ఇందూరులో ‘ఆమ్ ఆద్మీ’
సాక్షి, నిజామాబాద్ : ‘నేను సామాన్యుడిని.. నాకు స్వయం పాలన కావాలి’ అనే నినాదంతో దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది ఆమ్ ఆద్మీ పార్టీ. ‘ఢిల్లీతో మొదలైన ఈ ప్రస్థానం యావత్ భారతావనికి విస్తరిస్తుంది’ అని ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది క్రమంగా కార్యరూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈనెల 10 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా కోటి మందికి సభ్యత్వం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది.
ఇందులో భాగంగానే ఈ పార్టీ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. http://www.aamaadmiparty.orgÌZ వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా ప్రతినిధులు రవి పటేల్, సుమంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెలాఖరులో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కౌన్సిల్, జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీలు, బ్లాక్ స్థాయిలో బ్లాక్ కౌన్సిల్, క్షేత్ర స్థాయిలో ప్రైమరీ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆప్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకొని, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆప్లో చేరేందుకు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో చేరేవారు త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజధాని నగరంలో సత్తా చాటిన ఆప్.. జిల్లాలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో, ఆ పార్టీని జిల్లావాసులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.