breaking news
Thought
-
వైఎస్ జగన్ ‘మావిగన్’.. టీడీపీ కూటమికి దడ పుట్టిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ చారిత్రక పరిణామ క్రమంలో భౌగోళిక వ్యూహాలు, పరిపాలనా సౌలభ్యం, ప్రజా సంక్షేమం అనేవి కేవలం తాత్కాలిక రాజకీయ నినాదాలు కాకూడదు. ఒక రాష్ట్ర ఆర్థిక, సామాజిక ప్రగతి అనేది అక్కడ ఇప్పటికే దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న సహజ వనరులు, చారిత్రక మౌలిక వసతుల సద్వినియోగం పైనే ఆధారపడి ఉంటుంది తప్ప, శూన్యం నుంచి సృష్టించాలనుకునే ఊహాజనిత రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల మీద కాదు.ఈ మౌలిక సత్యాన్ని క్షేత్రస్థాయి వాస్తవాలతో విశ్లేషిస్తూ, కృష్ణా-గుంటూరు ప్రాంత పారిశ్రామిక హృదయభూమిని చారిత్రాత్మక తీరప్రాంతమైన మచిలీపట్నంతో అనుసంధానించాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ వ్యూహాత్మక ఆలోచనల్లోని అంతర్లీన హేతుబద్ధతను ఒకదాని వెనుక ఒకటిగా లోతుగా పరిశీలించాల్సిన చారిత్రక సందర్భం ఇది.నిజమైన ప్రజాస్వామ్యంలో అధికారం, సంపద, అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదు. అది సమాజంలోని ప్రతి ప్రాంతానికి, చివరి వ్యక్తి వరకు సమానంగా ప్రవహించాలి అన్న మహాత్మా గాంధీ సూక్తిని ఇక్కడ మనం స్మరించుకోవాలి. గతంలో ప్రతిపాదించిన అమరావతి నమూనా ఈ ప్రాథమిక వికేంద్రీకరణ సూత్రానికే పూర్తిగా విరుద్ధంగా సాగింది. ఒకే పరిమిత ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి, చుట్టుపక్కల దశాబ్దాలుగా సహజ సిద్ధమైన ఆర్థిక, సాంస్కృతిక శక్తులుగా ఎదిగిన నగరాలను పూర్తిగా విస్మరించడం తీవ్రమైన వ్యూహాత్మక లోపం.విజయవాడ, గుంటూరు నగరాలు ఎప్పటి నుంచో కోస్తాంధ్రాకు వాణిజ్య, విద్యా, రవాణా, వైద్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య అపారమైన మానవ వనరులు, అద్భుతమైన రోడ్డు నెట్వర్క్, రవాణా వసతులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఉన్న వసతులను మరింత పటిష్టం చేసి, వాటిని పరిపాలనా కేంద్రాలుగా మలిచి ఉంటే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఎంతో మేలు జరిగేది. కానీ, ఈ సహజసిద్ధమైన వసతులను కాదని, పచ్చటి పంట భూములను బలవంతంగా లాక్కొని కాంక్రీట్ వనంగా మార్చాలనుకోవడం అనాలోచిత ఆర్థిక ప్రణాళికే అవుతుంది.ఈ ప్రాంత రవాణా రంగంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న వనరుల చారిత్రక నేపథ్యాన్ని మనం గమనించాలి. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఘన చరిత్ర కలిగిన గన్నవరం విమానాశ్రయం, దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్, అలాగే ప్రాంతీయ రవాణాకు, సరుకు రవాణాకు అత్యంత కీలకమైన గుంటూరు రైల్వే జంక్షన్లు ఈ నేలపైనే ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన, చారిత్రక రవాణా నెట్వర్క్ కళ్లముందే సిద్ధంగా ఉన్నప్పుడు, వాటిని మరింత విస్తరించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించడం ఏ పాలకుడికైనా ఉండాల్సిన కనీస వివేకం. కానీ, ఈ అద్భుతమైన వ్యవస్థలను పక్కన పెట్టేసి, వాటికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి అనే ఊహాజనిత పరిధిలోనే సరికొత్తగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం, సరికొత్త అధునాతన రైల్వే స్టేషన్ నిర్మిస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయడం స్వార్థపూరిత, సంకుచిత వైఖరిని స్పష్టం చేస్తోంది. ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, కొత్తవాటి పేరుతో కాలయాపన చేస్తూ, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలో భూముల విలువలను పెంచేందుకు ప్రయత్నించడం అల్పబుద్ధి కాక మరేమిటి? ఇటువంటి అనాలోచిత చర్యలు ప్రజాధనాన్ని వృథా చేయడమే కాక, రాష్ట్ర భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెట్టడమే అవుతుంది.భూమి అనేది కేవలం ఒక స్థిరాస్తి కాదు, అది తరతరాల రైతు జీవన విధానం, సంస్కృతి, జీవనాధారం. "రైతు కన్నీరు పెట్టిన నేల ఏనాడూ సంతోషంగా ఉండదు, అది సమాజ పురోగతికి బాటలు వేయలేదు" అనేది పెద్దల మాట. అమరావతి పరిధిలో సాగిన భూసేకరణ ప్రక్రియ తీవ్రమైన లోపాలతో, బలవంతపు ల్యాండ్ పూలింగ్ విధానాలతో సాగింది. మూడు పంటలు పండే పచ్చని మాగాణి భూములను, బహుళ పంటల సాగుకు అనుకూలమైన కృష్ణా డెల్టా భూములను వ్యవసాయానికి దూరం చేయడం ప్రకృతికి, పర్యావరణానికి చేసిన ద్రోహం. దేశానికి అన్నం పెట్టే ఇటువంటి సారవంతమైన భూములను కాంక్రీట్ అడవులుగా మార్చడం వల్ల ఎంతోమంది రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానం ఎప్పుడూ రైతాంగ శ్రేయస్సుకు, పర్యావరణ రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తుంది. బలవంతంగా భూములు లాక్కోవడానికి బదులు, విజయవాడ, గుంటూరులలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను, మౌలిక వసతులను వాడుకుంటూ, వ్యవసాయ రంగాన్ని రక్షించడమే నిజమైన సమగ్ర ప్రణాళిక. విజయవాడ-గుంటూరు నగరాల పరిధిని మచిలీపట్నం తీరప్రాంతంతో అనుసంధానించడం ద్వారా అపారమైన పారిశ్రామిక, వాణిజ్య ప్రగతి సాధించవచ్చనేది మాజీ ముఖ్యమంత్రి వ్యూహంలోని అసలైన మాస్టర్ ప్లాన్.మచిలీపట్నం కేవలం ఒక సాధారణ పట్టణం కాదు, అది శతాబ్దాల చరిత్ర గల అంతర్జాతీయ ఓడరేవు కేంద్రం. డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కాలంలోనే ప్రపంచ దేశాలతో వ్యాపార సంబంధాలు నెరిపిన ఘనత బందరు సొంతం. అటువంటి చారిత్రక తీరప్రాంతాన్ని, సముద్ర రవాణా మార్గాన్ని వదిలేసి, సముద్రానికి దూరంగా, కేవలం కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం రాజధానిని ఒకే చోట నిర్బంధించడం చారిత్రక తప్పిదం. మచిలీపట్నం పోర్టును ఆధునీకరించి, విజయవాడ-గుంటూరు పారిశ్రామిక కారిడార్తో కలిపితే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక, పారిశ్రామిక మండలిగా మారుతుంది. ఈ సముద్ర తీర రవాణా సౌకర్యాన్ని, ఉన్న మౌలిక వసతులను సమర్థవంతంగా వాడుకోవాలనే ఆలోచన వెనుక ఉన్న దీర్ఘకాలిక ప్రయోజనాలను మనం గుర్తించాలి.భవనాల నిర్మాణంలో గతంలో జరిగిన అవినీతి, అసంపూర్ణ కట్టడాలు నేటికీ సాక్ష్యాలుగా నిలిచాయి. