breaking news
real test
-
ఇస్లాంకు అసలు సవాలు ఇదే
జాతిహితం యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టీవీ మతప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే అతి పెద్ద సమస్యతో ఎలా వ్యవహరిం చాలి? జకీర్ నాయక్ వంటి వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం వారి మనసులను ముంచెత్తుతోంది. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై ఈ దాడి జరుగుతోంది. సుప్రసిద్ధ పాకిస్తానీ వ్యాఖ్యాత ఖలీద్ అహ్మద్ చెప్పేంత వరకు (1984) జకీర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నట్టే నాకు తెలియదు. నా మొట్టమొదట పాకిస్తానీ మిత్రుడు కూడా అయిన ఖలీద్... ఆయనను నేను ఎరుగనని తెలిసి ఆశ్చర్య పోయాడు. 2009లో జరిగిన ఒక సమాంతర సమావేశం లాంటి సంభా షణలో, జకీర్ నాయక్ ఉపఖండంలోనేగాక ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఇస్లామిక్ టెలీ-మత ప్రబోధకునిగా వృద్ధి చెందుతున్నట్టు ఖలీద్ చెప్పారు. జకీర్ ప్రవచనాలు చాలా వరకు ఇంగ్లిషులో సాగడం కూడా అందుకు కారణం. అప్పటికీ నాకు ‘పీస్ టీవీ’ అనేది ఒకటున్నదని తెలియనందుకూ అతను ఆశ్చర్యపోయాడు. ‘‘అది కూడా తెలుసుకోవయ్యా బాబూ, మన మంతా ముందు ముందు అతని గురించి ఇంకా చాలా ఎక్కువ వినాల్సి ఉంటుంది’’ అన్నారు. నైపుణ్యంతో కూడిన ఆయన భాషా పటిమకు, మిత వాద అంధ విశ్వాసాన్ని హేతుబద్ధతీకరించడానికి మంత్ర ముగ్దుడనైపోయా నని ఖలీద్ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం అందరిలాగే నేనూ ‘‘హజరత్ (గౌరవనీయులైన) గూగుల్’’కు వెళ్లాను (ఈ పద ప్రయోగం నాది కాదు వేరొకరిది). జకీర్ గురించి చదవడం, ఆయన టీవీ ప్రవచనాల రికార్డింగులను చూడటం ప్రారంభించాను. ఇంగ్లిషు వైద్యుడైన జకీర్ టెలీ-మత ప్రబోధకునిగా మారి... సౌదీ తరహా మితవాద ఇస్లాంకు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన, వాక్పటిమగలిగిన, శక్తివంతమైన ప్రతినిధిగా అవతరించారు. రాక్-స్టార్ మతప్రబోధకుడు ఆయన భాష, దరహాస వదనంతో కూడిన నడవడిక, ఖురాను, భగవ ద్గీత, ఉపనిషత్తులు, బైబిల్ నుంచి అధ్యాయాలను, శ్లోకాలను అప్పటికప్పుడు అనర్గళంగా ఉల్లేఖించడం, క్రైస్తవులు, హిందువులు, నాస్తికులు సహా తన సమావేశాలకు హాజరైనవారు ఎవరు అడిగే ఏ ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉండే వైఖరి అతనిని మౌలానా మూసపోతకు భిన్నంగా నిలుపుతుంది. నిజానికి ఆయన వారికి పూర్తిగా విరుద్ధం. సూటు, టై ధరించి, చక్కగా ఆలోచించి కూర్చిన ఇంగ్లిషు వాక్యాలను వేగంగా మాట్లాడతారు. ఆయన నడవడిక అంతటిలోకీ పలుచటి గడ్డం, మాడు మీది టోపీలే ఎక్కువగా ఆయన భక్తితత్పరుడైన ముస్లిం అని తెలుపుతాయి. నా సహచరులు కొందరి ద్వారా నేను ఆయనకు సంబంధించిన వారిని సంప్రదిం చాను. 2009 మార్చిలో ఆ ఇంటర్వ్యూ జరిగింది. జకీర్ నాయక్కు ఏ అధికారికమైన లేదా మతపరమైన బిరుదూ లేదు. కెమెరా ముందు తనను మౌల్వీ లేదా మౌలానాగా అభివర్ణించడానికి ఆయన అభ్యంతరం తెలిపారు. టెలీ-మతప్రబోధక రాక్-స్టార్గా వర్ణించడానికి అభ్యంతరం లేకపోవడమే కాదు, మహా ఆనందంగా అంగీకరించారు. ‘ఆస్తా’ చానల్లో ఎంతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కనిపించే చాలా మంది మత బోధకులు ఆయనకున్న టీవీ స్టార్ నైజాన్ని చూసి అసూయ చెందు తారు. ఆయన సంభాషణ చాలా వరకు ఘర్షణాత్మకమైనది కాదు. అత్యంత స్నేహపూర్వకమైన