Rank
-
2026 JEE ఫలితాలు వచ్చేశాయి…ఈ ర్యాంకుతో మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుందా? - నెక్స్ట్ వేవ్ సీఈఓ రాహుల్ అత్తులూరి అభిప్రాయం
దాదాపు 14.5 లక్షల మంది విద్యార్థులు తమ ర్యాంకులు చూసుకుంటున్న ఈ సమయంలో… అసలు భవిష్యత్తును నిర్ణయించేది ఏంటో తెలుసుకుందాం. – రాహుల్ అత్తులూరి, సీఈఓ మరియు కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు.నెలల తరబడి కఠినమైన ప్రిపరేషన్, నిద్రలేని రాత్రులు, కేవలం ఒక జేఈఈ అభ్యర్థికి మాత్రమే తెలిసిన ఆ ఒత్తిడి.. వీటన్నిటి తర్వాత మొత్తానికి ఈరోజు రిజల్ట్స్ వచ్చేశాయి.మీలో కొందరికి ఈరోజు పండగలా ఉండొచ్చు. కానీ చాలామందికి అనుకున్న ఫలితం రాకపోయి ఉండొచ్చు. స్కోరు చూసిన తర్వాత కలిగే బాధ ఉందే… అది మీరు ఇప్పటిదాకా మోసిన ఏ బరువు కంటే కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు.మీరు అలా ఫీలవ్వడం సహజమే.కానీ ఒక్క నిమిషం ఆగి మీరు ఏం చేశారో ఆలోచించండి. మీరు పోరాడారు, కష్టపడ్డారు, మీ తప్పు లేకుండా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఒక్కటి చాలు మిమ్మల్ని అభినందించడానికి.మీ జేఈఈ ర్యాంక్ బట్టి మీరేంటో డిసైడ్ చేసేసుకోకండి. ఒక్కసారి నేను చెప్పే విషయం ఆలోచించండి. ఈ ఏడాది సుమారుగా 14.5 లక్షల మంది జేఈఈ రాశారు. ఉన్న ఐఐటీ సీట్లు మాత్రం సుమారుగా 18,000 మాత్రమే. అంటే ప్రతి వంద మందిలో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది.మరి మిగిలిన 99 శాతం మంది పరిస్థితి ఏంటి? వాళ్లంతా ఫెయిల్ అయినట్టా? వాళ్లకు తెలివితేటలు లేవనా? వాళ్లు ఇక దేనికి పనికిరారని అర్థమా?ఖచ్చితంగా కాదు!అసలు జేఈఈ అంటే ఏంటో నిజాయితీగా మాట్లాడుకుందాం.జేఈఈ అనేది ఒక 'ఫిల్టర్' మాత్రమే. ఉన్న కొన్ని సీట్లను నింపడానికి పెట్టిన ఒక పద్ధతి. అంతే తప్ప, మీ తెలివితేటలను జడ్జ్ చేయడానికి పెట్టింది కాదు ఇది. సాధారణంగా మంచి ర్యాంకు ఉంటేనే తెలివైనవాళ్లు అని అందరూ అనుకుంటారు, కానీ మీలో ఉన్న టాలెంట్ను కొలవడానికి ఇది సరైన కొలమానం కాదు. మీలాంటి యువకుల జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి అసలే కాదు.అయినా సరే, లక్షలాది కుటుంబాలు ఈ ఒక్క ఎగ్జామ్ చుట్టూనే తమ పిల్లల జీవితాలను తిప్పుతున్నాయి. కానీ రిజల్ట్స్ రోజున ఎవరూ బయటకు చెప్పని ఒక చేదు నిజం ఉంది. ఒక విద్యార్థి ఐఐటీలో సీటు సాధించాడా లేదా అన్నదానికి, వాళ్లు భవిష్యత్తులో ఎంత సక్సెస్ అవుతారన్నదానికి అసలు సంబంధం లేదు.ఐఐటీలో చదవకపోయినా సరే.. అద్భుతమైన కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్లని, టాప్ పొజిషన్లలో ఉన్నవాళ్లని, విజయవంతంగా స్టార్టప్లను నడుపుతున్న వాళ్లని నేను చాలా మందిని చూశాను. వాళ్లకు అప్పట్లో వచ్చిన జేఈఈ ర్యాంకుకు, ఈరోజు వాళ్లు ఉన్న పొజిషన్కు అసలు పోలికే లేదు.ఈ ఒక్క రోజుతో అంతా అయిపోలేదు.. ఇదొక కొత్త మలుపు మాత్రమే.ర్యాంకు పైన కాకుండా, స్కిల్స్ మీద ఫోకస్ పెట్టడమే ఇప్పుడు మీరు తీసుకోబోయే అత్యంత ముఖ్యమైన నిర్ణయం.నిన్నటి వరకు మీ సక్సెస్ను స్కోర్లు, కటాఫ్లు, పర్సంటైల్స్తో కొలిచారు. అందులో ఉన్నది ఒకే ఛాన్స్, ఒకే నంబర్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది... ఆ పాత విధానం ఇక్కడితో ముగిసింది!ముందున్న దశ పూర్తిగా వేరుగా ఉంటుంది. స్కిల్స్ అనేవి 'సింగిల్ అటెంప్ట్' మీద ఆధారపడవు. ప్రతి రోజూ కొత్తగా నేర్చుకోవడానికి, ఏదైనా సృష్టించడానికి మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. "సరైన సమయం" కోసం ఎదురుచూడకుండా ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వారికి మిగిలిన విద్యార్థుల కంటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండి నాలుగేళ్ల తర్వాత ఎవరూ ఊహించని గొప్ప పొజిషన్ లో ఉంటారు. 'ఇంటెలిజెన్స్ ఏజ్' ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇందులో మీ స్థానం ఏంటి అని కేవలం ఒక పరీక్ష నిర్ణయించలేదు.ఈ నాలుగేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రూల్స్ అన్నీ మారిపోయాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్లో చేరుతున్న స్టూడెంట్స్… ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు(2022లో) చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లాంటివి లేనే లేవు.మీరు నాలుగేళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చేసరికి (2030 నాటికి) ప్రపంచం ఇంకోలా ఉంటుంది. అప్పుడు సక్సెస్ అనేది ర్యాంక్ లతో నిర్ణయించబడదు… ఈ నాలుగేళ్లలో నిజమైన టెక్ ప్రాజెక్ట్స్ చేస్తూ, టెక్నాలజీపై పట్టు సాధించి, ఎక్స్పీరియన్స్ సంపాదించిన వాళ్లే రేపటి లీడర్లుగా నిలుస్తారు.ఏఐ వల్ల మార్పులు వస్తున్న మాట నిజమే. అది ఎంట్రీ లెవల్ ఉద్యోగాల మీద ప్రభావం చూపుతోంది. కానీ 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' ఇదే ఏఐ వల్ల 1.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి అని చెబుతుంది. ఈ అవకాశాలు ఎవరికి వస్తాయో తెలుసా? ర్యాంకు చూసి కాదు.. ఒక సమస్యను గుర్తించి, దానికి టెక్నాలజీతో పరిష్కారం వెతికే 'బిల్డర్ మైండ్సెట్' ఉన్నవాళ్లకి.మార్కుల కంటే స్కిల్స్కే ప్రాధాన్యత ఇస్తే ఫలితం ఎలా ఉంటుందంటే..జేఈఈ పరీక్ష అయిపోయిన తర్వాత, కొందరు విద్యార్థులు ర్యాంకుల గురించి అనవసరంగా టెన్షన్ పడకూడదని నిర్ణయించుకున్నారు. రేపటి భవిష్యత్తుకు ర్యాంకుల కంటే స్కిల్స్ ముఖ్యమని ముందే గ్రహించారు.ఉదాహరణకు, హరీష్ అనే విద్యార్థి ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదాన్ని చూశాడు. అక్కడ సకాలంలో సాయం అందకపోవడం వల్ల ప్రాణాలు పోవడం అతన్ని కలిచివేసింది. ఆ సమస్య కు పరిష్కారం కోసం 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' సహాయంతో ప్రాణాలు కాపాడే ఒక 'స్మార్ట్ హెల్మెట్'ను తయారు చేశాడు. కేవలం మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి తన ఆలోచనకు ప్రాణం పోశాడు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ చూసి ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే నితీష్ కటకం మరియు హర్షిణి లాంటి వాళ్లు, కంపెనీలు అసలు అభ్యర్థుల నుండి ఏం కావాలని కోరుకుంటున్నాయో అర్థం చేసుకుని, టెక్నికల్ స్కిల్స్ మీద పట్టు సాధించి, మొదటి ఏడాదిలోనే మంచి స్టైపెండ్తో ఇంటర్న్షిప్ సాధించారు. సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇలా స్టైపెండ్ తో ఇంటర్న్షిప్ అవకాశం రావడం చాలా అరుదు.అలాగే, జి. హృషికేష్ అనే ఒక 19 ఏళ్ల విద్యార్థి తన రోజువారీ పనిలో పదే పదే ఎదురవుతున్న ఒక సమస్యను గమనించాడు. ఎన్ఐఏటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని నెలల వ్యవధిలోనే దానికి పరిష్కారంగా 'జిఎస్' అనే ఒక ఏఐ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేశాడు. తను ఇంకా చదువుకుంటున్న దశలోనే, ఆ ప్లాట్ఫామ్ ద్వారా నెలకు సుమారు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడు.చాలామంది విద్యార్థులు ఇప్పుడు 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' ద్వారా రైతులకు సాయపడే ఏఐ సిస్టమ్స్, హ్యూమనాయిడ్ రోబోలు, ఏఐ డ్రోన్లు.. ఇలా ఎన్నో తయారు చేస్తున్నారు. ఇలాంటి వందలాది ఇన్నోవేషన్ కథల వెనుక ఉన్న అసలు నిజం ఒక్కటే. ర్యాంకుల కంటే స్కిల్స్ గొప్పవని ఈ విద్యార్థులు చాలా త్వరగా తెలుసుకున్నారు.పరిశ్రమలకు ఖచ్చితంగా ఎలాంటి నైపుణ్యాలు కావాలో, అవే నేర్పించడానికి ఎన్ఐఏటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. సరైన వేదికను, వాతావరణాన్ని అందించడం ద్వారా విద్యార్థులను మొదటి రోజు నుంచే 'టెక్ బిల్డర్స్'గా ఎన్ఐఏటి తీర్చిదిద్దుతుంది.దీని ఫలితంగానే, కేవలం మొదటి ఏడాదిలోనే 200 మందికి పైగా విద్యార్థులు స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్స్ సాధించగలిగారు. 22 మంది కి పైగా విద్యార్థులు సొంత స్టార్టప్స్ స్థాపించగలిగారు. ఎన్నో సమస్యలకు ‘ఎన్ఐఏటి 5.0 ల్యాబ్స్’ ద్వారా పరిష్కారం చూపగలిగారు.మీ టాలెంట్ను కేవలం ఒక జేఈఈ ర్యాంకుతో ముడిపెట్టకుండా, దాన్ని ఒక ఆరంభంలా భావిస్తే వచ్చే మార్పు ఇదే!స్టూడెంట్స్ అందరికీ ఒకే ఒక్క మాట..మీ జేఈఈ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అదే మీ కెరీర్ పై ఫైనల్ నిర్ణయం కాదు. రాబోయే నాలుగేళ్లలో మీరు ఏం చేస్తారన్నదే ముఖ్యం. ఈరోజు రిజల్ట్ కంటే మీలో ఉన్న టాలెంట్ చాలా గొప్పది.ఇది కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన సమయం, అనవసరమైన టెన్షన్ పడే టైమ్ కాదు. భవిష్యత్తులో మీకు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.ప్రపంచంలోని టాప్ కంపెనీలు 'బిల్డర్స్' కోసం ఎదురుచూస్తున్నాయి.ఆ బిల్డర్ అయ్యే అవకాశం మీ అందరికీ ఉంది. రాబోయే 4 ఏళ్లలో స్కిల్స్ నేర్పించే చోటునే మీ గమ్యంగా ఎంచుకోండి.ఆల్ ది బెస్ట్!మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ .. మూడో ప్లేసులో భారత్
పుల్వామా అటాక్ కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల లోవీ ఇనిస్టిట్యూట్ చేపట్టిన సర్వేలో భారత్ 40 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా 80 పాయింట్లతో మెుదటి స్థానంలో నిలువగా చైనా 73.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ తరువాత 38.8 తో జపాన్ , 32.1తో రష్యా వరుసగా , నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.అయితే రక్షణ నెట్ వర్క్ ల అంశంలో భారత్ రెండు స్థానాలు కోల్పోయి 11 స్థానంలో నిలిచింది. అదే పెట్టుబడులను ఆకర్షించే అంశంలో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ సూచికలో అమెరికా మెుదటి ప్లేస్ లో ఉంది. ఆర్థిక, మిలిటరీ రంగాలలో మంచి పురోగతి సాధించడంతోనే భారత్ ర్యాంకు మెరుగుపడిందని విశ్లేశకులు అంచనా వేస్తున్నారు. సాంకేతికత, పరపతి, అంతర్జాతీయ సంబంధాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను లోవీ ఇనిస్టిట్యూట్ ర్యాంకులను ప్రకటిస్తుంది. భారత్ సైనిక సామర్థ్యం ప్రస్తుతం ఎంతో మెరుగ్గా ఉందని సంస్థ పేర్కొంది. -
బాంబుల మోతలు వింటూనే...జేఈఈలో సక్సెస్!
