజూరై, ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులను రాష్ర్ట విభజన అనంతరం పునఃప్రారంభిస్తారు. వాస్తవానికి అపాయింటెడ్ డే తర్వాత కొత్త రాష్ర్ట కార్యకాలాపాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఈ నెల 26 నుంచే అందుకు సంబంధించి అంతర్గతంగా ప్రాథమిక స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటితో చెల్లింపులన్నీ నిలిపివేస్తున్నామని జిల్లా ట్రెజరీ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పీఎస్ సూర్యప్రకాశ్ ‘సాక్షి’కి తెలిపారు. అపాయింటెడ్ డే తర్వాతే ట్రెజరీ శాఖకు కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరపబోమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారం రోజుల ముందుగానే జీతభత్యాలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులు, పింఛన్లు అందుకున్న ఉద్యోగులు, పింఛనుదారులు రాష్ర్ట విభజన అనంతరం సకాలంలో జీతభత్యాలు, పింఛన్లు అందుతాయో, లేదోననే ఆందోళనలో ఉన్నారు.