స్వరంతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలో, న్యాయ వ్యవస్థలో తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని అంటుంటే ఇక వాదించడానికి ఏం మిగిలి ఉంటుంది. దేశవిభజన విషయంలో ఆయన వైఖరి ఆర్ఎస్ఎస్ వైఖ రికి భిన్నమైనదేం కాదు. అది, భారతదేశమనే దేశంగా ఉపఖండానికి గొప్ప విషాదం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ‘‘క్రీడల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రపంచ శక్తి’’గా ఎదిగి ఉండేవి అన్నారాయన. ముస్లింలలో చాలా మందికి ఎన్నడూ విభజన అవసరమే లేదు లేదా కోరలేదు, పాకిస్తాన్ ఉద్యమానికి నేతృత్వం వహించినవారిలో పలువురు ‘‘మతానుయాయులైన ముస్లింలు కూడా కారు.’’ అయితే అర్ఎస్ఎస్కు భిన్నంగా ఆయన ఈ అంశాన్ని ముస్లింల ప్రయోజనాల కోణం నుంచి చూశారు. మితవాద ముస్లింలు జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వంలో సాగిన దేశ విభజనను వ్యతిరేకించడానికి నేపథ్యం ఉంది. అయితే నేటి చర్చలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, జాతీయవాదం, దేశవిభజనలపై ఆయన వైఖరి చాలా మంది పాకిస్తానీలకు మాత్రమే చికాకు కలిగిస్తుంది. కశ్మీర్పై జకీర్ అభిప్రాయాన్ని ఆయనను ద్వేషించేవారు, మహా దుర్మా ర్గునిగా చిత్రీకరించేవారిలో అత్యధికులు సైతం కొంత అయిష్టంగానైనా అంగీ కరిస్తారు. భారత్, పాకిస్తాన్లు రెండింటి పట్ల కశ్మీరీలు విసిగిపోయారు. స్వేచ్ఛగా ఓటింగ్ను నిర్వహిస్తే ఒంటరిగా వదిలేయమనే వారు కోరుకుం టారు. కానీ అది వారికి ఒక అవకాశంగా ఇవ్వజూపుతున్నది కాదు. కాబట్టి విద్య, ఉపాధులను మెరుగుపరచి, తన వైపు నుంచి శాంతిని నెలకొల్పి, సాధారణ పరిస్థితిని తీసుకురాగలగాలి అని ఆయన అభిప్రాయం. అతి సౌమ్యుని అతి ప్రమాదకర పార్శ్వం ఇక క్లిష్టమైన అంశాలకు వచ్చేసరికి సమస్యలు తలెత్తాయి. 26/11ను, 9/11ను సైతం ఆయన స్వేచ్ఛగా ఖండిస్తారు. కాకపోతే ‘‘జంట టవర్లను ధ్వంసం చేసిన వ్యక్తి మతధర్మాన్ని పాటించే ముస్లిం కాడు, అతన్ని ఖండిం చాల్సిందే...’’ నేనెప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాను కాబట్టి నాకు 9/11 డాక్యు మెంటరీల నుంచి సమాచారం లభించింది. దాన్ని బట్టి జార్జ్ బుష్ స్వయంగా చేసిన, లోపలి వారి పనేనని తెలుస్తోంది... ఈ ఆధారాలు ఒసామా బిన్ లాడెన్కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలకంటే చాలా మెరుగైనవి’’ అంటారు. ముస్లింల మస్తిష్కాలపై ఆయన పట్టు పెరుగుతుండటాన్ని గుర్తించి ‘ఇండి యన్ ఎక్స్ప్రెస్’ పత్రిక జాగ్రత్తగా ఎంపిక చేసిన 2010 వార్షిక శక్తివంతుల జాబితాలో జకీర్ పేరును చేర్చింది. అయితే ఆయన ప్రయోగించే లాడెన్ తరహా సందిగ్ధ అభిభాషణా ధోరణి ఆయనలో ఉన్న తప్పుడు, ప్రమాదకరమైన అంశాన్ని నొక్కిచెబు తుంది. భార్యను ‘‘ఇస్లామిక్’’ పద్ధతిలో ‘‘ఏదో టూత్ బ్రష్తో కొట్టినట్టుగా మెల్లగా కొట్టడం’’ లేదా విశాలమైన అలంకారాలతో కూడిన ముస్లిం సమాధు లను ఇస్లాంకు విరుద్ధమైనవిగా ప్రకటించడం వంటి మూర్ఖత్వాలను ఆయన పదేపదే సమర్థిస్తుంటారు. ప్రతి మూడు వాక్యాలకు ఒకసారి ఒక సూక్తిని ఉల్లేఖించే జకీర్ ఉపన్యాస శైలి ఇస్లాం పట్ల లోతైన మితవాద, మతశాస్త్రవాద దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన పద్ధతి చూడటానికి భయపెట్టని దిగా, స్నేహపూర్వకమైనదిగా కనిపిస్తుంది. కానీ నిజంగానే తెలుసుకోగోరే, అమాయక మనసులతో