-
నాట్య దీపిక.. దీపికారెడ్డి
నవరసాలను పలికించే కళ్లు. చూపు తిప్పుకోనివ్వని ఆహార్యం. అకుంఠిత దీక్ష... నిరంతర సాధన. అంతకు మించిన అంకితభావం. యాభై ఏళ్ల కిందట కట్టిన మువ్వలు నేటికీ లయబద్ధంగా రవళిస్తూనే ఉన్నాయి. కూచిపూడి నాట్యానికి... ఆమె చేయాల్సింది ఏదో మిగిలి ఉన్నట్లుంది. నటరాజు మరింతగా సేవ కోరుకుంటున్నాడు. సంగీత నాటక అకాడమీ బాధ్యతనిచ్చాడు. కూచిపూడి నాట్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన దీపికారెడ్డి పౌరాణిక కథాంశాలకే పరిమితం కాకుండా ఆధునిక సామాజికాంశాలకు రూపకల్పన చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్’గా నియమితురాలైన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘నాట్యం అనేది అద్భుతమైన కళ. ఈ భారతీయ కళను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలి. మనం ఎన్ని ప్రదర్శనలిచ్చాం అని లెక్కపెట్టుకోవడం కాదు, మనం ఎంతమంది కళాకారులను తయారు చేశామనేది ముఖ్యం. కళాకారులు నటరాజుకు సమర్పించే నమస్సుమాంజలి కళను విస్తరింపచేయడం ద్వారానే’ అన్నారు. ‘నాట్యం, సంగీతం వంటి కళలన్నీ నగరాల్లో కేంద్రీకృతమైపోతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పిల్లలకు సరిగ్గా అందడం లేదు. ఈ కొత్త బాధ్యత ద్వారా ఈ కళలను జిల్లాల వారీగా ప్రణాళికలు వేసుకుని గ్రామాలకు చేరుస్తానని’ చెప్పారామె. కళ ఇచ్చిన మధుర జ్ఞాపకాలు! ‘‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశాననే మాట నిజమే. కానీ ఈ కళ నాకు ఇచ్చిన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో. ఖజురహో డాన్స్ ఫెస్టివల్స్లో నా పెర్ఫార్మెన్స్ చూసిన ఒక క్రిటిక్ మా అమ్మానాన్న దగ్గరకు వచ్చి ‘మీకు సరస్వతీదేవి పుట్టింది’ అన్నారు. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ ఆయనకు మనసులోనే ప్రణమిల్లుతుంటాను. మరొకటి... ఢిల్లీలో నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ద్రౌపది పాత్ర అభినయించాను. ఆ మరుసటి రోజు ఆడియెన్స్ గ్యాలరీకి వెళ్తున్నప్పుడు... ముందు రోజు నా ప్రోగ్రామ్ చూసిన వాళ్లు గుర్తు పట్టి ఎక్సైట్మెంట్తో ‘ద్రౌపదిరెడ్డీ... ద్రౌపది రెడ్డీ’ అని గట్టిగా పిలిచారు. వీటన్నింటినీ మించిన జ్ఞాపకం సెర్బియాలో జరిగింది. సెర్బియా– టర్కీ టూర్లో బెల్గ్రేడ్లో ప్రదర్శన, విపరీతమైన చలి. నాట్యం చేసేటప్పుడు పాదరక్షలేవీ ఉండవు కదా. నాట్యం ఎలాగో చేసేశాను. కానీ ఫెలిసిటేషన్ సమయంలో పాదాలు నేల మీద ఆన్చలేకపోయాను. ఒక పాదం నేల మీద ఉంటే మరో పాదం నేలను తాకకుండా పాదాలను మార్చుకుంటూ ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి తన కోటు తీసి నేల మీద పరిచి ఆ కోటు మీద నిలబడమన్నాడు. ఇవన్నీ ఈ నాట్యం ఇచ్చిన మధురానుభూతులే కదా! ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారైతే ‘రుక్మిణి– కృష్ణ’ ప్రదర్శన చూసి ‘దిస్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ డ్రామా ఐ హావ్ సీన్’ అంటూ ‘న్యత్యభారతి’ అని ప్రశంసించారు. అంతకంటే ఇంకేం కావాలి. నేను అందుకున్న అవార్డులు ఇచ్చిన సంతోషానికి మించిన ఆనందక్షణాలివి. ఎస్పీబీగారు మెసేజ్లు పెట్టరు. మాట్లాడి వాయిస్ రికార్డు పంపిస్తారు. అలా నాకు పంపిన వాయిస్ రికార్డులన్నీ దాచుకున్నాను. నాట్యమే ఊపిరి నాకు హాబీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నాట్యం చేయడం, కొత్త ప్రయోగాల గురించి ఆలోచించడం, నాట్యం గురించి మాట్లాడడం... ఇష్టం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఏ మధ్య రాత్రిలోనో ఓ కొత్త ఐడియా వస్తుంది. అప్పుడే ఆ ఐడియాను పేపర్ మీద రాసుకుని, నాట్యం చేస్తూ ఫోన్లో రికార్డు చేసుకోవడం, ఉదయానికంతా కొత్త రూపకాన్ని సిద్ధం చేయడం నాకలవాటు. కోవిడ్ సందర్భంగా రూపకం, ప్రకృతి సంరక్షణ కోసం ప్రకృతి రక్షతి రక్షితః, శాంతి జీవనం, రితు సంహార, తెలంగాణ వైభవం, వైద్యో నారాయణో హరి... వంటివన్నీ అలా రూపొందినవే. ఆరోగ్యం పెట్టిన పరీక్ష మహిళలకు అందరికీ మల్టీ టాస్కింగ్ వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఇల్లు, పిల్లలను ఒకవైపు తన వృత్తి ప్రవృత్తులను మరో వైపు బాలెన్స్ చేసుకోవడంలో సక్సెస్ అవుతాం. కానీ తల్లిగా నేను బిడ్డ దగ్గర ఉండాల్సిన క్షణాల్లో ఉండలేకపోయానే అనే గిల్ట్ పారిస్ టూర్ సమయంలో ఎదురైంది. నిజానికి ఆ టూర్ రెండు రకాలుగా పరీక్ష పెట్టింది. బయలుదేరే సమయానికి పాపకు జ్వరం. అలాగే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇరవై ప్రదర్శనలిచ్చాం. ఒకరోజు నాకు నాలుగు నూట నాలుగు జ్వరం. మందులు వేసుకున్నా కూడా కంట్రోల్ కాలేదు. మేకప్ వేసుకుంటుంటే చేతులు వణుకుతున్నాయి. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. నిలబడితే కాళ్లు వణుకుతున్నాయి. ఆర్గనైజర్స్ మొత్తం సిద్ధం చేశాక ‘నాకు జ్వరం, డాన్స్ చేయలేను’ అనడానికి మనసొప్పుకోలేదు. ఆర్కెస్ట్రా వాళ్లతో ‘ఒకవేళ నేను కళ్లు తిరిగిపడిపోతే వెంటనే లైట్లు ఆఫ్ చేయండి’ అని చెప్పి నాట్యం మొదలుపెట్టాను. పళ్లెం మీద నాట్యం అది. ఆ నటరాజే నాతో చేయించాడని నమ్ముతాను ఇప్పటికీ’’ అంటూ కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకున్నారు దీపికారెడ్డి. అమ్మమ్మ తాతయ్యల పెంపకం దీపికారెడ్డి తాత నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. తండ్రి వీఆర్ రెడ్డి న్యాయవిద్యలో సంస్కరణలు తెచ్చిన విద్యావేత్త, అడిషనల్ సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు ఆర్థిక బాధలు లేవు. కానీ, పేదరికం తెచ్చే కష్టాలు తెలుసన్నారామె. ‘‘వరంగల్లో తాతగారింట్లో పెరగడం వల్ల పేదవాళ్లకు ఆయన చేసిన సహాయాన్ని స్వయంగా చూశాను. నాట్య సాధన కోసం కొంతకాలం మా గురువుగారు వెంపటి చినసత్యం గారింట్లో ఉన్నాను. వాళ్లు నన్ను చాలా బాగా చూసు కున్నారు. అక్కడ నాట్యంతోపాటు చక్కటి డిసిప్లిన్ కూడా అలవడింది. నేలమీద పడుకోవడం, బావిలో నీరు తోడటం అలవాటయ్యాయి. తాత గాంధేయవాది. మమ్మల్ని అధికారిక వాహనాల్లో తిరగనివ్వలేదు. మా ప్రయాణం సైకిల్ రిక్షా, సిటీ బస్సులోనే. అమ్మమ్మ, తాత, గురువుగారు... ఈ ముగ్గురి స్ఫూర్తితో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నా శిష్యులకూ అదే నేర్పాను. నాట్యం నేర్చుకోవడానికి ఫీజు కట్టలేని అమ్మాయిలకు ఫ్రీగా నేర్పిస్తున్నాను. దేశం నలుమూలలా ప్రదర్శనలిచ్చాను, అలాగే విదేశాల్లోనూ. నా శిష్యులు కూడా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, డాన్స్ స్కూళ్లు నడుపుతూ కళాకారులను తీర్చి దిద్దుతున్నాను. కళ ఎంతగొప్పదంటే కళాకారులు గురువును మర్చిపోరు. గురుపూర్ణిమ రోజు వచ్చిన మెసేజ్లకు రిప్లయ్ ఇవ్వడానికి సమయం సరిపోలేదు. ప్రదర్శన ఉన్న రోజుల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వేడుకలకు వెళ్లలేకపోయేదాన్ని. నాట్యం కారణంగా దూరమైన సంతోషాలకంటే నాట్యం కారణంగా అందిన సంతోషాలే ఎక్కువ’’ అన్నారామె. నటరాజు కొలువైన ఆలయం జూబ్లీ హిల్స్లో ఉన్న ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ లో అడుగుపెట్టగానే దీపికారెడ్డి యాభై ఏళ్ల నాట్యప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారమైనట్లు ఉంటుంది. ఆమె గురువు వెంపటి చినసత్యం ఫొటో, 1976లో రంగప్రవేశం చేసినప్పటి ఫొటోతో మొదలు జ్ఞానపీఠ సినారె, ఇద్దరు రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధాని, ఐదుగురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, స్పీకర్లు, రాష్ట్రమంత్రుల చేతుల మీదుగా అందుకున్న పురస్కారాల చిత్రాలు కొలువుదీరి ఉన్నాయి. నాట్యం చేస్తున్న పరమశివుడి విగ్రహం నిత్యపూజలందుకుంటోంది. ఆమె శిష్యులు నేడు రవీంద్రభారతిలో ఇవ్వా ల్సిన ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. అమ్మానాన్నల సంతోషం! అత్యంత సంతోషకరమైన క్షణాలలో మొదటగా చెప్పాల్సింది సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకోవడమే. రాష్ట్రపతి భవన్లో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నప్పుడు మా అమ్మానాన్న కళ్లలో సంతోషం చూశాను. అమ్మానాన్నలు అంతగా సంతోషపడిన ఆ సందర్భమే నాకు మరపురాని క్షణం. ఇక ఎప్పుడూ సంతోషపడే విషయం ఏమిటంటే భర్త, పిల్లలు నాకు ప్రోత్సాహమిస్తూ సపోర్టుగా ఉండడం. తల్లిదండ్రులకు నేను చెప్పేదొక్కటే. పిల్లలకు సంగీతం, నాట్యం... ఏదో ఒక కళను సాధన చేయించండి. అది జ్ఞాపకశక్తిని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సాధనతో ఏకాగ్రత అలవడుతుంది. ఏ రంగంలో అయినా చక్కగా రాణించగలుగుతారు. నా స్టూడెంట్స్ అందరూ ర్యాంక్ హోల్డర్సే. అలాగే కళ కోసం చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. – దీపికారెడ్డి, చైర్పర్సన్, సంగీత నాటక అకాడమీ, తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : గడిగె బాలస్వామి -
ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ భరత నాట్యం కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ లీలా శాంసన్పై సీబీఐ కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలతో ఆమెతోపాటు అప్పటి అధికారులపై సీబీఐ అవినీతి, క్రిమినల్, కుట్ర కేసులు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్ కూతంబలం ఆడిటోరియం పునరుద్ధరణ సమయంలో అవినీతి జరిగిందనేది ప్రధాన అభియోగం. లీలా శాంసన్ హయాంలో రూ.7.02 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెన్ టెండర్ విధానాన్ని అనుసరించకుండా కాంట్రాక్టర్లకు నామినేషన్ ప్రాతిపదికన ఎక్కువ రేటుకు కాంట్రాక్టు పనులు అప్పగించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక కమిటీ అధికారిక అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు జరిగాయని తెలిపింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో 2017 లో సంబంధిత మంత్రిత్వ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సెన్సార్ బోర్డు చైర్పర్సన్గా కూడా పనిచేసిన లీలా శాంసన్తో పాటు అప్పటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ మూర్తి, అకౌంట్స్ ఆఫీసర్ రామచంద్రన్, ఇంజనీరింగ్ ఆఫీసర్ వీ శ్రీనివాసన్, కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ (కార్డ్) సంస్థ యజమాని, చెన్నై ఇంజనీర్లపై కేసు నమోదైంది. పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును జనరల్ ఫైనాన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫౌండేషన్ అధికారులు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ కార్డ్కు ప్రదానం చేశారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనవసర ఖర్చులతో పాటు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ విషయాన్ని చాలా ఏళ్లుగా దాచి పెట్టారని ఆరోపించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. కాగా 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను కళాక్షేత్ర డైరెక్టర్గా నియమించింది. తరువాత ఆగస్టు 2010లో సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్గా ఎంపికయ్యారు. ఆ తరువాత ఏప్రిల్ 2011లో బాలీవుడ్ సహా దేశీయ సినిమాలను సెన్సార్ చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు ఛైర్మన్గా లీలా శాంసన్ నియమితులయ్యారు. మరోవైపు లీలా శాంసన్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా భావిస్తారు. ప్రియాంకగాంధీకి కొన్నేళ్లపాటు భరతనాట్యం నేర్పించినట్టుగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ పాలనలో పదేళ్లపాటు ఆరు కీలక పదవులను కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. దీంతో లీలా శాంసనపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు జరిపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. -
తెలుగు కళాకారులకు అవార్డులు
రాధేశ్యామ్, దుర్గాప్రసాద్లకు ‘సంగీత నాటక’ పురస్కారాలు న్యూఢిల్లీ/కూచిపూడి/విజయనగరం టౌన్: సంగీత నాటక అకాడమీ అందించే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఇద్దరు తెలుగు వారు ఎంపికయ్యారు. 2014 ఏడాదికి సంబంధించి సంగీతం, నాట్యం, నాటకం తదితర రంగాల్లో మొత్తం 36 మందిని ఎంపిక చేయగా.. వీరిలో తెలుగువారైన కూచిపూడి నాట్యకళాకారుడు వేదాంతం రాధేశ్యామ్, వయొలిన్ విద్వాంసుడు ద్వారం దుర్గాప్రసాద్ రావు ఉన్నారు. వీరిని కూచిపూడి, వయొలిన్ విభాగాల్లో ఎంపిక చేశారు. విజేతల వివరాలను శుక్రవారం ఢిల్లీలో అకాడమీ కార్యదర్శి హెలెన్ ఆచార్య వెల్లడించారు. విజేతలకు రూ. లక్ష చొప్పున నగదు, తామ్రపత్రాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. అయితే, అవార్డు ప్రదాన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కాగా, అకాడమీ ఫెలోషిప్లకు 40 మంది కళాకారులను ఎంపిక చేశారు. రాధేశ్యామ్ కళాప్రతిభ... రాధేశ్యామ్కు సంగీత నాటక అవార్డు ప్రకటించడంతో ఆయన స్వగ్రామమైన ఏపీలోని కృష్ణాజిల్లా కూచిపూడి వాసులు సంబరాలు చేసుకున్నారు. రాధేశ్యామ్.. సత్యనారాయణ, సత్యవతమ్మలకు 1954లో జన్మించారు. ఐదో ఏట నుంచే అన్నగారైన సీతారామశాస్త్రి, పినతండ్రి పార్వతీశం వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. సత్యభామగా, గొల్లభామగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో మైసూర్లోని అవధూత దత్తపీఠం ఆస్థాన విద్వాంసుడిగా నియమితులయ్యారు. కూచిపూడిలోని శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు. దుర్గాప్రసాద్ ప్రస్థానం... ద్వారం దుర్గాప్రసాద్ రావు కుటుంబమంతా సంగీతానికే అంకితమైంది. తండ్రి నరసింగరావు సంగీత కళాశాల అధ్యక్షులుగా పనిచేశారు. ఆకాశవాణి నిర్వహించిన అఖిల భారత సంగీత సమ్మేళనంలో దుర్గాప్రసాద్ చిన్నతనంలోనే విజేతగా నిలిచి నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా అవార్డు అందుకున్నారు. విజయనగరం సంగీత కళాశాలలో అధ్యక్షులుగా పనిచేసి పదవీ విర మణ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement