breaking news
Terminal 2
-
ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టుకి మరింత భద్రత
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. పరిసర ప్రజలు విమానాశ్రయంలోకి రాకుండా నిలువరించడంతో పాటు కొత్తగా టెర్మినల్-2 వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచనున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎయిర్ పోర్ట్ ఆవరణలోని వివిధ చోట్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నైట్ విజన్ కెమెరాలను కూడా అమర్చనున్నామని వివరించారు. ఈ కెమెరాలు కొన్ని సెకన్ల కాల వ్యవధిలోనే కంట్రోల్ రూమ్కు సమాచారం చేరవేస్తాయన్నారు. దీనివల్ల విమానాశ్రయంలో ఏమి జరిగినా కనురెప్పపాటులో తెలిసిపోయే అవకాశమంటుందని వెల్లడించారు. ‘టీ2కు చెందిన జాయింట్ కో ఆర్డినేషన్ కంట్రోల్ (జేసీసీ) రూమ్ను మూడు భాగాలుగా విభజించారు. జి (గ్రౌండ్ స్టాఫ్), వి (ఫ్లైట్ ఆపరేషన్), కె.(సపోర్ట్ బృందం)గా విధులు నిర్వహణ ఉంటుంది. ఇందులో ఐటీ, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తార’ని తెలిపారు. కొత్త టెర్మినల్ మూడో అంతస్తులో ఏర్పాటుచేసిన జేసీసీలో ప్రస్తుతం 300 మంది సిబ్బంది ఉన్నారని, వీరి సంఖ్యను ఫిబ్రవరి 12వ తేదీ కల్లా పెంచుతామన్నారు. నూతన టెర్మినల్లో 1,600 భద్రత కోసం, 400 కెమెరాలు జేసీసీ కోసం కేటాయించామని వివరించారు. మున్ముందు టెర్మినల్ను మరింత అభివృద్ధి చేసినప్పుడు కెమెరాల సంఖ్యను కూడా పెంచుతామని చెప్పారు. ‘ ఇక్కడ ఏర్పాటుచేసే పెరిమీటర్ ఇంట్రషన్ అండ్ డిటెక్షన్ సిస్టమ్ (పీఐడీఎస్) భద్రతా వ్యవస్థ ‘టౌట్’ వైర్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటుంది. ఈ వైర్లను ఎయిర్పోర్ట్ ఆవరణలో ఫెన్సింగ్గా ఏర్పాటుచేస్తామ’ని తెలిపారు. ఈ వైర్లను ఎవరైనా తగిలితే తేలికపాటి షాక్ తగలడమేకాకుండా సూచనలు కూడా జారీ చేస్తుందని వెల్లడించారు. -
నన్నెందుకు పిలవలేదు ?
ముంబై: అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండో టెర్మినల్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముంబై మేయర్ సునీల్ ప్రభు ప్రధాని మన్మోహన్సింగ్కు లేఖాస్త్రం సంధించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం కోసం ముద్రించిన ఆహ్వానపత్రికలో తన పేరు లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన లేఖ రాశారు. ‘మేయర్ను అవమానించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముంబైకర్ల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నాకు, నగరవాసులందరికీ అవమానం. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీలు, దౌత్యవేత్తలు నగరానికి వచ్చినప్పుడు మేయర్ వారికి స్వాగతం, వీడ్కోలు పలకాలి. ప్రారంభోత్సవాల్లో మేయర్కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది’ అని సునీల్ ప్రభు లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత పరిణామం మేయర్ పదవికే అవమానమని ఆయన వ్యాఖ్యానించారు.