ఆడుకోగలగడం ప్రమాదకరం. తోటి మనుషులకు లేదా రాజ్యానికి వ్యతిరేకంగా హింసను ప్రయోగించమని ఆయన ఎన్నడైనా సూచిస్తారని నేను విశ్వసించను. అయితే ఆయన ఐఎస్ఐఎస్ను కచ్చితంగా ‘‘ఇస్లామ్ వ్యతిరేక కుట్ర’’గా ఖండిస్తారు. ఇస్లాంకు ఆయన చెప్పే ఛాందస వాద వ్యాఖ్యానాలు.. అమాయక, యువ ముస్లింల మనసులు మరింత తీవ్ర పద్ధతులను అనుసరించడానికి సమంజసత్వాన్ని కలుగ జేసేట్టుగా విస్తరింప జేయగలుగుతాయి. బంగ్లాదేశీ ఉగ్రవాదులలో కొందరు ఆయన అనుయా యులు అయినందుకు నేను ఆశ్చర్యపోను. కొత్త, యువ ముస్లిం ఉగ్రవా దులు, ప్రత్యేకించి ఐఎస్ఐఎస్కు చెందినవారు బాగా చదువుకున్నవారు, సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇంగ్లిష్ మాట్లాడేవారుగా ఉంటున్నా రెందుకు? అనే ప్రశ్న ఈ రోజుల్లో తరచుగా ఎదురవుతోంది. క్లుప్తంగా చెప్పా లంటే కొత్త ముస్లిం ఉగ్రవాది, పాత పేద, నిరక్షరాస్యుడైన అజ్మల్ కసబ్ తరహా ఉగ్రవాద మూసపోతకు భిన్నంగా ఉంటున్నాడెందుకు? దీనికి సమా ధానం బహుశా హిందూ మితవాదులు ద్వేషించడానికి ఇష్టపడే మరో వ్యక్తి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీవద్ద ఉండవచ్చు. ఓవైసీ లేవనెత్తిన అసలు సమస్య ఆయన నన్ను ఒకసారి హైదరాబాద్లోని పాత బస్తీలోకి కార్లో తీసుకు పోయారు. ఆ ప్రాంతాన్ని ఆయన, ఆయన కుటుంబం దశాబ్దాలుగా నియం త్రిస్తోంది. ఒవైసీ నాకు తను నడుపుతున్న విద్యాసంస్థలను చూపించారు. ఆయన విద్యాసంస్థలోని ఎమ్బీబీఎస్ క్లాస్లో ఆడపిల్లలు/మగపిల్లల నిష్పత్తి 70:30గా ఉండటం చూసి సంతోషంతో నివ్వెరపోయాను. సోషల్ మీడి యాలో ఆ ఫొటోలను కొన్నిటిని పోస్ట్ చేశాను. వారంతా హిజబ్ (బురఖా) ధరించి ఉన్నారనే ఫిర్యాదుతో నన్ను తిట్టి పోస్తూ ఓ పెద్ద దుమారమే రేగింది. ‘‘ఈ ఆడపిల్లలు మెడికల్ కాలేజీకి వెళ్లాలా లేక మదారసాకు వెళ్లాలా? అని మిమ్మల్ని తిట్టిపోసే వాళ్లను ఆడగండి’’ అన్నారాయన. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు ఆగి ‘‘బహుశా ఈ యువ ముస్లింలు మదా రసాకు కూడా వెళ్లి ఉంటేనే బాగుండేదేమో. ఇస్లాం అర్థాన్ని, సూత్రాలను, జిహాద్ను సైతం ఒక మౌల్వీ అయితే చెబుతారు’’ అన్నారు. ఈ యువ ముస్లింలు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు అవుతారుగానీ వారికి తమ మతంగురించి తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి ‘‘హజరత్ గూగుల్’’ తప్ప వారు ఎక్కడకు వెళ్లగలుగుతారు? ఒక యువ ముస్లిం గూగుల్లో జిహాద్ అని కొడితే ‘‘బహుశా మొహ్మద్ హఫీజ్ సయీద్, అతని జమా ఉద్ దవానే మొట్టమొదట కనబడొచ్చు’’ అంతకంటే మదా రసాకు వెళ్లడమే మంచిది అన్నారు ఒవైసీ. నేడు ఇస్లాం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే అన్నారు. ఆయనకు ఐఎస్ఐఎస్ అంటే అసహ్యం, పాత బస్తీలో దానికి వ్యతిరేకంగా హోర్డింగ్లను పెట్టించారు. ఒవైసీ చెబుతున్న మరింత పెద్ద, ప్రబలమైన సమస్య కూడా మీకు ఇప్పుడు కనబడుతుంది. యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టెలివిజన్ మత ప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే సమస్యతో ఎలా వ్యవహరించాలి? జకీర్ నాయక్ వంటి వారి ప్రబోధాలు వారి వారి మనస్సులను ముంచెత్తుతున్నాయి. వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం విశ్వసించ దగినదిగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సహా కొందరు లౌకికవాదు లుగా చెప్పుకునేవారు- కేవలం దిగ్విజయ్సింగ్ మాత్రమేకాదు - ఇషత్ ్రజహాన్ కేసు నుంచి బాట్లా హౌస్ ఎన్కౌంటర్ వరకు ప్రతిదాన్ని ముస్లింలను బాధించడంగానే చూపుతూ ఆ బాధిత కథనానికి ఆజ్యాన్ని పోస్తుంటారు. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై జరుగుతున్న దాడి ఇది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ముందుంది అసలు పరీక్ష
విశ్లేషణ - ఎం. పద్మనాభరెడ్డి దేశ ప్రజలు 2014 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. విపరీతమైన అవినీతి, పాలనలో అలసత్వం, సంకీర్ణ పేరుతో అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోలేక చేష్టలుడిగిన ప్రధానమంత్రి, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమ స్య వంటి రకరకాల కారణాలతో యూపీఏ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెంది బీజేపీకి పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం కాలమైనందున ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణ జరగడం సహజమే. నేడు కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమే, అందు లోను నరేంద్రమోదీ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ పనితీరును పరిశీలించినప్పుడు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అంతటా సానుకూల వాతావరణం ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరు కావడంతో మొదలైన కొత్త విదేశాంగ విధానం ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందే శాన్ని ఇచ్చింది. భారతదేశం అందరితో సత్సంబంధాలు కోరుకుంటుందని పొరుగు దేశాలతో శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుంటుందని సందేశం. ఇందులో భాగంగానే ప్రధాని గత ఏడాది కాలంలో 18 దేశాలలో పర్యటించి ఆ దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడ మే కాక దేశానికి ఉపయోగపడే ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అంతే కాక చాలా సందర్భాలలో ఆ దేశ పార్లమెంటులో మాట్లాడడం అక్కడి భారత సంతతి వారితో మమేకమై ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించారు. నేడు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక బలమైన ఆర్థికశక్తిగా పెరుగుతున్న దేశంగా గుర్తింపు కూడా వచ్చింది. అయితే విదేశాంగ విధానం బాగానే ఉన్నా, దేశీయరంగంలో మోదీ ఎన్నికల సందర్భంలో చెప్పినవాటికి, జరుగుతున్న వాటికి వ్యత్యాసం ఉంది. మంచి వాక్చాతుర్యంతో, పాలనలో అనుభవంతో ఎన్నికల సందర్భంలో ఆయన ప్రజలను ఆకట్టుకున్నారు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నాకు కేవలం 60 నెలలు అధికారం ఇవ్వండి. నేను దేశానికి, దేశ ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్) తీసుకురాగలను అంటూ ఒక ఫీల్గుడ్ వాతావరణాన్ని నెలకొల్పడంలో సఫలీకృతుడయ్యారు. ఆర్థిక వనరుల బదిలీ ఇంతవరకు దేశ ఆర్థిక వనరుల్లో చాలా భాగం కేంద్రం చేతిలో ఉండేవి. రాష్ట్రా లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 50% కేంద్ర పన్నుల నిధులు రాష్ట్రాలకు బదిలీ చేయడం మంచి నిర్ణయం. దేశాన్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న సమస్య ధరల పెరుగుదల. మోదీ ప్రభుత్వం ధరల నియంత్రణ చేయగలిగింది. అయినా పరిస్థితి పూర్తిగా అదుపులోనికి రాలేదు. స్థూల దేశీయ ఉత్పత్తి పెరు గుతున్నా, ఉద్యోగ అవకాశాలు అనుకున్నంతగా పెరగలేదు. మేక్ ఇన్ ఇండి యా పేరుతో కార్యక్రమాన్ని చేపట్టినా, అది ఇంకా పురుడు పోసుకోలేదు. ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేసే దిశలో జన్ధన్ యోజన ద్వారా సుమారు 15 కోట్ల కొత్త ఖాతాలు తెరవడం ఒక చక్కని మొదటి మెట్టు. ఇక దేశంలో కోట్లలో ఉన్న చిన్న వ్యాపారస్థుల సహాయార్థం 20 వేల కోట్లతో ‘ముద్ర’ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఉపాధి అవ కాశాలు పెంచుతుంది. ఇటీవలే తీసుకొచ్చిన రెండు బీమా పథకాలు పేదలకు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. భూసేకరణ బిల్లుతో అపవాదు మోదీ నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీ ధనవంతుల పార్టీ అని, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్థులకు కోట్లలో రాయితీలు ఇచ్చారు. అవి పరిశ్రమల అభివృద్ధికే అయినా, లాభపడింది మాత్రం కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రమే. పరిశ్రమలు స్థాపించడానికి భూమి ఒక కీలకమైన అంశం. గత ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ చట్టంతో పరిశ్రమలు ఇతర అభివృద్ధి కార్యక్ర మాలకు భూసేకరణ ఒక అడ్డంకిగా మారింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు తెస్తూ భూసేకరణ సులువుగా జరిగేటట్లు ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. ఇది కాస్త రాజకీయ దుమారం లేపింది. సంఖ్యాబలం లేక రాజ్య సభలలో ఈ బిల్లు కాస్త గట్టెక్కక రెండవసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చి బిల్లును బతికించే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అనే అపవాదు మూటకట్టుకుంది. మోదీ ప్రభుత్వంలోని గిరిరాజ్సింగ్, నిరంజన్జ్యోతి వంటి కొందరు మంత్రులు అల్ప సంఖ్యాక ప్రజలపై చేసిన అభియోగాలు ఆమోదయోగ్య మైనవి కావు. అసలే గుజరాత్ అల్లర్లతో మచ్చపడ్డ మోదీకి మంత్రివర్గ సహచ రుల అసందర్భ ప్రేలాపనలు అల్ప సంఖ్యాకులలో అభద్రతాభావం పెంచే విధంగా ఉండి, మోదీ ఇంకా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పైకి రాలేదు అనే అపవాదు వచ్చింది. కీలకమైన విద్య, ఆరోగ్య రంగాల్లో మోదీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో గట్టి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఈ రెండు రంగాలలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎక్కువగా ఉండటమే కాకుండా, కేంద్ర నిధులు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రాథమిక, ఉన్నత విద్యల ప్రమాణాలు దిగజా రాయి. 2014 -15లో విద్యా రంగానికి రూ.55 వేల కోట్ల కేటాయింపు ఉండగా, అది 2015-16లో రూ.42 వేల కోట్లకు తగ్గింది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు గత ఏడాది రూ.21 వేల కోట్లు కేటాయించగా 2015-16లో రూ.10వేల కోట్లకు తగ్గించినారు. కేంద్ర ప్రభు త్వం కొత్తగా ఐఐటీ, ఐఐఎంలు స్థాపించడానికి పూనుకున్నా సరైన బోధనా సిబ్బంది లేక అవి ఎక్కడ వేసిన గొంగళి అచ్చటనే అన్న చందాన ఉన్నాయి. అయితే కేంద్రం ఉపాధ్యాయులకు శిక్షణ పేరుతో టీచర్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రారం భించి అధ్యాపకులలో నైపుణ్యాన్ని పెంచే యత్నం చేసింది. కీలక విషయాలలో నాన్చకుండా సత్వర నిర్ణయం తీసుకోవడం మోదీ ప్రత్యేకత. ఫ్రాన్స్ పర్యటనలో వేల కోట్ల రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందం, అలాగే చైనా పర్యటనలో చైనా వారికి ఈ- వీసా మంజూరు ప్రకటన ముఖ్యమైనవి. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన నియంతగా వ్యవహరిస్తున్నాడు అనే అపవాదు కూడా వచ్చింది. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తెచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం విఫల మైంది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి, నల్లధనంపై ఒక చట్టాన్ని తెచ్చి నా విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం మాత్రం రాలేదు. మోదీ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదు. బంగ్లాదేశ్తో సరిహద్దు ఒప్పం దం ఒక చారిత్రక ఘట్టం. భారత పార్లమెంటులో ఏకగ్రీవంగా ఈ ఒప్పందం ఆమోదం పొందటం, ప్రధానమంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలుపడం ఒక మంచి సంప్రదాయానికి ప్రతీక. సభలో ఫలవంతమైన చర్చలు జరిగి ఎన్నో బిల్లులు ఆమోదం పొందడంతో ప్రజలకు పార్లమెంటుపై గౌరవం పెరిగింది. పారదర్శకతతో పెరిగిన ఆదాయం దేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నా, యూపీఏ ప్రభుత్వం అవినీతి మూ లంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించడంతో దేశ బొగ్గు అవసరాల కొరకు విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మోదీ ప్రభుత్వం పారదర్శకంగా బొగ్గు క్షేత్రా లను వేలం వేయడంతో ప్రభుత్వానికి లక్షల కోట్లలో ఆదాయం రావడమే కాక దేశంలో బొగ్గు లభ్యత పెరిగింది. అలాగే ధ్వని తరంగాల వేలం కూడా దేశానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చింది. 120 కోట్ల జనాభాతో ప్రపంచంలో అన్ని మతాల ప్రజలు, రకరకాల భాషలతో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సమయం కావాలి. మోదీ ప్రభుత్వం ఒక సంవత్సర పాలనలో ఏమీ జరగలేదు అనుకోవడం కానీ, ఏదో బ్రహ్మాండంగా జరుగుతుంది అని అనుకోవడం కాని పొరపాటే అవుతుంది. అయితే సంవత్సరకాలం ప్రభుత్వం అభివృద్ధి పథంలో ప్రయా ణిస్తుందా లేదా అని బేరీజు వేయడానికి సరిపోతుంది. ఎక్కడ ఉన్నామని కాదు - ఏ దిశలలో పయనిస్తున్నామన్నది ముఖ్యం. గత సంవత్సర పాలన లో మోదీ ప్రభుత్వం విదేశీ సంబంధాలలో, భారతదేశ ఇమేజ్ను ప్రపంచ దేశాలలో పెంచడంలో, అలాగే ఎటువంటి స్కామ్లు లేకుండా దేశ సంపద ను పారదర్శకంగా ఉపయోగించడంలో, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుం టూ కేంద్రంలో ఒక పని చేసే ప్రభుత్వం ఉందని చెప్పడం వంటి కార్యక్రమా లలో పూర్తిగా సఫలీకృతమైంది. ఇకపోతే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గుప్పించిన హామీలలో ఇంకా నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు తగ్గించి, ధరల నియంత్రణ, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై ఇంకా పని చేసే అచ్చేదిన్ తీసుకొని రావాల్సిన అవసరముంది. అలాగే ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచే ప్రసంగాలు చేస్తున్న మంత్రులు, పార్లమెంట్ సభ్యులపై నియంత్రణ అవసరం. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్, ముద్ర బ్యాంక్, జన్ధన్ యోజన వంటి కార్యక్రమాలు కార్యరూపం దాల్చిన ఫలితాలు కనిపిస్తాయి. మొత్తానికి ఒక సంవత్సరం మోదీ పాలన భేషుగ్గా ఉంది కానీ, అసలు పరీక్ష మాత్రం ముందుంది. వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ 98492 69105