breaking news
Telangana Water Supply Scheme
-
వాటర్గ్రిడ్లో 709 తాత్కాలిక ఉద్యోగాలు
662 వర్క్ ఇన్స్పెక్టర్లు, 47 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులకు ఓకే హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం ఈ మేరకు సర్క్యులర్ జారీచేశారు. ఆర్డబ్ల్యూఎస్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 47 సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో 47 మంది జూనియర్ అసిస్టెంట్లను, 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ను సర్కారు ఆదే శించింది. ఉద్యోగాలకు అర్హతలు ఇలా.. ప్రభుత్వం జారీచేసిన ఔట్ సోర్సింగ్ నిబంధనల మేరకే జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు, వారి వేతనాలు ఉండాలని సర్క్యులర్లో స్పష్టం చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టి, రోజువారీగా కన్సాలిడేటెడ్ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 662 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 636 పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం పోస్టుల్లో సగం డిగ్రీ అభ్యర్థులకు, సగం డిప్లొమా అభ్యర్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో 26 పోస్టులను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు చేసిన డిగ్రీ/డిప్లమో అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మరోవైపు ఆర్డబ్ల్యూఎస్లో రెగ్యులర్ ఇంజనీర్ల వాహనాలకు అదనపు ఇంధనాన్ని ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు నెలవారీగా ఉన్న 160 లీటర్ల పరిమితిని 250 లీటర్లకు పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. -
3 దశలుగా ‘గ్రిడ్’ టెండర్లు
తాజాగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్గ్రిడ్) టెండ ర్ల ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మొత్తం 26 ప్యాకేజీలకుగానూ తొలి దశ పనుల (11ప్యాకేజీల)కు గత నెల 23న నోటిఫికేషన్ జారీ చే యగా మిగిలిన విడతల టెండర్ల ప్రక్రియ (15ప్యాకేజీ)లకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. 2015-16కుగాను స్టాండర్డ్ షెడ్యూలు రేట్లు మారడంతో తొలి విడత టెండర్ల షెడ్యూలును గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) సవరించి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత షెడ్యూలు ప్రకారం గత నెల 27 నుంచి టెండర్లు స్వీకరించాల్సి ఉండగా కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల కారణంగా ఆ ప్రక్రియను అధికారులు అర్ధంతరంగా నిలిపేశారు. తాజా షెడ్యూలు మేరకు ఈ నెల 7 నుంచి 21 వరకు ఆన్లైన్లో టెండరు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే 22న టెక్నికల్ బిడ్లను, 25న ఫైనాన్షియల్ బిడ్లను పరిశీలిస్తామని, ఈ నెలాఖరులోగా టెండర్లను ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీల్లో స్వల్ప మార్పులు... వాటర్గ్రిడ్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 34,568 కోట్లుగా నిర్ధారించిన అధికారులు ఈనెల 23న తొలి దశ కింద 11 ప్యాకేజీలకుగానూ రూ.15,987 కోట్ల విలువైన పనులకు నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్లు స్వీకరించేలోగా ఎస్ఎస్ఆర్ రేట్లు మారడంతో ఆయా ప్యాకేజీల అంచనాలను మార్చాల్సి వచ్చింది. మారిన రేట్లతో ప్రాజెక్ట్ వ్యయం రూ. 100 కోట్లు తగ్గినట్లు (రూ. 15,887 కోట్లే) అధికారులు ప్రకటించారు. గతంలో కంటే ఇనుము ధర బాగా తగ్గడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కొన్ని ప్యాకేజీలకు సంబంధించి అంచనాలు యథాతథంగా ఉన్నాయని తెలిపారు. స్టీల్ ధర తగ్గినదానికి, ఇతర సామాగ్రి ధర పెరిగినదానికి సరిపోయిందని ముఖ్య అధికారి ఒకరు తె లిపారు. సీఎం సొంత జిల్లాలోని ప్యాకేజీ (మెదక్-గజ్వేల్)కి గతంలో రూ. 700 కోట్లతో అంచనాలు వేసిన అధికారులు ఆ ప్యాకేజీని తాజాగా రూ. 600 కోట్లకు కుదించారు. 11 ప్యాకేజీలు, వాటి అంచనా వ్యయాలు ప్యాకేజీ పేరు వ్యయం(రూ.కోట్లలో) మహబూబ్నగర్-శ్రీశైలం 5,953.00 మెదక్-జూరాల 700.00 రంగారెడ్డి- మేడ్చల్ 160.00 నల్లగొండ-ఏకేబీఆర్ 2,106.00 నల్లగొండ- ఎన్ఎస్పీ/టెయిల్పాండ్ 1,485.00 మెదక్-సంగారెడ్డి 680.00 మెదక్- గజ్వేల్ 600.00 అదిలాబాద్-ఎల్లంపల్లి-కడెం 670.00 వరంగల్-పాలేరు 1,700.00 వరంగల్-హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ 840.00 ఖమ్మం-పాలేరు 993.00 మొత్తం 15,887.00