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీల పేరిట చదరపు అడుగుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వేల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించి, ప్రజాధనాన్ని కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే వాడారనే విమర్శల్లో పూర్తి వాస్తవముంది. కనీసం ఒక వర్షానికి తట్టుకోలేని నాణ్యతా లోపాలు, లీకేజీలు బయటపడ్డాక ఆ నిర్మాణాల వెనుక ఉన్న అవినీతి ఏపాటిదో ప్రజలందరికీ అర్థమైంది. ఇటువంటి లోపభూయిష్టమైన నమూనా కంటే, విజయవాడ-గుంటూరులలో అందుబాటులో ఉన్న శాశ్వత కట్టడాలను కార్యాలయాలుగా మలిచి, మిగిలిన నిధులను మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు, ఉన్న రైల్వే జంక్షన్ల ఆధునీకరణకు మళ్లించడం ఎంతో లాభదాయకం. ఒక ప్రభుత్వ విజయం కట్టే తాత్కాలిక బిల్డింగుల సంఖ్యను బట్టి కాదు, అది ప్రజల ఆర్థిక స్థితిగతులను ఎంతవరకు మెరుగుపరిచిందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.మహాత్మా గాంధీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యం' సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే, అధికార కేంద్రీకరణ సంస్కృతికి స్వస్తి పలకాలి. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల త్రిభుజాకార అభివృద్ధి ద్వారా అటు పరిపాలన, ఇటు పారిశ్రామికీకరణ, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యం ఒకేసారి సాధ్యమవుతాయి. ఈ సహజసిద్ధమైన కారిడార్ను పటిష్టం చేయడమే వైఎస్ జగన్ తీసుకుంటున్న ప్రతి అడుగులోని అంతరార్థం. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే వ్యూహాత్మక అడుగు.రైతుల హక్కులను కాపాడుతూ, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, పర్యావరణాన్ని రక్షించేలా సాగే నమూనా మాత్రమే స్థిరమైన భవిష్యత్తును ఇవ్వగలదు. అమరావతిలోని లోపాలను సరిదిద్దుకుంటూ, విజయవాడ, గుంటూరు నగరాల అనుభవజ్ఞతను, రైల్వే జంక్షన్ల రవాణా అనుకూలతలను, మచిలీపట్నం తీరప్రాంత వ్యూహాత్మక ప్రాధాన్యతను ఏకం చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ప్రజా శ్రేయస్సే పరమావధిగా, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా సాగుతున్న ఈ వ్యూహం దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాన్ని చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.-కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..
కొన్ని జబ్బుల తీరు వైద్యులు చెప్పిన లక్షణాలేవి కనిపించకుండానే సైలంట్గా దాడి చేస్తాయి. అందువల్లే ప్రజలు కూడా తేలిగ్గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతలా అలాంటి వాటిని కట్టడి చేసి ప్రజల్లో ఆ వ్యాధులపై అవగాహన కల్పిద్దామన్నా పరిస్థితుల దృష్ట్యా లేదా జీవనశైలి కారణంగానో ఆ వ్యాధుల లక్షణాలు కూడా ఆశ్చర్య కలిగించే రీతిలో వస్తున్నాయి. అలాంటి షాకింగ్ లక్షణాలే ఇక్కడొక మహిళలో కనిపించడంతో లైట్ తీసుకుంది. అదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చి ఆస్పత్రి పాలు చేసింది. అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్ ఘటన యూఎస్ఏలో చోటు చేసుకుంది. జెన్నా టాన్నర్ అనే 48 ఏళ్ల మహిళ గతేడాది మహమ్మారి సమయంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంది. నిజం చెప్పాలంటే ఆమె ఇంటిల్లపాది ఆ మహమ్మారి బారిన పడి బయటపడ్డారు. అయితే ఆమెకు ఒక రోజు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది సేమ్ కరోనా మాదిరి సమస్యే అనుకుంది ఆమె. బహుశా ఫ్లూ లాంటి జ్వరం కాబోలు అనుకుని లైట్ తీసుకుంది. భర్తకు కూడా