breaking news
Telugutalli
-
విభజిస్తే విప్లవమే
‘తెలుగుతల్లి సౌ‘భాగ్య’ నగరం హైదరాబాద్ను చేజార్చుకునేందుకు సీమాంధ్రులు సిద్ధంగా లేరు.. అరవై ఏళ్ల సమష్టి కృషి ఫలితాన్ని తెలంగాణకు అప్పగించి చేతులు ముడుచుకు కూర్చునేది లేదు.. ఎలాంటి ఉద్యమాలైనా, ఎలాంటి త్యాగాలైనా చేసి హైదరాబాద్ సహా సమైక్యాంధ్రను సాధించి తీరుతాం...’ అంటూ విశాఖ నగర ప్రజానీకం, మేధావులు, వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత ముక్త కంఠంతో నినదించారు. నగరంలోని కావేరి ఫంక్షన్ హాల్లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ఎవరెటు?’ చైతన్య పథం చర్చా వేదికలో వీరందరి అభిప్రాయాలు ఆలోచనాత్మకంగా, ఆవేశభరితంగా సాగాయి. సాక్షి, విశాఖపట్నం : విభజనకు కారకులైన నాయకులకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని విశాఖ వాసులు హెచ్చరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన వచ్చే వరకు ఉద్యమాగ్ని చల్లారదని స్పష్టం చేశారు. ‘సమైక్యాంధ్ర కోసం ఎంతవరకైనా పోరాడుతాం. ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్తాం. శాంతియుత నిరసన కార్యక్రమాలతో తమ వాణి విన్పిస్తాం...పాలకుల మెడ వంచుతాం.’ అని ఘాటుగా స్పందించారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ సంయుక్తంగా సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఎవరెటు’ చైతన్య పథం చర్చా కార్యక్రమంలో హాజరైన వక్తలంతా సమైక్య గళం విప్పారు. స్థానిక కావేరి కన్నడ సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మేధావులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఉద్యోగ సంఘం నేతలు, కార్మిక సంఘం నేతలు, వివిధ రంగాల నిష్ణాతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మనోగతాన్ని తెలి యజేశారు. విభజనతో సీమాంధ్రకు జరిగే నష్టాలు ఏకరువు పెట్టారు. రాహుల్గాంధీ పట్టాభిషేకం కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి అనుసరిస్తున్న తీరును కడిగి పారేశారు. సమైక్యాంధ్ర ద్రోహిగా పేర్కొంటూ చంద్రబాబుపై వక్తలు విరుచుకుపడ్డారు. రాజకీయ నిరుద్యోగైన కేసీఆర్ ఒక నాజీగా, నియంతలా భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి చిదంబరం, నరేంద్ర మోడి ఎవరని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్లను రాజప్రతినిధులుగా అభివర్ణించారు. విజయమ్మ ఆమరణ దీక్ష చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా కొనియాడారు. హెదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, అందరిదని, దాన్ని వేరు చేయలేరని ఘంటాపదంగా చెప్పారు. సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం చల్లారదని స్పష్టం చేశారు. -
విభజనహోరు
సాక్షి, మచిలీపట్నం: తెలుగుతల్లి బిడ్డలను విడదీస్తే ఊరుకోమంటూ మచిలీపట్నంలో ఆందోళనలు హోరెత్తాయి. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రంథాలయ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలతో పట్టణం పోటెత్తింది. పలువురు హిజ్రాలు ర్యాలీల్లో నృత్యాలు చేస్తూ ఉద్యమానికి మద్దతు పలికారు. మునిసిపల్ క్లాస్-4 సిబ్బంది విచిత్రవేషాలతో ప్రదర్శనలిచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. లక్ష్మీటాకీస్, కోనేరుసెంటర్లలో విద్యార్థినులు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రంగవల్లులు వేశారు. నందిగామలో న్యాయవాదులు, ఐసీడీఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో మానవహారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్వర్యంలో మైలవరంలో భారీ ర్యాలీ జరిగింది. ఉయ్యూరులో సంపూర్ణ బంద్ పాటించారు. వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమైక్యవాదులు ఉయ్యూరు ప్రధాన సెంటరును దిగ్బం ధించారు. రైతులు ఎడ్లబళ్లతో ప్రదర్శన చేశారు. రోడ్డుపై వ్యాపారులు వంట కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. పోరంకి సెంటర్లో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త సురేష్బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. కానూరు సిద్ధార్థ లా కళాశాల వద్ద కొనసాగుతున్న రిలే దీక్షాశిబిరాన్ని అదే పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి మద్దతు తెలిపారు. కంకిపాడులో బ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో మహాశాంతియాగం నిర్వహించారు. గుడివాడలో మునిసిపల్ ఉద్యోగులు రోడ్లపైనే వంట వండారు. నడిరోడ్డుపై నాట్లు వేశారు. టీఆర్ఎస్ నేత హరీష్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. జగ్గయ్యపేటలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ విద్యార్థులు, ముస్లిం సోదరులు మానవహారం ఏర్పాటుచేశారు. నందిగామ నియోజకవర్గంలో పాఠశాలలు మూతపడ్డాయి. నూజివీడులో మున్సిపల్ ఉద్యోగులు చిన్న గాంధీబొమ్మ సెంటరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగంచిప్రోలులో కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్లో దహనసంస్కారాలు నిర్వహించారు. గన్నవరం మండలంలోని ముస్తాబాద, గొల్లనపల్లి, చినఆవుటపల్లి గ్రామాల్లో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. బెజవాడలో... కాళేశ్వరరావు మార్కెట్ వద్ద వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటుచేశారు. ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతమ్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. భవన నిర్మాణ కార్మికులు, వడ్డెరలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రెస్క్లబ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాఘవయ్య పార్క్ జంక్షన్లో మానవహారం చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్ఐసీ ఏజెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరో ర్యాలీ తీశారు. వైద్యులు, వైద్య ఉద్యోగులు గంటసేపు విధులు బహిష్కరించి ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఉద్యోగులు మూడోరోజూ విధులు బహిష్కరించారు. భవానీపురం స్వాతి థియేటర్ సెంటర్లో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. బందర్రోడ్డులో ఆటో ర్యాలీ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు, సిబ్బందికి సమైక్యాంధ్రపై ఎన్జీవో నాయకులు అవగాహన కల్పించారు. విజయవాడ సినీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సినిమా థియేటర్లలో అన్ని ఆటలు రద్దుచేశారు.