breaking news
tranquil
-
మంచి మాట: ఉండాల్సిన లక్షణం
మంచితనం; మానవ జాతి మొదలయిన రోజు నుంచి ప్రతిమనిషికి అతిముఖ్యంగా కావాల్సి వచ్చింది ఏదైనా ఉంది అంటే అది మంచితనం. ఒక మనిషి నుంచి మరొక మనిషికి జారి పోకుండా అందాల్సింది ఏది అని అంటే అది మంచితనం. మొత్తం మానవ జాతికి సర్వదా, సర్వథా క్షేమకరం అయిందీ, లాభకరం అయిందీ ఏదైనా ఉందీ అంటే అది మంచితనం. మానవజాతిలో మంచితనానికి ఆది నుంచీ కొరత ఉండడం కాదు అసలు మంచితనం మనలోకి, ప్రపంచం లోకి ఇంకా రానేలేదు. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇకపైనైనా మనలో మంచితనం కోసం మంచి ప్రయత్నాలు మెదలు అవచ్చు. మంచితనం అని మనం అనుకుంటోంది నిజానికి మంచితనం కాదు. మంచితనం అని మనం అనుకుంటోంది మంచితనమే అయి ఉంటే మన ప్రపంచంలో జరుగుతూ వస్తున్న హాని, విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాలు, ద్రోహాలు, దొంగతనాలు, కుట్రలు, మనుషుల బతుకులు అల్లకల్లోలం అవడమూ మనకు తెలుస్తూ ఉన్నంత తెలుస్తూ ఉండేవి కావు; ఇప్పటిలా మనం వాటివల్ల దెబ్బతినేవాళ్లం కాము. మంచితనానికి మంచి జరగలేదేమో? అందుకే మనలోకి, ప్రపంచంలోకి రావడానికి మంచితనానికి ఇంకా మంచిరోజు రాలేదేమో? మంచితనానికి మంచి జరిగే ఉంటే ఎంతో బావుండేది. మనకు నెమ్మది, మన బతుకులకు భరోసా ఉండేవి. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని యోగులు, గురువులు, కవులు, జ్ఞానులు అందరినీ మంచితనంవైపు మళ్లించే మాటలు చెప్పారు. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. ఎందుకో చెడు అబ్బినట్టుగా మనిషికి మంచి అబ్బలేదు. ఏమిటో మరి చెడుకు మాలిమి అయినట్టుగా మనిషి మంచికి మాలిమి అవలేదు. ఇందుకు కారణాలు తెలిసిపోతే మంచికి రోజులు వచ్చేస్తాయేమో? చెడుకు రోజులు చెల్లిపోతాయేమో? మనిషి చెడుతోనే పుడతాడు. చెడు అన్నది ఎవరికైనా పుట్టకతోనే వచ్చేస్తుంది. మనిషిలో చెడు సహజంగానే ఉంటుంది. మనిషి తనలో ఉన్న చెడును తొలగించుకుంటూ మంచిని అభ్యసిస్తూ ఆపై దాన్ని సాధించాల్సి ఉంటుంది. మనిషికి చెడు అన్నది లక్షణం; మంచి అన్నది లక్ష్యం. మనిషి తన లక్షణాన్ని వదులుకుని ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాడు. మనకు ప్రశాంతత కావాలి; అందుకు మంచితనం వచ్చి తీరాలి. మంచితనం వేగంగా రావాలి; మంచితనం నిజంగా రావాలి. కొత్తగా పుట్టిన నదిలా అది ఎప్పటికీ ఉండేలా మంచితనం మనలోకి ప్రవహించాలి. ‘ఓ మంచితనమా, నువ్వు ఎక్కడ ఉన్నావ్? నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఇదే మా స్వాగతం; ఇంకా నువ్వు వేచి ఉండకు రా మాలోకి. రాయని కవితలా ఎక్కడో ఉండిపోకు; సరైన తరుణం ఇదే రా మాలోకి. మాకు నీ అవసరం చాలా ఉంది; నువ్వు లేకపోవడం వల్ల మా ఈ లోకం అపాయకరం అయిపోతూ ఉంది. వెంటనే వచ్చేసెయ్ ఓ మంచితనమా, ఎదురు చూస్తూ ఉన్నాం రా మంచితనమా రా’ అంటూ మనం అందరమూ మన క్షేమం కోసం మంచితనాన్ని మనసా, వాచా తప్పనిసరిగా ఆవాహన చెయ్యాల్సిన అవసరం ఉంది. మంచితనం మనలో లేనందువల్ల మనం విరిగిపోయిన వాక్యాలం అయ్యాం; అందువల్ల మనం అనర్థదాయకం అయ్యాం. ఈ స్థితిని అధిగమించి మంచితనాన్ని సాధిద్దాం; మనుగడను సాత్వికం చేసుకుందాం. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. – రోచిష్మాన్ -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి
కర్నూలు: కుల మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. దసరా, బక్రీద్ పండుగల నేపథ్యంలో సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ వర్గాల మత పెద్దలతో ఎస్పీ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. శివసేన జిల్లా అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, మాజీ కార్పొరేటర్ విఠల్శెట్టి, జమాతె ఇస్లామ్ ఎ హింద్ జిల్లా కార్యదర్శి ఎస్.హమీద్, ఆవాజ్ కమిటీ కార్యదర్శి ఇక్బాల్ హుసేన్, ముక్తియార్తో పాటు హిందూ, ముస్లిం మత పెద్దలు పలువురు సమావేశానికి హాజరై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ రెండు పర్వదినాల సందర్భంగా మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా మత పెద్దలు సహకరించాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా రోడ్లపైన, బహిరంగ ప్రదేశాల్లో గోవధ చేయరాదన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాలకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నందున అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు గస్తీని ముమ్మరం చేశామన్నారు. నాల్గవ తేదిన నిర్వహించే అమ్మవారి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఓఎస్డీ మనోహర్రావు, ఏఎస్పీ ఎస్.బాబురావు,తదితరులు పాల్గొన్నారు.