breaking news
sriranga raju
-
కులాలకు కేసులకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తుంటే.. ఆయన కులం చాటున దాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని క్షత్రియ నేతలు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కె.కె.రాజు మండిపడ్డారు. కులాలకు– కేసులకు సంబంధం లేదని, తప్పు చేసిన వారు ఏ కులంవారైనా శిక్ష పడుతుందని వారు స్పష్టంచేశారు. ‘‘రాజకీయ, న్యాయ వివాదాల్లో... ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాల్లో కులసంఘాల జోక్యం సబబు కాదు. అశోక్గ జపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ పేరిట చేసిన మోసాలు, అవినీతి వ్యవహారాలను ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు వదిలిపెట్టాలే తప్ప కుల సంఘాల జోక్యం తగదు. అశోక్గజపతిరాజు తప్పు చేసి క్షత్రియ కులాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదెంతమాత్రం క్షమార్హం కాదు’’ అని విశాఖలో ఉత్తరాంధ్ర నేతలు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘గతంలోనూ చంద్రబాబు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడూ ఎల్లో మీడియా సాయంతో రెడ్డి, క్షత్రియుల మధ్య గొడవలు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు బుద్ధి రాకపోవడం సిగ్గు చేటు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులకు సంబంధించి ఊరు, పేరు లేకుండానే క్షత్రియుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రకటనలివ్వడం దారుణం. క్షత్రియులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు... సిద్ధాంతాలకు కట్టుబడే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు చెప్పారు. బాబు హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ కులాల కురుక్షేత్రాన్ని కోరుకోవడం మానుకోవాలని హితవు పలికారు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి వైఎస్ జగన్ క్షత్రియులకు మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు, మంత్రి పదవి ఇచ్చారని, దీన్నెవరూ మరచిపోరని చెప్పారాయన. మహిళపై వివక్ష క్షత్రియ ధర్మమా? విశాఖలో మాట్లాడిన క్షత్రియ నేతలు... ఇప్పుడు అశోక్గజపతిరాజును సమర్థిస్తూ, కొమ్ముకాస్తున్న ఒక వర్గం క్షత్రియ నేతలే గతంలో ఆయన తండ్రి దోపిడీదారుడని విమర్శించారని గుర్తుచేశారు. అశోక్గజపతిరాజు అంశాన్ని కులానికి ముడిపెట్టి కొన్ని పత్రికల్లో కథనాలు రాయడాన్ని క్షత్రియుల తరఫున ఖండిస్తున్నామన్నారు. అశోక్గజపతిరాజు తన అన్న కూతురు సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై వివక్ష చూపించడం క్షత్రియ ధర్మమా? అసలు క్షత్రియ కుటుంబంలో మహిళలకు ఎంత గౌరవమిస్తారో అశోక్ గజపతికి తెలుసా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎటువంటి హక్కులుండవని చెప్పడమే అశోక్ గజపతి ఉద్దేశమయితే.. ఆ వాదనను రాష్ట్రంలో క్షత్రియలెవ్వరూ సమర్థించరని చెప్పారు. ‘‘పంచగ్రామాల సమస్య పరిష్కారానికి అనుకూలమో, వ్యతిరేకమో.. అశోక్గ జపతి తక్షణమే చెప్పాలి. కోటిపల్లి వద్దనున్న మాన్సాస్ ట్రస్టు భూములను ఏపీఎండీసీకి (2020కి ముందు) అప్పగించక మునుపు అక్కడ ఇసుకను లెక్కాపత్రం లేకుండా దోచుకున్నది ఎవరు? మాన్సాస్ విద్యాసంస్థలకు రావాల్సిన రూ.35 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం« దరఖాస్తు కూడా చేయకుండా ఆ సంస్థలను నాశనం చేసింది ఎవరు? మాన్సాస్ భూములను కోర్టుకు తెలియకుండా వేలం వేయించింది ఎవరు? 