breaking news
Sri Padmavathi Ammavaru Brahmotsavams
-
వైభవంగా పంచమి తీర్థం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం పద్మసరోవరం(పుష్కరిణి)లో అత్యంత వైభవంగా పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్రస్నానం చేసి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి పుట్టిన రోజున నిర్వహించే ముఖ్యమైన ఘట్టం చక్రస్నానం. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9.30గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. వేదపండితులు అమ్మవారికి, చక్రతాళ్వారుకు కన్నులపండువగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం 11.50గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానమాచరించారు. అమ్మవారికి శ్రీవారిసారె పంచమీతీర్థం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారికి తిరుమల ఆలయం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి వారి సారె పంపారు. టీటీడీ ఈవో గిరిధ ర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆలయం నుంచి తీసుకొచ్చి తిరుమలలో ఊరేగింపు నిర్వహించారు. తిరుమల నుంచి పరిచారకులు నెత్తినపెట్టుకుని నడకదారిలో తిరుపతి అలిపిరి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబారీలపై ఊరేగింపుగా తిరుచానూరు తీసుకొచ్చి తిరుపతి జేఈవో భాస్కర్కు అందజేశారు. ఆయన సారెను పంచమీతీర్థం మండపానికి తీసుకురాగా వేదపండితులు అమ్మవారికి అలంకరించారు. అదేవిధంగా శ్రీపద్మావతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారు తరపున తిరుమల దేవేరికి పచ్చరాయి పొదిగిన విలువైన హారాన్ని కానుకగా అందజేశారు. ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు ఈనెల 19న ధ్వజారోహణంతో ప్రారంభమైన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను గురువారం రాత్రి ఆలయంలో వేదపండితులు ధ్వజావరోహణం నిర్వహించి ముగించారు. నేడు పుష్పయాగం బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అమ్మవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. తెలిసోతెలియకో జరిగిన పొరపాట్లకు దోషనివారణగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం దాతలు సమకూర్చిన దాదాపు ఆరు టన్నుల 12రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పయాగం నిర్వహిస్తారు. -
వెంకన్న దర్శనానికి 20 గంటలు
సాక్షి, తిరుమల : భక్తులతో శుక్రవారం తిరుమల కిటకిటలాడింది. వేకువజామున 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 32,326 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయూయి. వీరి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో సాయంత్రం 5 గంటలకు రూ. 300 టికెట్ల దర్శనాన్ని నిలిపివేశారు. కాలిబాట భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. కాగా, బ్లాక్ డే సందర్భంగా శుక్రవారం తిరుమలలో తనిఖీలు ముమ్మరంగా జరిగాయి. వైభోగం.. అమ్మవారి రథోత్సవం తిరుచానూరు, న్యూస్లైన్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజామున 4.15గం.కు అమ్మవారిని రథంపై కొలువుదీర్చి దివ్యమంగళ స్వరూపిణిగా అలంకరిం చారు. అమ్మవారు ప్రసన్నమూర్తిగా కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. రాత్రి అశ్వవాహనంపై పురవీధు ల్లో అమ్మవారు విహరించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన చివరి ఘట్టం పంచమీతీర్థం (చక్రస్నానం) శనివారం మధ్యాహ్నం 12.10గం.కు అత్యంత వేడుకగా జరగనుంది. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.