breaking news
sweet memorable
-
అలల్లో అలనాటి జ్ఞాపకాలు
వైనతేయ పుష్కరఘాట్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం పి.గన్నవరం జెడ్పీ హైస్కూలు 1983–83 బ్యాచ్ భేటీ పి.గన్నవరం : వారంతా నూనూగు మీసాలు, పరికిణీ, ఓణీల ప్రాయంలో విడిపోయిన వారు. యవ్వనం గడిచి, నడివయసు నడుస్తున్న వేళ తిరిగి వైనతేయ తీరంలో కలుసుకున్నారు. నేటి సమాజంలో తమ స్థానాలనూ, హోదాలనూ గడ్డిపరకల్లా పక్కకు నెట్టి నాటి చనువుతోనే పలకరించుకున్నారు. మూడు దశాబ్దాల కిందటి తమ అనుభవాలనూ, అనుభూతులనూ కలబోసుకున్నారు. నాటి చిలిపిపనులనూ, కొంటె పనులనూ ప్రేమగా గుర్తు చేసుకున్నారు. శిఖరాల నుంచి దుమికే జలపాతాల వంటి; బండరాళ్లను ఢీకొని ఉరకలేసే కొండవాగుల వంటి ఆనాటి తమను ఆ నది అలల్లో దర్శించుకున్నారు. మనసులు తిరిగి ఆ తరుణయవ్వనంలో కాలిడగా.. కాల ప్రవాహానికి ఎదురీది.. దాని ప్రభావం దేహంపైనే తప్ప హృదయం మీద కాదని రుజువు చేసుకున్నారు. పి.గన్నవరం జెడ్పీ హైస్కూలు 1983–84 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఇక్కడి పాత అక్విడెక్టు పుష్కర ఘాట్ వేదికగా జరిగింది. 32 ఏళ్ల కిందట విడిపోయిన వారిలో అనేకులు ఉద్యోగ, వ్యాపార తదితర కారణాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కాగా వారిలో స్థానికంగా ఉన్న కొందరు రెండు నెలలు శ్రమించి నాటి సహాధ్యాయుల చిరునామాలు సేకరించి ఆహ్వానాలు పంపగా 60 మంది హాజరయ్యారు. ఆ నాటి ముచ్చట్లను కలబోసుకుని మురిసిపోయారు. ఇంటిపేర్లతో పిలుచుకుంటూ చిన్నపిల్లల్లా మారిపోయారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఒకరి చిరునామాలు, సెల్ నెంబర్లు మరొకరు తీసుకున్నారు. నాడు తమకు చదువుచెప్పిన గురువులను వచ్చే ఏడాది జనవరిలో సత్కరించాలని, ఒక ట్రస్ట్ను ఏర్పాటుచేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. తమ బ్యాచ్లో అకాలంగా మరణించిన కొందరి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం బస్సులు, కార్లలో దిండి చేరుకుని ‘గెట్ టు గెదర్’ కేకును కట్ చేశారు. అక్కడ నుంచి అంతర్వేది యాత్రకు తరలివెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు అన్నాబత్తుల అనుబాబు, వాసంశెట్టి కుమార్, నేలపూడి సత్యనారాయణ, మానేపల్లి వెంకటేశ్వరరావు, సుంకర శ్రీను, వరిగేటి పద్మావతి, మొల్లా షేరా, పైడి బుజ్జి, కొండా వెంకటేశ్వరరావు, యడ్లపల్లి వెంకటేశ్వర రావు, కూనపరెడ్డి వెంకటేశ్వర రావు, పీవీఎస్ ప్రసాద్, కట్టా లక్ష్మీ బంగారం, వంకాయల రజని, అడబాల అలివేణి తదితరులు పాల్గొన్నారు. కేరళ నుంచి వచ్చా.. పదో తరగతి వరకూ ఇక్కడే చదివాను. కేరళలో స్థిరపడ్డాను. మా టెన్త్ బ్యాచ్ సమావేశమవుతుందని తెలుసుకుని మూడు రోజులు లీవు తీసుకుని వచ్చా. చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. నారాయణ విజయలక్ష్మి, కేరళ బాల్యం గుర్తుకొచ్చింది.. మేమంతా మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందం కలిగించింది. బాల్యం గురుక్తు వచ్చింది. ఉద్యోగ బాధ్యతల్లో క్షణం తీరికలేకుండా ఉండే నాకు గత స్మృతులు గుర్తుకు వచ్చాయి. అంబటి అనంతలక్ష్మి, ఏపీ ట్రాన్స్కో ఏఓ, హైదరాబాద్ గ్రామానికి సేవ చేయాలి.. ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సేవలందించాలి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సాయపడాలి. పూర్వ విద్యార్థులు కలిసినపుడల్లా గుర్తుగా గ్రామానికి ఏదో ఒక మంచిపని చేయాలి. పి.వాలెంటీనా, హిందీ టీచర్, రాజమండ్రి పేదస్నేహితులకు చేయూతనివ్వాలి.. కలిసి చదువుకున్న వాళ్లమంతా ఇలా తిరిగి కలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి చోటా జరగాలి. పేదరికంలో ఉన్న స్నేహితులకు ఉన్నతస్థితిలో ఉన్నవారు సహాయ పడాలి. –చింతపల్లి సుజాత, హెచ్ఎం, జెడ్పీ హైస్కూలు, అంతర్వేదిపాలెం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు మా బ్యాచ్ విద్యార్థులంతా కలిసి ట్రస్ట్ను ఏర్పాటు చేసి, తద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. వచ్చే జనవరిలో కుటుంబాలతో సహా హాజరై, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. బాల్యమిత్రులను కలవడం ఆనందంగా ఉంది. –మానేపల్లి వెంకటేశ్వరరావు, పాలకొల్లు -