అన్ని విజయాలను ఒకే గాటన కట్టలేము. అన్నీ అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని విజయాలు నల్లేరు మీద నడక అవుతాయి. కొన్ని విజయాలు అలా కాదు... కారుమేఘాల్లాంటి ప్రతికూల పరిస్థితులను చీల్చుకొని వెలుగు కిరణాలు అవుతాయి. ఇందుకు సాక్ష్యం కశ్మీరి అమ్మాయి జెనిస్... ఇండియా-పాక్ల మధ్య యుద్ధవాతావరణ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మరీ జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్)లో విజయం సాధించింది.పరీక్షకు ప్రిపేర్ కావాలంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రతతో చదవాలి. అయితే జెనిస్ ప్రిపరేషన్కు అవేం లేవు. ‘జేఈఈ’ పరీక్షలకు కొన్నిరోజుల ముందు... పాకిస్తాన్ బాంబుల శబ్దం వినిపించేది. మరోవైపు విరామం ఇవ్వని సైరన్లు. భయపెట్టేలా ఆకాశంలో డ్రోన్లు.ఎటు చూసినా భయానకమైన వాతావరణం.‘జేఈఈ పరీక్ష వాయిదా పడితే బాగుండేది’ అని మనసులో చాలాసార్లు అనుకుంది జెనిస్.‘ఇంత భయానక పరిస్థితుల్లో పరీక్ష రాయగలనా అనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది. ప్రిపరేషన్ సంగతి ఎలా ఉన్నా ‘పరీక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకోగలనా? అసలు వెళ్లగలనా?’ అనే సందేహం ఆమె మనసులో సుడులు తిరిగేది. ‘ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని పరీక్షకు పంపడం సరిౖయెనదేనా?’ అని జెనిస్ తల్లిదండ్రులూ ఆలోచనలో పడ్డారు.ఇదీ చదవండి: Air India plane crash కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!‘స్కూలు రోజుల్లో నాకు జేఈఈ గురించి బొత్తిగా తెలియదు. కశ్మీర్లో చాలామంది తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. తమ పిల్లలను మెడిసిన్ చదివించా లనుకుంటారు. కశ్మీర్లో జేఈఈ కోచింగ్ సెంటర్లు కూడా చాలా తక్కువ. ఇంటర్మీడియెట్లో జేఈఈ గురించి తెలిసిన తరువాత నాలో ఆసక్తి పెరిగింది. జేఈఈ ఎగ్జామ్స్ రాయాలనుకున్నాను. గూగుల్ నాకు కోచింగ్ సెంటర్గా మారింది. జేఈఈ పరీక్షకు సంబంధించిన కంటెంట్ను సెర్చ్ చేసేదాన్ని’ అంటుంది జెనిస్.మొదటి ప్రయత్నంలో విఫలం అయినా రెండో ప్రయత్నంలో ‘జేఈఈ’లో విజయం సాధించింది. మొదటిసారితో పోల్చితే రెండోసారి ‘జేఈఈ’ కోసం ప్రిపేరవుతున్నప్పుడు బయటి పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి.ఇంటర్నెట్ షట్డౌన్ మరో సమస్య. కరెంట్ కోతలు సరేసరి. ‘ఇంటర్నెట్ లేకపోతే ఆ ప్రభావం ప్రిపరేషన్పై పడుతుంది. ఎందుకంటే నేను కోచింగ్ సెంటర్లో చేరలేదు’ అంటుంది జెనిస్. అయినప్పటికీ ‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అనే గట్టి పట్టుదలతో విజయం సాధించింది పుల్వామాకు చెందిన జెనిస్.‘మా ప్రాంతంలో ఇంజనీరింగ్ అంటే అబ్బాయిలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. నా తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. నన్ను మెడిసిన్ చదివించాలనేది వారి కోరిక. నేను వారికి జేఈఈ గురించి వివరించాను. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఇష్టం. జేఈఈ గురించి చెప్పినప్పుడు నువ్వు మెడిసిన్ చదవాల్సిందే అనకుండా నన్ను ప్రోత్సహించారు’ అని చెప్పింది జెనిస్. ‘జేఈఈ’ ప్రిపేర్ కావడానికి ముందు ఎంతోమంది బంధువులు జెనిస్ తల్లిదండ్రులతో.. ‘జేఈఈ అంటే అబ్బాయిలు రాసే పరీక్ష. మీరు జెనిస్తో మెడికల్ ఎంట్రెన్స్ రాయించండి ఇంజనీరింగ్ ఫీల్డ్లో అబ్బాయిలు మాత్రమే ఉంటారు’ అనేవాళ్లు. అయితే వారి మాటలను జెనిస్ తల్లిదండ్రులు పట్టించుకోలేదు.చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే!‘నువ్వు సాధించగలవు’ అని కూతురికి ధైర్యాన్ని ఇచ్చారు.తల్లిదండ్రులు ఇచ్చిన ్ర΄ోత్సాహబలంతో తన ‘ఐఐటీ’ కలను నిజం చేసుకుంది జెనిస్.‘జేఈఈ’ ఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నప్పుడు సైరన్లు, బ్లాకవుట్స్ వల్ల ఏకాగ్రత కుదిరేది కాదు. ‘జేఈఈ’ అడ్వాన్స్డ్ ఫామ్స్ ఫిల్ చేయలేనేమో అని భయపడ్డాను. అదృష్టవశాత్తు చేయగలిగాను. ఆపరేషన్ సిందూర్ మే 7న జరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మే 18. ఈ మధ్య కాలంలో ఎంతో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎక్కడెక్కడి నుంచో బాంబుల శబ్దాలు వినిపించేవి. అంతా భయంలోనూ ఈసారి ఎలాగైనా సీటు సాధించాల్సిందేనని అనుకున్నాను. – జెనిస్ -
Hyderabad: స్వచ్ఛ ర్యాంక్ దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్(Swachh Survekshan) ర్యాంకుల్లో ఈసారి హైదరాబాద్ (hyderabad) పరిస్థితి ఏం కానుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణాలు ఉన్నాయి. నగరంలో గతంలో ఎత్తేసిన డంపర్ బిన్లను తిరిగి ఏర్పాటు చేస్తుండటం ఇందుకు ఒక కారణం కాగా.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటనలో తప్పుడు వివరాలిచ్చినట్లు గుర్తిస్తే పెనాల్టీ విధించనున్నారు. అంటే మైనస్ మార్కులుంటాయి. తద్వారా మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉండదు. నగరం స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకు పొందేందుకు గతంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. కేవలం స్వచ్ఛ ర్యాంకుల కోసమే నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డంపర్ బిన్లను ఎత్తివేశారు. దీంతో ప్రజల నుంచి పలు విమర్శలు ఎదురయ్యాయి. రోడ్ల వెంబడి ఎక్కడికక్కడే చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. నగరంలో చెత్త పరిస్థితులకు డంపర్బిన్లు లేకపోవడం కూడా ముఖ్య కారణంగా భావించిన కమిషనర్ ఇలంబర్తి తిరిగి వాటిని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. గతంలో మాదిరిగా కాకుండా ఆధునిక సాంకేతికతతో చెత్త పూర్తిగా నిండకముందే కంట్రోల్రూమ్కు ‘అలర్ట్’ వెళ్తుంది. వెంటనే వాహనం వెళ్లి ఆటోమేటిక్గా చెత్త తరలిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు చెత్త వేసేందుకు ఇతర ఏర్పాట్లు చేశారు. ఎటొచ్చీ బహిరంగ ప్రదేశాల్లో ఉండే ‘చెత్త సేకరణ’తో మార్కులు తగ్గుతాయి. తప్పుడు వివరాలిస్తే.. ప్రస్తుతం నడుస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో కొన్ని నిబంధనలు ఇటీవల కొత్తగా చేర్చారు. స్వచ్ఛ కార్యక్రమాల అమలు గురించి పోటీలో పాల్గొనే స్థానికసంస్థలు నిర్ణీత వ్యవధుల్లో సంబంధిత ‘స్వచ్ఛతమ్’ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తాయి. పోర్టల్లో పొందుపరిచిన వివరాలు నిజంగా అమలవుతున్నదీ, లేనిదీ పరిశీలించేందుకు కేంద్రం నుంచి వచ్చే బృందాలు తమ తనిఖీలు, పరిశీలనల్లో తప్పుడు వివరాలు నమోదైనట్లు గుర్తిస్తే పెనాల్టీ విధిస్తాయి. మైనస్ మార్కులు వేస్తాయి. ‘రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్’ థీమ్తో నడుస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2024కు సంబంధించి మూడు సర్వేలో మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ కోసం ఈ మార్పులు చేశారు. అమలు విధివిధానాల్లోనూ కీలక మార్పులు చేశారు. ఈ మేరకు మార్పులు ఇలా ఉన్నాయి.. ⇒ జనాభా ప్రాతిపదికన నిబంధనలు. ⇒ పది విభాగాలో ఇండికేటర్స్ సరళీకరణ. ⇒ కొత్తగా ‘సూపర్ స్వచ్ఛ్ లీగ్’ పట్టణాలు. ⇒ కొన్ని అంశాలకు కొత్త ఇండికేటర్స్. ⇒ పాఠశాలలు, జనసమ్మర్థం ఉండే çపర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ⇒ స్వచ్ఛతకు సంబంధించి పాఠశాలలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు. ⇒ స్వచ్ఛతమ్ పోర్టల్లో పొందుపరిచిన వివరాలు.. క్షేత్రస్థాయి çపరిస్థితులకు భిన్నంగా ఉంటే మైనస్ మార్కులు. ⇒ ఈ నేపథ్యంలో హైదరాబాద్కు మంచి ర్యాంక్ రావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్వచ్ఛ్ లీగ్.. కొత్తగా పొందుపరిచిన అంశాల్లో సూపర్ స్వచ్ఛ్ లీగ్ను ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన 2021, 2022, 2023లలో స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకుల్లో కనీసం రెండు పర్యాయాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచిన నగరాలు సూపర్ స్వచ్ఛ్ లీగ్గా గుర్తిస్తారు. సదరు పట్టాణాల్లో అమలయ్యే స్వచ్ఛ కార్యక్రమాలను ప్రత్యేక ఇండికేటర్స్ ఆధారంగా పరిశీలిస్తారు. అవి తమ ప్రత్యేక హోదాను కాపాడుకునేందుకు అవి భవిష్యత్లో 85 శాతం మార్కుల్ని పొందాల్సి ఉంటుంది. ఇండోర్ వంటి నగరాలు సూపర్ స్వచ్ఛ్ లీగ్లో చేరితే, హైదరాబాద్కు గతం కంటే మెరుగైన ర్యాంకు వస్తుందనుకుంటే.. మారిన నిబంధనలు, మైనస్ మార్కులతో మంచి ర్యాంకుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేసింది. ముంబై, లండన్లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక యోగ చేస్తూ బిజీగా ఉంటోంది. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో అలరించిన భామ.. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా ఓ అభిమానిపై ప్రశంసలు కురిపించింది.ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్ ఫ్యాన్ అయిన అమ్మాయి ఎంసెట్ ర్యాంక్ సాధించడంతో సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆమెతో దిగిన ఫోటోను పంచుకుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్ అంటూ సమంత రాసుకొచ్చింది. తన అభిమాని అయిన స్టూడెంట్ను స్టార్ హీరోయిన్ సమంత అభినందించడం చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్ ర్యాంక్ కొట్టిన యువతి స్టోరీ
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి..! ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్లో నివసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. తన తొలి ప్రిఫరెన్స్గా ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్లో మంచి తన టార్గెట్. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. వాస్తవానికి సివిల్స్కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023. She says, "I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV — ANI (@ANI) April 16, 2024 నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది. -
ఒక్కసారి డిసైడ్ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత
మన దగ్గర స్పూర్తిదాయక కథనాలకు కొదవే లేదు. ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంత యువత మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తున్నారు. ఏ ప్రాంతం, ఎంత డబ్బు ఉంది ఇలాంటి వాటితో సంబంధం లేకుండా మొక్కవోని పట్టుదలతో ఎదిగి తామేంటో నిరూపించుకుంటున్నారు. కలల సాకారం కోసం ఒక్కసారి గట్టి నిశ్చయించు కుంటే.. తమకు ఎదురే ఉండదని నిరూపిస్తున్నారు. బిహార్కు చెందిన ఒక రైతు బిడ్డ సక్సెస్ స్టోరీ ఆదర్శవంతంగా నిలుస్తోంది. బిహార్లోని భోజ్పూర్ జిల్లాలోని పేద రైతు సిద్ధనాథ్ సింగ్ కుమారుడు సత్యం కుమార్ 13ఏళ్లకే కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-JEE)లో సీటు సాధించి విశేషంగా నిలిచాడు. రైతు బిడ్డ సత్యం 2013లో 679 ర్యాంక్ సాధించాడు. 2010లో IIT సీటు పొందిన ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల సహల్ కౌశిక్ రికార్డును ఛేదించి అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డును బద్దలు కొట్టాడు. ఐఐటీ పరీక్షకు సంబంధించి కుమార్కి ఇది రెండో ప్రయత్నం. 2012లో 12 ఏళ్ళ వయసులోనే ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించాడు. అయితే బెస్ట్ ర్యాంక్ కోసం 12 నెలల తర్వాత మళ్లీ పరీక్ష రాసి విజయం సాధించాడు. రెండో ప్రయత్నంలో రికార్డు ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మూడు ప్రాజెక్టులపై పనిచేశాడు. ఎలక్ట్రోక్యులోగ్రామ్ బేస్డ్ ఐ బ్లింక్ క్లాసిఫికేషన్ డ్యూరింగ్ EOG సిగ్నల్ అక్యుయిషన్ టైం, “వివిధ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లలో ఎలక్ట్రోడ్ స్థానాల ఆప్టిమైజేషన్” , “ఇమాజినేటివ్ స్పీచ్ బేస్డ్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్” ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఇక్కడితో సత్యం కుమార్ విజయ్ ప్రస్థానం ముగిసిపోలేదు. తాజాగా 24 ఏళ్ల వయసులో టెక్ దిగ్గజం యాపిల్ అతణ్ని ఉద్యోగంలోకి తీసుకుంది. 2018లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించి B.Tech-M.Tech ఉమ్మడి కోర్స్ పట్టా సాధించాడు సత్యం కుమార్. ప్రస్తుతం ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేస్తున్నాడు. 2023 ఆగస్టు వరకు యాపిల్లో మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్గా పని చేశాడు. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ నిపుణుడిగా ఉన్న కుమార్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పలు టెక్నాలజీలను పిల్లలకు బోధించడానికి,వారి జీవితాలను మెరుగుపరచడానికి బిహార్లోని తన సొంత జిల్లా భోజ్పూర్కు తిరిగి రావాలని భావిస్తున్నట్టు ఇటీవల మీడియాతో చెప్పాడు ఎనిమిదో తరగత వరకు స్కూలు అంటే ఏంటో తెలియదు జూలై 20, 1999న జన్మించాడు సత్యం కుమార్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతటి వాడు కావాలనేది డ్రీమ్. ఇంకో విశేషం ఏమిటంటే అసలు ఎనిమిదో తరగతి వరకు స్కూల్కే వెళ్లలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో, స్థానిక వీర్ కుర్ సింగ్ కాలేజీలో క్లర్క్, మేనమామ పశుపతి సింగ్ సహాయంతో ఇంట్లోనే ప్రాథమిక విద్య పూర్తైంది. 2007లో రాజస్థాన్ బోర్డ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి కోటలోని మోడ్రన్ స్కూల్లో అడ్మిషన్ పొందాడు. అలా ఎనిమిదో తరగతిలో తొలిసారి పాఠశాలకు వెళ్లాడు. చాలా తొందరగా నేర్చుకునే తత్వం అసాధారణమైన జ్ఞాపకశక్తిగల విద్యార్థిగా ప్రశంసలందుకున్నాడు. రాజస్థాన్ బోర్డ్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని పదేళ్లకే పదో తరగతి, 12 సంవత్సరాల వయస్సులో XII తరగతిని క్లియర్ చేయడం విశేషం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ డ్రీమ్ అంతేకాదు తానేమీ పుస్తకాల పురుగును కాదనీ, సినిమాలు చూస్తా.. ఫుట్ బాల్ ఆడుకుంటా.. మొబైల్ చూస్తా..కానీ పూర్తి శ్రద్ధగా ఆరుం గంటలు చదువుకుంటా అని గతంలో తన స్టడీ హ్యాబిట్స్ గురించి తెలిపాడు. నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి ఘనతను సాధించాలనేది కల. టెక్నాలజీ ప్రపంచంలో దూసుకుపోవాలి...ఫేస్బుక్కు సమానమైనదాన్ని అభివృద్ధి చేయాలనేది అతని ఆకాంక్ష. -
పింఛను వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగువకు
ముంబై: రిటైర్మెంట్ తరువాతి పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 47 దేశాలతో కూడిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా 45వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 44 దేశాలతో జాబితా రూపొందించగా అందులో మనదేశం 41వ స్థానంలోనూ 2021లో 43 దేశాల జాబితాలో 40వ స్థానంలోనూ నిలవడం గమనార్హం. మెర్సర్ సీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ సిద్ధం చేసిన ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ తాజా నివేదిక ఈ విషయాలను తెలిపింది. ఇండెక్స్ విలువను పరిగణిస్తే మాత్రం భారత్ గత ఏడాది విలువ (44.4) కంటే ఈ ఏడాది విలువ కొంచెం పెరిగి 45.9 కి చేరడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్నిచ్చే పెన్షన్ వ్యవస్థలను (64 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే) మెర్సర్ అధ్యయనం చేసింది. నెదర్లాండ్ 85 ఇండెక్స్ వ్యాల్యూతో అన్నింటికంటే మెరుగ్గా ఉంది. 83.5 శాతం విలువతో ఐస్ల్యాండ్, 81.3 శాతం విలువతో డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 42.3తో అర్జెంటీనా అన్నింటి కంటే దిగువన ఉంది. పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగులకు తగినంత ఆదాయం ఇవ్వగల సామర్థ్యం పెన్షన్ వ్యవస్థకు ఉందా? ఈ ప్రయోజనాలను దీర్ఘకాలం కొనసాగించగలదా? పెన్షన్ వ్యవస్థ సమగ్రతతో పనిచేస్తోందా? అన్న అంశాల ఆధారంగా మెర్సర్ ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ను రూపొందించింది. అంటే నెదర్లాండ్స్ వంటి దేశాల్లో రిటైర్మెంట్ తరువాత కూడా ఓ మోస్తరు జీవనశైలితో జీవితం గడిపేందుకు తగినంత పెన్షన్ లభిస్తుందన్నమాట. కాగా... ఈ ఏడాది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లోకి బోట్స్వానా, క్రొయేషియా, కజకిస్థాన్లు కొత్తగా ప్రవేశించాయి. జననాల రేటు క్షీణించడం తాలూకూ ప్రభావం పలు ఆర్థిక వ్యవస్థలు, వాటి పెన్షన్ పథకాలపై పడిందని ఈ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో చైనా, కొరియా, సింగపూర్, జపాన్లు తమ స్కోర్ను పెంచకునేందుకు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపింది. మెర్సర్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్లో పెన్షన్ వ్యవస్థ గతం కంటే కొంత మెరుగైంది. తగినంత పెన్షన్, దీర్ఘకాలం ఇవ్వగలగడమన్న రెండు సూచీల్లో ఈ మెరుగుదల కనిపించింది. కానీ.. ప్రపంచ ర్యాంకింగ్లలో మాత్రం వెనుకబడే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా పెన్షన్ నిధికి చందాలు ఇచ్చే నిర్బంధ వ్యవస్థ లేకపోవడం భారత్ లోపాల్లో ఒకటని తెలిపింది. ప్రైవేట్ పెన్షన్ ప్లాన్లు కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నాయని, రిటైర్మెంట్కు ముందు వచ్చే ఆదాయంతో పోలిస్తే తరువాత వచ్చేది చాలా తక్కువగా ఉందని కూడా ఈ సంస్థ తెలిపింది. భారత్లో పెన్షన్ వ్యవస్థ తాలూకూ ఆస్తులు జీడీపీతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, రిటైర్మెంట్ కోసం కేటాయించే నిధులు తగినన్ని లేవనేందుకు, పొదుపు కూడా తక్కువగా ఉందనేందుకు ఇది ఒక రుజువు అని వివరించింది. -
ఆకలి సూచీలో అధోగతి!
ఎన్నో విజయాలు సాధిస్తున్నాం... అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో దూరంలో లేదని చెప్పుకొంటూనే ఉన్నాం. కానీ ఆకలి భూతాన్ని అంతం చేయటంలో వెనకబడే ఉన్నామని ఏటా వెలువడుతున్న అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ సిండీ మెకెయిన్ మాటలు విన్నా, తాజాగా ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)ని గమనించినా మన పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని అర్థమవుతుంది. జీహెచ్ఐ జాబితాలో మొత్తం 125 దేశాలు వుంటే, అందులో మన స్థానం 111. నిరుటికన్నా నాలుగు స్థానాలు కిందకు దిగజారామని ఆ నివేదిక చెబుతోంది. 2015 వరకూ ఎంతో పురోగతి సాధించిన భారత్ ఆ తర్వాత వరసగా నేల చూపులు చూస్తుందన్నది దాని సారాంశం. భారత్కు సంబంధించి నంతవరకూ ఇది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. అసలు జీహెచ్ఐ కోసం నిర్దేశించిన ప్రమాణాలు, తీసుకుంటున్న నమూనాలు, మొత్తంగా ఆ ప్రక్రియ సక్రమంగా లేదని కేంద్రం ఆరోపణ. ప్రపంచంలో 2030 నాటికి ఆకలన్నదే ఉండరాదన్నది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. కేవలం ఆహారం లభించటం ఒక్కటే ఆకలి లేదన టానికి గీటురాయి అనుకోవటానికి లేదనీ, ఆ లభిస్తున్న ఆహారంలో మనిషికి అవసరమైన కేలరీలు వుండాలనీ సమితి వివరించింది. మరో ఏడేళ్లకల్లా ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాన్ని అందుకోవలసి వుండగా అనేక దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయని జీహెచ్ఐ అంటున్నది. జాబితా గమనిస్తే పాకిస్తాన్ 102తో మనకన్నా మెరుగ్గా వుండగా, బంగ్లాదేశ్ (81), నేపాల్ (69), శ్రీలంక (60) దాన్ని మించిన మెరుగుదలను చూపించాయి. 28.7 స్కోర్తో ఆకలి తీవ్రత భారత్లో చాలా ఎక్కువగా ఉందన్నది జీహెచ్ఐ అభియోగం. పౌష్టికాహార లోపంలోనూ 16.6 స్కోర్తో మనం చాలా కింది స్థాయిలో వున్నాం. అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1గా ఉందని నివేదిక వివరిస్తోంది. మొన్న ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఆహారధాన్యాలు అందించామనీ, కానీ 2022–23లో ఆహార సబ్సిడీల బిల్లు రూ.2.87 లక్షల కోట్లకు చేరుకున్నందున అదనంగా ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ నిలిపేశామనీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పౌష్టికాహారలోపం కేవలం ఆహారధాన్యాలు ఉచితంగా అందించటం వల్ల మాత్రమే తీరేది కాదు. అవసరమైన పోషకాహారాన్ని అందించటంతో పాటు మహిళా విద్య, శిశు సంరక్షణ, మెరుగైన పారిశుద్ధ్యం, సురక్షితమైన మంచినీరు లభించేలా చూడటం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రంగాలన్నిటా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఏపాటి? సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) పేరు మారి సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 అయింది. కానీ గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి ఒక శాతం తగ్గి 20,554 కోట్లకు పరిమితమైంది. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మధ్యాహ్న భోజన పథకం)కు నిరుడు రూ. 12,800 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో అది రూ. 11,600 కోట్లకు తగ్గింది. బాలికల విద్యకు నిరుటితో పోలిస్తే కేవలం 0.2 శాతం పెంచి రూ. 37,453 కోట్లకు సరిపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో, బేటీ పఢావో, వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ) తదితర పథకాలతో కూడిన సంబాల్ స్కీమ్కైతే కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. మహిళలకు అందించే ఇలాంటి పథకాలైనా, శిశువులకు ఉద్దేశించిన పథకాలైనా పరిస్థితిని మెరుగుపరచగలవు. జీహెచ్ఐ సూచీ ప్రాతిపదికలు, మొత్తంగా అది రూపొందించే ప్రక్రియ లోపరహితమైనదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయనవసరం లేదు. ఎందుకంటే ఇంత జనాభా గల దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణించటానికి కేవలం 3,000 మంది వివరాలు మాత్రమే తీసుకుంటే అది సంపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుందా? తీవ్రమైన పోషకాహారంతో పిల్లలు అతి బలహీనంగా వుండటం జీహెచ్ఐ సూచీ ప్రకారం 18.7 శాతం వుండగా, మన పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ప్రతి నెలా సాగిస్తున్న పర్యవేక్షణలో అది కేవలం 7.2 శాతానికి పరిమి తమైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 11 లక్షల 80 వేల టన్నుల ఆహారధాన్యాలను 28 నెలలపాటు అందించామని కూడా వివరించింది. అలాగే పోషకాహార లోప సవాల్ను ఎదుర్కొనడానికి వివిధ పథకాల కింద ఎంతో చేస్తున్నామంటున్నది. జీహెచ్ఐ సూచీకి తీసుకున్న నమూనాలు సక్రమంగా లేవనడం వరకూ ఏకీభ వించొచ్చు. అయితే నివేదికే పక్షపాతంతో వున్నదనీ, భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే దీని లక్ష్యమనీ అనడం సరికాదు. ఎందుకంటే ఇదే ప్రక్రియ సూచీలోని 125 దేశాల్లోనూ అమలు పరిచివుంటారు. దేశ జనాభాలో నిర్దిష్టంగా ఫలానా శాతం అని పెట్టుకుని దాని ప్రకారం నమూనాలు తీసుకుంటే ఈ సూచీ వెల్లడిస్తున్న అంశాలు వాస్తవానికి మరింత చేరువగా ఉండేవనటంలో సందేహం లేదు. ఒకపక్క బడ్జెట్ కేటాయింపుల్లో, కేటాయించిన నిధులు వ్యయం చేయటంలో మనం సక్రమంగా లేమని అర్థమవుతున్నప్పుడు ఆకలి సూచీ వంటివాటిపై ఆరోపణలు చేయటంవల్ల ఉపయోగం లేదు. పోషకాహారం విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం వుంది. రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కూడా తేడాలున్నాయి. ఇవన్నీ సరిచేసుకుంటే నిస్సందేహంగా మెరుగుపడతాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరవవుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాలి. -
వీసా లేకుండానే 57 దేశాలకు!
