‘వయో’ వరం.. అమలైతే సంబరం
ఏలూరు, న్యూస్లైన్ : టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారుల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలవుతుందా.. లేదా అనే అంశంపై ఉద్యోగవర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, క్లాస్-4 ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి 60 ఏళ్ల వరకూ ఉంది. అరయితే, ప్రభుత్వ శాఖల్లోని ఎగువస్థాయి ఉద్యోగులు, గ్రూప్-1 అధికారుల పదవీ విరమణ వయసు మాత్రం 58 ఏళ్లుగానే ఉంది. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంఖ్య 25 వేలకు పైగా ఉన్నారు. వీరిలో పదవీ విరమణ సమీపించిన వారి సంఖ్య 5వేల వరకు ఉంటుందని అంచనా. కొద్దిమాసాల్లో రిటైర్ కానున్న ఉద్యోగులంతా చంద్రబాబు హామీపై గంపెడాశలు పెట్టుకున్నారు.
3 నెలల్లో నలుగురు అధికారుల పదవీ విరమణ
రానున్న మూడు నెలలు కాలంలో నలుగురు జిల్లాస్థాయి అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. జూన్ నెలలో ట్రెజరీ డెప్యూటీ డెరైక్టర్ ఎన్వీకే మోహన్రావు, జూలైలో హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్ జి.సత్యనారాయణ, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, ఆగస్టు నెలాఖరున జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పదవీ విరమణ చేయూల్సి ఉంది. చంద్రబాబు హామీ అమలులోకి వస్తే వారందరికీ మరో రెండేళ్లపాటు ఉద్యోగం చేసే అవకాశం కలుగుతుంది.
నిరుద్యోగుల గుర్రు
చంద్రబాబు హామీపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగాలు దొరక్క నిర్వేదంలో ఉన్న యువత ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచితే.. తమకు జీవితంలో ఉద్యోగాలు రావని ఆవేదన చెందుతున్నారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాల యంలో పేర్లు నమోదు చేయించుకున్న నిరుద్యోగుల సంఖ్య 59 వేలుగా ఉంది. పేర్లు నమోదు చేరుుంచుకోని వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. పోటీ పరీక్షలు కూడా ప్రతి ఏడాది జరగడం లేదు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నా ప్రభుత్వ కొలువులు యువతకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. దీనికి తోడు గ్రూప్-4 (క్లరికల్ గ్రేడ్) పోస్టుల్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇటీవల వీఆర్వో, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం పోటీ పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల వయోపరిమితిని పెంచడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.