breaking news
Total Gas Stations
-
పదేళ్లలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అదానీ టోటల్ గ్యాస్ (ఏజీటీఎల్) భారీ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందుకోసం వచ్చే 8–10 ఏళ్లలో రూ. 18,000 – రూ. 20,000 కోట్లు వెచ్చించనుంది. తద్వారా వాహనాలకు సీఎన్జీ, గృహాలు .. పరిశ్రమలకు పైపింగ్ గ్యాస్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచుకోనుంది. కంపెనీ సీఎఫ్వో పరాగ్ పారిఖ్ ఈ విషయాలు తెలిపారు. సంస్థ వార్షిక నివేదికలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. దీర్ఘకాలిక దృష్టి కోణం నుంచి చూస్తే పర్యావరణ అనుకూల ఇంధనంగా గ్యాస్కు డిమాండ్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మరింతగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పారిఖ్ పేర్కొన్నారు. అదానీ గ్రూప్, ఫ్రెంచ్ సంస్థ టోటల్ఎనర్జీస్ కలిసి జాయింట్ వెంచర్గా అదానీ–టోటల్ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 124 జిల్లాల్లో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. 460 పైచిలుకు సీఎన్జీ స్టేషన్లు, 7 లక్షలకు పైగా పైప్డ్ కుకింగ్ గ్యాస్ కస్టమర్లు ఉన్నారు. 1,800 సీఎన్జీ స్టేషన్ల ఏర్పాటు.. వచ్చే 7–10 సంవత్సరాల్లో 1,800 పైచిలుకు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీటీఎల్ సీఈవో సురేష్ పి.మంగ్లానీ తెలిపారు. మరి న్ని గృహాలకు పైప్డ్గ్యాస్ను అందించడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమైన గ్యాస్ సరఫరా వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు .. బయోగ్యాస్, ఈవీ చార్జింగ్ తదితర విభాగాలను కూడా మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. ఈ–మొబిలిటీ కోసం అదానీ టోటల్ఎనర్జీస్ ఈ–మొబిలిటీ పేరిట అనుబంధ సంస్థను నెలకొలి్పనట్లు, ఇది ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు మొదలైన వాటి కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంగ్లానీ చెప్పారు. ఇప్పటికే తమకు 26 ప్రాంతాల్లో 104 చార్జింగ్ పాయింట్లు ఉండగా, వీటిని 3,000కు పెంచుకోనున్నట్లు తెలిపారు. అటు మరో అనుబంధ సంస్థ అదానీ టోటల్ఎనర్జీస్ బయోమాస్ (ఏటీబీఎల్) దేశంలోనే అతి పెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును ఉత్తర్ప్రదేశ్ మథుర దగ్గర్లోని బర్సానాలో నెలకొల్పుతున్నట్లు మంగ్లానీ చెప్పారు. -
ఇక భారత్లో ‘టోటల్’ పెట్రోల్ బంకులు!
► స్థానిక భాగస్వామ్యంపై ఆసక్తి ► కంపెనీ సీఈవో పాట్రిక్ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో ఇంధన రిటైల్ వ్యాపారంలో ఉన్న అపార అవకాశాలపై ఫ్రాన్స్కు చెందిన టోటల్ఎస్ఏ కన్నేసింది. స్థానికంగో ఓ భాగస్వామితో కలసి పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు టోటల్ వెల్లడించింది. టోటల్ఎస్ఏ ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో లూబ్రికెంట్లు, ఎల్పీజీని విక్రయిస్తోంది. ‘‘ఇది చాలా పెద్ద మార్కెట్. ఇండియన్ ఆయిల్ తదితర పెద్ద సంస్థలు వేలాది రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ మధ్యే ఈ మార్కెట్ను నియంత్రణల నుంచి తప్పించారు. దీంతో ఈ మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాం’’ అని టోటల్ సీఈవో పాట్రిక్ పోయెన్నే తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నామని, సరైన భాగస్వామిని గుర్తించాల్సి ఉందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఈ రంగంలో మాది అతిపెద్ద కంపెనీ. మా దగ్గర నిధులు, ఆర్థిక సామర్థ్యం ఉంది. ఈ వ్యాపారంలో నైపుణ్యం కూడా ఉంది’’ అని వివరించారు. పాట్రిక్ అంతకుముందు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ సమావేశమయ్యారు. ఎల్పీజీ నిల్వ, దిగుమతి టెర్మినళ్లు, పంపిణీపై పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం తరఫున టోటల్కు సాధ్యమైనంత సహకారాన్ని అందిస్తామని ప్రధాన్ హామీ ఇచ్చారు.