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్కు చెందిన హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. చెత్త పాస్పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. – సాక్షి, అమరావతి -
సమంత ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్లో నెంబర్ వన్ ప్లేస్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్ వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!) -
ఏ ర్యాంక్కు ఎక్కడ మెడికల్ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్ల వరకూ సీట్లు లభించాయి. -
ప్రపంచ టేస్టీ శాండ్విచ్లలో భారతీయ వంటకానికి చోటు.. ఏదో తెలుసా!
ఇరవై ఏళ్ల కిందట స్ట్రీట్ ఫుడ్లపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అప్పట్లో బయట తినాలంటే రెస్టారెంట్, హోటల్స్వైపే మొగ్గు చూపేవాళ్లు. అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుత రోజుల్లో నగరవాసులు ఉరుకుల పరుగుల మధ్య బిజీబిజీగా గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. తాజాగా భారత స్ట్రీట్ ఫుడ్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక చిరుతిండి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా, మహారాష్ట్రలోని ప్రసిద్ధ స్నాక్స్లో ఒకటైన వడ పావ్ ఇప్పుడు టేస్ట్ అట్లాస్ ద్వారా ప్రపంచంలోని 13వ అత్యుత్తమ శాండ్విచ్గా ర్యాంక్ పొందింది. ఈ ర్యాంకింగ్ను టేస్ట్ అట్లాస్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 వంటకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో మొదటిది టోంబిక్ అయితే, జాబితాలో చివరిది టోర్టా అహోగడాగా. ఇందులో భారతీయ స్ట్రీడ్ పుడ్ అయిన వడా పావ్ 13 స్థానంలో నిలవగా, ఈ వంటకానికి 4.4 రేటింగ్ లభించింది. ఇంతలో, భారతీయ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడ పావ్ గురించి వివరిస్తూ, టేస్ట్ అట్లాస్ తన వెబ్సైట్లో ఇలా రాసుకొచ్చింది. "ఈ ప్రసిద్ధ చిరుతిండిని 1960 నుంచి 1970 లలో దాదర్ రైలు స్టేషన్కు సమీపంలో పనిచేసిన స్ట్రీట్ వెండర్ (వీధి వ్యాపారి) అశోక్ వైద్య కనుగొన్నట్లు సమాచారం. అతను ఆకలితో ఉన్న సిబ్బందికి ఆహారం అందించేందుకు ఈ వంటకాన్ని కనుగొన్నాడు. ముందుగా అశోక్ తన వంటకంలో ఏం ఉండాలో నిర్ణయుంచుకుని.. అందులో తక్కువ ధర, రుచి, సులభంగా రవాణా చేయడం వంటివి పరిగణలోకి తీసుకుని ఈ వడ పావ్ను కనుగొన్నట్లు పేర్కొంది. చట్నీతో తింటే సూపర్ కాలక్రమేణా వడపావ్కు ప్రజాదరణ కూడా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వడపావ్కు వచ్చిన రేటింగ్పై చాలా మంది నెటిజన్లు సంతోషంగా లేరు. ఈ చిరుతిండిని నంబర్ వన్గా లిస్ట్ చేసి ఉండాలని అభిప్రాయపడుతున్నారు. వడ పావ్ అంటే ప్రాణం అని ఒక యూజర్ కామెంట్ చేయగా, చట్నీతో కూడిన మరొక వడ పావ్ కాంబినేషన్ టేస్ట్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఏడో స్థానానికి పడిపోయిన అదానీ ర్యాంక్
హిడెన్ బర్గ్ నివేదికతో మూడు నుంచి ఏడో స్థానానికి పడిపోయిన అదానీ ర్యాంక్ -
ప్రజల భద్రతలో ఆదిలాబాద్ జిల్లా టాప్
ఆదిలాబాద్టౌన్: ప్రజల భద్రత విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో 5వ స్థానం దక్కింది. అలాగే రాష్ట్రంలో సురక్షిత జిల్లాగా మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. దీంతో జిల్లా పోలీసులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సర్వేలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్క్రైమ్, హత్యలు, రోడ్డు ప్రమాదాలు, హింసాత్మక నేరాలు, వ్యక్తిగత భద్రత, తదితర అంశాలతో కూడిన 89 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, నాగలాండ్లోని మొఖోక్ జిల్లా 89.89 శాతం మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా 85 మార్కులతో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల పరంగా తెలంగాణకు 42 మార్కులు లభించాయి. రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా 81 మార్కులతో 2వ స్థానంలో నిలిచింది. భద్రత విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు మంచి ర్యాంకు దక్కడంపై జిల్లా ఎస్పీ డి.ఉదయ్కుమార్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. -
పదివేల లోపు నిబంధన బీసీ, ఈబీసీల ఆవేదన
విఘ్నేష్ కుమార్ గండిపేట సమీపంలోని పేరున్న కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో ఎంసెట్లో 10025 ర్యాంకు రావడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. మంచి ర్యాంకు రావడం, బీసీ–బీ కేటగిరీలోని రిజర్వేషన్తో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని భావించిన విఘ్నేష్ ఫీజు ఎక్కువైనా అందులో చేరాలనుకున్నాడు. అయితే అడ్మిషన్ ఖరారు చేసే సమయంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అధికారులు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, ఈ లెక్కన కాలేజీలో వ్యక్తిగతంగా రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే పూర్తి ఫీజు రీయింబర్స్ చేయాలనే డిమాండ్ ఉండటంతో, తర్వాతైనా ప్రభుత్వం ఇవ్వకపోతుందా అనే ఆశతో తొలిఏడాది ఎలాగోలా ఫీజు మొత్తం సర్దుబాటు చేసుకుని అందులో చేరాడు. కానీ ఇప్పటికీ డిమాండ్ నెరవేరక పోవడంతో.. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఫీజు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ఒక దశలో కోర్సు మానేద్దామనుకున్నా అష్టకష్టాలూ పడి ఫైనల్ ఇయర్ పూర్తిచేసి కొలువు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తుండటం..చాలామంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక ర్యాంకు ఎక్కువ వచ్చినా ఆ పథకం కింద విద్యార్థికి కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని టాప్–10 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.80 వేలకు పైమాటే ఉంది. నాలుగైదు కాలేజీల్లో రూ.లక్ష కంటే ఎక్కువ ఉండగా.. మిగతా కాలేజీల్లో రూ.80 వేలకు అటుఇటుగా ఉంది. ఇక టాప్ 10 నుంచి 20 వరకు కాలేజీల్లో రూ.55 వేలకు మించి ఫీజు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా పదివేల ర్యాంకు సీలింగ్ దాటిన విద్యార్థులకు ప్రభుత్వం కనీస ఫీజు అయిన రూ.35 వేలు మాత్రమే ఇస్తుండగా.. చాలా కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సీలింగ్ ర్యాంకు దాటిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన పక్షంలో అదనపు ఫీజును వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. సీఎం సానుకూలంగా స్పందించినా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ర్యాంకు సీలింగ్ను కొన్నేళ్ల క్రితం విధించారు. అప్పట్నుంచీ విద్యార్థి సంఘాలతో పాటు బీసీ సంఘాలు, ఇతర సామాజిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సమానంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సందర్భాల్లో ర్యాంకు సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రతిపాదనల్లోనూ ఈ మేరకు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మూడేళ్లు గడిచినా ఈ అంశం ఎటూ తేలలేదు. ర్యాంకు సీలింగ్ నిబంధనతో ఏటా వేలాది బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అరకొరగానే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండగా.. ఆయా కాలేజీల్లో అదనపు ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వారిలో సగం మందే బీసీలు ఎంసెట్లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీలు సగం మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మినహాయిస్తే బీసీలు సగటున 3 వేల నుంచి గరిష్టంగా 6 వేల మంది ఉంటున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులు 6 వేలకు మించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా లక్ష మంది ఉండగా.. ఇందులో గరిష్టంగా 6వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ఫుల్ ఫీజు అందుతోంది. మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మందికి పూర్తి ఫీజు మంజూరవుతుండగా.. అందులో బీసీల వాటా 6శాతం మాత్రమే. -
Sakshi Cartoon: మేం ఒప్పుకోం! దీనిని తిప్పి పెట్టండీ!!
మేం ఒప్పుకోం! దీనిని తిప్పి పెట్టండీ!! -
అవినీతి సూచీలో మరింత దిగజారిన పాక్, భారత్ స్థానం ఏంటంటే..
ఇస్లామాబాద్: ప్రపంచ అవినీతి సూచికలో పాకిస్తాన్ మరింత దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. బెర్లిన్కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ 180 దేశాలతో కూడిన ఈ జాబితాను విడుదల చేస్తుంది. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది. 2021 సీపీఐ (కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్) జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– శూన్య అవినీతి)రేంజ్లో మార్కులు ఇచ్చారు. ఈ జాబితాలో 28 సీపీఐతో పాక్ 140వ స్థానంలో నిలిచింది. భారత్ 40సీపీఐతో 85వ స్థానంలో, బంగ్లాదేశ్ 147వ స్థానంలో నిలిచాయి. పాక్లో రూల్ ఆఫ్ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషిం చింది. జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ ఉన్నాయి. భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్ ఉన్నాయి. ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది. -
పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..
