breaking news
rural road development
-
రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్
సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. రూ.5,026 కోట్లతో పనులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి. కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ ప్రదీప్, ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు. -
గ్రామీణ రహదారులకు త్వరలో మోక్షం
సాక్షి, గుంటూరు: జిల్లాలో గ్రామీణ రహదారులకు త్వరలో మోక్షం కలగనుంది. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలు మినహాయించి జిల్లాలో మిగిలిన 15 నియోజకవర్గాల పరిధిలో 171 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) ఫేజ్-2 కింద జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడింది. గత మూడేళ్ల నుంచి కేంద్రం గ్రామీణ రహదారుల నిర్మాణానికి పీఎంజీఎస్వై నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రహదారులు మొత్తం పాడయ్యాయి. కొన్ని రూపు రేఖలు మారిపోయాయి. గతంలో పీఎంజీఎస్వై కింద శివారు గ్రామాలను కలిపే విధంగా 7.5 కిలోమీటర్ల వరకు లింకు రోడ్లు నిర్మించారు. ఈ దఫా పీహెచ్సీలు, స్కూల్స్, మార్కె టింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిం చారు. జిల్లాలో 16 రోడ్లను రూ.99.58 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఇ. సి.సూర్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘సమర సాక్షి’ శీర్షికన జిల్లాలోని రహదారుల దుస్థితిపై ‘ప్రయాణానికి దారేదీ!?’ అంటూ కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ‘సాక్షి’ ఈ కథనాన్ని పంచాయతీ రాజ్ ఎస్.ఇ. సూర్యనారాయణ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన త్వరలో గ్రామీణ రహదారులకు మోక్షం కలగనున్నట్లు వివరించారు. ఇటీవల ఢిల్లీలో పీఎంజీఎస్వై నిధుల కేటాయింపుపై సాధికారత కమిటీ (ఎంపవర్డ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీవీఎస్ రామ్మూర్తి హాజరయ్యారు. రాష్ట్రానికి పీఎంజీఎస్వై ఫేజ్-2 కింద నిధులు విడుదల చేయనున్నట్లు సాధికారత కమిటీ పేర్కొంది. దీనిలో భాగంగా జిల్లాకు రూ.99.58 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉందని, త్వరలో జీవో విడుదల కానుందని ఎస్ఈ తెలిపారు.