breaking news
Rural Progress
-
పోటాపోటీగా ‘పల్లె ప్రగతి’!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అభివృద్ధి అంశంలో పల్లెల మధ్య పోటీ నెలకొంది. కొత్తగా పనుల గుర్తింపు, అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లతో తమ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గాలే కాకుండా ప్రజలు పోటీ పడుతున్నారు. అధికారులు సైతం పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సంబంధిత అధికారులు, ఉద్యోగులను హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు పల్లె ప్రగతిలో చేపడుతున్న పనుల పురోగతి, పారిశుద్ధ్యం, పంచాయతీ కార్యాలయాల తనిఖీలు, గ్రామసభల నిర్వహణ, విద్యుత్ బిల్లుల వసూళ్లపై క్షేత్రస్థాయి నుంచి ప్రగతి నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఉత్తమ, చెత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను గుర్తించి సంబంధిత అధికారులకు నివేదిస్తోంది. మూడో విడత పల్లె ప్రగతిలో పనుల పురోగతిని సమీక్షించిన ప్రభుత్వం పారిశుద్ధ్యం, పచ్చదనం–పల్లె ప్రకృతి వనాలు, పన్ను వసూళ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల అంశాలపై ఉత్తమ జిల్లాల జాబితాను గత నెలలో వెల్లడించింది. ఇదే సమయాన పెద్దగా పురోగతి లేని ఐదు జిల్లాల వివరాలను ప్రకటించారు. దీంతో నాలుగో విడతలోనూ ‘ఉత్తమ’ జాబితాలో స్థానం పొందేలా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. మరోవైపు చేపడుతున్న పనులతో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నాలుగో విడత. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జూలై ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన అధికారులు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులను గుర్తించి వాటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని విడతల్లో కలిపి 51,076 గ్రామ సభలు జరిగాయి. కాగా, మూడో విడతలో జరిగిన పనులను ఆరు అంశాల్లో పరిశీలించిన ప్రభుత్వం... ఉత్తమమైన, పనుల్లో పురోగతిలో లేని ఐదేసి చొప్పున జిల్లాలను ఎంపిక చేసి వెల్లడించింది. పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఏళ్లుగా తీరని ప్రధాన సమస్యలు పల్లె ప్రగతితో పరిష్కారమవుతూ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లె ప్రగతిలో భద్రాద్రి జిల్లా నాలుగు విభాగాల్లో రాష్ట్రంలోనే టాప్ ఐదు స్థానాల్లో నిలిచింది. – రమాకాంత్, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
పల్లెప్రగతితో జీవనోపాధి
* 37.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యం * రూ. 642 కోట్లతో ‘సెర్ప్’ తాజా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతు కుటుంబాల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ప్రణాళికను సిద్ధం చేసింది. వచ్చే ఐదేళ్లలో 10,621 గ్రామాల్లోని 37.50 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జీవనోపాధికి ప్రాధాన్యత కల్పించింది. మొత్తం పల్లెప్రగతి ప్రాజెక్ట్ వ్యయం రూ.642 కోట్లు కాగా, జీవనోపాధి కార్యక్రమాలకే రూ.264 కోట్లు కేటాయించింది. వివిధ రకాల పంటలు పండించే రైతులతోనే ఉత్పత్తిదారుల సంస్థ(ప్రొడ్యూసర్స్ గ్రూప్)లను ఏర్పాటు చేసి, వారి ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఉత్పత్తులకు మెరుగైన ధర పొందేలా సెర్ప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం చేయనుంది. 165 ఉత్పత్తిదారుల సంస్థల్లో 2.55 లక్షల మందిని భాగస్వాములు చేయనుంది. మానవాభివృద్ధి మెరుగుదలకు: జీవనోపాధి కల్పనతో పాటు మానవాభివృద్ధి మెరుగుదల కోసం పల్లెప్రగతి కార్యక్రమం కింద పలు చర్యలు చేపట్టనున్నారు. ఆరోగ్యం, పౌష్టికాహార భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం నాణ్యమైన విద్యను అందించడం ఇందులో ముఖ్యమైనవి. 2.50 లక్షల కుటుంబాలు మెరుగైన మానవాభివృద్ధిని అనుభవించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కమ్యూనిటీ పర్యవేక్షణ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో అన్ని రకాల సేవలను అందించేందుకు డిజిటల్ కనెక్టివిటీతో సమగ్ర సేవా కేంద్రాలను స్థాపించి, ఉపాధిహామీ, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ ఉపకార వేతనాలు.. తదితర చెల్లింపులన్నీ ఈ కేంద్రాల నుంచే పొందే వీలు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ-గవర్నెన్స్, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఒకేచోట లభించేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.