న్యూఢిల్లీ: 2021లో నీట్లో ఉత్తీర్ణత సాధించిన చాలా మంది విద్యార్థులలో మోలార్బండ్లోని సర్వోద్య కన్యా విద్యాలయానికి చెందిన రితిక కూడా ఒకటి. కాకపోతే తను ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సొంతంగానే పేపర్ అయ్యి మెరిట్ ర్యాంకును సాధించింది. రితిక తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి బదర్పూర్లో ఒక చిన్న ఇంట్లో నివసిస్తోంది. తన తండ్రి ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ పని చేస్తూ వారు జీవనాన్ని సాగించేవాళ్ళు. కోవిడ్ లాక్డౌన్ మూలాన రితిక తండ్రి ఉపాధిని కోల్పోయాడు.దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో రితిక ఇంట్లో మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కూడా లేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెకు ఆండ్రాయిడ్ ఫోన్, పుస్తకాలు అవసరమైన తరుణంలో వాటిని కొనడానికి కూడా డబ్బులు లేవని ఆ పరిస్థితుల్లో తన పెళ్లి కోసం ఇంట్లో దాచిన నగలు అమ్మి అవి కొన్నట్లు చెప్పింది. చివరకు అన్ని కష్టాలను దాటుకొని ఆమె 500 మార్కులు సాధించి ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా 3,032 ర్యాంక్ను సాధించింది. నీట్లో మంచి స్కోర్ (93%) సాధించడంతో తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది. తను ప్రైవేట్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేని కారణంగా యూట్యూబ్ క్లాసులు, కొన్ని పుస్తకాల నుంచి సొంతంగా పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చాలా సహాయం చేసినట్లు చెప్పింది రితిక. ఈ ఏడాది ఢిల్లీ పాఠశాలల నుంచి మొత్తం 436 మంది విద్యార్థులు నీట్లో ఉత్తీర్ణత సాధించారు. చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు -
ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్గా నిలిచింది
-
హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత
సాక్షి, హైదరాబాద్: ది ఫైనాన్షియల్ టైమ్స్–గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 23వ స్థానం, ఆసియాలో ఐదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దేశంలోనే టాప్ 25లో స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థ ఐఎస్బీ కావడం గమనార్హం. పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ)లో ఈ ర్యాంకులు సాధించింది. ఈ ర్యాంకుల కోసం 2017కు చెందిన పీజీపీ విద్యార్థులను సర్వే చేశారు. ర్యాంకింగ్స్ కోసం ది ఫైనాన్షియల్ టైమ్స్ పరిగణనలోకి తీసుకున్న అనేక రంగాల్లో ఈ విద్యాసంస్థ మెరుగైన ప్రతిభ కనబర్చింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుంది. సమష్టి కృషితోనే సాధ్యమైంది.. అత్యుత్తమ ప్రపంచస్థాయి విద్యను అందించడంలో ఐఎస్బీ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పర్చుకుంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది, బోర్డు మద్దతు, సమష్టి కృషికి ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ నిదర్శనం. నాణ్యమైన మేనేజ్మెంట్ విద్యకు దేశంలోనే కలికితురాయిగా ఐఎస్బీ నిలిచింది. – ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, ఐఎస్బీ డీన్ చదవండి: శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా మాస్క్ తీసి ఫొటో దిగు నాయనా.. -
‘ఇన్నోవేషన్’లో భారత్కు 52వ ర్యాంకు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) –2019లో భారత్ ఐదు స్థానాలు మెరుగుపరచుకుంది. ప్రపంచంలోని అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో మొత్తం 129 దేశాలు ఉండగా.. భారత్ 52వ స్థానాన్ని సొంతంచేసుకుంది. మేధో సంపత్తి ఫైలింగ్ రేట్స్ నుంచి మొబైల్ అప్లికేషన్ సృష్టి, విద్యా వ్యయం వంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంక్ నిర్ణయం జరుగుతుంది. ఇక ప్రపంచంలోని టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు స్థానం సంపాదించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ సమాచారాన్ని బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ తొలుత 25వ స్థానానికి ఆ తరువాత 10వ స్థానానికి చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో భారత్ టాప్లో ఉన్నట్లు తెలిపారు. కార్మిక ఉత్పాదకత పెరుగుదల, సాంకేతిక ఉత్పాదన వృద్ధి, మేధో సంపత్తి సంబంధిత అంశాల మెరుగుదలతో పాటు సంస్థలు, మానవ మూలధనం, పరిశోధన పెరిగిన నేపథ్యంలో దేశ ర్యాంక్ మెరుగుపడింది. -
6లో హంపి... 11లో హారిక
హెంగ్షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత గ్రాండ్మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 16 మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య ర్యాపిడ్ పద్ధతిలో 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం నాలుగు రౌండ్ గేమ్లు నిర్వహించారు. నాలుగో రౌండ్ ముగిశాక హంపి రెండు పాయింట్లతో ఆరో స్థానంలో, హారిక రెండు పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నారు. తొలి గేమ్లో హంపి 69 ఎత్తుల్లో బేలా ఖొటెనాష్విలి (జార్జియా)పై గెలిచింది. జన్సాయా (కజకిస్తాన్)తో రెండో గేమ్ను 32 ఎత్తుల్లో... కొస్టెనిక్ (రష్యా)తో మూడో గేమ్ను 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... నానా జాగ్నిద్జె (జార్జియా)తో జరిగిన నాలుగో గేమ్లో 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు హారిక తొలి గేమ్లో 95 ఎత్తుల్లో కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన రెండో గేమ్ను 79 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా (జార్జియా)తో జరిగిన మూడో గేమ్లో హారిక 44 ఎత్తుల్లో గెలిచి, అనస్తాసియా (రష్యా)తో జరిగిన నాలుగో గేమ్ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హంపి, హారికతోపాటు మరో నలుగురి ఖాతాలోనూ రెండేసి పాయింట్లు ఉన్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్లను వర్గీకరించారు. -
కుమారుడి దైన్యం..తండ్రి విజయం
అతడి సంకల్పబలం ముందు పేదరికం ఓడిపోయింది. మనోధైర్యమే ముందుకు నడిపింది. దివ్యాంగుడైన కొడుకుకు వైద్యం చేయించడమే లక్ష్యమైంది. లక్ష్యసాధనకు స్నేహితుడి సహకార హస్తం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. చదువే ఊపిరైంది. 16 గంటలసేపు పుస్తకాలతో గడిపేలా చేసింది. విజయలక్ష్మి తలుపుతట్టింది. డీఎస్పీ పదవిలో అలంకరించింది. ఏపీపీఎస్పీ గ్రూప్–1 –2016 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించిన జగ్గయ్యపేట బూదవాడకు చెందిన బూడిద సునీల్ విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం. జగ్గయ్యపేట: గ్రూప్స్–1లో ఎంపికైన సునీల్ విజయ యాత్రపై ఆయన మాటల్లోనే.. నాది జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామం. నిరుపేద కుటుంబం లో పుట్టాను. నాన్న 11 ఏళ్ల క్రితం చనిపోవడంతో మా అమ్మ కూలీనాలీ చేస్తూ చదివించింది. ఒకటి నుంచి ఐదు వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్ జగ్గయ్యపేటలోని జేఆర్సీ కళాశాల, డిగ్రీ కూడా జగ్గయ్యపేట విశ్వభారతి కళాశాలలో బీఎస్సీ, బీజడ్సీలో 80 శాతం మార్కులు సాధించాను. కొడుకు పుట్టుకతోనే.... కొడుకు పుట్టుకే గ్రూప్స్కు సిద్ధం చేసింది. డిగ్రీ పూర్తవగానే ఐదేళ్ల పాటు గ్రామంలోని జేపీ సిమెంట్స్ కర్మాగారంలో ప్రైవేట్ ఉద్యోగం చేశాను. 2012లో శ్యామలతో వివాహమైంది. ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు పుట్టుకతోనే చెవుడు, కళ్లు కనిపించని లోపంతో పుట్టాడు. కుమారుడికి మెరుగైన వైద్యం చేయించాలని నిశ్చయించుకున్నాను. కుటుంబ సభ్యులతో మాట్లాడి గ్రూప్–1కు ప్రిపేరవుతానని సహకరించాలని కోరాను. వారు కూడా అంగీకరించడంతో పాటు తన ఇంటర్ స్నేహితుడు లాహోరు నరసింహారావు ఆర్థికంగా సహకరించడంతో ముందడుగు వేశాను. రెండేళ్లుగా హైదరాబాద్లో.. 2016లో గ్రూప్స్ పరీక్షలు రాసేందుకు గ్రామం విడిచి హైదరాబాద్కు వెళ్లిపోయాను. రెండేళ్లపాటు పిల్లలకు, భార్యకు దూరంగా ఉండి పట్టుదలతో గ్రూప్– 1కు సిద్ధమయ్యాను. రాత్రింబవళ్లు చదివా. నా కుమారుడి లోపమే కళ్లముందు కదలాడింది. ఉద్యోగ సాధనే లక్ష్యంగా కదిలాను. నిత్యం పత్రికలు, రాజ్యసభ టీవీ కార్యక్రమాల వీక్షణతోపాటు ఎన్సీఆర్టీ పుస్తకాలను రోజుకు 16 గంటలు చదివేవాడిని. 2016 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2017లో ప్రిలిమ్స్కు, ఆగస్టులో మెయిన్స్కు అర్హత సాధించడంతో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యాను. మౌఖిక పరీక్ష ఇలా.. ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాలతో పాటు జిల్లా, జాతీయ, అంతర్జాతీయ కరంట్ అఫైర్స్పై అనేక ప్రశ్నలు అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వంటి అంశాలు కూడా స్పృశించారు. స్థానిక అంశాలపై కూడా ప్రశ్నలు అడిగారు. వ్యక్తిగత శ్రద్ధే విజయానికి సోపానం కోచింగ్ కేంద్రాల్లో నేర్పించే అంశాలు 15 నుంచి 20 శాతం మేర మాత్రమే ఉపయోగపడతాయి. 80 శాతం వ్యక్తిగతంగా చదువుకుంటే ఎంచుకొన్న లక్ష్యాన్ని అదిగమించవచ్చు. యువత కూడా ప్రస్తుతం చదువులో ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆ ముగ్గురు.. నా విజయ యాత్రలో ముగ్గురున్నారు. పుట్టుక లోపం కలిగిన నా కుమారుడు, వాడిని రెండేళ్లు నేను లేని లోటు లేకుండా చూసుకున్న నా భార్య శ్యామల ఆమె కుటుంబ సభ్యులు, మూడో వ్యక్తి నా స్నేహితుడు నరసింహారావు. సునీల్ ఆదర్శం సునీల్ ఇంటర్లో పరిచయమయ్యాడు. నాకు డిగ్రీ పూర్తవగానే ఎస్బీఐలో ఉద్యోగం వచ్చింది. సునీల్ గ్రూప్స్కు సిద్ధమవుతున్నాడని తెలిసి ఆర్థికంగా సహాయపడ్డాను. అతడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.– లాహోరి నరసింహారావు, సునీల్ స్నేహితుడు -
టెట్లో జిల్లా సూపర్హిట్
శృంగవరపుకోట రూరల్ : ధర్మవరం మేజరు పంచాయతీకి చెందిన వేమన కుసుమ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 150/139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జిటి) టెట్ ఫలితాల్లో పేపర్ 1లో 139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. డైట్ పోటీ పరీక్షల్లో కూడా ఈమె జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా శిక్షణ పొందింది. తండ్రి అప్పలరాజు ధర్మవరంలో టైలర్గా పనిచేస్తుండగా తల్లి సన్నమ్మడు గృహిణి. ఈ సందర్భంగా అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ తనకు ముగ్గురు కుమార్తెలున్నారని,, రెండో కుమార్తె కుసుమ చిన్నప్పటి నుంచి చదువులో చక్కని ప్రతిభ కనబరుస్తూ అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానాలు సాధించిందని తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, స్థానికులు అభినందించారు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షకు అర్హత కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్)లో జిల్లా అభ్యర్థులు భారీ సంఖ్యలో అర్హత సాధించారు. పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరయ్యారు. తాజాగా అందిన సమాచారం మేరకు 80 శాతం అర్హత సాధించి ఉంటారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వివిధ శిక్షణ కేంద్రాల అభ్యర్థులు అధికసంఖ్యలో అర్హత సాధించారు. తాజాగా అందిన సమాచారం మేరకు పేపర్–1 కి సంబంధించి అధిక మార్కులు సాధించిన వారి వివరాలివి. వినెక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అల్లాడ లావణ్య (137), రొబ్బి జ్యోతి (132), మెయిద కృష్ణవేణి (130), బాలి కుమారి (130) ఉన్నారని ఆ సంస్థ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తమ విద్యార్థులు అయ్యప్ప (135), హేమ (133), పిళ్లా జగదీశ్వరి (133), బి.బిందుకుమారి (131), ఎస్.విజయ (131), టి.రోజారమణి (130) ఉన్నారని శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ శ్రీనివాసరావు తెలిపారు. అధిక మార్కులు సాధించిన అభ్యర్ధుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. శ్రీసాహితీ కోచింగ్ సెంటర్, తెలుగు స్టడీ సర్కిల్లకు చెందిన అభ్యర్థుల్లో వాడపల్లి నాగమణి (132), శెట్టి తేజస్వరి (129), లోపింటి రవికుమార్ (129), జి.చిరంజీవి (119) ఉన్నారని ఆ కోచింగ్ సెంటర్ రైరెక్టర్లు రెడ్డిపల్లి రమేష్కుమార్, సారిపల్లి గౌరీశంకర్ తెలిపారు. పరీక్షకు హాజరయిన 1200 మందిలో శతశాతం అర్హులయ్యారని తెలిపారు. -
ట్రంప్ అల్లుడు కుష్నర్ హోదా కుదింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ హోదాను శ్వేతసౌధం తగ్గించింది. ప్రస్తుతం టాప్ సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో ఉన్న కుష్నర్ పేరును తొలగించి సీక్రెట్ క్లియరెన్స్ జాబితాలో చేర్చింది. దీని ప్రకారం అధ్యక్ష భవనం అధికారులకు ప్రతిరోజూ అందే అత్యంత రహస్య నివేదికలు ఇకపై ఆయనకు అందుబాటులో ఉండవు. ట్రంప్ కుమార్తె ఇవాంకా భర్త, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు కూడా అయిన కుష్నర్.. పశ్చిమాసియా శాంతి చర్చలు, మెక్సికోతో సంబంధాలను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని విదేశీ ప్రభుత్వాలు కుష్నర్, అతని కుటుంబంతో ఆర్ధిక, వ్యాపార సంబంధాలను ప్రభావితం చేసి శ్వేతసౌధం రహస్యాలను చేజిక్కించుకునే ప్రమాదముందని అమెరికా నిఘా సంస్థలు భయపడుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. -
ర్యాంకుల గుట్టు
-
మెరుగైన ర్యాంకు సాధ్యమేనా?
