breaking news
Teesta Setalvad
-
సుప్రీంకోర్టులో సెతల్వాద్కు ఊరట
న్యూఢిల్లీ: గుజరాత్లో 2002 గోధ్రా ఘర్షణల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు బుధవారం సెతల్వాద్కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను త్రిసభ్య బెంచ్ తోసిపుచ్చింది. గోధ్రా హింసాకాండ కేసుల్లో అమాయకుల్ని ఇరికించడానికి సాక్ష్యాలను తారుమారు చేశారని తీస్తా సెతల్వాద్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సెతల్వాద్పై చార్జిషీటు నమోదు కావడంతో ఆమెను మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘తీస్తా సెతల్వాద్ ఇప్పటికే తన పాస్పోర్టును సెషన్స్ కోర్టుకు సమర్పించారు. ఆమె సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదు. వారికి దూరంగా ఉండాలి’’ అని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తీస్తా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని పోలీసులు భావిస్తే నేరుగా సుప్రీంను ఆశ్రయించవచ్చునని తెలిపింది. -
Teesta Setalvad: తీస్తా బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: 2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాద్ బెయిల్ను జూలై 19 దాకా సుప్రీంకోర్టు పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, ఎ.ఎస్.»ొపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణం వెలువరించింది. పిటిషనర్ మహిళ గనుక గుజరాత్ హైకోర్టే బెయిల్ రూపంలో ఆమెకు ఎంతో కొంత రక్షణ కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. సీతల్వాద్కు జూలై 1న సుప్రీంకోర్టు వారం పాటు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. -
గోద్రా అల్లర్ల కేసు: తీస్తా షెతల్వాద్కు ఊరట
అహ్మదాబాద్: గుజరాత్లో 2002 గోద్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాద్కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశిస్తూ శనివారం గుజరాత్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వారం రోజులపాటు స్టే విధించింది. తొలుత తీస్తా షెతల్వాద్కు గుజరాత్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారంటూ నమోదైన కేసుపై శనివారం జస్టిస్ నిర్జర్ దేశాయ్ విచారణ జరిపారు. ఈ కేసులో తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని విన్నవిస్తూ షెతల్వాద్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించారు. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై 30 రోజుల పాటు స్టే ఇవ్వాలన్న షెతల్వాద్ తరఫు లాయర్ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు. దీంతో ఆమె వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట ద్విసభ్య వెకేషన్ ధర్మాసనం విచారణ జరిపింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. షెతల్వాద్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ బీఆర్ గావై, జసిŠట్స్ ఏఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం రాత్రి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తూ హైకోర్టు ఉత్తర్వుపై వారం రోజులపాటు స్టే విధించింది. -
ముమ్మాటికీ తప్పును సరిదిద్దుకోవాలి
చాలామంది మాట్లాడటానికి భయపడుతున్నప్పుడు, మాజీ సీనియర్ న్యాయమూర్తులు కొందరు తీవ్రమైన విమర్శలు చేయడానికి సాహసించారు. బహుశా వారు వెరపులేని విమర్శకునికి అనుకూలంగా గొంతెత్తడం కోసం తమ సంయమనాన్ని కూడా అలా పక్కన పెట్టేయడానికి... వారి చైతన్యమే ప్రేరేపించినట్లున్నది. అలా స్పందించిన వారిలో ముగ్గురి గురించి ఈరోజు నేను మాట్లాడదలిచాను. వీరిలో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు కాగా, మూడో వ్యక్తి మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు తీస్తా సెతల్వాడ్ కేసులో తీర్పును ప్రకటించిన తర్వాత, ఆమెను అరెస్టు చేయడమే న్యాయస్థానం ఉద్దేశమైతే ‘ఇక స్వర్గాధిపతులే మనకు సహాయపడతారు’ అని జస్టిస్ మదన్ లోకుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి, విధానాలను దుర్వినియోగపర్చే ప్రక్రియలో పాల్గొన్న వారందరినీ చట్టం ప్రకారం విచారించా’లని ఆ తీర్పులో ఉన్న ఒక వాక్యం ఆయన్ని నిస్పృహకు గురి చేసింది. ఆ తీర్పు చెప్పిన న్యాయ మూర్తులు ఇక ఏమాత్రం జాగు చేయకుండా, ప్రత్యేకంగా సమావేశమై తీస్తా అరెస్టు తమ ఉద్దేశం కాదని ప్రకటన చేయాలని జస్టిస్ మదన్ లోకుర్ చెప్పారు. ‘కోర్టుకు సెలవులు కాబట్టి వారు ఢిల్లీలో లేనట్లయితే, తీస్తా సెతల్వాడ్ను అరెస్టు చేయడం తమ ఉద్దేశం కాదంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్కి ఆదేశం పంపాల’ని ఆయన సూచించారు. ‘తప్పుడు కేసు పెట్టినందుకు ఆమెను విచారించాలని మీరు చెప్పాల్సిన అవసరం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘వేలాది తప్పుడు కేసులను కోర్టుల్లో నమోదు చూస్తూనే ఉన్నారు. మరి వారందరినీ పట్టుకుని విచారించారా?’ అని ఆయన నిలదీశారు. ‘తప్పుడు కేసులను లెక్కకు మించి పెడుతున్న పోలీసుల విషయం ఏమిటి? ఇలా చెప్పడం ద్వారా కోర్టు తన విలువను తాను క్షీణింప చేసుకుంది. తీస్తాను అభిశంసించిన రోజు నిజంగా చీకటి దినమే అంటే అంగీకరిస్తాను. సుప్రీం కోర్టు ఇలా వ్యవహరి స్తుందని ఎవరూ ఊహించలేదు’ అని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ జుబెయిర్ కేసుపై జస్టిస్ దీపక్ గుప్తా వ్యాఖ్యానిస్తూ దిగువ కోర్టుపై మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతడిని టార్గెట్ చేశారని భావిస్తున్నాను, ఎక్కడో తప్పు జరుగుతోంది’ అనేశారు. పోలీసు దురభిమానానికి జుబెయిర్ కేసు చక్కటి ఉదాహరణగా జస్టిస్ గుప్తా అభివర్ణించారు. ‘కచ్చితంగా దాంట్లో సందేహించాల్సిన పనేలేదు’ అన్నారు. ‘అతడిని ఎందుకు కస్టడీలోకి తీసు కున్నారని నాకు కాస్త ఆందోళనగానూ, అయోమయం గానూ ఉంది’ అని జస్టిస్ గుప్తా పేర్కొన్నారు. ‘ఆ సంఘటన 2018 మార్చిలో జరిగింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. అతడి ట్వీట్ రెండు మతాల మధ్య ఏదైనా వివాదానికి దారి తీసినట్లు సంకేతాలు కూడా లేవు’ అంటూ జస్టిస్ గుప్తా స్వరం పెంచారు. ‘న్యాయస్థానం అతడికి బెయిల్ ఇవ్వడాన్ని కూడా తిరస్కరించిందన్న వాస్తవం నన్ను మరింత భయపెట్టింది. నాలుగేళ్లు అతడిని మీరు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆ నాలుగేళ్లూ ఎలాంటి హానికర ఘటనా జరగ లేదు కదా. కానీ ఇప్పుడు అతడిని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారని న్యాయమూర్తి పోలీసులను కనీసంగా కూడా ప్రశ్నించలేదెందుకు?’ అన్నారు. బహుశా ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో కరకుగా వ్యవహరించింది మద్రాస్, ఢిల్లీ హైకోర్టుల్లో పనిచేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎపీ షా కావచ్చు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ని ధిక్కరించినందుకు జహంగిరి పురిలోని ముస్లిం ఇళ్లను కూల్చివేయడం గురించి ఆయన మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు న్యాయం చేయాలనుకుంటే అది తప్పకుండా తగిన చర్యలు తీసుకుని, తప్పు చేసిన అధికార్లను జైలుకు పంపించాలి.’ అంతకుమించి న్యాయ స్థానం ‘యధాతథ స్థితిని’ పునరుద్ధరించి, ‘పరిహారాన్ని నిర్ణయించాలి.’ అలాగే ‘ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న క్యాంపెయిన్ని స్పష్టంగా చూస్తున్నాను’ అని జస్టిస్ షా ఖరాఖండీగా చెప్పారు. దీనికి గాను ‘అత్యున్నత స్థాయి నుంచి క్షమాపణ’ రావాలని ఆయన కోరారు. ఢిల్లీ కేసుకు సంబంధించినంతవరకు హోమ్ మంత్రిని ఉద్దేశించే తానిలా అంటున్నానని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనా, విద్వేష ప్రసంగం, మతపరమైన హింస పట్ల ప్రభుత్వ మౌనాన్ని జస్టిస్ షా తీవ్రంగా ప్రశ్నించారు. అత్యున్నత స్థాయిలో ఉంటున్నవారు దీనిపట్ల పూర్తి మౌనం వహించడం చాలా ఆందోళనకరమైన విషయం అన్నారు. ఈ మొత్తం వ్యవహారం లక్ష్యం... ప్రజల్ని మరింతగా వేరు చేయడం, మరిన్ని ఉద్రిక్తతలను సృష్టించడమే అనడంలో సందేహమే లేదని చెప్పారు. ఇక ఢిల్లీ పోలీసుల విషయానికి వస్తే ‘వారు పూర్తిగా రాజీపడిపోయారు, సంపూర్ణంగా పక్షపాత దృష్టితో ఉంటున్నార’ని జస్టిస్ షా చెప్పారు. ఆయన ముగింపు మరింత తీవ్రంగా ఉంది. ‘ఇక్కడ నేను స్పష్టంగా ఎలక్టోరల్ నిరంకుశత్వాన్ని చూస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి నాయకులు... ప్రజాస్వామిక సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్, మానవ హక్కుల కమిషన్, మీడియా కూడా రాజీపడిపోయాయ’ని జస్టిస్ షా చెప్పారు. ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో ఏదో ప్రత్యేకత, నిస్సంకోచత్వాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి భ్రమా రాహిత్యాన్నీ, ధిక్కార స్వరాన్నీ వ్యక్తం చేసిన ప్రముఖ వ్యక్తులు వేరే ఎవరైనా ఉంటారని నేను భావించను. అందుకే ఈ ముగ్గురు మన చైతన్య స్వరాలు అని నేను నమ్ముతున్నాను. మనలో చాలామంది మౌనంగా ఉంటున్న తరుణంలో వారు గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఇందుకు వారికి మనం మహాభినందన తెలియజేయాలి. (క్లిక్: వివక్షే ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు