ఆడపిల్లను.. చంపేస్తున్నారు!
విజయవాడ : ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంట లక్ష్మీదేవి పుట్టిందని.. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీకళ ఉట్టిపడుతుందని పెద్దలు చెబుతారు. నేడు ఆ పరిస్థితులు మారిపోతున్నాయి. ఆడపిల్ల అంటే బతకనిచ్చే పరిస్థితులే కనిపించడం లేదు. కొందరు పేగుబంధాన్ని తెంచుకుని చెత్తకుప్పల పాలు చేస్తుంటే.. మరికొందరు గర్భంలో ఉండగానే చిదిమేస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆడపిల్ల పుట్టి ప్రపంచాన్ని చూడటమే గగనంగా మారుతోంది. జిల్లాలో ఆరేళ్లలోపు బాలిబాలికల నిష్పత్తి కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రతి వెయ్యి మంది బాలురకు 935 మంది బాలికలు ఉండటం గమనార్హం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సేవ్ గర్ల్ చైల్డ్ అంటూ ఎంత ప్రచారం నిర్వహించినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.
ఇటీవల వెలుగుచూసిన దారుణాలివీ...
నెల రోజుల కిందట వేకున జామున వర్షపు జల్లులు కురుస్తున్న వేళ విజయవాడ రాణీగారితోటలో ఓ కన్నతల్లి పేగుబంధాన్ని తెంచుకుని తన బిడ్డను చెత్తకుప్పలో వేసింది. ఆ శిశువు ఏడుపు విన్న పారిశుధ్య కార్మికులు అక్కడికి చేరుకొని ఆ బిడ్డను కాపాడారు. అనంతరం శిశువును చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి రెండు రోజుల చికిత్స అనంతరం శిశు భవన్కు తరలించారు. ఆ బిడ్డ ఆడపిల్ల.
►పది రోజుల కిందట గూడూరు మండలానికి చెందిన దుర్గాదేవికి ఆమె భర్త, అత్తింటి వారు ఆరో నెల గర్భంతో ఉండగా గర్భనిర్ధారణ పరీక్షలు చేయించారు. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలియడంతో గర్భస్రావం చేయించారు. ఈ ఘటనలో దుర్గాదేవికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా, భ్రూణహత్య చేసిన విషయం వెల్లడైంది.
►తాజాగా బుధవారం వేకువ జామున రెండు గంటలకు కడుపు నొప్పి వస్తోందంటూ ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్సా విభాగానికి వచ్చిన దుర్గ (30) అనే మహిళ టాయిలెట్కు వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ప్రసవించడంతో పాటు, పుట్టిన బిడ్డను కమోట్లో కుక్కి, ఎవరికీ తెలియకుండా అదృశ్యమైంది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో టాయిలెట్ బ్లాక్ అయిందని శానిటరీ సిబ్బంది చూడగా, లోపలి నుంచి శిశువు రావడంతో కంగుతిన్నారు.
గత నెల రోజుల కాలంలోనే జిల్లాలో మూడు వరుస దారుణాలు చోటుచేసుకోవడం చూస్తుంటే.. వెలుగు చూడని ఘటనలు ఇంకెన్నో అని జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విషయంలో అధికారులు అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో ఆడపిల్ల పుట్టడమే కష్టతరంగా మారే పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేయడంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దృష్టిపెట్టాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మరోసారి ఈ తరహా దారుణాలకు ఆస్కారం లేకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఆడపిల్లల్ని పుట్టిన వెంటనే చంపేసినట్లు నిర్ధారణ అయితే అందుకు కారణం తెలుసుకుని చర్యలు తీసుకుంటాం. భ్రూణ హత్యలను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.
- డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి