breaking news
Sindhutai Sapkal
-
అభాగ్యుల తల్లి.. సింధుతాయి!
ముంబై: ఉత్తరప్రదేశ్లో ఓ సామాజిక కార్యకర్తను మదర్ ఆఫ్ ఆర్పన్స్గా సత్కరించారు. సింధుతాయి సఫ్కల్ అనే సామాజిక కార్యకర్త చూపిన అసమాన మానవత్వానికి... రచయిత, మానవతావాది, జర్నలిస్టు అయినటువంటి డాక్టర్ రామ్మనోహర్ త్రిపాఠీ గౌరవార్థం ఇచ్చే డాక్టర్ రామ్మనోహర్ త్రిపాఠీ లోక్సేవ సమ్మాన్తో సత్కరించారు. 70 ఏళ్ల సింధుతాయ్కు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పూనేకు చెందిన సామాజిక కార్యకర్త సింధుతాయ్. తన జీవితం మొత్తం వెనుకబడిన వర్గాల వారి కోసం ఎంతో సేవ చేశారు. తన సేవలో భాగంగా 1000మందికి పైగా పిల్లలను దత్తత తీసుకున్నారు. అవార్డు తీసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుసంపన్నమైన మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అవసరమున్న ప్రతివ్యక్తికి సాయపడుతూ తమ దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. సింధు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అహల్యాబాయి హల్కర్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. -
సప్కాల్... అనాథల తల్లి
ఎవరూ లేని స్థాయి నుంచి తనకంటూ ఒక పెద్ద కుటుంబాన్ని సృష్టించుకున్న వైనమే ఈ కథనం.. ఈ ఫొటోలోని 68 ఏళ్ల మహిళ పేరు సింధుతై సప్కాల్. సప్కాల్ ఒక పేద కుటుంబంలో జన్మించింది. 9 ఏళ్ల వయసులో చదువును మధ్యలోనే ఆపేసింది. పదేళ్ల వయసులో 20 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పదేళ్ల తర్వాత సప్కాల్ గర్భం దాల్చింది. ఆ సమయంలో అండగా ఉండాల్సిన భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. నా అనుకున్న వాళ్లు కూడా ఎవరూ చేరదీయలేదు. పశువుల పాకలో ఒక పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. తనకు, తన కుమార్తె కోసం భిక్షాటన చేసింది. ఆ సమయంలోనే తనలాగా కష్టాలు పడుతున్న యువతను చేరదీసి వారికి తన ఆహారాన్ని పంచేది. అలా అలా ఆమెను ఆశ్రయించిన వారు నేటికి 1400 మంది అయ్యారు. ప్రస్తుతం సప్కాల్ను అందరూ అనాథల తల్లి అని ముద్దుగా పిలుచుకుంటారు. అనాథలకు కావాల్సిన ఆహారం, నివాసం ఇవ్వడంతోపాటు వారికి కావాల్సిన∙ప్రేమను పంచేది. సప్కాల్ చేస్తున్న విశేష కృషికి ఇప్పటివరకు 750 అవార్డులు నడుచుకుంటూ వచ్చి ఆమె పాదక్రాంతం అయ్యాయి. పుణేలో సప్కాల్ నాలుగు అనాథశ్రమాలను నడుపుతోంది. అందులో రెండు అబ్చాయిలకు, రెండు అమ్మాయిలకు. తనను ఆశ్రయించిన అనాథలలో చాలా మంది లాయర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా జీవితాల్లో స్థిరపడ్డారు. చాలా మందికి దగ్గరుండి వివాహాలు కూడా జరిపించింది. అలా అలా ఎవరూ లేని స్థాయి నుంచి ఒక పెద్ద కుటుంబానికి తల్లిలా మారింది. -
అన్నం పెట్టిన అమ్మకు 500 అవార్డులు!
అర్థవంతం మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల సింధుతాయి సప్కాల్ను మీకెందరు పిల్లలు అని అడిగితే 1,500 మంది పైనే అని చెబుతుంది. మీ కుటుంబం గురించి చెప్పమంటే... 207 మంది అల్లుళ్లు, 36 మంది కోడళ్లు, 1000 మంది మనవళ్లు, మనవరాళ్లు అని అంటుంది. ఆమెకు, వాళ్లకు రక్తసంబంధం లేదు కానీ, వాళ్లకు అన్నీ ఆమే. రోడ్డుమీద అనాథ కనిపించినా, ఎక్కడైనా అనాథ చిన్నారులున్నారన్నా తీసుకొచ్చి తన ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాల్లో చేర్పించి, వాళ్ల ఆలనా పాలనా చూస్తారు సింధుతాయి. వాళ్లమీద ఆమెకంత ప్రేమ ఏంటి? అంటే అర శతాబ్దం వెనక్కి వెళ్లాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో సింధుతాయిని పదో ఏటే స్కూలు మాన్పించేసి, పెళ్లి చేసి పంపించేశాడు ఆమె తండ్రి. తన కన్నా ఇరవై ఏళ్లు పెద్దవాడైన భర్త ఆమెకు నరకం చూపించాడు. రోజూ గొడ్డును బాదినట్లు బాదేవాడు. తన బాధ చెప్పుకోవడానికి కూడా చుట్టూ ఎవరూ ఉండేవాళ్లు కాదు. ఎందుకంటే వాళ్ల ఇల్లుండేది అటవీ ప్రాంతంలో. ఇరవయ్యో ఏట తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న సమయంలో సింధుతాయిని బయటికి వెళ్లగొట్టాడు భర్త. కడుపులో బిడ్డ ఉందన్న కనికరం కూడా చూపించలేదు. పశువుల పాకలో అమ్మాయిని ప్రసవించిన సింధుకు, బిడ్డ బొడ్డుతాడును ఓ మొన తేలిన రాయితో కోసుకోవలసిన దుస్థితి తలెత్తింది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తీసుకుని పది కిలోమీటర్లు నడుచుకుంటూ పుట్టింటికి వెళ్లింది. కానీ వాళ్లు ఆమెకు ఆశ్రయమివ్వలేదు. దీంతో తనకిక చావే శరణ్యమనుకుంది. కానీ పండంటి బిడ్డను చూసి మనసు మార్చుకుంది. పుణెకు చేరుకుని రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో యాచన చేసి బిడ్డను పోషించింది సింధుతాయి. రోడ్డుమీద ఆలనా పాలనా లేని పసిబిడ్డల్ని చూసినప్పుడల్లా, ఆమె గుండె తరుక్కుపోయేది. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంది. పిల్లల్ని చేరదీసి వాళ్ల కోసం తాను భిక్షం ఎత్తి, అందరినీ పోషించడం మొదలుపెట్టింది. కొన్నాళ్ల తర్వాత ఈ పిల్లల్ని తీసుకుని వివిధ సేవాసంస్థల్ని కలవడం మొదలుపెట్టింది. సింధు నిజాయితీని, ఆమె సేవాదృక్పథాన్ని గుర్తించి, ఆమెకు సాయం చేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. వాటి సహకారంతో అనాథ పిల్లల కోసం ఓ ఇల్లు కట్టించింది. రోడ్డుమీద కనిపించే అనాథ పిల్లలు మరింత మందిని చేరదీసింది. పోనుపోను పూణె నగరంలో సింధుతాయి ఫలానా అని అందరికీ తెలిసొచ్చింది. ఆర్థిక సహకారం మరింతగా పెరిగింది. ఇప్పుడు పూణెలో ఎక్కడ అనాథ పిల్లాడు కనిపించినా, సింధుతాయి దగ్గరికి చేర్చడం ఓ అలవాటుగా మారిపోయింది అక్కడి జనాలకు. విశేషం ఏమిటంటే సింధుతాయి అండ కోసం వచ్చిన అనాథల్లో ఆమె భర్త కూడా ఉన్నాడు! అతణ్ని కూడా మన్నించి తన అనాథ శరణాలయంలోనే చోటిచ్చింది. తాను చేరదీసిన పిల్లల్లో కొందరు డాక్టర్లయ్యారు. ఇంజనీర్లయ్యారు. మరికొందరు వేరే ఉన్నత చదువులు చదివారు. మొత్తంగా సింధుతాయి ఆధ్వర్యంలో ఆరు ట్రస్టులు నడుస్తున్నాయి. రోజూ వివిధ కంపెనీలకు, కార్యాలయాలకు వెళ్లడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం, అనాథల కోసం విరాళాలు సేకరించడం, వారి కడుపు నింపడం, విద్యాబుద్ధులు చెప్పించడం... ఇదీ సింధుతాయి దినచర్య. సింధు కృషిని గుర్తించి దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు 500 దాకా అవార్డులిచ్చాయి ఆమెకు. చివరికి రాష్ట్రపతి అవార్డు కూడా వరించింది. భవిష్యత్తులో మరిన్ని భవనాలు నిర్మించి, మరింతమంది పిల్లల్ని చేరదీయాలని ఆమె ఆలోచన. సింధు సొంత కూతురు కూడా ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తుండటం విశేషం. అనాథల అమ్మగా పేరొందిన సింధు జీవితంపై మరాఠీలో ‘మీ సింధుతాయి సప్కాల్’ పేరుతో ఓ సినిమా కూడా తీశారు. దానికి జాతీయ అవార్డు వచ్చింది. ఇంతమంది అనాథల్ని ఆదుకునే శక్తిని తనకు ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది సింధు.