వినాయక్నగర్ : స్వచ్ఛసర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు గత కొన్ని నెలలుగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పకడ్బందీగా చెత్త తరలించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ఎప్పటికప్పుడు చెత్త తరలించకపోవడంతో కూడళ్లలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో నగరానికి 178వ ర్యాంకు రాగా ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకుకు నగర పాలకసంస్థ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించి పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పారిశుధ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. కాగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో చెత్త పాయింట్ల వద్ద భారీ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల చెత్త వేస్తే రూ.500 జరిమానా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రారంభంకాని అద్దెవాహనాలు చెత్త సేకరణ కోసం కార్పొరేషన్కు మొత్తం 64 వాహనాలుండగా అందులో 16 వాహనాలు అద్దెప్రాతిపదికన నడుపుతున్నారు. ఇందులో 10ట్రాక్టర్లు, 6లారీలు ఉన్నాయి. అద్దె చెల్లించడం లేదని వాహనాల యజమానులు తమ వాహనాలను నిలిపివేశారు. వాహనాల అద్దె బకాయిలు మొత్తం రూ.64 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారులు చొరవ చూపలేదు. దీంతో చెత్త సేకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. తమ కాలనీల్లో చెత్త తొలగించడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు స్పందించి తమ కాలనీల్లో నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని కోరుతున్నారు. కేంద్రబృందం సభ్యుడి పర్యటన స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ బృంద సభ్యుడు జోసెఫ్ పర్యటించారు. గతంలో నగర పాలక సంస్థలో డాక్యుమెంటేషన్ను పరిశీలించిన ఆయన సోమవారం నగరంలో పర్యటించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ తీరును, పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. కాగా నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోయి ఉండటంతో మెరుగైన ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
పోటీతత్వంలో భారత్ వెనకడుగు!
ఐఎండీ జాబితాలో 45వ స్థానం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్ గతేడాదితో పోల్చుకుంటే నాలుగు స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్స్ (ఐఎండీ) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జాబితాను విడుదల చేసింది. పొరుగున ఉన్న చైనా మాత్రం ఏడు స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో చైనా అంకిత భావాన్ని ఇది తెలియజేస్తోందని ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్నెస్ సెంటర్ డైరెక్టర్ ఆర్టురోబ్రిస్ పేర్కొన్నారు. హాంగ్కాంగ్ ఎప్పటి మాదిరిగానే మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, సింగపూర్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. -
'కోచింగ్ లేకుండానే సివిల్స్లో మంచి ర్యాంక్'
-
కర్నూలు నంబర్ వన్
–పారిశ్రామిక, సేవారంగంలో, తలసరి ఆదాయంలో కర్నూలుకు మొదటి ర్యాంకు –14వ స్థానానికి పరిమితమైన మంత్రాలయం – నియోజక వర్గాల వారీగా ర్యాంకులను ప్రకటించిన జిల్లా యంత్రాంగం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ - 1 గా నిలిచింది. 2015–16 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా లభించిన గ్రేడుల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లా విస్తీర్ణం 17658 చదరపు కిలో మీటర్లు ఉంది. అన్నింటిలో కర్నూలు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండగా.. డోన్ అసెంబ్లీ నియోజక వర్గం రెండో స్థానంలో నిలిచింది. వ్యవసాయ ఉత్పాదకతలో మాత్రం కోడుమూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. మొదటి సారిగా నియోజకవర్గాల వారీగా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా ర్యాంకులు ఇచ్చారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, సేవా రంగానికి చెందిన అన్ని కార్యక్రమాలకు కర్నూలు కేంద్ర బిందువుగా ఉండటంతో కర్నూలు అసెంబ్లీకి నంబరు–1 స్థానం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలోనూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లా వెనుకబడి ఉంది. స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో జిల్లాకు 9వ స్థానం, తలసరి ఆదాయంలో 11వ స్థానం లభించింది. 2011–12 ధరల ప్రకారం వ్యవసాయ, పారిశ్రామిక, సేవ రంగం ప్రగతిని అంచనా వేశారు. జిల్లా మొత్తం మీద స్థూల ఉత్పత్తి విలువ రూ.29,887.30 కోట్లు ఉండగా, తలసరి ఆదాయం రూ.72,463 ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. జిల్లా స్థూల ఉత్పత్తిని వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల నుంచి లెక్కిస్తారు. జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యవసాయ ఉత్పాదకత రూ.9631.62 కోట్లు ఉండగా కోడుమారు నియోజక వర్గం మొదటి స్థానంలో, పత్తికొండ నియోజకవర్గం 2వ స్థానంలో ఉంది.ఽ కర్నూలు నియోజకవర్గానికి 14వ స్థానం దక్కింది. పారిశ్రామిక రంగంలో జిల్లా ఉత్పాదకత రూ.6066.75 కోట్లు ఉండగా, కర్నూలు నియోజకవర్గానికి 1వ ర్యాంకు, డోన్కు 2వ ర్యాంకు లభించింది. మంత్రాలయం నియోజకవర్గానికి 14వ ర్యాంకు లభించింది. సేవా రంగంలో రూ.14,188 కోట్ల విలువ సేవలు అందగా, ఇందులో కర్నూలు నియోజకవర్గానికి మొదటి ర్యాంకు, నంద్యాలకు రెండవ ర్యాంకు లభించింది. మంత్రాలయం 14వ ర్యాంకుతో సరిపుచ్చుకుంది. జిల్లా మొత్తం మీద తలసరి అదాయం రూ.72,463 ఉండగా, కర్నూలు అసెంబ్లీలో అత్యధికంగా రూ1,18,446 ఉండి మొదటి ర్యాంకును పొందగా, డోన్ అసెంబ్లీ 2వ ర్యాంకును పొందింది. తలసరి ఆదాయంలోను మంత్రాలయం నియోజకవర్గం 14వ ర్యాంకుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గాల వారీగా ర్యాంకుల వివరాలను జిల్లా ప్రణాళిక విభాగం అధికారులు జిల్లా కలెక్టర్కు సమర్పించారు. -
టాటా బ్రాండ్.. ర్యాంక్ తగ్గింది
• దేశంలో టాప్ బ్రాండ్ ఎల్జీ; టాటాకు 7వ స్థానం • తొలి ఐదు స్థానాలూ విదేశీ కంపెనీలవే • ఎఫ్ఎంసీజీలో మాత్రం పతంజలి హవా న్యూఢిల్లీ: ఇటీవల వివాదంలో ఉక్కిరిబిక్కిరవుతున్న టాటా గ్రూప్నకు మరో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా ఉత్పత్తుల బ్రాండ్ స్థారుు తగ్గుతున్నట్లు ఒక సర్వే తేల్చింది. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ తాజాగా నిర్వహించిన భారత్లోని అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్ల సర్వేలో టాటా బ్రాండ్ ర్యాంక్ క్షీణించింది. ఎల్జీ టాప్లో నిలవగా... టాటా బ్రాండ్ ఏకంగా 7వ స్థానానికి పడిపోరుుంది. టాటా బ్రాండ్కు 2014లో 5వ ర్యాంక్ ఉండగా, 2015లో అది 4వ స్థానానికి చేరింది. ఇపుడు ఒకేసారి మూడు స్థానాలు వెనక్కి పడింది. దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ ఎలకా్ర్టనిక్స్ సంస్థ ‘ఎల్జీ’ దేశంలో టాప్ స్థానాన్ని దక్కించుకోగా తర్వాతి స్థానాల్లో సోనీ, శాంసంగ్ మొబైల్స్, హోండా, శాంసంగ్ నిలిచారుు. కాగా టాప్-5లో విదేశీ కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతుండటం గమనార్హం. దేశీ దిగ్గజాలైన బజాజ్, టాటా, మారుతీ బ్రాండ్లు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారుు. ఎరుుర్టెల్, నోకియాలు 9, 10 స్థానాల్లో నిలిచారుు. ఇక ఎఫ్ఎంసీజీ విభాగంలోని టాప్ బ్రాండ్లను చూస్తే.. పతజలి టాప్లో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో హెచ్యూఎల్, నిర్మా, ఇమామి, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉన్నారుు. -
తొమ్మిదో ర్యాంక్కు ఫెడరర్
లండన్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ర్యాంక్ తొమ్మిదికి పడిపోరుుంది. 2002 తర్వాత తన ర్యాంక్ ఇంతగా దిగజారిపోవడం ఇప్పుడే. ఈ ఏడాది ఫామ్ కోసం నానా తంటాలు పడ్డ ఫెడరర్ ఏడాది ముగింపుర్యాంకుల్లో తొమ్మిదికి చేరాడు. జొకోవిచ్, ముర్రే, వావ్రింకా వరుసగా తొలి మూడు ర్యాంక్ల్లో ఉన్నారు. -
నాడు 02.. నేడు 50
ఎంసెట్-3లో ఐశ్వర్యకు 50వ ర్యాంకు ఎంసెట్-2లో రెండో ర్యాంకు గజ్వేల్: నిరంతర శ్రమతో ఎంసెట్-2లో రాష్ట్ర స్థాయిలోనే రెండో ర్యాంకును సాధించిన గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్కు చెందిన కాసం ఐశ్వర్య... తాజాగా గురువారం వెలువడిన ఎంసెట్-3 ఫలితాల్లో 50వ ర్యాంకును సాధించింది. పరీక్ష నిర్వహణ విషయంలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడినా... అధైర్యపడకుండా మరోసారి తన సత్తాను చాటింది. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన కాసం శ్రీనివాస్, అమృత దంపతులు గత కొన్నేళ్లుగా ప్రజ్ఞాపూర్లో స్థిరపడ్డారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. కిరాణా దుకాణం, ఇతర చిన్నపాటి వ్యాపారాలే వీరి జీవనాధారం. మధ్యతరగతి జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ తన పిల్లలను మాత్రం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కష్టపడుతున్నాడు. ఈ దంపతులకు కాసం ఐశ్వర్య, క్రాంతికుమార్ సంతానం. క్రాంతికుమార్ ప్రస్తుతం సెయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఐశ్వర్య సైతం ఇదే పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. ఆ తరువాత ఆమె కూకట్పల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ చేసింది. తనకోసం నిరంతరం శ్రమిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ఐశ్వర్య తీవ్రంగా కృషి చేసింది. ఈ క్రమంలోనే ఇంటర్లో 990 మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదే ఉత్సాహంతో ఎంసెట్-2 రాసి మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో ఐశ్వర్య, ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. వారి ఆనందం కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. ఇంతలో ఆ పరీక్ష రద్దు కావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెల్సిందే. అయినా ఐశ్వర్య అధైర్యపడకుండా మరోసారి పరీక్ష సిద్ధమైనా ఆ విద్యార్థిని తాజా ఫలితాల్లో 50వ ర్యాంకును సాధించి తన సత్తాను చాటుకుంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పరీక్ష రద్దు కావడంతో కొద్ది రోజులు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనన్నారు. అయినా తేరుకొని తిరిగి శ్రమించి పరీక్ష రాశానని, ఈ ర్యాంకు సాధించడం కూడా సంతోషంగానే ఉందని తెలిపింది. -
టాప్ బ్రాండ్ గా టీసీఎస్
లండన్: లీడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అరుదైన ఘనతను సాధించింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన మేటి సూపర్-50 సంస్థల జాబితాలోటాప్ లో నిలిచిన ఈ గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం అమెరికాలోకూడా తన సత్తాను చాటింది. అత్యంత విలువైన 100 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. అమెరికాలో 'టాప్ 500 బ్రాండ్స్' లో 58 ర్యాంకు కొట్టేసింది. బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ ..బ్రాండ్ ఫినాన్స్ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ ఐటి కంపెనీల్లో నాలుగవ స్థానం సంపాదించిన టీసీఎస్ ఈ సర్వేలో అమెరికా లో అగ్ర 100 బ్రాండ్ల పరిధిలో గుర్తింపును పొందింది. 78.3 పాయింట్ల స్కోరుతో కంపెనీ 'ఎఎ +'రేటింగ్ సంపాదించి అత్యంత శక్తివంతమైన బ్రాండ్ గా అవతరించింది. అంతేకాదు టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 286 శాతం వృద్ధితో ఐటి సేవల రంగంలో వేగంగా మార్కెట్ ను విస్తరించుకుంది. దీంతో 2010 లో 2.3 బిలియన్ల డాలర్లనుంచి 2016 లో 9.04 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అమెరికాలో తాము అందిస్తున్న డిజిటల్ సేవలకు, వినియోగదారుల స్పందన, ఈ ర్యాంకింగ్ అద్దం పడుతుందని టీసీఎస్ ఉత్తర అమెరికా ప్రెసిడెంట్ సూర్యకాంత్ తెలిపారు. ఐటి సేవల రంగంలో బలమైన శక్తిగా ఉద్భవించామనీ, ఈ రంగంలో బలమైన బ్రాండ్ గా నిలిచామని బ్రాండ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ హైగ్ అన్నారు. తన వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకోవడం, బ్రాండ్ బలం కొనసాగింపు నేపథ్యంలో గత సంవత్సరంలో టీసీఎస్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టింది. శాంటాక్లారా స్టూడియో డిజిటల్ రీఇమాజినేషన్ లాంటి కొత్త ఆవిష్కరణలు సంస్థ ప్రతిభను ఇనుమడింప చేశాయి. 2015 లో న్యూయార్క్ సిటీ మారథాన్ టైటిల్, చికాగో మరియు బోస్టన్ మారథాన్లో టీసీఎస్ టెక్ స్పాన్స్ ర్ గా వ్యవహరించింది. అంతేకాదు అదే ఏడాది యాపిల్ స్టోర్ లో టీసీఎస్ సృష్టించిన యాప్ 275,000 డౌన్ లోడ్స్ తో టాప్ యాప్ గా నిలిచింది. తన వివిధ కార్యక్రమాలతోపాటు స్టెమ్ మెంటార్ షిప్ అవార్డులిస్తోంది. ఫ్లాగ్ షిప్ కార్యక్రమం గో ఐటి ద్వారా 32 నగరాల్లో , 10 వేల మంది విద్యార్ధులకు కోడింగ్ టీచింగ్, రోబోటిక్ అండ్ డిజైనింగ్ లో శిక్షణ ఇస్తోంది. -
ఎంసెట్లో పాస్.. ఇంటర్లో ఫెయిల్!
