breaking news
shanbu singh
-
వచ్చారు..వెళ్లారు
ఒంగోలు కలెక్టరేట్, చీరాల, పర్చూరు, ఇంకొల్లు, న్యూస్లైన్: జిల్లాను గత నెలలో కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పంటలన్నీ దెబ్బతిన్నాయి. మనుషుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. వరద ఉధృతిలో పశువులు కొట్టుకుపోయాయి. వందల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. భారీ వర్షాలకు ఆదుకోవలసిన జిల్లా మంత్రి మహీధరరెడ్డి మొహం చాటేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. 26 రోజుల తరువాత బుధవారం జిల్లాలో అడుగుపెట్టిన కేంద్ర బృందంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ దానిలో కొంత కుదించారు. చివరకు కొన్నిరకాల పంటలను చూసి బాగున్నాయంటూ బృంద సభ్యులు కామెంట్ చేశారు. కేంద్ర బృందం తీరును చూసిన రైతులు, అధికారులు విస్మయానికి గురయ్యారు. చీరాల మండలం బూర్లవారిపాలెంలో మొదలైన పర్యటన ఒంగోలులో అధికారులతో నిర్వహించిన సమీక్షతో ముగిసింది. కేంద్ర ఆంతరంగిక సంయుక్త కార్యదర్శి శంభుసింగ్ నేతృత్వంలో ఆర్పీ సింగ్, ఎం రమేష్కుమార్లు బృందం చీరాల, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు ప్రాంతాల్లో పర్యటించింది. చీరాల మండలం బూర్లవారిపాలెం సాయినగర్ కాలనీలో బండి ఓబులేసు అనే చేనేత కార్మికుడి ఇంటిని సందర్శించింది. మగ్గం గుంటలో నీరు నిలిచి ఉండటాన్ని గమనించింది. ఆ కార్మికుడి పేరు రాసుకొని అక్కడ నుంచి నిష్ర్కమించింది. వాస్తవానికి చీరాలలోని తోటవారిపాలెం చేనేతకాలనీ, మార్కండేయ కాలనీల్లో చేనేత గుంటల్లో నీరు నిలిచిపోయాయి. వాటివైపు బృందం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తరువాత చీరాల - కారంచేడు రోడ్డులో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించింది. భారీ వర్షాలకు చీరాల తరచుగా ముంపునకు గురికావడానికి కారణమైన రొంపేరు డ్రైనేజీని సందర్శించింది. కాలువ నుంచి సముద్రంలోకి వరద నీరు వెళ్లాల్సి ఉండగా, సముద్రం నుంచి పోటు వచ్చి ముంపునకు దారితీస్తోందని స్థానికులు కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. వారు చెప్పిందంతా విని అక్కడ నుంచి బృందం కారంచేడు బాట పట్టింది. కారంచేడులో భారీ వర్షాలకు వరి పూర్తిగా దెబ్బతింది. దాంతో రైతులు తిరిగి నాట్లు వేసుకున్నారు. దానిని చూసిన శంభుసింగ్ ‘విత్తే దశలో ఉందికదా.. మళ్లీ నాట్లు వేసుకోవచ్చు కదా’ అని ఉచిత సలహా ఇవ్వడంతో పక్కనే ఉన్న అధికారులు, రైతులు విస్తుపోయారు. కారంచేడులోని కొమ్మమూరు కాలువ గండ్లను కేంద్ర బృందం పరిశీలించింది. అక్కడ నుంచి పర్చూరు మండలంలో పర్యటించింది. పోతుకట్ల వద్ద చెరువుకు పడిన గండ్లు పరిశీలించింది. తిమ్మరాజుపాలెంలో భారీ వర్షాలకు పత్తి దెబ్బతినడంతో రైతులు వాటిని తీసివేశారు. కొన్ని మొక్కలు అలాగే ఉంచేశారు. అవి పచ్చగా ఉండటంతో పత్తి పచ్చగా బాగుంది కదా అని మరోమారు వ్యాఖ్యానించారు. అక్కడ నుంచి ఇంకొల్లు మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. కోతకు గురైన వాగు, వంకాయలపాడులో మిర్చి పొలాలను పరిశీలించింది. అనంతరం ఒంగోలుకు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం చెరువుకట్టను సందర్శించి , నేరుగా ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకొంది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించింది. సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పవర్ పాయింట్ ప్రజంటేషన్లో నష్టం వివరాలను తెలుసుకుంది. బలరాం కాలనీవైపు కన్నెత్తి చూడలేదు ఒంగోలులో భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే కాలనీల్లో బలరాం కాలనీ ముందు వరుసలో ఉంటుంది. ఆ కాలనీని కేంద్ర బృందం సందర్శిస్తుందని షెడ్యూల్లో ప్రకటించారు. బృందం వస్తుండటంతో కార్పొరేషన్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్డుపక్కన బ్లీచింగ్ చల్లించారు. ముంపునకు కారణమయ్యే పోతురాజు కాలువ బ్రిడ్జి వద్ద చిన్న బ్యానర్ కట్టారు. కొంతమంది అధికారులతోపాటు మీడియా కూడా బృందం కోసం ఎదురు చూసింది. అయితే కేంద్ర బృందం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
కంటి తుడుపే
ఒంగోలు కలెక్టరేట్, పర్చూరు, న్యూస్లైన్: గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. నెలరోజుల సగటు వర్షం నాలుగు రోజుల్లోనే నమోదైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. పొలాలు చెరువులయ్యాయి. రోడ్లు వాగులుగా మారాయి. కాలనీలు మునిగిపోయాయి. తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. రూ 850 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. విపత్తు జరిగిన 26 రోజుల తరువాత ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నష్టం అంచనాల కోసం జిల్లాలో నేడు కాలుమోపనుంది. అది కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు పర్యటించి తిరిగి హైదరాబాద్ వెళ్లనుంది. భారీ వర్షాల వల్ల అపార నష్టం జరిగినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించలేదు. నష్టం జరిగిన తరువాత కేంద్ర బృందం తీరికగా జిల్లాకు రావడంపై ప్రజలతోపాటు జిల్లా యంత్రాంగం కూడా పెదవి విరుస్తోంది. కాలువలు, కల్వర్టులకే బృందం పరిమితం కానుంది. వందల కోట్ల నష్టం.. అక్టోబర్లో 206.5 మిల్లీమీటర్ల సగటు వర్షానికిగాను ఆ నెల 22 నుంచి 25వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు 246.9 మిల్లీమీటర్లు నమోదైంది. మూడు మండలాల్లో 400పైగా, 13 మండలాల్లో 300-400, 20 మండలాల్లో 200-300, మరో 20 మండలాల్లో 200 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖకు రూ 120 కోట్లకు పైగా నష్టం జరిగింది. ఉద్యాన, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమ శాఖలకు సంబంధించి దాదాపు రూ 7 కోట్ల మేర నష్టం జరిగింది. ఆర్అండ్బీ రోడ్లకు రూ 290 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు రూ 250 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు రూ 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. మేజర్ ఇరిగేషన్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించి దాదాపు రూ 14 కోట్లు, ప్రాజెక్టులకు సంబంధించి రూ 20 కోట్ల వరకు నష్టం జరిగింది. మైనర్ ఇరిగేషన్కు సంబంధించి రూ 30 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఒంగోలు నగరంతోపాటు మిగిలిన మునిసిపాలిటీల్లో రూ 90 కోట్లకు పైగా నష్టం జరిగింది. భారీ వర్షాలు 350కి పైగా గ్రామాలపై ప్రభావం చూపాయి. 650కి పైగా ఇళ్లు పూర్తిగా, 700కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మత్స్యకారులు, చేనేత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని గంటలు, కొన్ని ప్రాంతాలు... శంభూసింగ్, ఆర్పీసింగ్, కృష్ణప్రసాద్లతో కూడిన ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం జిల్లాలో కొన్ని గంటలు మాత్రమే పర్యటించనుంది. అదికూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కానుంది. కేంద్ర బృందం పర్యటించనున్న ప్రాంతాల్లో కారంచేడు, స్వర్ణ గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో పంటలన్నీ తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు తిరిగి సాగు చేపట్టారు. పొగాకు పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. పొగాకు పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి పొగనారు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి ఏం తేలుస్తుందో వారికే తెలియాలి. భారీ వర్షాల కారణంగా నష్టం జరిగిన మొదటి మూడు నాలుగు రోజుల్లో పర్యటిస్తే ఎంత నష్టం జరిగిందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. 26 రోజుల తరువాత వస్తే నష్టం ఆనవాళ్లు కూడా కనిపించవు. కేంద్ర బృందం పర్యటించే ప్రాంతాల్లో పంటలకంటే కల్వర్టులు, కాల్వలనే ఎక్కువగా పెట్టారు. కనీసం వాటిని చూసైనా నష్టం అంచనా తెలుసుకుంటారేమో! గత బీభత్సాలకు పరిహారమేదీ.. గతంలో లైలా, జల్ వంటి తుపాన్లు జిల్లాను వణికించాయి. అప్పుడు కూడా అపార నష్టం సంభవించింది. కేంద్ర బృందాలు వచ్చి వెళ్లడం తప్పితే పూర్తి స్థాయిలో పరిహారం అందించిన దాఖలాల్లేవు. శాఖల వారీగా కొన్నింటికి మాత్రం పరిహారం అందించి ప్రభుత్వం సరిపెట్టుకొంది. దాంతో నష్టం ఏ మేరకు అందించాలన్న వివరాలు లేవు. తాజాగా రానున్న కేంద్ర బృందం కూడా గతంలో మాదిరిగానే రావడం, చూడటం, వెళ్లడం వరకే పరిమితం కానున్నట్లు వారి పర్యటన షెడ్యూల్ను చూస్తే స్పష్టమవుతోంది. జిల్లాలో జరిగిన భారీ వర్షాల నష్టంపై యంత్రాంగం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. కనీసం దానిని చూసైనా కేంద్ర బృందం స్పందిస్తుందో లేక మొక్కుబడి పర్యటనతో ముగిస్తుందో వేచి చూడాలి. కొమ్మమూరు కాలువపై 60 చోట్ల గండ్లు.. కొమ్మమూరు కాలువపై జిల్లాలో సుమారు 60 చోట్ల గండ్లు పడ్డాయి. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోని 29 చోట్ల గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల రైతులే స్వచ్ఛందంగా గండ్లు పూడ్చుకుంటున్నారు. గండ్లకు పూర్తిగా మరమ్మతులు చేస్తేనే కొమ్మమూరు కాలువలకు సక్రమంగా నీటి సరఫరా అవుతుంది. వెంటనే గండ్లు పూడ్చాల్సి ఉంది. తడిసిన పత్తిని, వరిని కొనుగోలు చేయాలి... వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తిపైరు చాలాచోట్ల పీకేశారు. వేరే పైరు సాగుచేయలేని రైతులు పత్తిపైరును అలానే ఉంచారు. తడిసిన కాయల నుంచి తీసిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానాతంటాలు పడాల్సి ఉంటుంది. తడిసిన పత్తిని నిబంధనలు పక్కనపెట్టి సీసీఐ, నాఫెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించాలి. తడిసిన పత్తిని క్వింటా రూ 4 వేలు, నాణ్యమైన పత్తిని క్వింటా రూ 6వేలకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంది. ఇదే విధంగా వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో పంటనష్టం కేంద్ర బృందానికి వివరిస్తాం: జేడీఏ దొరసాని భారీవర్షాల కారణంగా జిల్లాకు జరిగిన పంట నష్టాన్ని కేంద్రబృందానికి విన్నవించనున్నట్లు వ్యవసాయశాఖ జిల్లా జేడీఏ ఎస్.దొరసాని పేర్కొన్నారు. కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్చూరు వచ్చిన ఆమె మంగళవారం స్థానిక ఏడీఏ కార్యాలయంలో విలేకరుతో మాట్లాడారు. కేంద్ర బృందం బుధవారం పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. వర్షాలకు దెబ్బతిన్న పైర్లను పరిశీలిస్తారని చెప్పారు. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో పత్తిపైర్లను, కారంచేడు మండలం కుంకలమర్రులో వరిపైరును, ఇంకొల్లు మండలం వంకాయలపాడులో మిర్చిపైరును పరిశీలిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో పంటనష్టం వివరాలు సేకరించామని ప్రస్తుతం ఆన్లైన్లో ఉంచుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ కూడా 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులు పాసుపుస్తకాల జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాల నంబర్లు వెంటనే సంబంధిత వీఆర్వోలకు అందజేయాలని కోరారు. కేంద్ర బృందం నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం ఒంగోల్లో ఫొటోఎగ్జిబిషన్, పవర్పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా కేంద్ర బృందానికి నష్టానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వివరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో దెబ్బతిన్న పత్తిపైరును పీకివేసి ప్రస్తుతం దాని స్థానంలో పొగాకు, శనగ సాగుచేస్తున్నట్లు తెలిపారు. రాయితీ శనగలు త్వరలోనే అందజేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆమె వెంట ఏడీఏలు జి.రత్నప్రసాద్, సీహెచ్ గణేష్బాబు, ఏవో బీ. గౌతమ్ప్రసన్న ఉన్నారు. -
19, 20 తేదీల్లో కేంద్ర బృందం పర్యటన
శ్రీకాకుళంకలెక్టరేట్,న్యూస్లైన్: పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, ప్రభుత్వ ఆస్తులను పరిశీలించేందుకు.. నష్టాలను అంచనా వేసేందు కు ఈ నెల 19, 20 తేదీల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శంభుసింగ్ నేతృత్వంలో హోం, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ కమిషన్, రోడ్స్ అండ్ హైవేస్, వాట ర్సప్లై, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఆర్.పి.సింగ్, వి.కె.భట్ల, కె.రాంవర్మ, ఎ.చంద్రశేఖర్, ఎ.కృష్ణప్రసాద్, పి.జి.ఎస్.రావులతో కూడిన ఈ బృం దం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఇదీ షెడ్యూల్ 19వ తేదీ: మధ్యాహ్నం 3 గంటలకు రణస్థలం మండలం బంటుపల్లిలో దెబ్బతిన్న చెరువులు, కాలువలు, రోడ్లను పరిశీలిస్తుంది. 3.30 గంటలకు లావేరు మండలం ఆదపాక, బుడుమూరుల్లో జరిగిన పంట నష్టం, చెరువులకు పడిన గండ్లు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తుంది. అనంతరం బుడుమూరు ఎస్సీ కాలనీని సందర్శిస్తుంది. 4.10 గంటలకు పొందూరు మండలం లోలుగులోని కుమ్మరి గుంట చెరువు, ఇరిగేషన్ కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం ఎచ్చెర్ల టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. అనంతరం ఫరీద్పేట వద్ద నాగావళి కుడి కాలువ గట్టుకు పడిన గండిని పరిశీలించి ఆక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. రాత్రికి శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తుంది. 20వ తేదీ: ఉదయం 10.30 గంటలకు సోంపేట మండలం ఇస్కలపాలెంలో పర్యటిస్తుంది. అనంతరం కవిటి మండలం రాజపురం ప్రాంతంలో కొబ్బరి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. తర్వాత పలాస మండలం సున్నాదేవి గ్రామంలో పర్యటిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు పలాస నుంచి బయలుదేరి కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, బోరుభద్ర మీదుగా పోలాకి మండలం డీఎల్ పురం, సుసరాం వరకు వరి పంటకు జరిగిన నష్టాన్ని, వంశధార కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం నరసన్నపేట మండలం కోమర్తిలో అరటి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎచ్చెర్ల మండలం ముద్దాడకు వెళ్లి అక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. అనంతరం కేంద్ర బృందం విశాఖపట్నం వెళుతుంది.