breaking news
Speakers decision
-
టీటీడీపీ కథ కంచికి
♦ రేపు ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి.. ♦ విలీనంపై స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూపులు ♦ అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై టీడీపీ నేతల భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ కథ కంచికి చేరిన ట్లే కనిపిస్తోంది. కొత్త రాష్ట్రం తెలంగాణకు జరిగిన తొలి ఎన్నికల్లో(2014) పదిహేను మంది ఎమ్మెల్యేలతో మొదలైన తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 20 నెలలు గడిచేసరికి ముచ్చటగా మూడుకు పడిపోయింది. ఒకరి వెనుక ఒకరుగా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి టీటీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో ఆ పార్టీ చిక్కిశల్యమైపోయింది. గురువారం నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలతోనే హాజరు కానుంది. టీడీపీఎల్పీ నేత రేవంత్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మిగిలారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు బుధవారం టీడీఎల్పీ కార్యాలయంలో చర్చించారు. అధికార పక్షంపై పోరాడడానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహాన్నీ ఖరారు చేయలేదని, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడే నిర్ణయించుకుంటామని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు రేవంత్రెడ్డితో సమావేశమై చర్చించి పలు సూచనలు చేశారు. కాగా, గురువారం గవర్నర్ ప్రసంగం ముగిశాక జరగాల్సిన బీఏసీ సమావేశానికి తమకు అనుమతి ఉంటుందా? లేదా అన్న అంశంపైనా టీటీడీపీకి స్పష్టత లేదు. స్పీకర్ నిర్ణయం కోసం... టీటీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి నేతృత్వంలో స్పీకర్కు ఓ లేఖ రాశారు. మొత్తం 15 మందిలో మెజారిటీ తమకే ఉందని, విలీనానికి అవసరమైన రెండింట మూడొంతుల మెజారిటీ ఉన్నందున తమను టీఆర్ఎస్లో వీలీనం చేయాలని ఆ లేఖలో కోరారు. కాగా, తమ చేరిక ఖాయమై సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో తాము కూడా విలీనానికి మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీలు ఎర్రబెల్లికి లేఖ ఇచ్చారని తెలిసింది. మొత్తం 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఎర్రబెల్లి మరో లేఖను స్పీకర్కు అంద జేశారని సమాచారం. ప్రస్తుతం ఈ లేఖ స్పీకర్ పరిశీలనలో ఉంది. టీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేస్తారా? లేదా అని టీడీపీ నాయకత్వం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ ఎల్పీ నేతగా రేవంత్ను ఎన్నుకున్నామని స్పీకర్కు రాసిన లేఖ కూడా పెండింగులోనే ఉంది. దీంతో ఆయనను ఎల్పీ నేతగా గుర్తిస్తారా? బీఏసీ సమావేశానికి ఆహ్వానిస్తారా? లేదా అన్న ప్రశ్నలు టీడీ పీ నేతల మదిని తొలుస్తున్నాయి. మరోవైపు పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగలడంతో చివరకు అసెంబ్లీ ప్రాంగంణలోని టీడీఎల్పీ కార్యాలయం కూడా టీటీడీపీకి లేకుండా పోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్పీకర్కు గోపీనాథ్, గాంధీ లేఖ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుని, చేరికకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి లేఖ రాశారు. సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయిన అనంతరం ఈ నెల 11న(శుక్రవారం) టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వీరిద్దరూ స్పీకర్కు లేఖ రాయడంతో ఒక విధంగా వారు టీఆర్ఎస్లో చేరినట్లేనని, ముఖ్యమంత్రి సమక్షంలో అధికారికంగా గులాబీ కండువాలు కప్పుకోవడమే మిగిలిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరి పార్టీ మార్పు నిర్ణయంతో గ్రేటర్లో తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలకుగానూ ఇక ఆర్.కష్ణయ్య(ఎల్బీనగర్) ఒక్కరే మిగులుతారు. టీడీపీ నుంచి గాంధీ, గోపీనాథ్ సస్పెన్షన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్లను టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలంటూ బుధవారం స్పీకర్ మధుసూదనాచారికి వీరు లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
9 స్థానాలకు ఉప ఎన్నిక తప్పదా?
⇒ టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాపై జోరుగా చర్చ ⇒ అనర్హత వేటుపై పెండింగ్లో స్పీకర్ నిర్ణయం ⇒ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యోచనపై ఊహాగానాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగనుందా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇదే ఆలోచనలో ఉన్నారా.. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై స్పీకర్ నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది. అలాగే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనిపైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అలాగే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు గడ్డం విఠల్రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్, కాలే యాదయ్యతోపాటు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన మదన్లాల్, తాటి వెంకటేశ్వర్లు తమ తమ పార్టీలను వదిలి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా పార్టీల నాయకత్వాలు వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాయి. ఈ పరిస్థితుల్లో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చే యించి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఉందన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. వీరిపై అనర్హత వేటు వేయకుండా, లేదంటే రాజీనామానాలు చేయించకుండా సభలోనే ఉంచి నడిపించడం అంత తేలికైన విషయం కాదని, ఉప ఎన్నికలకు పోవడం ఒక్కటే టీఆర్ఎస్ ముందున్న ఏకైక మార్గమని పరిశీ లకులు విశ్లేషిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మదిలో ఏముందన్నది టీఆర్ఎస్ వర్గాల్లోనే స్పష్టత లేదు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది.