breaking news
safe travel
-
ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
న్యూఢిల్లీ: సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టంచేశారు. మూడు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్కోయిల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇండియన్ రైల్వే ఒక గ్యారంటీగా మారాలన్నదే తమ ధ్యేయమని, అది నేరవేరేదాకా తమ కృషి ఆగదని స్పష్టంచేశారు. భారత రైల్వే శాఖ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం తమ ప్రభుత్వ అంకితభావానికి ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దార్శనికతకు ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఒక బలమైన మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు గుర్తుచేశారు. మన రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నామని, హై–టెక్ సేవలతో అనుసంధానిస్తున్నామని వివరించారు. దక్షిణాది అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన ఆశయ సాధనకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన ప్రగతి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాదిన నిపుణులకు, వనరులకు, అవకాశాలకు కొదవ లేదని చెప్పారు. సౌత్ ఇండియా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో రైళ్ల సంఖ్యను పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రెట్లు పెంచామని వివరించారు. రైల్వే ట్రాకులు మెరుగుపరుస్తున్నామని, విద్యుదీకరణ వేగం పుంజుకుందని, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, ప్రయాణికులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. -
ఆటోడ్రైవర్లకు వీఐటీ గుర్తింపు కార్డులు
వేలూరు, న్యూస్లైన్: విద్యార్థులు క్షేమ ప్రయాణం కోసం వీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 835 మంది ఆటోడ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆటోడ్రైవర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. విశ్వనాథన్ మాట్లాడుతూ ఇండియాలో ఉన్న నెంబర్ వన్ యూనివర్సిటీల్లో వీఐటీ ఒక్కటని, యూనివర్సిటీ నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక పథకాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల వీఐటికీ కొత్తగా వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. అలాగే యూనివ ర్సిటీకి వచ్చే ఉద్యోగులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు సైతం ఎక్కువగా ఆటోలోనే వస్తుంటారన్నారు. వీరి క్షేమ ప్రయాణం కోసమే ఆటోలు నడిపే 835 మంది డ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ గుర్తింపు కార్డులో డ్రైవర్ పేరు, చిరునామా, సెల్ నెంబర్ వివరాలు ఉంటాయన్నారు. దీనివల్ల యూని వర్సిటీకి వచ్చి వెళ్లే వారి బ్యాగులు పోయినా తిరిగి వాటిని పొందేందుకు ఎంతగానో వీలుగా ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి ఈ గుర్తింపు కార్డులున్న ఆటోలను మాత్రమే యూనివర్సిటీలోనికి అనుమతిస్తామన్నారు. వీఐటీ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఇకపై వీఐటీ సిబ్బంది ఒకరిని బస్టాండ్ లేక కాట్పాడి రైల్యేస్టేషన్ వరకు తోడుగా పంపుతామని, సొంత గ్రామాలనుంచి యూనివర్శిటీకి వచ్చే సమయంలో కూడా రైల్యేస్టేషన్ వరకు తోడుగా ఒకరిని పంపుతామన్నారు.వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్, జీవీ సెల్వం, కాట్పాడి ఆర్టీవో కణి, ఇన్స్పెక్టర్ మహేంద్రన్, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.