breaking news
Ricky bhuy
-
ఆంధ్ర అదరహో
ఇండోర్: ఇతర సమీకరణాలపై ఆధారపడకుండా ఆంధ్ర క్రికెట్ జట్టు దర్జాగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్తో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో గాదె హనుమ విహారి నాయకత్వంలోని ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జార్ఖండ్ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 9.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (18 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్లు), రికీ భుయ్ (27 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) తొలి బంతి నుంచే జార్ఖండ్ బౌలర్ల భరతం పట్టారు. దాంతో 5.5 ఓవర్లలో తొలి వికెట్కు 82 పరుగులు జోడించాక అశ్విన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విహారి (2 బంతుల్లో 4; ఫోర్), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 15; 2 సిక్స్లు), నరేన్రెడ్డి (7 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, 2 సిక్స్లు) కూడా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా ఆడటంతో ఆంధ్ర లక్ష్యం దిశగా బుల్లెట్ వేగంతో దూసుకుపోయింది. జార్ఖండ్ జట్టులోని భారత బౌలర్లు వరుణ్ ఆరోన్ 2 ఓవర్లలో 30 పరుగులు... షాబాజ్ నదీమ్ 2 ఓవర్లలో 26 పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు జార్ఖండ్ జట్టు 46.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు హరిశంకర్ రెడ్డి (4/30), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (2/30), కార్తీక్ రామన్ (2/38) జార్ఖండ్ పతనాన్ని శాసించారు. ప్రణాళిక ప్రకారం... ఈ మ్యాచ్కు ముందు ఆంధ్ర ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. క్వార్టర్ ఫైనల్ బెర్త్ నేరుగా దక్కాలంటే గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. ఈ నేపథ్యంలో రన్రేట్ మెరుగు పర్చుకోవడానికి ఆంధ్ర జట్టు టాస్ నెగ్గగానే ఛేజింగ్ చేయడానికే మొగ్గు చూపింది. జార్ఖండ్ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్ (19; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జార్ఖండ్ 11 పరుగుల తేడాలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. దాంతో 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జార్ఖండ్ కష్టాల్లో పడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (38; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న దశలో షోయబ్ అతడిని అవుట్ చేయడంతో జార్ఖండ్ కోలుకోలేకపోయింది. అనంతరం మీడియం పేసర్లు హరిశంకర్ రెడ్డి, కార్తీక్ రామన్ విజృంభించడంతో జార్ఖండ్ ఇన్నింగ్స్ 139 పరుగులవద్ద ముగిసింది. లక్ష్యం చిన్నది కావడంతో ఆంధ్ర బ్యాట్స్మెన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. పది ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి రన్రేట్ను మెరుగుపర్చుకున్నారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర, తమిళనాడు, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్ కారణంగా ఆంధ్ర జట్టు (0.73) ‘టాప్’ ర్యాంక్లో నిలిచింది. తమిళనాడు (0.65), జార్ఖండ్ (0.29), మధ్యప్రదేశ్ (–0.46) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి గుజరాత్... గ్రూప్ ‘సి’ నుంచి కర్ణాటక క్వార్టర్ ఫైనల్ చేరాయి. గ్రూప్ ‘డి’ నుంచి ముంబై, ఢిల్లీ... గ్రూప్ ‘ఇ’ నుంచి సౌరాష్ట్ర, చండీగఢ్ క్వార్టర్ ఫైనల్ రేసులో ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్ 198 పంజాబ్తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో మధ్యప్రదేశ్ 105 పరుగుల తేడాతో గెలిచింది. మధ్యప్రదేశ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (146 బంతుల్లో 198; 20 ఫోర్లు, 7 సిక్స్లు) రెండు పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 402 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 42.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (49 బంతుల్లో 104; 8 ఫోర్లు, 9 సిక్స్లు) మెరుపు సెంచరీ చేశాడు. తన్మయ్, తిలక్ వర్మ సెంచరీలు సూరత్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు విజయంతో లీగ్ దశను ముగించినా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. గోవా తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (150; 19 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (128, 9 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరు తొలి వికెట్కు 264 పరుగులు జతచేయడం విశేషం. లిస్ట్–ఎ క్రికెట్లో హైదరాబాద్ తరఫున తొలి వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2002లో గోవాపై అంబటి రాయుడు, వినయ్ కుమార్ తొలి వికెట్కు 196 పరుగులు జతచేశారు. 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 343 పరుగులు సాధించి ఓడిపోయింది. ఓపెనర్ ఏక్నాథ్ కేర్కర్ (169 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్స్లు), స్నేహల్ (112 బంతుల్లో 116; 15 ఫోర్లు) రెండో వికెట్కు 225 పరుగులు జోడించారు. ఏక్నాథ్ చివరిదాకా అజేయంగా ఉన్నా గోవాను గెలిపించలేకపోయాడు. 12 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ‘శత’క్కొట్టిన దేవ్దత్, సమర్థ్ రైల్వేస్తో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో కర్ణాటక 10 వికెట్ల తేడాతో నెగ్గింది. 285 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 40.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. లిస్ట్–ఎ క్రికెట్ లో భారత గడ్డపై ఇదే అత్యధిక ఛేదన. దేవ్దత్ పడిక్కల్ (145 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్స్లు), సమర్థ్ (130 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. అంతకుముందు ప్రథమ్ సింగ్ (129; 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ చేయడం తో రైల్వేస్ 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. ఢిల్లీలో 7 నుంచి నాకౌట్ మ్యాచ్లు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లు ఈనెల 7 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం ఐదు ఎలైట్ గ్రూప్ల్లో ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. చివరిదైన ఎనిమిదో బెర్త్ కోసం ఓవరాల్ ఎలైట్ గ్రూప్ల్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్టు, ప్లేట్ గ్రూప్ విజేత జట్టుతో 7న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు చివరి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఈనెల 8, 9 తేదీల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు... 11న సెమీఫైనల్స్... 14న ఫైనల్ జరుగుతాయి. -
దులీప్ ట్రోఫీకి రికీ భుయ్, అక్షత్
న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్ సీజన్ 2019–20 ఆరంభ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఆడనున్నారు. భారత్ ‘గ్రీన్’ జట్టుకు హైదరాబాదీ బ్యాట్స్మన్ అక్షత్ రెడ్డి... ‘బ్లూ’ జట్టుకు ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ ఎంపికయ్యారు. ఈ రెండు జట్లతో పాటు భారత్ ‘రెడ్’ కూడా పాల్గొనే ఈ టోర్నీ మ్యాచ్లు ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరుగుతాయి. మ్యాచ్ లన్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహిస్తారు. ‘బ్లూ’ జట్టుకు శుబ్మన్ గిల్... ‘గ్రీన్’ జట్టుకు ఫయాజ్ ఫజల్... ‘రెడ్’ జట్టుకు ప్రియాంక్ పాంచల్ నాయకత్వం వహిస్తారు. గత మూడు సీజన్ల పాటు డేనైట్ ఫార్మాట్లో పింక్ బాల్తో జరిగిన ఈ ఫస్ల్క్లాస్ టోర్నీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే జరుగనుంది. రెడ్ బాల్తో డే ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) సాబా కరీమ్ మాట్లాడుతూ ‘చిన్నస్వామి స్టేడియంలో ఫ్లడ్లైట్లున్నప్పటికీ లైవ్ కవరేజ్ లేకే డేనైట్ మ్యాచ్లు ఆడించడం లేదు. అయితే సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు జరిగే ఒక్క ఫైనల్ మ్యాచ్ మాత్రం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది’ అని చెప్పారు. భారత్లో ఇకపై పింక్ బాల్తో డే నైట్ టెస్టులకు దారులు మూసుకుపోయినట్లేనా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘అలా అని ఏం లేదు. అంతా కోరితే మళ్లీ ఆ ఫార్మాట్లోనే మ్యాచ్లు జరగొచ్చు. ఎవరైనా డేనైట్ కావాలని బోర్డును సంప్రదిస్తే భారత్ ‘ఎ’ ఫస్ట్క్లాస్ మ్యాచ్లు పింక్బాల్తో నిర్వహించవచ్చు. కానీ అందరు అదే కోరరు’ అని అన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భారత్ ఆడే మ్యాచ్లన్నీ డే ఫార్మాట్లోనే జరగనున్నాయని అందుకే మళ్లీ దేశవాళీలోనూ ఈ పద్ధతికే మొగ్గుచూపినట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. -
కుమ్మేసిన కిషన్, రికీ భుయ్
మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భారత యువ జట్టు దుమ్మురేపింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (86 బంతుల్లో 138 రిటైర్డ్ అవుట్; 16 ఫోర్లు, 7 సిక్సర్లు), ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ (71 బంతుల్లో 115 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు)లు వీరోచిత సెంచరీలు సాధించడంతో... శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 372 పరుగుల భారీ తేడాతో కెనడాను చిత్తు చేసింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 485 పరుగులు చేసింది. తర్వాత కెనడా 31.1 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. హర్ష్ (25) టాప్ స్కోరర్. కెప్టెన్ అబ్రాష్ ఖాన్ (22)తో సహా అందరూ విఫలమయ్యారు. భారత బౌలింగ్ ధాటికి కెనడా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరేలా కనిపించలేదు. లోమ్రోర్ 3, మావి, అన్సారి చెరో రెండు వికెట్లు తీశారు. -
రికీ భుయ్ సూపర్ సెంచరీ
అండర్-19 చాలెంజర్ టోర్నీ విజేత ఇండియా బ్లూ హైదరాబాద్: ఆంధ్ర యువ క్రికెటర్ రికీ భుయ్ అండర్-19 చాలెంజర్ టోర్నీ ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్తో సెంచరీ చేశాడు. ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన భుయ్ (117 బంతుల్లో 142; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులతో... ఫైనల్లో ఈ జట్టు ఇండియా గ్రీన్పై 25 పరుగులతో గెలిచింది. తొలుత బ్లూ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేయగా... గ్రీన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు మాత్రమే చేసింది. -
ప్రదీప్, రికీ భుయ్ సెంచరీలు
విజయనగరం: కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మూడో రోజే సాధించిన ఆంధ్ర రంజీ జట్టు చివరి రోజును బ్యాటింగ్ ప్రాక్టీస్కు వినియోగించుకుంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ రికీ భుయ్ (321 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏజీ ప్రదీప్ (262 బంతుల్లో 100; 8 ఫోర్లు) సెంచరీలతో సత్తా చాటుకోవడంతో... బరోడాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్నైట్ స్కోరు 328/3తో చివరిరోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆంధ్ర జట్టు 195.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 474 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆంధ్రకు 172 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బరోడా 17 ఓవర్లలో రెండు వికెట్లకు 60 పరుగులు చేసింది. బండారు అయ్యప్పకు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న ఆంధ్రకు మూడు పాయింట్లు రాగా, బరోడాకు ఒక పాయింట్ లభించింది.