ఎంసెట్లో ర్యాంకు పొంది ఇంటర్లో ఫెయిలైన 18,143 మంది సాక్షి, హైదరాబాద్: ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్లో ఫెయిల్ అవడంతో 18,143 మంది విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించలేదు. మరో 3,114 మంది తమ ఇంటర్ మార్కుల వివరాలను అందజేయకపోవడంతో వారి ర్యాంకులను కూడా ప్రకటించలేదు. తెలంగాణ ఎంసెట్కు మొత్తంగా 2,46,540 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,23,542 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,00,861 మంది ఎంసెట్లో అర్హత సాధించారు. అయితే 18,143 మంది ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. మరో 3,114 మంది ఇంటర్ ఉత్తీర్ణత వివరాలను ఇవ్వనందున ఎంసెట్ కమిటీ 1,79,609 మందికి మాత్రమే ర్యాంకులను ప్రకటించింది. -
ఏయే కాలేజీలో ఏ ర్యాంకుల వరకు సీట్లు..
కాలేజీల వారీగా గతేడాది సీట్లు వచ్చిన ర్యాంకుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది ఏయే కాలేజీలో ఎంత ర్యాంకు వరకు సీట్లు వచ్చాయో తెలియట్లేదా.. ఇప్పుడు మీ పిల్లలకు వచ్చే ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో అంచనా వేసుకోవాలనుకుకునే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారా.. ఇకపై ఆ అవసరమే లేదు. తల్లిదండ్రుల్లో ఉన్న ఆ ఆందోళన తొలగించే చర్యలను సాంకేతిక విద్యాశాఖ చేపట్టింది. గతేడాది ఎంసెట్, పాలీసెట్, ఐసెట్ కౌన్సెలింగ్లో ఏయే కాలేజీల్లో ఎంత ర్యాంకు వరకు సీట్లు లభించాయన్న వివరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులు, పాలిటెక్నిక్ డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కాలేజీల వారీగా ఎంత ర్యాంకు వరకు సీట్లు లభించాయన్న వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. కాలేజీ వారీగా సీట్లు లభించిన చివరి ర్యాంకులు, కోర్సులు, బ్రాంచీల వివరాలతో రూపొందించిన సీడీలను సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంంలో సాంకేతిక విద్యా జాయింట్ డెరైక్టర్ మూర్తి, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నారాయణరెడ్డి, ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోర్సులు, బ్రాంచీలు, ర్యాంకుల వివరాలను www.sakshieducation.com, http://dte.telangana.gov.in, http://dtets.cgg.gov.in, https://tspolycet.nic.in, http://tsche.cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. -
ఫస్ట్ కోళ్ల... లాస్ట్ గీత
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎమ్మెల్యేల పనితీరు, పథకాల అమలుపై నియోజకవర్గాల వారీగా టీడీపీ నిర్వహించిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎనిమిది అంశాలపై చేసిన సర్వే రిపోర్టు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్ అధికార పార్టీలో చర్చనీయాంశ మైంది. టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకు ఆ సర్వే రిపోర్టులు అందజేసినట్టు తెలిసింది. జిల్లా విషయానికొస్తే ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి మొదటి ర్యాంకు రాగా, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు చివరి ర్యాంకు, మంత్రి మృణాళిని ఎనిమిది ర్యాంకు ఇచ్చినట్టు సమాచారం. పింఛన్ల పంపిణీ, రేషన్ సరఫరా, జన్మభూమి, ఇసుక పాలసీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఆరోగ్య శ్రీ అమలు అంశాలతో పాటు ఎమ్మెల్యే అందుబాటును ఆధారంగా సర్వే చేసినట్టు చేసింది. దీనిలో పారదర్శకత ఎంత ఉందో తెలియదు గాని ప్రకటించిన ర్యాంకులు మాత్రం కాసింత ఆసక్తికరంగా ఉన్నాయి. పథకాల అమల్లో వెనకబడి ఉన్నప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి మొదటి ర్యాంకు ప్రకటించినట్టు తెలిసింది. అంతర్గతంగా ప్రకటించిన ర్యాంకింగ్లో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు రెండో ర్యాంకు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి మూడో ర్యాంకు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులకు నాలుగో ర్యాంకు, గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికి ఐదో ర్యాంకు,సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ఆరో ర్యాంకు, నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామినాయుడికి ఏడో ర్యాంకు, మంత్రి మృణాళినికి ఎనిమిదో ర్యాంకు, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు తొమ్మిదో ర్యాంకు ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, జిల్లాలో ఐదో ర్యాంకులో ఉన్న ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికి పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారని వేదికపై చంద్రబాబు అభినందించారు. అంతేకాకుండా పంపిణీలో మంచి ఫలితాలు సాధించడానికి గల కారణాలు వివరించాలని కె.ఎ.నాయుడ్ని వేదికపైకి పిలిచి మాట్లాడించారు. మొత్తానికి టీడీపీ నిర్వహించిన సర్వేలో నిబద్ధత ఎంతమేర ఉందో తెలియదు గాని ప్రకటించిన ర్యాంకుల కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలుగజేశాయి. -
సివిల్స్లో మెరిశారు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ -2014 ఫలితాల్లో జిల్లా యువకులు మెరిశారు. జాతీయస్థారుులో ఉన్నత ర్యాంకులు సాధించి జిల్లావాసులను మురిపించారు. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన 24 ఏళ్ల క్రాంతి తొలి ప్రయత్నంలోనే 50వ ర్యాంకుతో.. హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన 26 ఏళ్ల పింగిళి సతీష్రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా రెండో ప్రయత్నంలో 97వ ర్యాంకుతో అత్యుత్తమ ప్రతిభ చాటారు. - 50వ ర్యాంకు సాధించిన క్రాంతి - 97వర్యాంకు పొందిన పింగిళి సతీష్రెడ్డి - యువ అధికారుల స్ఫూర్తితో లక్ష్య సాధన - హోం స్టేట్గా తెలంగాణను ఎంచుకుంటామని వెల్లడి ముంబైలో బహుళజాతి కంపెనీలో సీఏగా పని చేస్తున్నప్పుడు చాలెంజింగ్గా ఉండే సివిల్స్ రాయాలని అనిపించింది. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయి. ఏడాదిపాటు లాంగ్లీవ్ పెట్టి సివిల్స్కు ప్రిపేరయ్యాను. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటాను. కొత్త రాష్ర్టంలో సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుక కృషి చేస్తా. సాక్షి, హన్మకొండ : తొలి ప్రయత్నంలోనే సివిల్స్ జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో క్రాంతి 50వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని నలుమూలల చాటాడు. క్రాంతి తల్లిదండ్రులు పాటి సురేందర్, జ్యోతి కాగా.. బాబారుు కొండల్రావు వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లో డీఈగా పనిచేస్తున్నారు. క్రాంతికుమర్ తండ్రి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థలో లెక్చరర్, ప్రిన్సిపాల్గా పలు హోదాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. క్రాంతికుమర్ ఐదో తరగతి వరకు మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఐదు నుంచి పది వరకు పెదవేగి, ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల్లో చదివారు. అనంతరం షోలాపూర్, మహారాష్ట్రలో నవోదయ విద్యాలయాల్లో చదివారు. ఆపై ఇరవై ఒక్క ఏళ్లకే పూణేలో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేసి ముంబైలో ఓ బహుళజాతి కంపెనీలో ఏడాదికి తొమ్మిది లక్షల రూపాయల వేతనంతో సీఏగా పని చేశారు. ఈ వృత్తిలో ఉండగానే దీర్ఘకాలిక సెలవు పెట్టి ఢిల్లీకి వెళ్లి సివిల్స్కు ప్రిపేరయ్యారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించారు. మెయిన్స్లో ఆప్షనల్గా కామర్స్ సబ్జెక్టును ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్ బురహన్పురంలో ఉన్న క్రాంతి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయని, దీంతో ఏడాదిపాటు లాంగ్లీవ్ పెట్టి సివిల్స్కు ప్రిపేరయ్యానని చెప్పారు. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటానన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా సివిల్స్లో 97 వ ర్యాంక్ సాధించిన సతీశ్రెడ్డి తల్లిదండ్రులు సీతారాంరెడ్డి, విజయలక్ష్మి. వీరు హన్మకొండలోని బాలసముద్రంలో నివాసం ఉంటున్నారు. తొలి ప్రయత్నంలో మెయిన్స్లో విఫలమైన సతీశ్రెడ్డి, ద్వితీయ ప్రయత్నంలో విజయం సాధించాడు. మెయిన్స్లో ఆయన సోషియాలజీని ఆప్షన్గా ఎన్నుకున్నారు. -
ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు?
వెబ్సైట్లో గతేడాది వివరాలు పొందుపరిచిన ఐఐటీ బాంబే సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్లో ఏ ర్యాంకు వారికి ఎక్కడ సీటు వస్తుంది. ఏ బ్రాంచీల సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైన కాలేజీ, కోరుకున్న బ్రాంచిలో సీటు వస్తుందా? లేదా? వంటి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఐఐటీ బాంబే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు 2013, 2014 సంవత్సరాల్లోని విద్యార్థుల ర్యాంకు, వారు పొందిన బ్రాంచి సీటు తదితర వివరాలను తమ వెబ్సైట్లో (http://jeeadv.iitb.ac.in/seat information) పొందుపరిచింది. విద్యార్థులు వెబ్సైట్లో పెట్టిన ప్రత్యేక లింక్ను ఉపయోగించుకొని తమ ర్యాంకులతో ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చని (కచ్చితంగా అలాగే ఉండకపోవచ్చు కూడా) వెల్లడించింది. -
డీఈఈసెట్లో మెరిసిన ‘జ్యోతి’
సక్సెస్ స్టోరీ ఆ ఇంట్లో అమ్మానాన్నలకు అక్షర కాంతులు లేవు. అయినా ఆమె ఆ కుటుంబంలో అక్షర ‘జ్యోతు’లు నింపింది. రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్కు దాదాపు నాలుగు లక్షలమంది పోటీపడగా మొదటి ర్యాంకు సాధించి విజయ దుందుభి మోగించింది..గంటా జ్యోతి. ఆమె విజయప్రస్థానం తన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం మాది విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, రావివలస. నాన్న ఆదినారాయణ, అమ్మ మంగమ్మ. అమ్మానాన్న ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. చెల్లెలు యమున తొమ్మిదో తరగతి చదువుతోంది. విద్యాభ్యాసం నా విద్యాభ్యాసమంతా మా జిల్లాలోనే జరిగింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు కొఠారుపల్లిలోని ఎస్వీడీ గంగాధర్ విద్యానికేతన్లో విద్యనభ్యసించాను. పదో తరగతిలో 8.00 గ్రేడ్ పాయింట్లు సాధించాను. విజయనగరంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ చదివాను. ఇంటర్లో 736 మార్కులు వచ్చాయి. అన్నయ్యల స్ఫూర్తితో మా పెదనాన్న కుమారులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచి వారిని చూస్తూనే పెరిగాను. నేను కూడా ఎప్పటికైనా టీచర్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ఈ క్రమంలోనే డీఈఈసెట్ రాశాను. మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ 86 (మొత్తం 100) మార్కులతో మొదటి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు. వారానికి నాలుగు గ్రాండ్ టెస్టులు డీఈఈసెట్ కోసం విజయనగరంలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. రెండు నెలల శిక్షణలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరగతులు ఉండేవి. వారానికి నాలుగుసార్లు గ్రాండ్ టెస్టులు నిర్వహించేవారు. చివరి పది రోజులు ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్టులు రాశాను. వీటి ఆధారంగా బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి సారించాను. గత 20 ఏళ్ల ప్రశ్నపత్రాలను సేకరించి సాధన చేశాను. వీటితోపాటు కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేశాను. నా తల్లిదండ్రులు, అన్నయ్యలు, టీచర్ల ప్రోత్సాహంతో ప్రథమ ర్యాంకు సాధించగలిగాను. -
What is his new rank from the end?
