breaking news
Ryan Lochte
-
అప్పుడు అబద్ధం.. ఇప్పుడు ఓటమి.. కన్నీళ్లతో గుడ్బై!
తప్పులు.. చేసిన పాపాలు దాగవు. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలూ సాగవు. ఏదో ఒక నాటికి శిక్ష అనుభవించాల్సిందే. అమెరికన్ స్విమ్మర్ ర్యాన్ లోక్టి విషయంలో ఇదే జరిగింది. ఒలింపిక్స్లో పన్నెండు మెడల్స్.. 27 ప్రపంచ ఛాంపియన్షిష్ టోర్నీలో గెలిచిన ఘనత ఈయనది. కానీ, వరుస విజయాల ట్రాక్ నుంచి పక్కకు తప్పి.. అబద్ధం, తప్పులు, అవమానాల మీదుగా సాగి చివరికి ఓటమితో ఈ దిగ్గజం కెరీర్ ముగింపు దశకు చేరింది. ర్యాన్ స్టీవెన్ లోక్టి.. అమెరికన్ స్విమ్మర్. ఒకప్పుడు ఛాంపియన్, స్విమ్మింగ్ హీరో. కానీ, తనను తానే పాతాళానికి తొక్కేసుకున్నాడు. తాజాగా టోక్యో ఒలంపిక్స్ కోసం జరిగిన 200 మీటర్ల క్వాలిఫైయింగ్ పోటీల్లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా ఒలంపిక్స్ అర్హతను కోల్పోయాడాయన(తొలి ఇద్దరికి మాత్రమే అవకాశం). ఈ ఓటమి తర్వాత లోక్టి మీడియా ముందుకొచ్చాడు. ఐదు నిమిషాలపాటు ఏకబిగిన కన్నీళ్లు పెట్టుకుని.. మౌనంగా కుటుంబ సభ్యులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న మరో దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్.. లోక్టిని అడ్డుకుని హత్తుకుని సాగనంపాడు. ఇక లోక్టి ఒలింపిక్స్ కెరీర్ ఇక ముగిసినట్లేనని యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ ప్రకటించింది. అయితే ఆయన ఇక మీదట ఏ పోటీల్లోనూ కనిపించకపోవచ్చని అతని గర్ల్ఫ్రెండ్ కయ్లా ప్రకటించింది. తప్పతాగి.. అబద్ధం 2004 ఒలింపిక్స్ ట్రయల్స్లో మైకేల్ ఫెల్ప్స్ తర్వాతి ప్లేస్లో నిలిచి.. ఏథెన్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో ర్యాన్ లోక్టి పేరు మారుమోగింది. అప్పటి నుంచే ఫెల్ప్స్తో లోక్టి మధ్య ప్రొఫెషనల్ శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాత మెడల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ విజయాలతో నడుమ లోక్టి కెరీర్ దిగ్విజయంగా సాగింది. ఈత కొట్టే టైంలో ‘యే’ అంటూ అతను అరిచే అరుపు అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే 2016 రియో ఒలింపిక్స్ టైంలో జరిగిన ఘటన అతని ప్రతిష్టను దారుణంగా తొక్కొపడేసింది. తోటి ప్లేయర్లతో తప్పతాగి ఓ గ్యాస్ స్టేషన్కు వెళ్లిన లోక్టి.. అక్కడి సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఆ స్టేషన్ బయట మూత్రం పోసి, అక్కడి బాత్రూంని ధ్వంసం చేశాడు. ఆ తర్వాతి ఉదయం తుపాకులతో వచ్చిన దుండగులు కొందరు తమను బెదిరించి.. దోపిడీకి పాల్పడ్డారని అబద్ధం చెప్పాడు. దీంతో లోక్టి మీద అందరికీ సానుభూతి మొదలైంది. అయితే ఆటగాళ్ల భద్రత గురించి పలు దేశాలు ఒలింపిక్స్ నిర్వాహకులను ప్రశ్నించాయి. దీంతో కొన్నాళ్లపాటు నిర్వాహకులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తీవ్ర ఎత్తున విమర్శలు రావడంతో అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టగా.. చివరికి లోచ్టె చెప్పిందంతా అబద్ధం అని తేలింది. వరుస నిషేధాలు రియో ఘటనలో సెక్యూరిటీ గార్డులకు డబ్బులిచ్చి ఈ వ్యవహారాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు లోక్టిపై వచ్చాయి. ఈ నేరం రుజువు కావడంతో అతని నుంచి పరువు నష్టం దావా కింద భారీ ఫైన్ రాబట్టింది ఒలింపిక్స్ కమిటీ. అంతేకాదు యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ 10 నెలల నిషేధం విధించింది. ఇక ఈ వివాదం చల్లారకముందే 2018లో మోతాదుకు మించి డ్రగ్స్ ఉపయోగించాడని ఆంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్ధారించగా.. ఆ కేసులో 14 నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. ఈ వివాదాలన్నింటి తర్వాత రిహాబ్ సెంటర్లో కొన్నాళ్లపాటు గడిపిన లోక్టి.. ఇంకొన్నాళ్లు కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తిరిగి కిందటి ఏడాది మళ్లీ స్విమ్మింగ్ ట్రాక్లోకి దిగినప్పటికీ.. మునుపటిలా ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యువ స్విమ్మర్ల మధ్య పోటీలో ఓడిపోయి.. ఆ అవమానాన్ని దిగమింగుకోలేక భావోద్వేగపు పశ్చాత్తాపంతో కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు ఒకప్పటి స్విమ్మింగ్ ఛాంపియన్. -
స్విమ్మర్ లోక్టేపై సస్పెన్షన్ వేటు!
