breaking news
Railway sources
-
ఢిల్లీ-చెన్నై బులెట్ రైలుతో బోలెడు ప్రయోజనాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత ఢిల్లీ-చెన్నై బుల్లెట్ రైలుతో భారత్-చైనాలకు బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని రైల్వేవర్గాలు పేర్కొంటున్నాయి. 32 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం ప్రచురితమైన వ్యాసంలో గ్లోబల్ టైమ్స్ దినపత్రిక పేర్కొంది. ‘చైనా-భారత్ రైల్వే భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎనలేని ప్రయోజనాలను చేకూరుస్తుంది. తన హైస్పీడ్ రైలును ప్రపంచం ముందుంచేందుకు చైనా తహతహలాడుతోంది. 1,754 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 32 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయమవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. తన దేశం వెలుపల చైనా చేపట్టనున్న తొలి ప్రాజెక్టు ఇదే’అని గ్లోబల్ టైమ్స్ పత్రిక గురువారం ప్రచురించిన వ్యాసంలో పేర్కొంది. ఇదేవిధంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్కూడా అధ్యయనం చేస్తోంది. మెక్సికోలోనూ చైనా రైల్వే శాఖ 3.7 బిలియన్ డాలర్ల విలువైన బులెట్ రైలు ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. అయితే మెక్సికోలో అవినీతి జోరుగా ఉండడంతో ఆ ప్రతిపాదనను చైనా విరమించుకుంది. చైనా అడుగుల్లో భారత్ అడుగులు వేస్తే మరింత పురోగమిస్తుందని మరో పత్రిక పేర్కొంది. పరస్పర సహకారం ఉంటే ఇంకా బాగుంటుందని సూచించింది. -
ఖర్గే కనికరిస్తారా?
కొత్త ప్రాజెక్టుల ఊసే లేకుండా పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే చాలని ప్రతిపాదనలు పంపామంటూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ మంగళవారం సాయంత్రం కుండబద్దలు కొట్టారు. కర్నూలు ఎంపీ కోట్ల ఆ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో మన పొరుగు రాష్ట్రానికి చెందిన రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే నేడు పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ స్థితిలో గుంతకల్లు రైల్వే డివిజన్ రూపురేఖలు మారుతాయని ఆశించడం ఆశా.. అత్యాశా..? గుంతకల్లు, న్యూస్లైన్: గుంతకల్లు రైల్వే డివిజన్లో పడకేసిన ప్రాజెక్టుల్లో కదలిక రావాలంటే నేటి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తేనే సాధ్యమని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కనీసం వెయ్యి కోట్లు కేటాయిస్తే తప్ప ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల్లో కదలిక కనిపించదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు నివేదికలను రైల్వే బోర్డుకు సమర్పించారు. చాలాకాలంగా గుంతకల్లు రైల్వే డివిజన్కు నిధుల కేటాయింపులు సరిగా జరగడం లేదని, దీంతో మంజూరైన, చేపట్టిన రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని ఆ నివేదికల్లో పొందుపర్చారు. నిధుల లేమి వల్ల‘సీమ’ జిల్లాల్లో రైల్వే అభివృద్ధి అధ్వాన్నంగా తయారైందని కూడా ఆ నివేదికల్లో విశ్లేషించినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపలేదని, ఈ ఏడాదిని ప్లాన్ హాలిడేగా ప్రకటించాని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ మంగళవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేటి రైల్వే బడ్జెట్ ఏమేరకు ఈ ప్రాంతాభివృద్ధికి దోహదపడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గుంతకల్లు డివిజన్కు మంజూరైన ప్రాజెక్టులు పూర్తవ్వడానికి గతంలో రూపొందించిన అంచనాల ప్రకారం రూ.1684.56 కోట్ల అవసరం. 2011-12 రైల్వే బడ్డెట్లో రూ.135.38 కోట్లు, 2012-13 రైల్వే బడ్జెట్లో రూ.145 కోట్లు, 2013-14 బడ్జెట్లో రూ.160 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 90కి పైగా రైల్వేస్టేషన్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 2011-12, 2012-13, 2013-14 బడ్జెట్లలో అడిగిన నిధులనే మళ్లీ అడుగుతూ 2014-15 బడ్జెట్కు ప్రతిపాదనలు పంపారు. రైల్వే మంత్రిపై అందరి దృష్టి అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాలు రైల్వే పరంగా అభివృద్ధి చెందితేనే ‘సీమ’ ప్రాంతం పారిశ్రామికంగా ముందంజవేస్తుంది. సీమ వెనుకబాటుతనం గురించి బాగా తెలిసిన రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు పంపిన నివేదిక మేరకు నిధులు విడుదల చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు మహర్దశ వచ్చేనా? రైల్వే డివిజన్ పరిధిలో విద్యుత్తు లోకోషెడ్డు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్ నిర్మాణం, గుత్తి షెడ్ అభివృద్ధి, గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్, మంత్రాలయం రోడ్డు- కర్నూలు కొత్తలైన్ నిర్మాణం, కర్నూలు-మార్కాపురం కొత్తలైన్, కదిరి-రాయచోటి నూతన మార్గం, పెన్నానదిపై వంతెన నిర్మాణం, వాడి-గుంతకల్లు డబ్లింగ్ నిర్మాణం, కడప- బెంగుళూరు రైల్వే లైన్ నిర్మాణం. కర్ణాటకకే పెద్దపీట! కొత్త రైళ్లను పరుగులు తీయించే క్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్ర ప్రయోజనాలకు ఇప్పటికే పెద్దపీట వేశారు. 2013-14 బడ్జెట్లో కొత్తగా మంజూరైన రైళ్లలో గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా ఎనిమిది ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటిలో ఏకంగా ఆరు రైళ్లు ఏదోవిధంగా కర్ణాటక రాష్ర్ట ప్రజల అవసరాలు తీర్చేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. పనిలో పనిగా మరో ఎనిమిది ఎక్స్ప్రెస్ రైళ్లకు పొడిగింపులు ఇచ్చారు. తన హయాంలో కర్ణాటకకు రైల్వేపరంగా వీలైనంత ప్రయోజనం చేకూర్చే దిశగా మంత్రి ఖర్గే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకంటూ మూడు నెలల వ్యవధిలోనే మూడు పర్యాయాలు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే కర్ణాటక ప్రాంతంలో పర్యటించారు. కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్లకు పొడిగింపులు ఇవ్వడం వల్ల కర్ణాటక ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరినా.. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. నేటి బడ్జెట్లో కూడా అదేరీతిలో రైల్వే స్పందించి లబ్ధి చేకూరుస్తారని కన్నడిగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశ నెరవేరితే మనకూ కాస్త లబ్ధి చేకూరినట్లే.