ఎవరు గెలుస్తారో చెబితే రూ.21 లక్షలిస్తాం!
పంచాంగకర్తలకు, జ్యోతిష్యులకు అభ్యుదయవాదుల సవాల్
సాక్షి, ముంబై: ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెబితే 21,00,000 రూపాలయల నగదు బహుమతిని ఇస్తామని పంచాంగకర్తలకు, జ్యోతిష్యులకు మహారాష్ట్ర మూఢనమ్మకాల నిర్మాలన సమితి సవాలు విసిరింది.జ్యోతిష్యం, పంచాంగాలపై మీకు నమ్మకం ఉంటే శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పేందుకు తమ ఆహ్వానాన్ని స్వీకరించాలని చాలెంజ్ను విసిరింది. గత ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో కూడా పుణే యూనివర్సిటీతోపాటు మరికొన్ని అభ్యుదయ సంస్థలు ఇలాగే సవాలు విసిరాయి. అయితే జ్యోతిష్యులు, పండితులెవరూ ముందుకు రాలేదు. కాగా బుధవారం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి జ్యోతిష్యులకు అదే పరిస్థితి ఎదురైంది. మరి ఈసారి ఎవరైనా ముందుకొస్తారా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.