20 ఏళ్లుగా మాన్సాస్ ట్రస్టు అకౌంట్లను ఆడిటింగ్ చేయించలేదంటే.. ఇది ట్రస్టుగా నడుస్తోందా? లేక అశోక్గజపతి సొంత వ్యవహారంలా నడుస్తోందా? అని ప్రశ్నించారు. వీరితో పాటు ఈ సమావేశంలో విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్రాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రఘురామరాజు, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్రాజు, మాజీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసరాజు, కార్పొరేటర్లు అనిల్కుమార్రాజు, భూపతిరాజు సుజాత, జానకిరామరాజు, పార్టీ అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, సంయుక్త కార్యదర్శి కిరణ్రాజు పాల్గొన్నారు. -
26 వేల కోట్లతో పేదలకు ఇళ్లు
విజయవాడ : రాష్ట్రంలో తొలి విడతగా 15 లక్షల 10 ఇళ్లను నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చేరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. ఇందుకు లబ్ధిదారులు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 26 వేల కోట్లతో, నాణ్యమైన మెటీరియల్తో ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. సీఎం జగన్ పాదయాత్రలో పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 1400 కోట్లు బకాయిలు పెట్టగా, వాటిని కూడా పేదలకు రెండు విడతల్లో విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు శ్రీరంగనాథ రాజు తెలిపారు. (డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లు) -
సీఐడీ ఇన్స్పెక్టర్ పేరుతో అమ్మాయిలకు వల
ఉప్పల్: సీఐడీ ఇన్స్పెక్టర్నంటూ ఐడీ కార్డులను సృష్టించుకుని.. అమ్మాయిలను వలలో వేసుకొని మోసం చేస్తున్న ఓ టీపీఎస్పీ కానిస్టేబుల్ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం ఉప్పల్ ఠాణాలో మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్రెడ్డి, ఉప్పల్ సీఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వాడాలి శ్రీరంగరాజు(32) యూసుఫ్గూడలోని ఫస్ట్ బెటాలియన్ కానిస్టేబుల్. ఉప్పల్ చిలుకానగర్లో భార్య లతతో కలిసి ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు. కానిస్టేబుల్ శ్రీరంగరాజు ప్రతీ రోజు విధులు ముగించుకున్న తర్వాత మూడుస్టార్ల చొక్కా ధరించి సీఐడీ ఇన్స్పెక్టర్ అవతారం మెత్తుతాడు. స్కార్పియో కారు, బుల్లెట్పై తిరుగుతూ ఖరీదైన ల్యాప్టాప్లను వాడుతూ అమ్మాయిలకు వల వేస్తాడు. సీఐడీ ఇన్స్పెక్టర్నంటూ నకిలీ ఐడీ కార్డులు చూపిస్తాడు. తనుకు పెళ్లైన వెంటనే విడాకులు తీసుకున్నానని నమ్మబలికి ఎంతో మంది మహిళలను మోసం చేశాడు. ఇదే విధంగా రామంతాపూర్లో తన సోదరి ఇంటి పక్కన ఉండే ఓ మహిళను నమ్మించి మోసం చేశాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని కూడా చెడగొట్టాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో శ్రీరంగరాజు ఉదంతం బయటపడింది. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని మరికొందరి వద్ద పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని మోసం చేశాడని పోలీసులు తెలిపారు. 2009-2011లో ఎస్ఐ పరీక్షలు రాసి ఫెయిల్ కావడంతో శ్రీరంగరాజు నకిలీ సీఐ అవతారమెత్తినట్లు తెలిపారు. 2014లో స్కూల్ టీచర్గా పని చేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పరచుకుని ఆమె వద్ద నుంచి రూ.2 లక్షలు తీసుకుని స్కార్పియో కొన్నాడు. ఇదే కారులో ఇన్స్పెక్టర్ డ్రెస్స్ వేసుకుని తిరిగే వాడని పోలీ సులు తెలిపారు. గురువారం నిందితున్ని రిమాండ్కు తరలించారు.