న్యూయార్క్: రియో ఒలింపిక్స్ సందర్భంగా తనతో పాటు కొంతమంది అమెరికా స్విమ్మర్లు దోపిడీకి గురయ్యామంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన ర్యాన్ లోక్టేపై పది నెలల నిషేధం పడింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ నిషేధం వచ్చే సంవత్సరం మధ్య వరకూ కొనసాగనున్నట్లు యూఎస్ పత్రిక పేర్కొంది. అయితే ఈ ఉదంతంలో ఇరుక్కున మరో ముగ్గురు స్విమ్మర్లపై నాలుగు నిషేధం మాత్రమే విధిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్ కమిటీ(యూఎస్ఓసీ) నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఈ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన లోక్టే.. ఆ మెగా ఈవెంట్ సందర్భంగా తనతో పాటు, ముగ్గురు సహచర స్మిమ్మర్లు ఓ రాత్రి కారులో వెళుతున్నప్పుడు కొంతమంది దుండగులు అడ్డగించి తమ వద్దనున్న కొన్ని విలువైన వస్తువులు దోచుకెళ్లారంటూ ఆరోపించాడు. దీనిపై సీరియస్గా స్పందించిన బ్రెజిల్ అధికారులు విచారణ చేపట్టగా, లోక్టే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు రుజువైంది. లోక్టే చేసిన ఆరోపణల్ని కట్టుకథగా నిరూపించడంతో అతను భారీ జారీమానా చెల్లించుకోవాల్సివచ్చింది..దాంతో పాటు పలు వాణిజ్య సంస్థలు లోక్టేతో స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. -
స్విమ్మర్ లోక్టేపై కేసు నమోదు
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ సందర్భంగా కొంతమంది దొంగలు కత్తులతో బెదిరించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారంటూ తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన అమెరికా స్టార్ స్విమ్మర్ ర్యాన్ లోక్టేపై కేసు నమోదయ్యింది. తాజాగా లోక్టేపై బ్రెజిల్ పోలీసులు కేసు నమోదు చేయడంతో అతనికి జైలు శిక్ష పడే అవకాశం కనబడుతోంది. గతవారం రియో ఒలింపిక్స్లో తనతో పాటు మరో ఇద్దరు స్విమ్మర్లు ఒక అర్ధరాత్రి పార్టీ వెళుతుండగా కొంతమంది దొంగలు బెదిరించి తమ వద్ద నగదును దొంగిలించారంటూ లోక్టే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు లోక్టే ఇచ్చిన ఫిర్యాదు నమ్మకశక్యంగా లేదని తేల్చారు. లోక్టేతో పాటు ఉన్న మిగతా ఇద్దరు స్విమ్మర్లు కూడా ఎటువంటి దొంగల బారిన పడలేదని రియో పోలీస్ చీఫ్ ఫెర్నాండో వెలాసో స్పష్టం చేశారు. ఆ దీనికి సంబంధించిన తుది నివేదికను కోర్టు ముందుంచారు. ఒకవేళ లోక్టే తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు కోర్టు భావిస్తే అతనికి సమన్లు జారీ చేయడంతో పాటు ఒకటి నుంచి ఆరు నెలల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని సదరు పోలీస్ అధికారి పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్లో 4x 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో లోక్టే స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. గతవారం స్విమ్మర్లు జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లతో కలిసి ట్యాక్సీలో సెంట్రల్ రియోలో పార్టీకి వెళుతున్నప్పుడు దొంగల బారిన పడినట్లు పేర్కొన్నాడు. అయితే దీనిపై బ్రెజిల్ అధికారులు సీరియస్గా దృష్టి సారించడంతో అది కాస్తా తప్పుడు ఫిర్యాదు అని తేలింది. స్విమ్మర్లు జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లు అమెరికాకు బయల్దేరిన క్రమంలో వారిని విమానం నుంచి దింపి మరీ పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లోక్టే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. దీనిపై బ్రెజిల్ అధికారులను క్షమాపణలు కూడా కోరాడు. తాను మోసపూరితమైన ఫిర్యాదు చేసినట్లు లోక్టే తెలిపాడు.