breaking news
retail trade
-
జోరుగా చిల్లర దందా....
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో ప్రధానంగా చిల్లర వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. వ్యాపార లావాదేవీల్లో చిల్లర ఎంతో అవసరంగా మారడం తో వ్యాపారస్తులు చిల్లరను కొనుగోలు చేస్తున్నారు. చిల్లర వ్యాపారంలో కిరాణషాపు యజమానులు, భిక్షాటన చేసేవారు ప్రధానంగా ఉన్నారు. కిరాణ షాపు యజమానులు బ్యాంకుల నుంచి చిల్లరను తీసుకొని ఇతర వ్యాపారస్తులకు విక్రయాలు చేస్తున్నారు. రూ. 100 చిల్లరకు రూ. 15 నుంచి రూ. 20 కమీషన్ తీసుకుంటున్నారు. డిమాండ్ను బట్టి ఈ కమీషన్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. మొత్తానికి 15 రూపాయలకుపైబడే కమీషన్ ఉంటుంది. ఇలా చి ల్లరను రూ. 100 చొప్పున మూటకట్టి వ్యాపార సముదాయాలు, హోటళ్లు, టీపాయింట్లు, షో రూంలు, వైన్స్ లు, బెకరీలు, ఇ తర వ్యాపారస్తులకు కమీష న్ పద్ధతి మీద మార్పిడి చేస్తున్నా రు. కేవలం ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నవారు సుమారు 100 మంది వరకు ఉంటా రు. అదే విధంగా పట్టణంలో భిక్షాటన చేసేవారు ఈ చిల్లర దందాను నడిపిస్తారు. వంద రూపాయలకుగాను రూ. 8 కమీషన్ తీసుకొని దుకాణాదారులకు చిల్లర ను అందిస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఈ దందా కొనసాగుతుంది. ఉదయమంతా భిక్షాటన చేసి రాత్రి ఏడు గంటలకు ముందుగానే మాట్లాడుకున్న హోటల్, వ్యాపార సముదాయానికి వెళుతారు. ఆ రోజు వారికి భిక్షాటనలో లభించిన చిల్లరను వ్యాపారులకు ఇచ్చి కమీషన్ తీసుకుంటారు. ఇలా పలువురు వ్యాపారస్తులు కూడా అవసరార్థం భిక్షాటన చేసేవారిని చిల్లర కోసం సంప్రదిస్తారు. ఈ చిల్లర దందా నెలకు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని వ్యాపార వర్గాల వారు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 5,380 వ్యాపార సముదాయాలు రిజిష్టర్ అయి ఉన్నాయి. ఈ చిల్లర మార్పిడి జరుగుతున్న దుకాణాలు 4 వేల వరకు ఉన్నాయి. ప్రతి రోజు 15 రూపాయల లేదా 20 రూపాయల వరకు కమీషన్ తీసుకొని చిల్లర మార్పిడి చేస్తుండడంతో రోజుకు రూ. 60 వేలకు పైగా కమీషన్ దందా కొనసాగుతోంది. ఇలా నెలకు సుమారు రూ. 2 కోట్ల కమీషన్దందానే నడుస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. భలే గిరాకీ.. భిక్షాటన చేసేవారు వ్యాపారస్తులకు అవసరం తీర్చేవారుగా మారారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్, రైల్వేస్టేషన్, దేవాలయాలు, ఇతర ప్రధాన కేంద్రాల వద్ద భిక్షాటన చేసేవారు రోజులో ఒక్కొక్కరు సుమారు రూ. 200 నుంచి రూ. 300 వరకు సంపాదిస్తారు. వీరు సాయంత్రం ఒప్పందం చేసుకున్న వ్యాపారుల వద్దకు వెళ్లి కమీషన్కు చిల్లర నాణేలను అందజేస్తారు.గతంలో వంద రూపాయలకు ఐదు రూపాయల కమీషన్ ఉండేది. వ్యాపారుల డిమాండ్ పెరగడంతో కమీషన్ను ఎనిమిది రూపాయలకు పెంచారు. బ్యాంకుల, యజమానుల ఒప్పందం.. కొందరు కిరాణషాపు యజమానులు, మరి కొందరు చిల్లర దుకాణాదారులు చిల్లరను విక్రయించే బ్యాంకులతోనే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బ్యాంకు వారు కూడా కేవలం వారికే చిల్లరను విక్రయిస్తున్నారు. బ్యాంకు అధికారులు సైతం రూ. 6 చొప్పున కమీషన్ తీసుకొని ఒప్పందం చేసుకున్న వారికే మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి బ్యాంకులో ఎలాంటి కమీషన్ లేకుండానే చిల్లరను అందజేయాల్సి ఉంటుంది. రూ. 100 పైబడి చిల్లరను బ్యాంకు అధికారులు అందిస్తున్నారు. ఈ చిల్లరపై ప్రధానంగా ఎవరు దృష్టి పెట్టకపోవడమే కారణం. -
కొండెక్కిన ధరలు
సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. తత్ఫలితంగా నగరానికి ప్రతిరోజూ కూరగాయాల లోడుతో రావాల్సిన ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో 20 శాతం మేర ధరలు పెరిగిపోయాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతి రోజూ పుణే, నాసిక్ జిల్లాల పరిసరాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇవి ముంబై, ఠాణే, నవీముంబై ప్రాంతాలకు సరఫరా అవుతాయి. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా వర్షాల జాడ మాత్రం లేదు. దీంతో ఈ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఉల్లిపాయలు గృహిణులకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి. వారం క్రితమే కూరగాయల ధరలు పెరిగాయి. దీనికితోడు తాజాగా మరో 20 శాతం మేర పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మొన్నటివరకు ప్రతిరోజూ మార్కెట్కి 300-350 వరకు కూరగాయలు ట్రక్కులు రాగా , ప్రస్తుతం కేవలం 80-100 లోపే వస్తున్నాయి. ఏపీఎంసీలో ఏదైనా కూరగాయ ధర కేజీకి ఐదు రూపాయలు పెరిగితే అవి కొనుగోలుదార్ల చెంతకు వచ్చేసరికి చిన్న వ్యాపారులు ఏకంగా మూడురెట్లు పెంచేస్తున్నారు. కొన్నిచోట్ల టమాటాలు మొన్నటి వరకు కేజీకి రూ.30 చొప్పున లభించాయి. సరుకు కొరత కారణంగా తాజాగా మరో ఐదు రూపాయల మేర వాటి ధర పెరిగింది. దీన్ని బట్టి కేజీకి రూ.35 చొప్పున విక్రయించాలి. అయితే చిన్న చిన్న వ్యాపారులు ఏకంగా రూ.50 విక్రయించి తమ జేబులను నింపుకుంటున్నారు. ఇవే టమాటాలు రెండు వారాలక్రితం టోకు మార్కెట్లో కేజీకి రూ.12 లభించాయి. వారం క్రితం రూ.22 చేరుకున్నాయి. తాజాగా టోకు మార్కెట్లో కిలో రూ.35 పలుకుతోంది. కూరగాయల ధరల పెరుగుదలతో పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు కూడా సతమతమతున్నారు.