breaking news
Telangana amortization Day
-
అధికారికంగా విమోచన దినోత్సవం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పదాధికారుల సమావేశం డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా సంపర్క అభియాన్లను వినియోగించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాల్లో కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూనే... రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసేలా వ్యూహం రూపొందించారు. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు. సమావేశం అనంతరం పార్టీనేతలు ప్రేమేందర్రెడ్డి, చింతా సాంబమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీల్లో యాదాద్రిలో రాష్ట్రస్థాయి కిసాన్ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిర్మాణాత్మకమైన ప్రతిపక్షపార్టీగా పోరాటం చేస్తామన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఒత్తిడి తెస్తామన్నారు. రాఖీబంధన్ సందర్భంగా 11 వేల మందితో ప్రధానమంత్రి సురక్షా యోజనను చేపడుతామని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.రామచందర్రావు, నామాజీ, పార్టీ ప్రధానకార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
అధికారికంగా ‘తెలంగాణ విమోచన’
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ సిద్దిపేట జోన్: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అందుకోసం పట్టుబడుతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం ఎంఐఎంతో కుమ్మక్కయి విమోచన దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేస్తుందని కిషన్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ గతంలో మాట్లాడిన సీడీలు, పేపర్ కట్టింగ్లతో రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేస్తామని, కలెక్టరేట్లను దిగ్బంధిస్తామన్నారు. మరోవైపు అన్ని గ్రామాల సర్పంచ్లకు లేఖలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న హెదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుందని, 16న పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.