breaking news
Sheshanna
-
శేషన్నపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీంకు సుదీర్ఘకాలం కుడిభుజంగా మెలిగిన ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్నపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. శేషన్నపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో 11 కేసులు ఉన్నాయి. 2004లో అచ్చంపేటలో వి.రాములు, 2005లో మహబూబ్నగర్లో ప్రభుత్వ టీచర్ కనకాచారి, అదే ఏడాది అక్కడే చెంచు గోవిందు, 2011లో పహాడీషరీఫ్లో శ్రీధర్రెడ్డి, బొగ్గులకుంటలో పటోళ్ల గోవర్థన్రెడ్డి, 2013లో అచ్చంపేటలో మాజీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, 2014లో నల్లగొండలో మాజీ నక్సలైట్ కొనాపురి రాములు హత్య కేసులతోపాటు పలు బెదిరింపుల కేసులు శేషన్నపై ఉన్నాయి. 2016లో నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల నగరంలో బెదిరింపుల దందా చేయడానికి వచ్చిన శేషన్నను గోల్కొండ పోలీసులు సెప్టెంబర్ 27న అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి వద్ద నాటుతుపాకీ, తూటాలు లభించాయి. హుమాయున్నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్లాకు ఇతడు గతంలో తుపాకీ సరఫరా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. శేషన్నపై ఆంధ్రప్రదేశ్లోనూ అనేక కేసులు ఉన్నాయి. ఇతడి నేరచరిత్రను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
కాసేపట్లో రిమాండ్ కు నయీం అనుచరుడు శేషన్న
-
పోలీసుల అదుపులో నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న
-
నయీం కుడి భుజం శేషన్న జాడేది..?
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఎన్కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల గుట్టు వీడాలంటే శేషన్న దొరకాల్సిందే.. శేషన్న పట్టుకునే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సైతం ఘోరంగా విఫలమైంది. నయీం హతమై నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నయీం యాక్షన్ టీమ్ ఇన్చార్జ్ ఆచూకీ లభించలేదంటే సిట్ పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. అతడు చిక్కలేదా..? పోలీసులు పట్టుకోవట్లేదా..? అన్న విషయం స్పష్టం కావట్లేదు. మరోపక్క నయీం రాసిన డైరీల ఆచూకీ లభించకపోవడంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఆ టీమ్ అత్యంత కీలకం.. షాద్నగర్ శివార్లలోని మిలీనియం టౌన్షిప్లో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. ఇది జరిగిన నాటి నుంచి అతడి కేసుల్ని దర్యాప్తు చేసిన, చేస్తున్న పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు చేశారు. కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే అతడి అనుచరుల్ని పట్టుకున్నారు. వీరంతా అప్పటివరకు తెరచాటుగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారు. భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు, ల్యాండ్ సెటిల్మెంట్లలో కీలకపాత్ర పోషించడంతో పాటు నయీం ఆస్తులకు బినామీలుగా, ఆస్తిపత్రాలు, నగదు తదితరాలను దాచే డెన్లకు కేర్ టేకర్స్గా పని చేశారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీం కనుసన్నల్లో పనిచేసేది. వీరి పేర్లు, వ్యవహారాలు గతంలో అనేక సార్లు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులు, పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన, ఎక్కని వారితో కూడిన ఈ టీమ్ నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో యాక్టివ్గా పనిచేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. ఆయుధాల గుట్టు వీడేనా? ఈ యాక్షన్ టీమ్ సాధారణ సమయంలో ఎవరి కంటపడేది కాదు. నయీం ఆదేశాల మేరకు నిర్దేశిత సమయంలో రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్కు వెళ్లిపోవడం వీరి పని. ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్ సిద్ధంగా ఉండేది. నయీంకు చెందిన యాక్షన్ టీమ్ చేసిన ఏ నేరమైనా.. మేమే చేశామంటూ తమ మీద వేసుకునే ఈ టీమ్ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోతుండేవారు. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీమ్కు చెందిన వారు కేవలం కుట్రదారులుగానే నమోదయ్యారు. అంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీమ్ నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నయీం వద్ద, అతడి డెన్లలోనూ దొరికిన భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయం నయీంతో పాటు యాక్షన్ టీమ్కు నేతృత్వం వహించిన శేషన్నకు మాత్రమే తెలిసే అవకాశముంది. గాలించినా ఫలితం శూన్యం.. కేవలం ఆయుధాల సమాచారమే కాదు.. నయీం వ్యవహారంలో అనేక చిక్కుముడుల్ని విప్పగలిగేది శేషన్న మాత్రమే. నయీం ‘వారసత్వాన్ని’కొనసాగించే ప్రయత్నం ఆ యాక్షన్ టీమ్ చేయవచ్చని తొలినాళ్లలో పోలీసులు అనుమానించారు. నయీంకు చెందిన యాక్షన్ టీమ్లో ఏడుగురున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే మహబూబ్నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపి.. పటోళ్ల గోవవర్ధన్రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్ననే అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు వర్గాలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించాయి. ఓ దశలో శేషన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడనే వార్తలు వచ్చినా.. ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ గాలింపు మొదలై ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావస్తున్నా శేషన్న పోలీసులకు దొరకలేదు. గ్యాంగ్స్టర్నే పట్టుకున్న పోలీసులు అతడి కుడిభుజాన్ని పట్టుకోలేకపోవడం సిట్ పనితీరుపై సందేహాలకు తావిస్తోంది. డైరీలెన్ని? అవెక్కడ? సుదీర్ఘ కాలం మావోయిస్టులతో కలసి పనిచేసిన నయీంకు డైరీ రాసే అలవాటుంది. నయీం 2010 వరకు రాసిన డైరీలను సొహ్రబుద్దీన్ కేసు భయంతో తగలపెట్టాడని గతంలో చిక్కిన అతడి అనుచరుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎన్కౌంటర్ జరిగే వరకు ప్రతి అంకాన్నీ నయీం తన డైరీల్లో రాసుకున్నాడు. ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశాడు? ఆయా దందాల్లో ఎంత డబ్బు వచ్చింది? దాన్ని ఎవరెవరికి పంచాడు? ప్రధాన అనుచరులెవరు.. ఇలా ఎన్నో అంశాలు డైరీల్లో రాసినట్లు సమాచారం. ఎన్కౌంటర్ తర్వాత షాద్నగర్తో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న డెన్ల నుంచి పోలీసులు డైరీలు స్వాధీనం చేసుకున్నారనీ వార్తలు వెలువడ్డాయి. అయితే అవెన్ని? ఎక్కడున్నాయి? వాటిలో ఏముంది.. అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. -
నయీం ఆత్మ.. శేషన్న ఇతనే!
హైదరాబాద్: నేరసామ్రాజ్యానికి నయీం రాజైతే.. సైన్యాధికారి శేషన్న! టార్గెట్ ను ఎంచుకోవడం మొదలు, రెక్కీలు నిర్వహించడం, స్కెచ్ వేయడం, దాన్ని పక్కాగా అమలుచేయడం.. ఇవన్నీ నయీం గ్యాంగ్ లో నంబర్ 2గా కొనసాగిన శేషన్న పనులు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన శేషన్న.. గ్యాంగ్ లీడర్ గా మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్నాళ్లు ఎలా ఉంటాడో ప్రపంచానికి తెలియని శేషన్న ఫొటో శనివారం మీడియాకు లభించింది. ఎన్ కౌంటర్ తర్వాత నయీం స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా రంగంలోకి దిగిన సిట్..ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నయీం అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. కాగా, నయీంకు 'ఆత్మ' లాంటివాడైన శేషన్న దొరికితే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని పోలీసుల భావన. అంతే కాకుండా బెదిరింపులు, కబ్జాల ద్వారా నయీం వసూలు చేసిన భారీ మొత్తంలోని డబ్బును డంప్ ల రూపంలో దాచి ఉండొచ్చని, ఆ డంప్ లు ఎక్కడెక్కడున్నాయో శేషన్నకు కచ్చితంగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనాసరే శేషన్నను పట్టుకోవాలనుకుంటున్న సిట్ కావాలనే అతని ఫొటోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎవరీ శేషన్న? మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శేషన్న గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు. బయటికి వచ్చీరాగానే.. అప్పటికే దందాలు నడుపుతోన్న నయీం పంచన చేరాడు. క్రమక్రమంగా గ్యాంగ్ లో నంబర్ 2గా ఎదిగాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూరు, అచ్చంపేట, కల్వకుర్తి,షాద్నగర్ తోపాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తదితర ప్రాంతాలు శేషన్న ఆధిపత్యంలో ఉండేవి. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు నయీం తరఫున డీల్స్ చేసింది శేషన్నేనని అరెస్టయిన అనుచరులు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు మహబూబ్నగర్ జిల్లాల్లో ముగ్గురు ప్రజాసంఘాల నేతల హత్యల్లో శేషన్న సూత్రధారిగా ఉన్నాడు. మాజీ మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి, తిరిగి వారిని నయీం గ్యాంగ్ లో చేర్చుకోవడంలో శేషన్నదే కీలకపాత్ర. నయీంను ఎవరెవరు కలిశారు? అతని ముఠాతో ఎవరెవరికి సంబంధాలున్నాయనే పూర్తి ఆధారాలు శేషన్న దగ్గరే ఉన్నాయని అనుచరుల ద్వారా తెలిసిన సమాచారం. అందుకే ఈ కేసులో శేషన్న అరెస్టు లేదా లొంగుబాటు కీలకంగా మారింది. -
నయీం 'ఆత్మ' ఎలా ఉంటాడో తెలుసా?