నీరజ్ చోప్రా సహచరుడిపై పదేళ్ల నిషేధం!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపియన్ శివపాల్ సింగ్ పదేళ్ల నిషేధం ఎదుర్కోనున్నాడు. డోపింగ్కు పాల్పడినట్లు రుజువు కావడంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) క్రమశిక్షణ ప్యానెల్ అతనిపై పదేళ్లు నిషేధం విధించింది. దీంతో 31 ఏళ్ల శివపాల్ సింగ్ కెరీర్ ప్రమాదంలో పడింది.విషయంలోకి వెళితే.. శివపాల్ సింగ్ నుంచి సేకరించిన శాంపిల్స్లో నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ 'మెథాండినోన్' పాజిటివ్గా తేలింది. అతను డోపీగా తేలడం ఇది రెండోసారి. 2021లో డోప్ టెస్టులో పట్టుబడటంతో అతను నాలుగేళ్ల నిషేధానికి గురయ్యాడు. ఆ నిర్ణయాన్ని శివ్పాల్ సింగ్ నాడా అప్పీల్ ప్యానెల్ ముందు సవాల్ చేశాడు. తన వాదనతో అప్పీల్ ప్యానెల్ ఏకీభవించి నాలుగేళ్ల నిషేధాన్ని సంవత్సరానికి తగ్గించింది. 2023లో అతను తిరిగి పోటీల్లో పాల్గొన్నాడు. 2023 జూన్లో భువనేశ్వర్లో జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర ఛాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకొని, గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించాడు.శివ్పాల్ సింగ్ 2019 ఆసియా చాంపియన్షిప్లో రజతం సాధించాడు. తాజాగా రెండోసారి కూడా డోపింగ్కు పాల్పడంతో నాడా అతనిపై కఠిన చర్యలు చేపట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాతో కలిసి శివపాల్ సింగ్ పాల్గొన్నాడు.చదవండి: ‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’