breaking news
thirunala
-
ఘనంగా తిక్కయ్యస్వామి తిరునాల
నార్పల : మండల కేంద్రంలో తిక్కయ్యస్వామి ఉట్ల పరుష శనివారం అత్యంత వైభవంగా సాగింది. వేకువ జామున వేద పండితులు ఆలయంలో హోమం నిర్వహించి స్వామివారి మూలవిరాట్ను గంగాజలంతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిలిపిన ఉట్లమాను ఎక్కేందుకు స్థానిక వాల్మీకి యువజన సంఘం సభ్యులు తాంబూలం స్వీకరించారు. అశోక్ అనే యువకుడు ఉట్లకాయను పగులగొట్టగా, ఉట్లమాను ఎక్కే పోటీలో రాము విజయం సాధించాడు. విజేతలకు డొక్కాకృష్ణ రూ.5116, రూ.3116లు బహుమతి ప్రదానం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉట్ల తిరునాల తిలకించేందుకు ఆలయ ప్రాంగణంలో కిక్కిరిశారు. అలాగే ఉత్సవాల సందర్భంగా తప్పెట పోటీలు నిర్వహించారు, విజేతలైన నార్పలకు చెందిన పెద్దగంగయ్య, వైఎస్సార్జిల్లా గురుజాలకు చెందిన లక్ష్మినారాయణ, వెలిదండ్లకు చెందిన పుల్లయ్య, గరిసినపల్లికి చెందిన ఈరప్పకు వెండి బహుమతులు సింగరయ్య అందజేశారు. రాత్రికి తిక్కయ్యస్వామి ఉత్సవ విగ్రహాన్ని పుర వీధుల్లో ఊరేగించారు. అలాగే భజన కార్యక్రమం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకం అలరించాయి. ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సేవా కార్యకర్తలు రేకులకుంట లక్ష్మిరెడ్డి, తలారి ఆంజనేయులు చెప్పారు. -
అశ్వర్థ నారాయణస్వామి తిరునాళ్లు
అనంతపురం కల్చరల్ : నగర శివార్లలోని అశ్వర్థ నారాయణస్వామి తిరునాళ్లు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగే ఆ ఉత్సవాలలో భాగంగా తొలిరోజు ఉదయం స్వామివారికి శుద్ధి కార్యక్రమాలు, అలంకార సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను భజన బృందాలతో కట్టవద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో రామాంజనేయులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం తిరునాళ్లను శాస్త్రోక్తంగా జరిపిస్తామన్నారు. అన్నదానం ఏర్పాట్లు చేశామన్నారు. రాత్రి సోములదొడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కళాకారులు నవరత్నాలు నాటికను ప్రదర్శిస్తారని తెలిపారు. అలాగే తడకలేరు రాఘవేంద్రస్వామి ఆలయంలో తిరునాళ్ల సందర్భంగా అఖండ రామభజన ప్రారంభమైంది.