Civils Prelims Paper - II Model Questions 1. Read the following statements and answer the four items that follow: Five cities P, Q, R, S and T are connected by different modes of transport as follows. P and Q are connected by boat as well as rail. S and R are connected by bus and boat. Q and T are connected by air only. P and T are connected by boat only. T and R are connected by rail and bus. i) Which mode of transport would help one to reach R starting from Q, but without changing the mode of transport? a) Boat b) Rail c) Bus d) Air ii) If a Person visits each of the places starting from 'P' and gets back to 'P'. Which of the follo-wing places must he visit twice? a) Q b) R c) S d) T iii) Which of the following pairs of cities is connected by any of the routes directly without going to any other city? a) P and T b) T and S c) Q and R d) None of these iv) Between which two cities among the pairs of cities given below are there maximum travel options available? a) Q and S b) P and R c) P and T d) Q and R Sol: i) One can travel from Q to P by boat and from P to R also by boat. Answer: a ii) 'S' is connected only to 'R' and no other city. Therefore in order to visit all cities one must visit 'R' twice. Because he has to reach 'S' via 'R' and again gets back to 'R' Answer: b iii) Among the given options, no two cities are directly connected. Answer: d iv) Between Q and S, there are 8 different options available to travel. And no other pair has so many options. Answer: a 2. In a class of 45 students, a boy is ranked 20th. When two boys joined, his rank was dropped by one. What is his new rank from the end? a) 25 b) 26 c) 27 d) 28 Sol: It is given that, among 47 stude-nts the boy ranks 21st from top. \ his rank from the end = 47 – 21 + 1 = 27 Answer: c 3. A thief running at 8 km/hr is ch-ased by a policeman whose speed is 10 km/hr. If the thief is 100mt ahead of the policeman, then the time required for the policeman to catch the thief will be? a) 2 min b) 3 min c) 4 min d) 6 min Sol: Relative velocity between thief and policeman = 10 – 8 = 2 km/hr. Therefore police would get an advantage of 2 km or 2000 mt in 1 hour or 60 min. \ To get an advantage of 100 mt, the time required Answer: b 4. A train travels at a certain aver-age speed for a distance of 63 km and then travels a distance or 72 km at an average speed of 6 km/ hr more than its original speed. If it takes 3 hours to complete the total journey, what is the original speed of the train in km/hr? a) 24 b) 33 c) 42 d) 66 Sol: From the given data, the average speed during the whole journey = Total distance / Total time This average speed shall lie in between the original average speed and the increased (by 6 km/hr) average speed. The only possibility among the given 4 options is 42 km/hr. Because 45 lies in between 42 and 42 + 6 = 48. Answer: c 5. Consider the following matrix What is the number at 'X' in the above matrix a) 5 b) 8 c) 9 d) 11 Sol: From the numbers in the given matrix 33 + 73 = 27 + 343 = 370 23 + 63 = 8 + 216 = 224 Similarly 13 + x3 = 730 Þ x3 = 729 Þ x = 9 Answer: c 6. Examine the following three figures in which the numbers follow a specific pattern. The missing number in the third figure above is a) 7 b) 16 c) 21 d) 28 Sol: First figure: Second figure: Third figure: Answer: b 7. A cube has six numbers marked 1, 2, 3, 4, 5 and 6 on its faces. Three views of the cube are shown below. What possible numbers can exist on the two faces marked A and B, respectively on the cube? a) 2 and 3 b) 6 and 1 c) 1 and 4 d) 3 and 1 Sol: This problem can be solved by using a simple technique. From the first and second views of the cube it is clear that 6, 4, 2 and 3 are adjacent to 1. Therefore the two numbers 1 and 5 are on the opposite faces of the cube. Therefore 1 cannot be on the adjacent face of 5. So we can rule out the three options (b), (c) and (d). Answer: a 8. A gardener has 1000 plants. He wants to plant them in such a way that the number of rows and the number of columns remain the same. What is the minimum number of plants that he needs more for this purpose? a) 14 b) 24 c) 32 d) 34 Sol: By observation, 30 ´ 30 = 900 31 ´ 31 = 961 32 ´ 32 = 1024 \He needs a minimum of 24 plants Answer: b 9. A person can walk a certain dis-tance and drive back in 6 hours. He can also walk both ways in 10 hours. How much time will he take to drive both ways? a) 2 Hours b) 2.5 Hours c) 5.5 Hours d) 4 Hours Sol: It is given that walk + drive = 6 hours walk + walk = 10 hours Þ twice walk + twice drive = 12 hours – twice walk = 10 hours Þ twice drive = 2 hours Answer: a 10. The tank full petrol in Arun's motorcycle lasts for 10 days. If he starts using 25% more every day, how many days will the tank full petrol last? a) 5 b) 6 c) 7 d) 8 Sol: If consumption is increased by 25%, in 4 days, the petrol suffici-ent for 5 days will be consumed. Therefore in 8 days, the petrol sufficient for 10 days will be consumed. Answer: d 11. In a garrison, there was food for 1000 soldiers for one month. Aft-er 10 days, 1000 more soldiers joined the garrison. How long would the soldiers be able to car-ry on with the remaining food? a) 25 days b) 20 days c) 15 days d) 10 days Sol: Let one packed of food is suf-ficient for a soldier per one day. Then the no. of food packets = 1000 ´ 30 = 30,000 In 10 days, no.of food packets consumed = 10,000. The remaining food packets = 20,000 For 2000 soldiers, these last for Answer: d -
ఇంటర్లో ఫెయిలైన ఎంసెట్ ర్యాంకర్లు
36 వేల మందిది ఇదే పరిస్థితి రీ వెరిఫికేషన్లో వచ్చిన మార్కులు లేకుండానే ఎంసెట్ ర్యాంకులు హైదరాబాద్: ఎంసెట్లో ర్యాంకు సాధించినా, ఇంటర్ మీడియెట్లో 36,310 మంది ఫెయిల్ అయ్యారు. అయితే చాలా మందికి ఇంటర్మీడియట్లో పరీక్షలు బాగా రాశామని నమ్మకం ఉన్న విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన వారు, ఫెయిల్ అయిన వారు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో చాలా మందికి మార్కులు అదనంగా కలిశాయి. 1 నుంచి 10 మార్కుల వరకు కూడా కలిసిన విద్యార్థులు ఉన్నారు. అయితే, ఇలా అదనంగా వచ్చిన వారి మార్కులను మాత్రం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో పరిగణనలోకి తీసుకోలేదు. ఇంటర్మీడియెట్ బోర్డు సంబంధిత వివరాలను ఎంసెట్ వర్గాలకు ఇంతవరకు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తమకు రీవెరిఫికేషన్ ద్వారా అదనంగా వచ్చిన మార్కులతో పాస్ అయిన విద్యార్థులు, మార్కులు పెరిగిన విద్యార్థులు తమకు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మే 22న జరిగిన ఈ పరీక్షకు ఇంజనీరింగ్లో 2,66,820 మంది హాజరు కాగా 1,88,831 మంది (70.77 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. అయితే మరో 24,723 మంది ఎంసెట్లో అర్హత సాధించినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. ఇక 1,782 మంది ఇంటర్మీడియట్లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. అయితే వారిని ఫెయిల్ అయినట్టుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్లో 1,06,396 మంది పరీక్ష రాయగా 98,292 మంది (83.16శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. మరో 8,371 మంది ర్యాంకు పొందినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. 1,434 మంది ఇంటర్లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. వారిని కూడా ఫెయిల్ అయినట్టుగానే పరిగణించారు. -
ఈసెట్కు 11 వేల మంది
నేడే పరీక్ష.. నగరంలో రెండు జోన్లు..14 కేంద్రాలు నిమిషం లేటైనా అనుమతించం: కన్వీనర్ సాయిబాబు సాక్షి, సిటీబ్యూరో: ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)-2014కు నగరంలో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం జరిగే ఈ పరీక్షకు 11,687 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తిచేసిన వారు ఈసెట్లో ర్యాంకు సాధించి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చు. ఉన్నత విద్యామండలి తరపున ఈ పరీక్షను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తోంది. పరీక్ష నిర్వహణకు నగరాన్ని రెండు (హైదరాబాద్ 1,2)జోన్లుగా విభజించారు. హైదరాబాద్-1 జోన్లోని 3 కేంద్రాల్లో 6,155 మంది, జోన్-2లోని 11 కేంద్రాల్లో 5,532 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు పరీక్ష జరుగుతుంది. జోన్-1 కోఆర్డినేటర్గా జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ యాదయ్య, జోన్-2 కోఆర్డినేటర్గా ఓయూ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గోపాల్నాయక్ వ్యవహరిస్తారు. నిమిషం లేటైనా అనుమతించం ఈసెట్కు నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించబోమని కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. అలాగే మధ్యాహ్నం ఒంటి గంట కంటే ముందు అభ్యర్థులను పరీ క్ష హాలు నుంచి బయటకు పంపబోమన్నారు. 9.15 గంటల నుంచే పరీక్ష కేం ద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అభ్యర్థులు ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీ, హాల్టికెట్తో పాటు నీలి, నలుపు రంగు బాల్పాయింట్ పె న్నులు తెచ్చుకోవాలి. కాలుక్యులేటర్లు, సెల్ఫోన్లు, తెల్లకాగితాలు వంటివి అనుమతించరు. ఓఎంఆర్ షీట్లో సమాధానాలను ఒక సారి గుర్తించాక వాటిని మార్చేందుకు వీల్లేదు. వాటిని చెరిపేందుకు ఎరైజర్, వైట్నర్లు వాడరాదని ఆయన సూచించారు. -
మొదటి ర్యాంకర్కూ దక్కని చోటు
=ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్లలో గందరగోళం =ఆందోళనలో విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్లైన్: ఏదైనా ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు వస్తే సీటు తప్పకుండా వస్తుంది. ఎస్వీయూలో మాత్రం రీసెట్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినికి పీహెచ్డీలో సీటు దక్కలేదు. ఎస్వీ యూనివర్సిటీలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్లలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థిని ఎస్.గంగాదేవి ఎస్వీయూలో రీసెట్-2013లో భాగంగా నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఈమె 86 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించింది. బుధవారం సాయంత్రం జరిగిన కౌన్సెలింగ్కు హాజరైంది. ఎస్వీయూ అధికారులు నెట్, సెట్లలో అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించడంతో ఈమెకు ఇవ్వడానికి సీటు మిగల్లేదు. మొదటి ర్యాంకు సాధించినా సీటు రాకపోతే రీసెట్ పేరిట ప్రవేశపరీక్ష ఎందుకు నిర్వహించాలని ఆమె ప్రశ్నిం చారు. తాను నాన్ లోకల్ కాదని, రీసెట్లో తెలుగు విభాగంలో మొదటి ర్యాంకు వచ్చినా సీటు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చేదు అనుభవమే మరొకరికి ఎదురైంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక విద్యార్థిని మొదటి ర్యాంకు సాధించినా ఎస్వీయూ అధికారులు కౌన్సెలింగ్కు పిలువలేదు. ఎస్వీయూ అధికారుల నిబంధనలు సక్రమంగా లేకపోవడంతో తాము ర్యాంకులు సాధించినా సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు కొనసాగుతున్న అడ్మిషన్లు ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎంఫిల్, పీహెచ్డీ అడ్మిషన్లలో భాగంగా బుధవారం సోషియల్ వర్క్, తమిళ్, ఉమెన్స్టడీస్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, తెలుగు విభాగాలకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించింది. తెలుగు విభాగానికి సంబంధించి ఎస్టీ క్యాటగిరిలో అడ్మిషన్ విషయంపై కొందరు విద్యార్థుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే డీవోఏ డెరైక్టర్ శ్రీధర్రెడ్డి జోక్యంతో సమస్య సద్దుమణిగింది.


