breaking news
stop bills
-
పెట్టుబడులు, టెండర్లు ఆపేయండి
న్యూఢిల్లీ: ముందస్తు కొనుగోళ్ల ఆర్డర్లు, ఇప్పటికే ఖరారైన టెండర్లను తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా నిలిపివేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. దీంతో పెట్టుబడి వ్యయాలకు సంబంధించి కొత్త టెండర్లు ప్రకటించాలంటే ముందుగా ఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీసర్ అనుమతులు తీసుకోవాలంటూ అన్ని సర్కిల్స్ హెడ్స్కు బీఎస్ఎన్ఎల్ ఆర్థిక విభాగం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ తీవ్ర ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బీఎస్ఎన్ఎల్ తాత్కాలికంగా ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని, ఇప్పటికే పేరుకుపోయిన రుణభారాలను తీర్చే పరిస్థితుల్లో లేదని సర్కిల్ హెడ్స్కు పంపిన ఆర్డరులో కంపెనీ పేర్కొంది‘ అని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. పెట్టుబడి వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ డాట్ నుంచి ఆదేశాలు రావడంతో బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు ఆర్డరు జారీ చేసినట్లు వివరించాయి. ప్రైవేట్ టెలికం సంస్థలు ఓవైపున వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుండగా.. వాటితో పోటీపడేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇంకా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అనువుగా భారీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉన్నప్పటికీ అందుకు అవసరమైన పరికరాలు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల సమీకరణ కోసం రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను పంపినప్పటికీ కేంద్రం దానిపై నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టింది. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాల విస్తరణకు అడ్డంకులుగా మారాయి. 2014–15లో రూ. 672 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించిన బీఎస్ఎన్ఎల్ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,885 కోట్లు, 2016–17లో రూ. 1,684 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జించింది. రిలయన్స్ జియో రాకతో మిగతా టెల్కోల తరహాలోనే బీఎస్ ఎన్ఎల్పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత భీకరమైన పోటీ నెలకొందంటూ కంపెనీ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఎస్కే గుప్తా గత నెలలో చీఫ్ జనరల్ మేనేజర్స్కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న అత్యంత చౌకైన టారిఫ్ల కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని అందులో ఆయన పేర్కొన్నారు. -
‘మిషన్కు గండి’పై మంత్రి ఆగ్రహం
పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి తెగిన కట్టలను పునరుద్ధరించాలని ఆదేశం తాత్కాలికంగా బిల్లుల నిలిపివేత సాక్షి ప్రతినిధి, వరంగల్ : చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. దశల వారీగా జిల్లాలోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. అయితే కాంట్రాక్టర్ల కకుర్తి.. సాగునీటి శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ కాకతీయ పనులు జిల్లాలో నాసిరకంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాలోనే మిషన్ కాకతీయ పనులపై ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. సకాలంలో పనులు జరగకపోవడం.. చేసిన పనుల్లోనూ నాణ్యత లోపించడం వంటి కారణాలతో సాగునీటి శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన పలు చెరువులు ఇటీవల వర్షాలకు తెగిపోయాయి. హసన్పర్తి, మద్దూరు, మంగపేట మండలాల్లోని పలు చెరువుల కట్టలకు గండ్లు పడ్డాయి. నీటిని నిల్వ చేసేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ పనులు.. చెరువులు తెగిపోయేలా చేశాయని, నాసిరకం పనులతోనే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యతను పర్యవేక్షించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని పలువురు అధికారులే చెబుతున్నారు. నాణ్యతను పట్టించుకోకుండా అధికారులు పనులను రికార్డు చేసి, కాంట్రాక్టర్లుకు బిల్లులు మంజూరు చేస్తుండడం మన జిల్లాలోనే ఎక్కువగా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వర్షాలకు తెగిన చెరువుల పనులను చూసినా ఇదే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సాగునీటి శాఖ అధికారులపై ఆ శాఖ మంత్రి టి.హరీశ్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. చెరువులు తెగిన విషయంపై అధికారులను మందలించినట్లు సమాచారం. నాసికరం పనులపై చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సాగునీటి శాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డిని హెచ్చరించినట్లు తెలిసింది. మిషన్ కాకతీయలో అభివృద్ధి చేసిన చెరువుల పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. మిషన్ కాకతీయ రెండో దశ టెండర్ల సమయంలోనూ మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా పనుల నాణ్యత విషయంలోనూ అదే పరిస్థితి వచ్చింది. బిల్లుల చెల్లింపు నిలిపివేత.. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతను పట్టించుకోకుండా బిల్లులు మంజూరు చేస్తున్న విషయంలో ఆరోపణలు పెరుగుతుండడంతో రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించారు. పనుల నాణ్యతను పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతే బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. కట్టలు తెగిపోయిన చెరువుల పనులకు బిల్లులు చెల్లింపును నిలిపివేయాలని.. మళ్లీ పనులు చేయించిన తర్వాతే బిల్లుల మంజూరు విషయం పరిశీలించాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి వానలతో దెబ్బతిన్న మిషన్ కాకతీయ చెరువుల విషయం సాగునీటి శాఖ జిల్లా అధికారుల్లో ఆందోళన పెంచుతోంది.