చెప్పకూడదనుకుంది. ఎందుకంటే? ఆస్పత్రిలో చేరిపోమంటారన్న భయం తోపాటుపైగా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో టాన్నర్ చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అది కాస్త తీవ్రమై సడెన్గా ఓ రోజు ఇంట్లోనే స్ప్రుహతప్పి పడిపోయింది. కట్ చేస్తే.. ఆమె రెండు రోజుల వరకు ఆస్పత్రిలోనే కోమాలో ఉంది. రెండో రోజు సాయంత్రం మెలుకువ వచ్చి అంతా తెలుస్తున్నా.. ఏది తన కండిషన్లో లేనట్లు, గుండెపై ఏనుగులాంటి పెద్ద బరువు ఏదో ఉన్నట్లు తోచింది ఆమెకు. కనీసం బెడ్ మీద నుంచి కదలాలనుకున్న కొంచెం కుడా కదలలేకపోతోంది. కనీసం చేతిని కూడా కదపడం కష్టంగా ఉంది. ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత కాసేపటికి తనవాళ్లు వచ్చి తనకు గుండె పోటు వచ్చిందని చెప్పేంత వరకు కూడా ఆమెకు ఏం తెలియదు. అయితే తనకు వచ్చింది గుండెపోటా..? అని నిర్ఘాంతపోయింది. నాకలాంటి సంకేతాలేం కనిపించలేదు కదా! అని ఆలోచిస్తూ షాక్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు బైపాస్ సర్జరీ చేసి స్టంట్ వేశారు. అస్సలు గుండెపోటు వచ్చినప్పుడు ఇలా గాలి పీల్చుకోవడం వంటి రెస్పిరేషన్ సమస్యలు కూడా వస్తాయ? అని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆమె తనలా ఎవరూ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో తన ఉదంతాన్ని అందరికీ చెప్పి గుండెపోలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించే యత్నం చేస్తోంది టాన్నర్. కాగా,అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. మహిళలకు గుండెపోటులో యూఎస్ తొలి స్థానంలో ఉంది. నిజానికి గుండెపోటు అనంగానే ఛాతీ నొప్పిలా వస్తుందని అందరికీ తెలుసు. కానీ మహిళ్లల్లో ఇలా కాకుండా వేర్వేరు లక్షణాలతో కూడా సంకేతాలిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. స్త్రీలల్లో ముఖ్యంగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, వెన్ను, భుజం, దవడ నొప్పి వంటి ఇతర లక్షణాల రూపంలో కూడా సంకేతమిస్తుందని అన్నారు. ఏదీ ఏమైనా 45 ఏళ్లు దాటాక ఏ వ్యక్తి అయినా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
మంచి మాట..: ఏది నిజమైన సంపద?
సంపద అంటే చాలామంది దృష్టిలో, భవంతులు, పొలాలు. మరికొందరికి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు. ఇంకొందరి భావనలో వాహనాలు, ఇళ్ళ స్థలాలు. కషీవలుడికి పంట, పశువులు, పండితుడికి జ్ఞానం... ఇలా సంపదను ఎన్నో రకాలుగా భావించి నిర్వచించవచ్చు. ఇది లౌకిక దృష్టి, సహజమైనది. ఆ రకమైన సంపద మన జీవనానికి అవసరమైనది. అయితే, సంపదంటే కేవలం ఇదే కాదు, ఈ భావనలకు లేదా మరికొన్ని ఇటువంటి భావనలకే ఈ మాట అర్థాన్ని పరిమితం చేయలేం. ఇది అర్థమయితేనే దాని లోతైన, విస్తృతార్థం బోధపడుతుంది. ఇహపరమైన సంపద ఏ రూపంలో ఉన్నా, తరతరాలకు తరగనిదైనా ఎవరి దగ్గర ఉన్నా వారికి తృప్తి అనేది ఉండాలి. తమ శక్తి మేరకు కూడబెట్టామన్న ఆలోచన రావాలి. ఇంకా ఎక్కువ పొందాలి అన్న తీవ్రమైన కోరిక కూడదు. అది ఉన్నవారు ప్రశాంతతకు దూరమవుతారు. అపార సంపన్నులైనా పరిమిత ప్రాథమిక అవసరాలతో, కోరికలతో నిరాడంబర జీవితం గడపగలగాలి. తమ తోటి వారికి ఆర్ధిక సహాయం చేయగలిగే దృష్టి రావాలి. ఆపన్నులకు చేయాత నివ్వాలన్న భావన రావాలి. ఇలా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన నిజమైన సంపద. ఈ తృప్తి, నిరాడంబర జీవితం, పక్కవారిని ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వారు ఎంత పేదవారైనా ఐశ్వర్యవంతులే. ఆ ఆలోచన లేని వారు ఎంత ధనవంతులైనా అభాగ్యులే. గురువుల నుండి నేర్చుకున్న విద్యకు మెరుగు లు దిద్ది మన పరిశీలనా దృష్టితో దానిని మరింతగా వృద్ధి చేసుకోవాలి. ఇతరులకు అందివ్వగలగాలి. అపుడు అదెంతో సుసంపన్నమవుతుంది. ఇలా గురువులే కాదు ఇతరులూ చేయవచ్చు. గురువుల జ్ఞానం లేదా పాండిత్యం వారి శిష్యప్రశిష్యుల ద్వారా సర్వవ్యాపితమై అ దేశం జ్ఞాన సంపదగా నిక్షిప్తమవుతుంది. ‘మిడాస్ టచ్’ అనే కథలో ఒక రాజు తను ముట్టుకున్నది ప్రతిది బంగారంగా మార్చగల వరం పొందాడు. ఇక తన ఆనందానికి అవధులే లేవనుకుంటూ తన రాజభవనంలోని ప్రతి దానిని ముట్టుకుని హేమమయం చేసుకున్నాడు. తను తినే ఆహారం, తాగే మంచి నీరు, చివరకు తన కూతురు బంగారు విగ్రహంగా మారి పోవటం చూసి నిశ్చేష్టుడై, తన వరాన్ని వెనుకకు తీసుకోమని ఆ దేవతను వేడుకున్నాడు. నిజమైన ప్రేమ, అనుబంధాలు ముఖ్యమైన వని, అవే నిజమైన సంపదని గ్రహించాడు. నిజమైన సంపద ఇహపరమైనది కాదు. దానిని మన భౌతిక సంపదతో కొలవలేం. మన వ్యక్తిత్వం, గుణశీలత, మానవీయతలను మన ముందు తరాలవారికి వారసత్వంగా ఇవ్వగలగాలి. అదే నిజమైన సంపద. ఒక దేశంలోని అద్భుత కట్టడాలు సృజనశీలురు వారి అపురూప సృష్టి, సంగీత, సాహిత్య ప్రవాహాలు, శిల్ప సంపద, జీవనవిధానం, ఆహారం, నాట్యం, చలనచిత్రాలు, శాస్త్రవేత్తల అద్భుత మేధస్సు.. వీటి కలయిక ఆ దేశ సంస్కృతిగా భావన చేస్తారు. ఈ సంస్కృతి ఆ దేశ సంపదవుతుంది. వీటికి మనం జత చేయవలసిన అంశాలు ఆ దేశ ప్రజల నీతి, నిజాయితీ, నైతిక వర్తన, నిబద్ధత, వ్యక్తిత్వం, వారి ఆలోచనా తీరు. ఇవి వారికి వారసత్వసంపదగా వచ్చిన సంస్కృతిని మరింత ఉదాత్తంగా చేస్తుంది. ఇహపరమైన సంపదే కాకుండా ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన చక్కని లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆలోచనలు. మనల్ని సక్రమమార్గంలో పయనింపచేసే పథాలు. మనలోని అంతర్గత శక్తులకు సరైన ఆకృతి వీటివల్లే వస్తుంది. ఆలోచనలు మనిషి వ్యక్తిత్వ వికాసాన్నే కాదు సమాజ, దేశ వికాసాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. దేశ ప్రజల సక్రమ ఆలోచనా సరళి దేశ సంపదగానే భావించాలి. – బొడ్డపాటి చంద్రశేఖర్, అంగ్లోపన్యాసకులు -
మంచి మాట: మన ఆలోచనలే మనం
మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు. ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది. ‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది. సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం. ‘హెయిన్’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే. మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది. కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్ తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు. మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది. మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు. – ఆచార్య మసన చెన్నప్ప -
మీ ఆలోచనలు కుదురుగానే ఉంటాయా?
ఒక పని చేయాలని కాసేపు అనుకొని, మళ్లీ అంతలోనే వద్దనుకోవటం, వాయిదా వేయాలనుకోవటం, తిరిగి చేయాలనుకోవటం... ఇలాంటి తికమకలు తెలిసినవే. ఆలోచనలను వెంటవెంటనే మార్చుకుంటూ అయోమయానికి గురయ్యే పరిస్థితి మీలోనూ ఉందా? మీ ఆలోచనలు కుదురుగా ఉన్నాయో లేవో సెల్ఫ్చెక్ చేయండి. 1. షాపులో ఒక వస్తువును సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలాసేపు దాని గురించి అయోమయంలో ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. ఎవరికైనా మాట ఇచ్చి వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. ఒక క్రమపద్ధతి లేని ఆలోచనా విధానం వల్ల మీ జీవితభాగస్వామి, స్నేహితులతో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 4. మీ అభిప్రాయాలకు కాక ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువనిచ్చి ఆచరించటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 5. పరీక్షల్లో ముందుగా సరైన సమాధానం రాసి దాన్ని మార్చి తర్వాత తప్పుగా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఎ. అవును బి. కాదు 6. ఆలోచనలో క్రమం లేకపోవటం వల్ల అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితి కలుగుతుంది. ఎ. అవును బి. కాదు 7. అభిప్రాయాలను స్థిమితం లేకుండా మార్చుకోవటంవల్ల ప్రయోజనం కలిగిందని మీ అనుభవంలో తెలుసుకున్నారు. ఎ. కాదు బి. అవును 8.ఎప్పటికప్పుడు మారే మీ అభిప్రాయాలకు ఇతరులను సాకుగా చూపిస్తారు. ఎ. అవును బి. కాదు 9. స్థిమితంలేని ఆలోచనలు, అభిప్రాయాల వల్ల కొన్నిసార్లు మీరు ఆందోళనకు గురవుతారు. ఎ. అవును బి. కాదు 10. ఆలోచనలో మార్పుల వల్ల ఒక పనిని చాలాసార్లు చేయవలసి వస్తుంది. ఎ. అవును బి. కాదు మీరు టిక్ పెట్టుకున్న సమాధానాలలో ‘ఎ’ లు ఏడు దాటితే మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే మార్చుకొనే మనస్తత్వం మీకుంటుంది. ఇలాంటి నిలకడలేని ఆలోచనలు మీ జీవితంలో చాలా చికాకుని, ఆందోళనని కలిగిస్తాయి. ‘బి’ లు 6 కంటే ఎక్కువగా వస్తే నిర్ణయాలను వెంటవెంటనే మార్చుకొనే మనస్తత్వం మీకుండదు. మీ నిర్ణయాలలో అయోమయానికి తావుండదు. కాబట్టి మీరు ‘ఎ’లను ప్రాతిపదికగా తీసుకోవడం బెటర్. -
కొత్త ఆలోచన:తాటిచెట్టుకు తాళం!
-
మహిళల ఆలోచన మారాలి
తణుకు టౌన్ : మహిళల ఆలోచనాధోరణిలో మార్పుతో లింగ వివక్షతను నిర్మూలించవచ్చని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పి.లక్ష్మీశారద అన్నారు. మంగ ళవారం తణుకులోని ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో డీఆర్సీ ఆధ్వర్యంలో లింగవిక్షత అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అరుణ అధ్యక్షత వహించారు. లక్ష్మీశారద మాట్లాడుతూ బాల్య వివాహాలు నేరం అని చట్టం చెబుతున్నా గ్రామాలలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బాల్య వివాహాల నిరోధం కోసం అంగన్వాడీ కార్యకర్త మొదలుకుని పోలీసు ఉన్నతాధికారుల వరకు ఏ అధికారికైనా ఫిర్యాదు చేయవచ్చని తెలి పారు. వరకట్న నిర్మూలనకు చట్టాలున్నా ఆచరణలో మాత్రం కట్నం తీసుకోవడం, ఇవ్వడం తగ్గలేదన్నారు. మహిళలపై వివక్షత గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతోందని, ఆడశిశువులను పిండ దశలోనే తొలగించే యంత్రాలు, పరీక్షలు రావడంతో వివక్ష మరీ ఎక్కువైందన్నారు. దీని నివారణకు పీసీపీఎన్డీటీ చట్టం తీసుకోవడం రావడం జరిగిందన్నారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ మానసికంగా పరిణితి చెందనిదే సమాజంలో వివక్షత తగ్గదని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని కోరారు. స్త్రీవాద రచయిత్రి కుప్పి పద్మ, జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) చైర్మన్ డాక్టర్ ఎం.శ్రీనివాసప్రసాద్, కళాశాల కోశాధికారి నందిగం సుదాకర్, వర్క్షాప్ కన్వీనర్ డాక్టర్ ఎం.ఝాన్సీ, కళాశాల మహిళా సాధికారిత చైర్మన్ కె.వాణీ, ఏయూ లా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్లవి, సెయింట్ థెరిస్సా కళాశాల అద్యాపకురాలు కేవీ పద్మావతి, డాక్టర్ రాధాపుష్పావతి, డాక్టర్ బి.నాగపద్మావతి, ప్రిన్సిపాల్ డి.విజయలక్ష్మి, వీవీవీ సత్యనారాయణరెడ్డి, వివిద కళాశాలల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. క్రమశిక్షణ అవసరం స్వేచ్ఛగా ఉండాలనుకునే వారికి క్రమశిక్షణ అవసరం. స్త్రీలను ఎవరు అవ మానించినట్లు మాట్లాడినా నిరసన తెలియజేయాలి. మంచి సాహిత్యం ద్వారానే మంచి వ్యక్తులు తయారవుతారు. - కుప్పిలి పద్మ, స్త్రీవాద రచయిత్రి మహిళా ప్రాతినిథ్యం పెరగాలి చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. ప్రభుత్వం నిర్దేశించిన 33 శాతం కూడా మహిళా సభ్యులు కూడా చట్ట సభలలో లేరు. పురుషులతో సమానంగా హక్కులు ఉన్నా సరైన అవగాహన లేదు. - డాక్టర్ పీ అరుణ, ప్రిన్సిపాల్ ఎస్కెఎస్డీ మహిళా కళాశాల తణుకు. చట్టాలున్నా కొన్నే అమలు మహిళా అభ్యుదయానికి చట్టాలు ఉన్నా ఆచరణలో కొన్నే మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయి. విద్య, రాజకీయాలు, ఇతర రంగాలలో మహిళలు వెనుకబడి ఉన్నారు. ఇది లింగవివక్షతను తెలియజేస్తుంది. - డాక్టర్ ఎం ఝాన్సీ, వర్క్షాపు కన్వీనర్, తణుకు సృష్టిలోనేవివక్ష సృష్టిలో ఏజాతిలో లేని వివక్షత ఒక్క మానవ జాతిలోనే ఉంది. అయితే ఒక తరానికి మరో తరానికి మధ్య ఆలోచనల్లో కొంత సరళత వస్తుంది. ఇది లింగవివక్షత తగ్గడానికి దోహదం చేస్తుందని ఆశిద్దాం. - డాక్టర్ ఎం శ్రీనివాసప్రసాద్, జిల్లా వనరుల కేంద్ర చైర్మన్, తణుకు


