breaking news
RTC strike retire
-
దశ తిరిగింది!
రైట్.. రైట్ ముగిసిన ఆర్టీసీ సమ్మె 43 శాతం ఫిట్మెంట్కు ప్రభుత్వ అంగీకారం రోడ్డెక్కిన బస్సులు ఊపిరి పీల్చుకున్న ప్రజలు కర్నూలు (రాజ్విహార్) : కార్మిక శక్తి మరోసారి పైచేయి సాధించింది. శ్రమకు తగిన వేతనం రాబట్టుకునేందుకు ప్రభుత్వం, యాజమాన్యంపై సాగించిన పోరులో విజయం వరించింది. రోడ్డు రవాణా సంస్థలో కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గింది. సుదీర్ఘ చర్చల అనంతరం 43 శాతం ఫిట్మెంట్కు అంగీకారం తెలపడంతో సమ్మెకు తెరపడింది. కార్మికులు, ఉద్యోగులు సంబరాలు చేసుకోగా.. బస్సులు రోడ్డెక్కడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియర్ నేతలు గత నెలలో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం పీఆర్సీ ఇవ్వాలని.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి 2013 ఏప్రిల్ 1 నుంచి వేతన బకాయి చెల్లించాలని.. సంస్థ పరిరక్షణ దృష్ట్యా డీజిల్పై పన్నులో రాయితీ ఇవ్వడంతో పాటు బడ్జెట్లో నిధులు కేటాయించాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈనెల 6 నుంచి చేపట్టిన సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్తో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. జిల్లాలోని మొత్తం 11 డిపోల్లో 4,800 మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో ఆఫీసర్ స్థాయి అధికారులు 48 మంది. వీరు తప్ప 4,752 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రైవేట్ అభ్యర్థులను వినియోగించుకొని అనధికారికంగా కొన్ని బస్సులను తిప్పినా ఫలితం లేకపోయింది. అయితే ఎనిమిది రోజుల పాటు కొనసాగిన సమ్మె బుధవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వం దిగిరావడంతో కార్మికులు విధులకు హాజరయ్యారు. రూ.6కోట్లకు పైగా నష్టం జిల్లాలోని 11 డిపోల్లో 970 బస్సులు ఉండగా.. 371 రూట్లలో 4లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తున్నాయి. రోజు ఆదాయం రూ.1.10 కోట్లు ఉంటోంది. సమ్మె కారణంగా మొదటి రోజు 970 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. మొత్తంగా సమ్మె కారణంగా సంస్థ రూ.6కోట్లకు పైగా ఆదాయం కోల్పోయినట్లు రీజినల్ మేనేజరు పి.కృష్ణమోహన్ తెలిపారు. -
ఆగిన సమ్మె కదిలిన చక్రం
విధులకు హాజరైన ఉద్యోగులు డిపోల ఎదుట విజయోత్సవాలు జిల్లాలో రూ.కోటీ 84లక్షల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ విజయనగరం అర్బన్: ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కాయి. వేతన ఫిట్మెంట్ డిమాండ్తో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. 43 శాతం ఫిట్మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను విరమించి బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు. అంతకు ముందు డిపోల వద్ద కార్మికులు సంబ రాలు చేసుకున్నారు. ఈ నెల 5వతేదీ అర్థరాత్రి ప్రారంభమైన సమ్మె ఎనిమిది రోజుల పాటు కొనసాగింది. సమ్మెవల్ల ప్రయాణికులు ఇక్కట్లకు గురికాగా, ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయింది. ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుని లాభపడ్డారు. నెక్ పరిధిలో రూ.4.6 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోగా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో రూ కోటీ 84 లక్షల ఆదాయానికి గండిపడింది. జిల్లాలో డిపోల వారీగా విజయనగరంలో రూ.50 లక్షలు, సాలూరు రూ.35 లక్షలు, పార్వతీపురం రూ.64 లక్షలు, ఎస్.కోట డిపో పరిధిలో రూ.35లక్షల ఆదాయానికి గండిపడింది. సమ్మెకాలంలో ప్రత్యామ్నాయం పేరుతో ప్రభుత్వం చేపట్టని చర్యల వల్ల సంస్థకుగాని, ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రయోజనం లభించలేదనే చెప్పాలి. ఎనిమిది రోజుల ఆదాయాల లెక్కలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నెక్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి సాధారణంగా రోజుకు సరాసరిగా రూ.85 లక్షల ఆదాయం వచ్చేది. ఈ లెక్కన ఎనిమిది రోజులకు నెక్ రీజియన్ (తొమ్మిది డిపోల) నుంచి రూ.6.4 కోట్ల రావాల్సి ఉంది. కాని కేవలం రూ.1.8 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్టు సమాచారం. అంటే దాదాపుగా రూ.నాలుగు కోట్ల 60 లక్షల మేర ఆదాయానికి గండి పడింది. నెక్ రీజియన్ పరిధిలో తిరిగిన 507 బస్సులలో 267 బస్సుల వరకు అద్దెబస్సులే ఉన్నాయి. అద్దెబస్సుల వసూళ్లన్నీ వారికే వర్తిస్తాయి, సంస్థకు పైసా కూడా చెల్లించక్కలేదు. దీంతో సంస్థ భారీస్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. ఈ విజయం ఆర్టీసీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని కార్మికులు అభిప్రాయపడ్డారు. స్థానిక డిపో ప్రధాన గేటు వద్ద బుధవారం సాయంత్రం వారు సంబరాలు జరుపుకొన్నారు. కార్మిక ఐక్యతే గెలిచింది వేతన ఫిట్మెంట్ ప్రధాన డిమాండ్గా పెట్టుకొని చేపట్టిన సమ్మె విజయానికి కారణం కార్మిక ఐక్యతే. అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడితే కార్మిక సంక్షేమంతోపాటు సంస్థను కాపాడుకోవచ్చు. -కె.రాజ్కుమార్, ఎన్ఎంయూ నేత ఇది కార్మికుల విజయం సంస్థలోని కార్మిక, ఉద్యోగులంతా ఐక్యంగా ఏకతాటిగా నిలబడడం వల్లే సమ్మె విజయవంతమైంది. సమ్మెలో పాల్గొన్న వారందరికీ అభినందనలు. రానున్న రోజుల్లో ఇదే ఐక్యతతో ఉంటే మరిన్ని డిమాండ్లు సాధించుకోవచ్చు. సంస్థ వృద్ధికోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. -పి.భానుమూర్తి, ఎంప్లాయీస్ యూనియన్ నేత