జాతిపిత.. పదిలం నీ చరిత
మహాత్ముని ‘జ్ఞాపకాలు’ పదిలం గాంధీభవన్లో ‘గాంధీ’ చిత్రాలు కాకినాడ : స్వాతంత్రోద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేందుకు జాతిపిత మహాత్మగాంధీ కాకినాడ ప్రాంతాన్ని సందర్శించిన జ్ఞాపకాలు ఇప్పటికీ జనం మదిలో చిరస్థాయిగా ఉన్నాయి. 1921 నుంచి 1929 మధ్యలో మూడుసార్లు గాంధీజీ కాకినాడ వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. గాంధీజీ ఇక్కడికి వచ్చినప్పటి విషయాలతోపాటు ఆయన బాల్యం నుంచి స్వాతంత్య్రం సాధించే వరకు ఉన్న జీవితఘట్టాలను తెలియజేస్తూ కాకినాడ ప్రాంతంలో గాంధీభవన్ కూడా ఏర్పాటు చేశారు. ఆయనను నిత్యం స్మరించుకునేలా ఓ పార్కుకు గాంధీపార్కుగా, ఓ ప్రాంతానికి గాం«ధీనగర్గా అప్పట్లోనే నామకరణం చేశారు. 1921లో తొలిసారిగా వచ్చిన గాంధీ జాతిపిత మహాత్మాగాంధీ 1921 ప్రాంతంలో కాకినాడ వచ్చారు. ప్రస్తుతం ఎల్విన్పేటగా పిలిచే ప్రాంతంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారని, అదే సమయంలో సేవాదళ్ క్యాంప్ కూడా నిర్వహించారని చెబుతుంటారు. ప్రస్తుతం దేవాలయం వీధిగా పిలిచే ప్రాంతంలో పైడా వెంకటనారాయణ నివాసానికి గాంధీజీ వచ్చి అక్కడే ప్రజలను కలుసుకున్నారట. ఆ సందర్భంలోనే కాకినాడ మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ప్రాంతంలో ఓ రాత్రి గడిపారు. అక్కడే శాశ్వత భవన నిర్మాణం: కాకినాడ రాక సందర్భంగా గాంధీజీ బస చేసిన ప్రాంతాన్ని స్వాతంత్య్ర సమరయోధులు కోమండూరి శఠగోపాచారి, డాక్టర్ తనికెళ్ల సత్యనారాయణమూర్తి కొనుగోలు చేశారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ హరిజనోద్ధరణ, మహిళలకు వృత్తి విద్యాకోర్సులు, అక్షరాస్యత కార్యక్రమాల అమలు కోసం 1935 ప్రాంతంలో అక్కడొక భవనాన్ని నిర్మించారు. 1950 ప్రాంతంలో అప్పటి ప్రధాని పోసుపాటి కుమార్స్వామిరాజా దీనిని ప్రారంభించారు. 1969లో వచ్చిన పెనుతుపానుతో భవనం కూలిపోయింది. 1994లో దంటుసూర్యారావు ఈ గాంధీభవన్కు అధ్యక్షుడిగా ఎన్నికై తిరిగి ఈ భవనాన్ని పునరుద్ధరించి సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గాంధీభవన్లో కొంత ప్రాంతాన్ని మహార్షిసాంబమూర్తి వికలాంగుల పాఠశాల నిర్వహణ కోసం నామమాత్రపు లీజుకు ఇచ్చి వాటితో నిర్వహణ చేస్తున్నారు. అలాగే యంగ్మెన్స్హ్యాపీ క్లబ్కు కూడా మరికొంత స్థలాన్ని కేటాయించారు. అప్పటి ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15లక్షలు కేటాయించడంతో భవనం సుందరంగా రూపుదిద్దుకుంది. స్ఫూర్తిని కలిగించే చిత్రపటాలు ప్రముఖ గాంధేయవాది వాడ్రేవు సుందరరావు గాంధీస్మారక మందిరం కోసం అనేక చిత్రపటాలను సేకరించారు. గాంధీజీ బాల్యం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు ఆయన పాల్గొన్న అనేక కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సేకరించి గాంధీభవన్లో ఉంచారు. అక్కడే ఓ గాంధీ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారతప్రభుత్వం 1969లో గాంధీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ముద్రించిన గాంధీజీ స్వీయరచనల పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సుమారు 100 వరకు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కూడా గాంధీజీ స్వీయరచనలు అందుబాటులో లేవని చెబుతుంటారు. అలాగే ప్రతీరోజు ఉచిత కుటుశిక్షణను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు.